Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్య భారతదేశంలో కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు మాత్రమే తమకు పాలించే హక్కును ప్రజలు ఇచ్చారని ఇష్టారీతిన పరిపాలన చేస్తామని ప్రశ్నించే గొంతుకలను, ప్రజాస్వామ్య వాదులను, ప్రతిపక్షనేతలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పార్లమెంటు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు కూడా తగినంత ప్రాధాన్యత కలిగి ఉన్నారన్న సంగతి మరచి, ఎన్నికైన ప్రతిపక్ష నాయకులను నయానో, భయానో వారిని ప్రలోభపెట్టి పాలక పక్షంలో కలుపుకోవడం ఎంతవరకు సబబు? పాలకపక్షం తెలిసిచేసినా, తెలియకుండా చేసిన తప్పులను ఎత్తిచూపి ప్రజలకు న్యాయం కల్పించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉందన్న సంగతి మరువరాదు. బలమైన పాలకపక్షానికి ప్రతిపక్షం, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదుల విలువైన సలహాలు, సూచనలు చాలా అవసరం. వీరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్వవహరిస్తే ప్రజలకు మెరుగైన సేవలను అందించలేవన్నది వాస్తవం.
ఇటీవలి లోక్సభ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దాదాపు రూ.60,000 కోట్లు ఖర్చుచేసారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల ఖర్చుకంటే దాదాపు రెట్టింపు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, డీ-మానిటైజేషన్, దేశం దాటిన నల్లధనం వెలికితీతపై ఇచ్చిన హామీ, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, నిత్యావసర ధరల పెరుగుదల, ఏడాదికేడాది పెరుగుతున్న నిరుద్యోగ యువత, కార్మికచట్టాల నిర్వీర్యం, కనీసవేతనాలు పెంచాలన్న డిమాండ్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వరంగ సంస్థలలో అనుమతించడం వంటి కీలక అంశాలపై ఎన్నికలలో ఎటువంటి ప్రస్తావన లేకుండా అనవసర మతతత్వ, దేశభక్తి వంటి అప్రస్తుత అంశాలను తెరపైకి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. నేరారోపణ ఎదుర్కొంటున్న నేతలు, ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసే నేతలు, ప్రజాసమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి వారికి ఉంటుందని ఆశించడం నేతిబీరకాయలో నేతి చందంగా ఉంటుంది.
- శ్రీవరం గుణశేఖర్
సెల్: 7382348735