Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బారేజిని, అక్కడినుంచి ఎత్తిపోసిన నీళ్లు చేరే కన్నెపల్లి పంప్ హౌజ్ను జూన్ 21న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇద్దరు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, గవర్నర్తో కలిసి ప్రారంభించారు. పందొమ్మిది పంప్ హౌజులు, 20బారేజీలు, జలాశయాలతో కూడిన ఈ బృహత్తర పథకంలో ఒక బారేజీని, ఒక పంప్ హౌజ్ను ప్రారంభించడం ప్రతీకాత్మకం కావచ్చు గాని, ప్రశంసల జడివానలో (బహుశా ఈసారి ప్రకృతి వర్షాకాలాన్ని ఎత్తగొట్టింది గనుక ఇక మిగిలినది ప్రశంసల, ప్రగల్బాల వర్షాలే కావచ్చు!) మిగిలిన పనులు ఎంత అయ్యాయో, ఇంకా ఎంత పని కావలసి ఉన్నదో ప్రచార సాధనాలు కూడా వాస్తవాలు ప్రకటించడం లేదు.
ఈ పథకం గురించి మూడేండ్లుగా సాగుతున్న సాంకేతిక, ఆర్థిక, రాజకీయ, నిర్వాసిత, పునరావాస వివాదాలు ఇప్పటికీ పూర్తిగా సమసిపోలేదు. మహా సంరంభంతో ప్రారంభోత్సవం జరపడం, పని అయిపోయిందని అనిపించడం సమస్యలను మూసిపెట్టవచ్చు గాని పరిష్కరించినట్టు కాదు. ఆడంబరంగా ప్రారంభోత్సవం జరిగింది గనుక, పని అయిపోయింది గనుక దాని గురించి మాట్లాడవలసిందీ సమీక్షించవలసిందీ ఏమీ ఉండదని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించీ, నాగార్జునసాగర్ గురించీ చర్చకే ఆస్కారం ఉండేది కాదు, తెలంగాణ ఆకాంక్షలే వ్యక్తమయ్యేవి కావు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యే ఉండేది కాదు.
అందువల్ల ఆ పని ముప్పై శాతమో, అంతకన్న తక్కువో జరిగినా పూర్తయిపోయినట్టు బాజాభజంత్రీలు వాయిస్తున్నప్పటికీ, ప్రచారసాధనాలన్నిటినీ గుప్పిట్లో పెట్టుకుని విమర్శల గొంతు నొక్కుతున్నప్పటికీ, నిజాలు ఎప్పటికైనా మాట్లాడుకోవలసిందే. లక్షకోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి, ప్రజల పేరు మీద అమలవుతున్న పథకం గనుక అది నిజంగా ప్రజానుకూలమైనదేనా, కాంట్రాక్టర్ల కోసం, ముడుపుల కోసం సాగుతూ, నీళ్లను సెంటిమెంట్గా మార్చి ప్రజల కండ్లలో దుమ్ము కొడుతున్నదా ఎప్పటికైనా చర్చించవలసిందే.
కృష్ణా గోదావరులు తమ బీళ్లకు మళ్లాలని, తమ నేల సస్యశ్యామలం కావాలని తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా బలంగా ఆకాంక్షిస్తున్నారు. అందువల్లనే తెలంగాణ ఉద్యమ భూమికలుగా ప్రచారంలోకి వచ్చిన నాలుగు అంశాలలో (నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం) నీళ్లే ప్రథమ స్థానంలో ఉన్నాయి. అలా తెలంగాణ ప్రజా చైతన్యంలో నీళ్ల కోసం తపన ఒక సెంటిమెంటుగా, భావోద్వేగంగా మారిపోయింది. అంటే నిజంగా నీళ్ల గురించి ఏమైనా చేసినా చేయకపోయినా, నీళ్ల పేరు చెపితే చాలు తెలంగాణ ప్రజలను ఆకర్షించడానికి, తప్పుదారి పట్టించడానికి, మోసగించడానికి కూడా అవకాశం వచ్చింది.
ఈ స్థితిలో తెలంగాణకు అత్యవసరమైన నీరు అందించడానికే కాళేశ్వరం భారీ ప్రాజెక్టును చేపడుతున్నాననే వాదనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తమ ఆకాంక్ష ఈ రూపంలో నెరవేరుతున్నదనే ఆలోచనతో తెలంగాణ ప్రజలలో ఈ పథకం పట్ల ఆశాభావం, ఆదరణ ఉండడం సహజమే. నీటి వినియోగం ఒక భావోద్వేగంగా మారిపోయిన సందర్భంలో వినియోగం గురించి ప్రకటనలు నిజమో అబద్ధమో తేల్చుకోలేని స్థితి, అది నిజమేనా అని ప్రశ్నించినవారి పట్ల వ్యతిరేకత కలిగించే స్థితి, వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రించే స్థితి కూడా సహజమే. వివాదాలన్నీ అసమంజసం, ఇది చాల ఉదాత్తమైన పథకం అని అనుకున్నప్పటికీ, ఆ పని జరిగిన పద్ధతి అంత ఉదాత్తంగా, పారదర్శకంగా, సందేహాతీతంగా లేదని గత మూడేండ్ల చరిత్ర చూపుతున్నది.
