Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్భరు, పోక్సో వంటి కఠినతర చట్టాలు తెచ్చినా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు యథేచ్ఛగా సాగుతుండడం సిగ్గు చేటు. పైగా మన దేశంలో రాజకీయాలు నేరమయం కావడమే కాదు, నేరం రాజకీయమయం కూడా అవడం ఒక వైచిత్రి. ఇటువంటి నేరాల్లో మతకోణాన్ని జోడించి నిందితులకు వంతపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావడం విలువల పతనానికి నిదర్శనం. జమ్మూలోని కథువాలో అసిఫా అనే ఎనిమిదేండ్ల బాలికను అపహరించి, లైంగికదాడి చేసి హతమార్చిన కేసులో పంజాబ్లోని పఠాన్కోట్ ప్రత్యేక కోర్టు ప్రధాన నిందితుడు సాంజీరాం, మరో ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు ఆనాటి పీడీపీ-బీజేపీ ప్రభుత్వంలోని మంత్రులిద్దరు బహిరంగంగా ప్రయత్నించారు. నిందితులకు అనుకూలంగా జరిగిన ప్రదర్శనలో స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. చార్జ్షీటు దాఖలు చేయకుండా బార్ అసోసియేషన్ అడ్డగించింది. నిందితులకు రాజకీయ నేతలు, న్యాయవాదులు వంత పాడడం దేనికి సంకేతం అనుకోవాలి? అభం శుభం తెలియని ఒక సంచార తెగ బాలికకు జరిగిన అత్యాచారానికి స్పందించి దీపికా సింగ్ అనే న్యాయవాది ఆ కేసును వాదించడానికి ముందుకు వస్తే, జమ్మూలో పీడీపీకు చెందిన నేతలు బెదిరింపులకు పాల్పడడం, ఆ న్యాయవాది పోలీసులను ఆశ్రయిస్తే, వారు కనీసం స్పందించకపోవడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఎలా నిందితులకు కొమ్ము కాసారో ఇట్టే అర్థమవుతోంది. సంఘటనలు జరిగిన అనంతరం అధిక శాతం కేసులలో పోలీస్శాఖ వెంటనే స్పందించి సమగ్రమైన దర్యాప్తు జరిపి, పటిష్టమైన ఆధారాలను సేకరించకపోవడం, సాక్షులను సకాలంలో కోర్టులలో ప్రవేశపెట్టలేక పోవడం, తగినన్ని ఐపీసీ సెక్షన్లను ఉదహరించక పోవడం వలనే అధికశాతం కేసులు కోర్టులలో వీగిపోతున్నాయని సుప్రీం కోర్టు స్వయంగా ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. చాలా కేసులలో స్థానిక రాజకీయ నేతల అండదండల కారణంగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కావడం లేదు. కథువా అత్యాచారం కేసులో సైంధవుడిలా ఎందరో నేతలు అడ్డుపడ్డారు. ఈకేసుకు మతం రంగు కూడా పులిమారు. దేశంలో స్త్రీలపై, బాలలపై జరుగుతున్న హత్య, లైంగికదాడి, కిడ్నాప్ వంటి నేరాలకు ముకుతాడు వేయాలంటే మహిళా సమాజం యావత్తు చైతన్యవంతం కావాలి. స్వార్థపూరిత రాజకీయాలతో నిందితులకు వంత పాడే రాజకీయనేతలకు తమ ఓటు అనే వజ్రాయుధంతో తగిన గుణపాఠం చెప్పాలి.
- సి. సాయి ప్రతాప్