Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీట్లు లేకుండా కమ్యూనిస్టు ఉద్యమం బతకటం కష్టమా?
పార్లమెంటరీ విలువలు దిగజారుతున్న నేపథ్యంలో... డబ్బుపాత్ర పెరిగిన నేపథ్యంలో కమ్యూనిస్టులేం చేయాలి?
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం కాంగ్రెస్తో పొత్తు తప్పదా?
ఈ ప్రశ్నలన్నీ కమ్యూనిస్టు శ్రేణుల్లోనూ, శ్రేయోభిలాషు ల్లోనూ ఇప్పుడు చర్చనీయాంశాలు.
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వామపక్షాలు చేయగల్గిందంతా చేసాయి. నిజానికి మోడీ ప్రభుత్వం గత ఐదేండ్లలో అన్ని రంగాలలో విఫలమైంది. ఆ వైఫల్యాలన్నీ ఎన్నికల ఎజెండా కావాలి. మోడీ ప్రభుత్వం ఓడిపోవాలి. కానీ అలా జరగలేదు. ఒకవైపు ప్రజావ్యతిరేక విధానాలు అమలు జరిపిన మోడీ పాలన, మరోవైపు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వామపక్షాలు తీసుకున్న చర్యలు కూడా మోడీ గెలుపును ఆపలేకపోయాయి. కారణమేమిటి? మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నికల ఎజెండా చేయటంలో కాంగ్రెస్ విఫలమైంది. జాతీయ దురభిమానం, భావోద్వేగాలే ఎజెండాగా మల్చటంలో బీజేపీ నాయకత్వం సఫలమైంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా బీజేపీ నిర్దేశించిన ఎజెండా వలలో చిక్కుకున్నది. ఇది యాధృచ్ఛికమా? అంతకన్నా లోతుగా అర్థం చేసుకోవాల్సిందేమైనా ఉన్నదా? ఇది కమ్యూనిస్టు ఉద్యమం ముందున్న ప్రశ్న.
కాంగ్రెస్ బలహీనత
ఉపాధి అవకాశాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయరంగంలో పెరుగుతున్న సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, కార్మికుల హక్కులపైదాడి, పెరుగుతున్న లైంగికదాడులు, కుల దురహంకారం వంటి అనేక సమస్యలు ముందుకొచ్చాయి. మోడీ నిరంకుశ పోకడలు, ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు ప్రమాదం. రాష్ట్రాల హక్కులూ, అధికారాలూ, ఫెడరల్ రాజ్యాంగం వంటి కీలక అంశాలన్నీ మోడీ ప్రభుత్వాన్నీ, బీజేపీ నాయకత్వాన్నీ ఇరుకున పెట్టేవే. అయినా కాంగ్రెస్ నాయకత్వం ఆవైపు దృష్టి సారించలేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈ సమస్యలకు పరిష్కారాలు లేవు. ఇప్పుడు మోడీ చుట్టూ చేరిన అంబానీ, అదానీలు, టాటా, బిర్లాలే నాడు మన్మోహన్సింగ్ చుట్టు కూడా ఉన్నారు కదా! ఆర్థిక, పాలనా పరమైన సమస్యలన్నీ అప్పటి నుంచీ కొనసాగుతున్నవే. మోడీ పాలనతో మరింత ముదిరాయి. ఈ సమస్యలను ఎన్నికల ఎజెండా చేసి ప్రత్యామ్నాయ విధానాలు చూపగల స్థితిలో కాంగ్రెస్ లేదు.
లౌకికవాదం కోసం నిలబడ్డదా?
