Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ విద్యా విధానం ముసాయిదాతో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయబోతున్నట్టు, అందరికీ నాణ్యమైన విద్యను అందించి ప్రపంచ పోటీలో దీటుగా నిలబడే విధానం రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ఈ తాజా ముసాయిదాకు అంతటి సత్తా సామర్థ్యం ఉన్నదా అన్నదే చర్చనీయాంశం.
తమ ప్రభుత్వం దేశానికి అవసరమైన నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరిస్తుందని 2014 స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా ప్రకటించారు. కానీ ముసాయిదా నివేదిక విడుదల చేయడానికే ఇన్నేండ్లు పట్టింది. 2015 మార్చిలో ఆనాటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి స్మతి ఇరానీ విద్యా విధానం తయారీ కోసమంటూ 33థీమ్స్ ప్రకటించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా చర్చల ప్రక్రియ నిర్వహించారు. ఆన్ లైన్లో కూడా సజషన్స్ సేకరించారు. మూడు లక్షలు పైగా వచ్చిన సూచనలు సలహాలను మదింపు చేసి ముసాయిదా రూపొందించే బాధ్యతను రిటైర్డ్ కేంద్ర కేబినెట్ సెక్రెటరీ టీఎస్ఆర్ సుబ్రహ్మణియన్ కమిటీకి అప్పగించారు. ఆ కమిటీకి ఇచ్చిన గడువు మేరకు 2016 మే 30న నివేదిక ఇచ్చింది. కానీ ఆ నివేదికను అధికారికంగా వెల్లడించకుండా ''సమ్ ఇంపుట్స్ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2016'' పేరుతో మరోసారి ఎంహెచ్చార్డీ వెబ్సైటు ద్వారా స్టేక్ హౌల్డర్స్ నుంచి సజషన్స్ కోరింది. వాటి ఆధారంగా ముసాయిదా రూపొందించాలని డాక్టర్ కె. కస్తూరిరంగన్ కమిటీని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కోరారు. ఆ కమిటీకి ఇచ్చిన గడువును ఐదు సార్లు పొడిగించి ఆ ప్రభుత్వం గడువు ముగిసేదాకా నివేదిక తీసుకోకుండా దాటవేసింది. బీజేపీ/ఎన్డీఏ రెండోసారి అధికారం చేపట్టిన రెండోరోజైన ఈ ఏడాది మే 31న ''ముసాయిదా జాతీయ విద్యా విధానం 2019'' నివేదిక స్వీకరించింది. ఇంత కాలయాపన, ఇన్ని మల్లగుల్లాలు పడడం కాకతాళీయంగా జరిగిందేమీ కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరివారాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఇంత సుదీర్ఘ ప్రక్రియ నడిచింది.
ముసాయిదా నివేదిక 484పేజీలతో గల పెద్ద గ్రంథం. ఇంత భారీ నివేదికను అధ్యయనం చేయడం, అవసరమైన సజషన్స్ 30రోజుల (జూన్ నెలాఖరు) లోగానే ఇవ్వడం అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యం కావచ్చు. అందునా ఆ నివేదిక ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఉండడం వలన హిందీయేతర ప్రాంతాల ప్రజలకు అందని ద్రాక్షగా ఉంటోంది. నివేదికను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి, ఎక్కువమంది అధ్యయనం చేసి సూచనలు చేయడానికి అనువుగా జూలై 31వరకు గడువు పెంచాలని 'సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్' తదితర సంస్థలు చేస్తున్న సూచన కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో చూడాలి. నివేదికలోని ముఖ్యమైన సిఫార్సులను పరిశీలిస్తే కొన్ని ఇప్పటికే అమలవుతున్న కేంద్ర పథకాలు కాగా మరికొన్ని పరివార్ పన్నాగాలకు, కార్పొరేట్ శక్తుల వత్తిళ్లకు తలొగ్గుతున్నవే .
