Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత అటవీచట్టం (ఐఎఫ్ఎ) 2019 ముసాయిదాలో అటవీశాఖ అధికారు లకు క్రూరమైన నిర్బంధాన్ని అమలు చేయగల అధికారాలు దఖలుపరుస్తూ ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాపితంగా 7,08,273చదరపు కిలోమీటర్ల విస్తరణలోని అడవులను నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా వాణిజ్యీ కరించేందుకు ప్రతిపాదనలు పొందుపరిచింది.
2006 చట్టానికి భిన్నంగా ముసాయిదాలో బలవంతంగా చట్టాలను అమలు జరిపే విశేష అధికారాలను అటవీశాఖ అధికారులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వ శాసన, కార్యనిర్వాహక అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం అతిక్రమిస్తోంది. 2019ముసాయిదా ఇప్పటికే రాష్ట్రాలకు పంపి వారి అభిప్రాయాలను కోరి ఉన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ఫ్రిబ్రవరి 13 తీర్పులో ఎండగట్టిన తరువాత కేంద్రం ఇటువంటి ప్రతిపాదనతో ముందుకు రావటం గమనార్హం. ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం సామాజికంగా వెనుకబడిన వారికి ఈ సవరణ ద్వారా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా బుద్ది తక్కువతనంగా, నిసిగ్గుతో ముందుకు తేవడం ఘోరమైన విషయం.
ఈ ముసాయిదా చట్టం తిరోగామి, వివాదాస్పదం చట్టంలోని అనేక అంశాలను తాజా చట్టంతో ప్రతిపాదించారు. ఫారెస్టు అధికారులకు ప్రస్తుతం లేని 1927నాటి కొన్ని ''విటో'' అధికారాలు కల్పిస్తున్నది. అన్నింటికంటే వివాదాస్పదమైన విషయమేమిటంటే ఫారెస్టు అధికారులకు వారి స్థాయిలోనే నేరాలను నిర్ధారించి శిక్షలు వేసే విశేష అధికారం కల్పిస్తున్నది. రెండవది అదే అటవీ చట్టాల ఉల్లంఘన జరిగిందన్న అనుమానం వస్తే ఆయుధాలను వినియోగించవచ్చు. కాల్చేయవచ్చు. ఎవరి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. పూర్తి అధికారం వారిదే. ఫారెస్టు అధికారికి ఏదైనా ఉల్లంఘన లేక నేరం జరిగిందన్న అనుమానం వస్తే చాలు కాల్పులు జరపవచ్చు. అనుమానితుడి ఆస్తి జప్తు చేయవచ్చు. తనిఖీ చేయవచ్చు. అరెస్టు చేయవచ్చు. అనుమానితుడే తను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాలి. అప్పుడే అతను విడుదల అవుతాడు. రెండో వైపున ఫారెస్టు అధికారులకు యుద్ధభూమిలో సైనికులకు కల్పించే చట్టపరమైన రక్షణ కల్పిస్తారు. సాయుధ దళాల(స్పెషల్ పవర్స్) చట్టం, 1958 ప్రకారం చట్ట రక్షణ ఉంటుంది. మన అడవి బిడ్డలపై మన ప్రభుత్వమే ఫారెస్టు అధికారులతో యుద్ధం చేయిస్తున్నది అన్నమాట. ఇది బాగా అర్థం చేసుకోవాలి.
అడవిని సంరక్షించే సందర్భంలో అటవీ హక్కుల చట్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి విధి విధానాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటిది కుదరనప్పుడు అక్కడ నివాసముంటున్న వారికి నేరుగా డబ్బులు ఇచ్చి లేక అడవిలోని భూమికి బదులుగా వేరే భూమిని ఇచ్చి వారిని తొలగించవచ్చు. ఈ సౌకర్యం ఉంటే అడ్డూ అదుపూలేకుండా అడవి బిడ్డలను అడ్డగోలుగా బయటికి పంపించివేస్తారు. ప్రలోభ పెట్టి అడవి నుంచి తొలగిస్తారు. ఇది రాజకీయంగా చాలా తిరోగమన చర్య. గతంలో వలస పాలకులు అడవి బిడ్డలను అనేక రకాలుగా మోసం చేస్తే ఇప్పుడు స్వదేశీ పాలకులు అదే బాట నడుస్తున్నారు. ఇదే విచిత్రం.