నీటి లభ్యత, అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి వినియోగ గణాంకాలు, విద్యుత్ అవసరాలు, ప్రాజెక్టు సంబద్ధత, నిర్వాసితత్వం, పునరావాసం వంటి ప్రధానమైన వివాదాలకు ఇవాళ్టికీ సంతృప్తికరమైన సమాధానాలు లేవు. పాత పథకం ప్రకారం తుమ్మిడిహట్టిలో ఆనకట్ట నిర్మిస్తే అక్కడ ముందు అనుకున్నంత నీటి లభ్యత లేదని కేంద్ర జల వనరుల సంఘం చెప్పిందని, అంతేకాక అక్కడ ఆనకట్ట ఎత్తు నిర్ణయించడంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులు ఉన్నాయని, మేడిగడ్డ దగ్గర అయితే చాల ఎక్కువ నీరు అందుబాటులో ఉందని, అందువల్ల రీడిజైన్ చేసిన పథకం చాల ప్రయోజనకరమని ప్రభుత్వం, ప్రాజెక్టు సమర్థకులు వాదించారు. కాని ఈ మూడు వాదనలు కూడా అబద్ధాలు, అర్థసత్యాలు. ఇవి కేవలం పాత ప్రాజెక్టును రద్దు చేసి కొత్త ప్రాజెక్టుకు సమర్థనగా చూపిన సాకులే తప్ప వాస్తవ పరిశీలనకు నిలిచేవి కావు.
తుమ్మిడిహట్టి దగ్గర ముందు అనుకున్నట్టుగా 165టీఎంసీల నీరు లభ్యం కావడం లేదని కేంద్ర జల సంఘం ఎక్కడా ఎప్పుడూ అనలేదు. కేంద్ర జల సంఘం అన్నదల్లా గతంలో ప్రతిపాదించిన పంపులతో తుమ్మిడిహట్టి దగ్గర అనుకున్నట్టుగా 160టీఎంసీల నీటిని తీసుకోవడం సాధ్యం కాదని మాత్రమే. ఆ పంపులతో 130టీఎంసీల కన్న ఎక్కువ నీరు తరలించడానికి అవకాశం లేదని మాత్రమే. అంటే అక్కడే మరింత ఎక్కువ సామర్థ్యం గల పంపులు ఏర్పాటు చేస్తే పాత ప్రాజెక్టు సరిపోయేది. ఆ కారణం కోసం పూర్తిగా ఆ ప్రాజెక్టునే మార్చవలసిన అవసరం లేదు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వమే 2014 నుంచి 2015 చివరి వరకూ జరిపిన చర్చలలో పాత ప్రాజెక్టు ఎత్తు గురించి, ముంపు విస్తీర్ణం గురించి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి గాని వాటిలో కొన్ని చర్చల ద్వారా పరిష్కారమయ్యాయి, మిగిలినవి కూడా చర్చల ద్వారా పరిష్కారమయ్యేవే.
తుమ్మిడిహట్టి ఆనకట్ట 152మీటర్ల ఎత్తున కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది గాని 148మీటర్ల ఎత్తున కట్టడానికి ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఆ ఒప్పందం కూడా కుదిరింది. అలా 148మీటర్ల ఎత్తు ఆనకట్ట కట్టినా, తీసుకోదలచుకున్న 160టీఎంసీ నీళ్లను తీసుకుని, ముందు అనుకున్నట్టుగా ఎల్లంపల్లికి ఎత్తిపోసి ఉండవచ్చు. కాని హఠాత్తుగా, అంతర్రాష్ట్ర జల వివాదం సాకుతో మొత్తం ప్రాజెక్టు డిజైన్నే మార్చి, 100మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ ఆనకట్ట తలపెట్టడానికి సాంకేతిక కారణాలు కాక ఇతర కారణాలున్నాయి. పైగా తుమ్మిడిహట్టిని తొలగించి, దాదాపు 150కిమీ దిగువన మేడిగడ్డ దగ్గర నీళ్లు తీసుకుని, భారీ పంపుల ద్వారా తుమ్మిడిహట్టికి సమాన ఎత్తులో ఉన్న ఎల్లంపల్లికి ఎత్తిపోయడం అనేది హాస్యాస్పదమైన, అనవసరమైన, వృథావ్యయానికి దారితీసే ప్రయాస మాత్రమే. ఈ మధ్యలో భారీ పంపుసెట్లు, రెండు జలాశయాలు, పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి, పంపిణీ కేంద్రాలు మొదలైనవన్నీ విపరీతమైన ప్రజాధనం వ్యయంతో నిర్మించడానికి, అంటే కాంట్రాక్టర్లకు, ఆ యంత్ర సామగ్రి తయారుచేసే బహుళజాతి సంస్థలకు వేల కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి, అందులో ఇరవై శాతమో ముప్పై శాతమో ముడుపులుగా తిరిగి పొందడానికి చేసిన దురాలోచన తప్ప, ప్రాజెక్టు రిడిజైన్ అవసరమూ లేదు, అందులో ప్రజా ప్రయోజనమూ లేదు.
