Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశమంతటా చర్చిస్తున్న విద్యా విధానం - 2019 ముసాయిదా నివేదికలో ఉన్నత విద్య పరిస్థితిని విస్తతంగా వివరించి, భవిష్యత్ దర్శనం ఆవిష్కరించడం జరిగింది. గత విద్యా విధానం 1986 (1992లో మోడీఫై చేయబడింది) తర్వాత గడిచిన మూడు దశాబ్దాల కాలంలో సామాజిక ఆర్థిక రాజకీయ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా మార్పులు జరిగినవి. వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ప్రగతి పథంలో పురోగ మించడానికి సమర్థవంతమై ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. ఆ లక్ష్యం ఈ ముసాయిదాలో నెరవేరిందా లేదా అనేది పరిశీలించాలి.
దేశంలోని 19-23ఏండ్ల వయసుగల యువతీ యువకుల్లో 25.8శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను అందుకోగలుగు తున్నారని, ఇది అభివృద్ధి చెందిన దేశాలకంటే చాల తక్కువని ముసాయిదాలో పేర్కొనబడింది. 2013లో ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన డేటా రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 88శాతం, ఆస్ట్రేలియాలో 86శాతం, జర్మనీలో 61శాతం, బ్రిటన్లో 56శాతం, బ్రెజిల్లో 46శాతం, మలేసియాలో 38శాతం, చైనాలో 30శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మన దేశంలో ఉన్నత విద్య పొందికగా లేకుండ ముక్కలు చెక్కలుగా చెల్లా చెదురుగా ఉంది. ఎనిమిది వందలకు పైగా విశ్వవిద్యాలయాలు, నలబై వేలకు పైగా కళాశాలలు ఉన్నాయి. ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే 2016-17 ప్రకారం 20శాతం కాలేజీల్లో విద్యార్థులు వందమంది లోపే ఉన్నారని, మూడు వేలుపైగా విద్యార్థులు ఉండే కాలేజీలు నాలుగు శాతమేనని, నలభైశాతం కళాశాలలు ఒక్క విభాగంతోనే నడుస్తున్నవని విశ్లేషించింది. ఇతర దేశాల్లోని కాలేజీలు బహుళ విభాగాలతో నడుస్తున్న విషయాన్ని గుర్తుచేసింది.
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధనలు చాలా పరిమితంగా జరుగుతున్నాయి. బోధనా సంస్థలు, పరిశోధనా సంస్థలు వేర్వేరుగా ఉండడమే అందుకు కారణమని ముసాయిదా తేల్చింది. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో పరిశోధన, అభివృద్ధికి వెచ్చిస్తున్న ఖర్చు, పరిశోధకుల సంఖ్య చాలా తక్కువని 'ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంకేతిక సంస్థ (యునెస్కో)' 2017లో ప్రకటించిన నివేదికలోని వివరాలను పేర్కొన్నది.
దేశం జీడీపీలో ఖర్చు మిలియన్
శాతం పెడుతోంది జనాభాకి
మిలియన్ పరిశోధకుల
డాలర్లు సంఖ్య
ఇజ్రాయెల్ 4.2 11,760.90 8250
స్వీడన్ 3.1 14,191.10 6877
సింగపూర్ 2.2 10,069. 00 6729
జపాన్ 3.4 1,69,554.10 5328
జర్మనీ 2.9 1,09,562.60 4318
అమెరికా 2.7 4,76,460.00 4255
బ్రిటన్ 1.7 43,811.10 4254
రష్యా 1.1 40,330.20 3094
చైనా 2.0 3,70,602.50 1096
ఇండియా 0.8 48,063.00 156
యూజీసీ, ఏఐసీటీఈ, న్యాక్ తదితర సంస్థల్లోని అక్రమాలు, అవకతవకలు, బయటివారి నియామకాలు, పెత్తనాల వలన ఉన్నత విద్య అభివృద్ధి చెందలేకపోయిందని కస్తూరిరంగన్ కమిటీ ఎత్తిచూపుతోంది. మెరిట్ని వదిలేసి సీనియారిటీకే అవకాశాలు ఇవ్వడం వలన రీసర్చ్ ఇన్నోవేషన్కి ప్రోత్సాహం కొరవడిందని వ్యాఖ్యానించింది. అందువలన ఉన్నతవిద్యను ప్రక్షాళన చేసి, 21వ శతాబ్ద అవసరాలకు అనువైన ప్రగతిపథాన పయనించడానికి తగిన సిఫార్సులు చేస్తున్నట్టు చెప్పింది.