లౌకిక విధానాల కోసమైనా కాంగ్రెస్ గట్టిగా నిలబడాలి అన్న ప్రశ్న కూడా సహజం. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిలబడే స్వభావం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా అన్న విషయం పరిశీలించాలి. అప్పుడే, గత ఎన్నికలలో మోడీ పాలన వైఫల్యాలను కాంగ్రెస్ ఎందుకు ఎజెండాగా మలచలేకపోయిందో స్పష్టమవుతుంది. కాంగ్రెస్ అగ్రనాయకుడు ప్రణబ్ముఖర్జీ స్వయంగా ఆర్ఎస్ఎస్ వేదికనెక్కారు. మోడీ ప్రభుత్వం ప్రజలలో మతపరమైన విభజన సృష్టిస్తున్న సమయంలో ఆ పని చేసారు. ఈ చర్య కొత్తతరం యువతలో ఆర్ఎస్ఎస్ పట్ల గౌరవభావం పెంచడానికే తోడ్పడుతుందన్న విషయం తెలియని అమాయకుడు కాదాయన. అయినా.. కాంగ్రెస్ నాయకత్వం కనీసం ప్రశ్నించలేదు. గుజరాత్ శాసనసభ ఎన్నికల నుంచి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల దాకా, రాహుల్గాంధీ గుడులూ గోపురాలూ తిరిగారు. మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గోవధ నిషేధ చట్టం పేరుతో అనేకమందిని నిర్బంధించింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వం బీజేపీతో గొంతు కలిపింది. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ మొత్తం బోర్డు తిప్పేసి బీజేపీగా మారింది. చివరకు పార్లమెంట్ ఎన్నికలలో లౌకిక, ప్రజాస్వామ్య వాదులంతా బీజేపీ మీద పోరాడుతున్న సమయంలో రాహుల్గాంధీ మాత్రం కేరళ ఎల్డీఎఫ్ మీద పోరాటంలో నిమగమయ్యారు. ప్రాంతీయ పార్టీలు కూడా ఉదారవాద విధానాలు తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, లౌకికవిలువల పట్ల నిబద్ధతకు నీళ్ళొదిలాయి. కమ్యూనిస్టుల మీద దాడికి వీరుకూడా సిద్ధమే! వీటికి తోడు రాజకీయాలలో విలువలు దిగజారాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర అనూహ్యంగా పెరిగింది. కమ్యూనిస్టులు పోటీ చేయటమే కష్టమైన స్థితికి చేరింది. మరోవైపు దీనికి పూర్తి భిన్నంగా శ్రేయోభిలాషుల్లో పదవులు గెలిస్తేనే పార్టీ మనగల్గుతుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవిలువలు కాపాడుకోవటం వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశమైనాయి. ఇందుకోసం బూర్జువా పార్టీలమీద ఏమేరకు ఆధారపడవచ్చో, కమ్యూనిస్టుల కర్తవ్యం ఏమిటో పరిశీలించవల్సిన అవసరం ఏర్పడింది.
అవకాశవాదానికి పునాది ఎక్కడీ
కాంగ్రెస్ చరిత్రను గమనిస్తే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. దేశ స్వాతంత్య్రానికి కొద్దికాలం ముందు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ముస్లింలీగ్లు పోటీ చేసాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ పేరుతో పోటీ చేసేందుకే కొన్ని సందర్భాలలో సాహసించలేదు. కాంగ్రెసు పోటీ చేసిన అలాంటి ప్రాంతాలలో హిందువులనుద్దేశించి ప్రసంగించింది. మొత్తం ప్రజలనుద్దేశించి కాదు. ''పాకిస్థాన్తో రాజీలేని పోరాటం చేయాలంటే, హిందువుల హక్కుల కోసం నిలబడాలంటే కాంగ్రెస్కు మద్దతు నివ్వాలి'' అని విజ్ఞప్తి చేసింది. దేశ స్వాతంత్య్ర సమయంలో జరిగిన మతకొట్లాటలలో కూడా కొన్ని ఘటనలు పరిశీలించాలి. బీహార్ ప్రాంతంలో మైనారిటీల మీద స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు మూడురంగుల జెండాలు పట్టుకుని దాడిచేసారు. కాంగ్రెస్ నాయకత్వం అనుసరించిన అవకాశవాద వైఖరి ఫలితంగా కాంగ్రెస్లోపల హిందూత్వ భావజాలం బలపడింది. నాటినుంచి నేటి వరకూ అన్ని కీలక సందర్భాలలోనూ కాంగ్రెసు అవకాశవాదం స్పష్టమవుతూనే ఉన్నది. మొన్నటి పార్లమెంటు ఎన్నికలలో.. ఇంతటి కీలక సమయంలో.. లౌకిక విధానాల మీద కాంగ్రెసు నినాదమే లేదు కదా! 1947 డిసెంబర్లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, కాంగ్రెస్ అవకాశవాదం పట్ల ఆనాడే హెచ్చరించింది. ''గాంధీ, నెహ్రూలు అనుసరిస్తున్న రాజకీయ విధానాలు ఎప్పటికీ మతోన్మాదాన్ని గానీ, మత కొట్లాటలను గానీ ఓడించజాలవు'' అని స్పష్టం చేసింది. డెబ్బయి ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా కాంగ్రెస్ మీద ఇంకా భ్రమలు అవసరమా?