పాఠశాల విద్య విస్తరణ
ప్రస్తుతం పాఠశాల విద్య 6-14ఏండ్ల పిల్లలకే పరిగణించ బడుతోంది. 3-6ఏండ్ల వయసును ప్రీ-స్కూల్ విద్యగా, 15-16ఏండ్ల వయసును దేశమంతటా హయ్యర్ సెకండరీగా, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియటుగా వ్యవహరించబడుతోంది. ఇకనుంచి పాఠశాల విద్యను 3-18 (మొత్తం 15)ఏండ్ల వయసుకు వర్తింప చేయాలని ముసాయిదా నివేదిక సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 వార్షిక బడ్జెట్లోనే ప్రకటించింది. గతేడాది నుంచే అమల్లోకొచ్చింది. కాగా ఈ విషయంలో తాజా సిఫార్సు కొంత గందరగోళం కలిగిస్తోంది. మొత్తం పదిహేనేండ్ల పాఠశాల విద్యను 5+3+3+4 ఏండ్ల దొంతర్లుగా రీడిజైన్ చేయాలంటోంది. శిశువిద్యతో పాటు ఒకటి, రెండు తరగతులను కలిపి (3-8ఏండ్ల) ఒకే యూనిటుగా అంగన్వాడీల అనుసంధానంతో నిర్వహించాలంటోంది. ఆచరణలో ఇది సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాఠశాలల్లో నియమించే ఉపాధ్యాయులు (అన్ని స్థాయిల్లో) అందరికీ నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ అర్హతగా ఉండాలన్నారు. ప్రీ-ప్రైమరీ తరగతుల్లో బోధించేవారికి, సెకండరీ (9-12) క్లాసులకు పాఠాలు చెప్పేవారికి ఒకే స్థాయి విద్యార్హత సమంజసమేనా? వయసుకు తగిన చదువు రావడానికి అనువుగా కరిక్యులంను, బోధనా విధానాన్ని మార్చాలనేది పాత విషయమే. తొమ్మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులను నేర్చుకునే ఆప్షనల్ అవకాశంతో పాటు ఒకేషనల్ కోర్సులను పెట్టాలనడం, సెమిస్టెర్ సిస్టంలో పరీక్షల నిర్వహణ కొత్త విషయాలు. ఇప్పటిదాకా 11, 12 తరగతులను హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్గా వ్యవహరిస్తున్న వాటిని రద్దుచేయాలని చెప్పడం జరిగింది.
సంస్క ృత భాషను నెత్తికెత్తుకునే ఎత్తుగడ
ఇంటిభాష / మాతభాష / స్థానిక భాషలోనే ఐదో తరగతి వరకు, అవకాశం ఉంటే ఎనిమిదో తరగతి వరకూ విద్యా మాద్యమం ఉండాలని, ఆ తర్వాతి తరగతుల్లో ఒక భాషగా కొనసాగించాలని పేర్కొంది. కానీ ఇంగ్లీష్ మీడియం గురించి ఏమీ చెప్పకుండా వదిలేసింది. ఆరో తరగతి నుంచి త్రిభాషా సూత్రాన్ని పాటించాలన్నది. హిందీ ప్రాంతంలో భారతీయ భాషల్లోని ఏదో ఒక భాషను, ఇంగ్లీష్ నేర్పాలని, హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని, ఇంగ్లీషును బోధించాలని చెప్పింది. ఇకనుంచి ఇంగ్లీష్ భాష ప్రాధాన్యతను తగ్గిస్తూ అన్ని స్థాయిల్లో సంస్కృత భాషను ప్రోత్సహించాలని నివేదికలో నొక్కి వక్కాణించబడింది. ఇంగ్లీష్ ప్రపంచ భాషేమీ కాదని, అభివృద్ధి చెందిన దేశాల్లో వాటి స్వంత భాషలే అధికారిక భాషలుగా ఉన్నాయని, అలాగే మనమూ మన భాషలనే పోషించుకోవాలని హితవు పలికింది. కావాలంటే సెకండరీ లెవెల్లో ఫ్రెంచి, జర్మనీ, జపనీస్ తదితర విదేశీ భాషల్లో ఏదైనా నేర్చుకోవచ్చు ఇంగ్లీషే ఎందుకు అని అంటోంది. అది సామాన్య ప్రజలందరికీ ఎందుకని సముదాయిస్తున్నారు. సంస్కత భాషను నెత్తికెత్తుకోవాలని చెప్పడంతోపాటు భారతీయ భాషలన్నిటినీ వెలుగులోకి తేవాలని, పాళీ, ప్రాకతిక, పర్షియన్ భాషల అభివృద్ధికి జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలనీ తెలిపింది. ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా చేసిన ఈ సిఫార్సు విద్యారంగానికి, దేశానికి ఉపయోగపడేదేనా?