ఈ ముసాయిదా ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలకు పొసగని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వ విధివిధానాలనే విధిగా అమలు జరపాలని ఉన్నది. ఇది రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైన చర్య. ''గ్రామీణ అడవులు'' అనే విధానాన్ని సృష్టించి గ్రామ సభలను పట్టించు కోకుండానే పని జరిగిపోయేలా ఒక వింత విధానాన్ని ఈ ముసాయిదా ప్రతి పాదిస్తున్నది. ఇది పరిపాలనలో వికేంద్రీకరణ అనే స్ఫూర్తికి విరుద్ధం. ఈ సవరణలను అమలు జరిపితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు, పౌరులకు సంతరించిన ప్రాథమిక హక్కులు, సూత్రాలు నిర్వీర్యం అవుతాయి.
అడవులను వాణిజ్యంగా మార్చే క్రమంలో అడవులను ప్రయివేటీకరిస్తారు. ''ఉత్పాదక అడవుల''నే ముద్దు పేరు పెట్టి కానిచ్చే ప్రయత్నం సవరణలో ఉన్నది. ఈ చర్య వలన అటవీ హక్కుల చట్టం మౌలిక స్ఫూర్తి అయిన ప్రజాస్వామిక పరిపాలననే తొలగించటమవు తుంది. గతం నుంచి అనేక తరాల నుంచి అటవీ పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించిన గిరిజనులకు స్థానం ఉండదు. సహకార పద్ధతి లేక ఉమ్మడి పద్ధతిలో అటవీ భూములను. ఉమ్మడి ఆస్తులుగా పరిగణించే పద్ధతి స్థానంలో ప్రయివేటు వారు సంపద పోగుచేసుకోవడానికి పేద గిరిజనుల బతుకుల్ని బలి చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ అటవీ విధానాన్ని ఎందుకు తీసుకువస్తున్నది? బాగా వెనుకబడిన గిరిజనులు, చెదురుమదురుగా ఉండే వీరిని కేవలం అడవీ మీదనే ఆధారపడి బతికే ఆదివాసీలను అటవీ హక్కుల చట్టం నీడలో బతుకుతున్న వారిని కట్టడిచేస్తూ చట్టంలో సవరణలను తెచ్చి అడవిని ఒక యుద్ధ క్షేత్రంగా ఎందుకు మారుస్తున్నది? నిజం చెప్పాలంటే ప్రభుత్వం ఉన్న చట్టాన్నే సవరించకుండా అమలు జరిపి పేద గిరిజన, ఆదివాసీలకు రక్షణ కల్పించాలి. కానీ ప్రభుత్వం దానికి పూర్తి విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నది. చట్ట సవరణలను ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం రాజకీయ ప్రక్రియగా కనీసం ప్రజాభిప్రాయం కోసం చర్చను కూడా నిర్వహించకపోవడం బాధాకరమైన విషయం.
దేశంలో పేదరికం వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాలలో విలయతాండవం చేస్తున్నది. అసమానత తీవ్రంగా కొన్ని తరాల నుంచి కొనసాగుతూ వస్తున్నది. అటవీ నిర్వహణ అటవీ హక్కులు అనేవి పాలక పార్టీలకు చర్చనీయం కాకుండా పోతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అటవీ నిర్వహణలో అడవు లలో నివసించే వారిని భాగస్వామ్యం చేస్తు ఒక సమగ్రమైన ప్రణాళికను తెస్తామని చెప్పింది. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరుపుతాము అనే మాటే లేదు. ఏదిఏమైనా అడవులపై ఆధారపడి బతికే ప్రజల బాగోగుల కోసం ఈ క్రూరమైన, అన్యాయమైన సవరణలను ఉపసంహరించు కోవాలి. పేదల అనుకూల, ప్రజాస్వామ్య ధృక్కోణంలో అడవుల నిర్వహణకు పూను కోవాలి. అడవి భూములను ప్రభుత్వమే విచక్షణరహితంగా విధ్వంసం చేస్తే కొత్త పద్ధతులలో అసమానతలు తీవ్రమై జనాభా లెక్కలలో కూడా మిగలని విధంగా ఆదివాసి గిరిజన ప్రజలు కకావికలం అవుతారు.
ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ సంపాదకీయం
అనువాదం:
- టి.ఎన్.వి.రమణ,
సెల్: 9494731091