ఇక నీటి వినియోగ గణాంకాల గారడీ అయితే ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నదో చెప్పనక్కరలేదు. మొన్న ప్రారంభోత్సవం రోజునే 37లక్షల ఎకరాల నుంచి 45లక్షల ఎకరాల వరకూ ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్పారు. ఇన్ని లెక్కలు చలామణీలో ఉన్నాయంటేనే ఏదో తిరకాసు ఉందని అర్థం. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక టీఎంసీతో పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాలు సాగవుతాయని అబద్ధాలు చెప్పాయని, కాని వాస్తవంగా పదివేల ఎకరాల కన్న ఎక్కువ సాగు కష్టమని ఎన్నో సభల్లోనూ, చివరికి శ్రీకృష్ణ కమిషన్ ముందు లిఖితపూర్వకంగా సమర్పించిన నివేదికలలోనూ టీఆర్ఎస్ నేతలు వాదించారు. ఇవాళ వారే కాళేశ్వరం నీటితో మాత్రం పన్నెండు వేలు, పద్నాలుగు వేల, ఇరవై వేల ఎకరాల దాకా సాగదీస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కింద నిర్మించనున్న అన్ని లిఫ్టులకూ కలిపి 4992 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుందని ప్రభుత్వమే అంటున్నది. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించడానికి వేల కోట్ల రూపాయలు కావాలి. ఈ లిఫ్టులు నిరంతరం పనిచేయడానికి ఆ సబ్ స్టేషన్ల, లిఫ్టుల నిర్వహణకు ప్రతిరోజూ అవసరమయ్యే విద్యుత్తుకు సాలీనా వేలాది కోట్ల రూపాయలు కావాలి. ఇలా కాళేశ్వరం నీటి సరఫరా వ్యయం సాలీనా రు.12758 కోట్లకు పైనే ఉండవచ్చునని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా పూర్తయి, సాగు భూములకు నీరు అందినా ఆ సాగు చాల ఖరీదైన సాగుగా మారుతుంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి తగిన గిట్టుబాటు ధరలు అందని రైతాంగం మీద ఇది మరింత భారమవుతుంది. ఈ వ్యయాన్ని రైతులు భరించనక్కరలేదని, ప్రభుత్వం ఇప్పటిలాగే ఎప్పటికీ ఉచిత విద్యుత్తు ఇస్తుందని అనుకున్నప్పటికీ, ప్రభుత్వమైనా ఆ వ్యయాన్ని పన్నుల రూపంలోనో, రుణాల రూపంలోనో సమకూర్చుకోవలసిందే.
ఇక ఆర్థికాంశాలలోకి వస్తే, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ప్రాజెక్టు నిర్మాణానంతర వార్షిక నిర్వహణా వ్యయం, కాంట్రాక్టర్ల పాత్ర, రాజకీయ నాయకత్వం పాత్ర వంటి ప్రధానాంశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం హఠాత్తుగా రూ.38,000 కోట్ల నుంచి రూ.80,500 కోట్లకు పెరిగిపోయింది. ఇప్పటికి రూ.50,000 కోట్లు ఖర్చు పెట్టారని, అందులో ఒక్క కాంట్రాక్టు సంస్థకే 80శాతం పనులు అందాయని తెలుస్తున్నది. ఇక నిర్మాణానంతర వార్షిక నిర్వహణా వ్యయం ఇప్పుడు ఉజ్జాయింపుగా అంచనా వేయగలిగిందే తప్ప కచ్చితంగా చెప్పలేం. ఒక అంచనా ప్రకారం ఇది రూ.17,584 కోట్ల వార్షిక వ్యయంగా ఉండబోతుంది. అది ఇరవై వేల కోట్ల రూపాయల దాకా ఉండవచ్చు. ఇటువంటి బహుళార్థసాధక, ప్రజా ప్రయోజన ప్రాజెక్టును లాభనష్టాల లెక్కలలో అంచనా వేయడం సరైనది కాదనే మాట నిజమే గాని, ప్రాజెక్టు నిర్మాణానికి ఎనభై వేల కోట్ల రూపాయలు (నిర్మాణం పూర్తయ్యేవరకు అది లక్షకోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదు), నిర్మాణానంతరం ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి, ఆ ఖర్చులో అత్యధిక భాగం కాంట్రాక్టర్ల బొక్కసాల్లోకీ, అటు నుంచి రాజకీయ నాయకుల బొక్కసాల్లోకీ ప్రవహిస్తున్నప్పుడు, ప్రవహించేది నీళ్లా, ధనమా అని ప్రశ్నించక తప్పదు. ఎవరి బొక్కసాల్లోకో ప్రవహిస్తున్న ధనం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించక తప్పదు.
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028