ప్రయివేట్ స్కూళ్ళు ఫీజులు పెంచుకోవచ్చు అంటోంది
ప్రయివేట్ పాఠశాలలను ప్రోత్సహించాల్సిందేనని నివేదిక బలపరుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రయివేట్ స్కూల్సును ఆదరించాలే తప్ప రూల్స్, రెగ్యులేషన్స్ పేరుతో అణిచివేయకూడదు అంటోంది. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని వత్తిడి చేయడం తగదని చెబుతోంది. ట్యూషన్ ఫీజులను ప్రయివేట్ స్కూళ్లే నిర్ణయించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కాకపోతే మరీ అతిగా కాకుండా రీజనబుల్గా అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానంగా పెంచుకుంటే సరిపోతుంది (పేరా 8.3.6) అని సిఫార్సు చేసింది. ఈ రికమండేషన్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులను తగ్గించాలనే ఉద్యమాలపై నీళ్లుజల్లి యాజమాన్యాలకు భరోసా కల్పించేలా ఉంది. ప్రయివేట్ స్కూళ్ళు లాభాల కోసమే నిర్వహించ కూడదు, కానీ గడిచిన యాభైయేండ్లలో ప్రయివేట్ స్కూళ్ళు సంపన్నుల బిడ్డలకే పరిమితమై వైవిధ్యం లేకుండా పోయింది. కనుక సకల సామజిక తరగతుల పిల్లలను చేర్చుకోవడానికి ప్రయివేట్ స్కూళ్ళు ప్రయత్నించాలని సలహా ఇచ్చింది.
ఉన్నత విద్యలో కొత్త సంస్థలు
ఉన్నత విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేయాలంటూ ఇప్పుడున్న 800 విశ్వవిద్యాలయాలను, 40,000కళాశాలలను 15,000అద్భుతమైన సంస్థలుగా కన్సాలిడేట్ చేయాలని చెప్పింది. ప్రొఫెషనల్ స్ట్రీమ్స్, లిబరల్ ఆర్ట్స్తో మమేకం చేసి మల్టీ డిసిప్లినరీ కోర్సులను పెట్టాలన్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కమిషన్ (హెచ్ఈజీసీ) గా మార్చాలని, మొత్తం ఉన్నత విద్యారంగం నియంత్రణ కోసం ''నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ (యన్హెచ్ఈఆర్ఏ)''ని నెలకొల్పాలని సిఫార్సు చేసింది. ప్రమాణాల రూపకల్పన, నిధుల సముపార్జన, అక్రిడిటేషన్ తదితర విషయాలకు విడివిడిగా స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. ఉన్నత విద్యా సంస్థలు అన్నీ స్వంత బోర్డులతో అటానమస్ ఇనిస్టిట్యూషన్సుగా మారాలని వివరించారు. అగ్రికల్చర్, లీగల్, హెల్త్కేర్, టక్నికల్ మున్నగు వృత్తి విద్యా సంస్థలన్నీ ఉన్నత విద్యా స్రవంతిలో విలీనమైపోవాలి. యూనివర్సిటీలు, కాలేజీల్లో రిసెర్చీ, ఇన్నోవేషనులకు అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ చూస్తుంటే 'కొత్తొక వింత పాతొక రోత' అన్నట్టు ఉన్న సంస్థలకు పేర్లు మార్చుకుని మురిసిపోవడం తప్ప ఉన్నత విద్యావకాశాల పెరుగుదలకు గాని, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే సామర్ధ్యం పెరిగేదానికి గాని దోహదపడే విధంగా లేదు.