నిరంకుశ పోకడలు వెన్నతో పెట్టిన విద్య
1929లోనే సమ్మెలను అణచివేసేందుకు బొంబాయి ప్రొవిన్షియల్ కాంగ్రెస్ ప్రభుత్వం ''బాంబే ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్'' పేరుతో నిరంకుశ చట్టం తెచ్చింది. ఉత్తరప్రదేశ్, మద్రాస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టాలు చేస్తామని బెదిరించాయి. 1939 ప్రాంతంలో భూస్వాములకూ, వడ్డీ వ్యాపారులకూ వ్యతిరేకంగా పోరాడిన రైతులను కూడా బెంగాల్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అరెస్టు చేసింది. జైలులో దోమతెరలు కూడా అనుమతించలేదు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల కాలంలో కూడా పోరాడే కార్మికులూ, రైతుల పక్షం వహించకుండా తెల్లదొరలకు వంతపాడారు. కమ్యూనిస్టులను అణచివేసేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు. 1938-39లో ఆంధ్ర ప్రాంతంలో బాట్లీవాలా పర్యటన సందర్భంగా ప్రజలను బ్రిటిష్ వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు జైలులో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయాలని కమ్యూనిస్టు పార్టీ పోరాడింది. 1946లో ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వారందరినీ విడుదల చేసింది. కానీ విడుదల చేయాలని పోరాడిన కమ్యూనిస్టులను మాత్రం విడుదల చేయలేదు. బొంబాయి ప్రొవిన్షియల్ ప్రభుత్వంలో హౌంమంత్రిగా ఉన్న కెఎం మున్షి కమ్యూనిస్టులను విడుదల చేయకపోగా.. కమ్యూనిస్టుల మీద నిఘా పెట్టాలని వైస్రారుని కోరాడు. మొత్తంమీద స్వాతంత్య్ర పోరాటంలో జైలుపాలైన కమ్యూనిస్టులను విడుదల చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు మరింత మందిని నిర్బంధించాయి. గాంధీ బహిరంగంగానే ఈ చర్యలను సమర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడటం సరైంది కాదనీ, ఇది కాంగ్రెస్ క్రమశిక్షణ అన్న పేరుతో నెహ్రూ తప్పుకున్నాడు. ఇవన్నీ లౌకిక విలువలూ, ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ వైఖరికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మాత్రమే!
ఎవరి ప్రయోజనాల కోసం?
స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత పెట్టుబడిదారీ వర్గం ప్రతినిధిగా పోరాడిన కాంగ్రెస్ చేతిలో రాజ్యాధికారం లేదు. బ్రిటిష్ రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరాడిన దశ అయినా కుల మత విభేదాలకు అతీతంగా ప్రజలను ఐక్యంగా నడపటంలో అనేక సందర్భాలలో నిజాయితీ ప్రదర్శించలేక పోయింది. ముస్లింలీగ్గానీ, కాంగ్రెస్గానీ ప్రజల ఆకాంక్షలకన్నా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారీవర్గం ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చారు. కాంగ్రెస్ నాయకత్వం అవకాశవాదాన్నే ప్రదర్శించింది. స్వాతంత్య్రానంతరం రాజ్యాధికారం కాంగ్రెస్ చేతికి చిక్కింది. భారత బూర్జువావర్గం మరింత బలమైన వర్గంగా తయారైంది. రాజ్యాధికారం రుచిచూసిన బడా బూర్జువావర్గం ప్రతినిధి మీద ప్రజాస్వామ్యం, లౌకిక విధానాల కోసం ఆధారపడగలమా?
కమ్యూనిస్టులు ఏంచేయాలి?
సీపీఐ(ఎం) కార్యక్రమం చెబుతున్న మౌలిక విషయాలు ఇక్కడ పరిశీలించటం అవసరం. భారత రాజ్యాంగ యంత్రం బడా బూర్జువా నాయకత్వంలో ఉన్న బూర్జువా భూస్వామ్య వర్గం చేతుల్లో ఉన్నదని సీపీఐ(ఎం) అంచనా వేసింది. పెట్టుబడిదారీ విధానం అమలు కోసం భూస్వామ్య సంబంధాలు బద్దలు కొట్టేందుకు ఇక్కడ బూర్జువావర్గం సిద్ధంగాలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే భూస్వాములతో రాజీధోరణి వ్యక్తమైంది. గత ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ చరిత్ర దీనినే రుజువు చేసింది. కులంగానీ, మతంగానీ భూస్వామ్య సమాజపు లక్షణాలన్న విషయం తెల్సిందే. భూస్వామ్య విధానంతో రాజీపడిన పెట్టుబడిదారీవర్గం కుల నిర్మూలనకు గానీ, మతోన్మాద విధానాలకు భిన్నంగా లౌకిక విలువల కోసం గానీ పనిచేయడానికి సిద్ధంగాలేరు. పైగా వారి స్వార్థ లాభాపేక్షకోసం, పేద ప్రజలను విభజించడానికి వాటిని ఉపయోగించుకుంటున్నారు. పెంచి పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి రాజకీయ ప్రతినిధులైన బూర్జువాపార్టీల నుంచి పైగా బడా బూర్జువా ప్రతినిధిగా ఉన్న కాంగ్రెసు నుంచి ప్రజాస్వామ్యం, లౌకిక విధానాల కోసం ఇంతకన్నా ఆశించలేము. కమ్యూనిస్టు ఉద్యమం పునాది మీద నిలబడి పోరాడగల్గినప్పుడే, ఇతర ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు కూడా తోడు రాగల్గుతాయి. అందుకే కాంగ్రెస్ వైపో, మరో పార్టీ వైపో చూడటం కాదిప్పుడు చేయవల్సింది. కమ్యూనిస్టు ఉద్యమం బలపడాలి. ప్రజాఉద్యమాల మీద దృష్టి సారించాలి. ప్రజాపునాది బలపర్చుకోవాలి.
- ఎస్. వీరయ్య