2035 నాటికి ఉన్నత విద్యలో సగటు నమోదు 50శాతానికి పెరగాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో సంస్థలో 5000మంది పైగా విద్యార్థులతో బహుళ విభాగాలతో నడిచే విధంగా ఉన్నత విద్యాసంస్థలను రీస్ట్రక్చర్ చేయాలన్నది. పరిశోధనా విశ్వవిద్యా లయాలు, బోధనా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అని మూడు రకాలుగా అభివృద్ధి చేసి అటానమస్ సంస్థలుగా మార్చాలి. విద్యార్థులకు ఇష్టమైన మేజర్ మైనర్ సబ్జాక్టులతో బహుళ విభాగాల విద్యకు అనువుగా కరిక్యులమ్ను సులభతరం చేయాలి. రాబోయే ఐదేండ్లలో ఐదు 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్' సంస్థలను ఏడాదికి రూ.20 వేల కోట్ల గ్రాంటుతో నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. యూజీసీ, ఏఐసీటీిఈ, న్యాక్ సంస్థల అధికారాలు, విధులను పరిమితం చేసి మొత్తం ఉన్నత విద్యారంగాన్ని అజమాయిషీ చేసేందుకు ''నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అధారిటీ'' సంస్థను నెలకొల్పాలని సూచించింది.
ఉన్నత విద్య గురించి కస్తూరిరంగన్ కమిటీ చేసిన సమీక్ష స్థూలంగా బాగానే ఉన్నా చేసిన సిఫార్సులు, ప్రతిపాదనలు మాత్రం ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య ఇప్పుడున్న 25.8శాతం నుంచి రానున్న పదిహేనేండ్లలో 50శాతానికి పెంచాలనడం సంతోషించదగిందే. కానీ రీస్ట్రక్చర్, కన్సాలిడేషన్ పేరుతో 25వేల కాలేజీలను మూసేస్తే ఉన్నత విద్యావకాశాలు ఎలా పెరుగుతాయి? అనే ప్రశ్నకు సమాధానంగా కాబోలు దూర విద్యా అభ్యసన కేంద్రాలను విస్తతంగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. ఒక్కో విద్యాసంస్థలో 5000 వేల మంది పైగా విద్యార్థులు ఉండే పెద్ద సంస్థలను ఏర్పాటు చేయాలనడం బాగానే ఉన్నా, అంతటి పెద్ద సంస్థలను నిర్వహించడం కార్పొరేట్ సంస్థలకు తప్ప మన ప్రభుత్వాలకు సాధ్యమయ్యేదేనా? అందుకేనేమో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషనుకి నిధులు సమకూర్చడంలో ప్రయివేట్ సంస్థలను కూడా పబ్లిక్ సంస్థలతో సమానంగా చూడాలని చెప్పింది. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు అటానమస్ సంస్థలుగా మారాలని స్వయంపోషకం కావాలని చెప్పడంలో ప్రభుత్వ సహాయాన్ని ఆశించకూడదనే అర్థం కూడా దాగివుంది. అలాగైతే బడుగు బలహీన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యను అందుకునే అవకాశం మరింత తగ్గిపోగలదు. నాణ్యత లేకపోవడం, ఉద్యోగానికి ఉపయోగ పడకపోవడం మన ఉన్నత విద్యలోనున్న పెద్ద బలహీనత. ఉద్యోగాల కోసం వెళ్లే గ్రాడ్యుయేట్లలో సగంమందికి ఇంటర్వ్యూలో పాల్గొనే మెళుకువలు కూడా ఉండడం లేదని 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2018' వెల్లడించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 20శాతం మంది మాత్రమే తగిన ఉద్యోగాలకు అర్హులవుతున్నారని ప్రయివేట్ ఏజెన్సీలు నిర్వహించే 'ఎంప్లాయబిలిటీ రిపోర్ట్స్' తెలియజేస్తున్నవి. ఇలాంటి మౌలిక లోపాలు, లొసుగులు, బలహీనతలను అధిగమించే సిఫార్సులు మాత్రం ముసాయిదాలో లేకపోవడం పెద్ద వైఫల్యం.
- ఎన్. నారాయణ
సెల్: 9490300577