కేంద్ర ప్రభుత్వ పెత్తనానికే ఆర్ఎస్ఏ
త్రిభాషా సూత్రం పేరుతో హిందీ భాషను నిర్బంధం చేసే సిఫార్సును చూడగానే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు, సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే ముసాయిదాలోని ఆ సిఫార్సునే ఎత్తేసుకున్న విషయం తెలిసిందే. నివేదికలో కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని పెంచే ఎత్తుగడలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమంత్రి చైర్మనుగా ఉండే రాష్ట్రీయ శిక్షా అభియాన్ (నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్) ఏర్పాటు చేయాలనేది కీలకమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి వైస్ చైర్మనుగా ఉండే ఈ కమిషన్లో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్ ఉంటారని, దేశ విద్యారంగానికి ఇదే అత్యున్నతమైన సంస్థగా, కస్టోడియనుగా ఉంటుందని ప్రతిపాదించారు. దాని శాఖలుగా రాష్ట్ర విద్యా కమిషన్లు ఏర్పడాలని, అవి కేంద్ర కమిషనుకి జవాబుదారీగా పనిచేస్తాయన్నారు. విద్యారంగానికి సంబంధించిన సకల విషయాలు ఆ కమిషన్ చేతుల్లోనే ఉండే విధంగా ముసాయిదాలో ఉంది.
జీవితానికి, దేశానికి ఉపయోగపడే విద్యా విధానం కావాలి
'కోటి విద్యలు కూటి కొరకే' అన్నట్లు జీవితానికి భరోసా ఇచ్చే విద్య కావాలి. సంపన్నులకు, ధనవంతులకు విలువలు నేర్పే విద్య సరిపోవచ్చు, కానీ సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు బతునిచ్చే విద్యే ప్రధానం. పన్నెండో తరగతి వరకే చదివినా, డిగ్రీ, ఉన్నత విద్యార్హతలు ఏవి సాధించినా ఉపాధికి, ఉద్యోగానికి ఉపయోగపడాలి.
ఇవాళ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో తక్కువ, ప్రయివేట్ రంగంలో ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇండిస్టీ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ కావాలనే చర్చ చాలా కాలంగా జరుగుతున్నదే. చైనాలో లాగ గ్రామీణ పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా పంట పొలాలు, తోటలు, పౌల్ట్రీ, ఫిజియో థెరపీ వగైరా ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పుష్క లంగా నెలకొంటాయి. అందుకనువైన కరిక్యులమ్, బోధన, శిక్షణ కావాలి. రాజ్యాంగ లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులర్ పాఠాలే దేశానికి మేలు చేసేవి. కస్తూరిరంగన్ కమిటీ నివేదికలో ఇలాంటి విషయాలు లేవు. పైగా ఇంగ్లీష్ భాషను నిరుత్సాహ పరచాలానే సిఫార్సు హాస్యాస్పదంగా ఉంది. సంస్కృత భాషను ప్రోత్సహించాలనే రికమండేషన్ కేంద్ర పాలకుల కోరికను తీర్చవచ్చునేమో గానీ విద్యార్థులకు, దేశానికి ఉపయోగపడేది కాదు. కాబట్టి విద్యా విధానం ముసాయిదాలోని ముఖ్యమైన సిఫార్సులను పూర్తిగా మార్చాలి. అందుకు విద్యారంగ శ్రేయోభి లాషులు పెద్ద ఎత్తున స్పందించాలి.
- నాగటి నారాయణ
సెల్: 9490300577