Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలస కాలంలోనే ప్రభుత్వాలు అడవిని లాభదాయక వనరుగా పరిగణించాయి. భారతీయ అటవీ చట్టం - 1927 అడవిని స్థిరీకరించి, అటవీ ఉత్పత్తుల రవాణా కలప, ఇతర ఉత్పత్తులపై పన్ను విధించేందుకు చట్టం రూపొందించింది. రక్షణా, రవాణా, రాబడి ఈ మూడు అంశాలే శాసన పీఠికలో పేర్కొన్నారు.
గత మార్చిలో అటవీ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఫారెస్టు పాలసీ డివిజన్ వారు ఈ చట్టానికి పలు సవరణలు ప్రతిపాదిస్తూ చర్చకు ముసాయిదా విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్జీఓలతోనూ, అడవితో సంబంధమున్నవారందరినీ పిలిచి ఈ సవరణలపై చర్చించి సూచనలు పంపాలని కేంద్రం కోరింది. మన తెలంగాణ ప్రభుత్వం ఆ సలహా పట్టించుకున్నట్టు లేదు.
సవరించదలచిన 'పీఠిక' ఏం చెపుతోంది?
ఉపోద్ఘాతంలో పైమూడు లక్ష్యాలతోపాటు మరికొన్ని జోడించారు. అవి 1. అడవుల పరిరక్షణ, అటవీ వనరులను క్రమబద్ధంగా నిర్వహించటం వాటికి పరిపుష్టి కలిగించటం, 2. పర్యావరణ సమతుల్యం (స్థిరత్వం) కాపాడటం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడివుంటూ పర్యావరణ వ్యవస్థల సేవలను నిరంతరాయంగా కొనసాగించటం, 3. ప్రజలు, ప్రత్యేకంగా అడవిపై ఆధారపడిన ప్రజా సంక్షేమం, 4. జాతీయ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చటం, 5. అటవీ ఆధారిత సాంప్రదాయ జ్ఞానం బలపర్చటం మద్దతు తెలపటం. పర్యావరణ సమస్యలకు విశ్వవ్యాపిత స్వభావం ఉంటుంది. అందుకే దేశంలో అడవులను వాటితోని జీవావరణాన్ని కాపాడే చట్టాలున్నాయి. వన్యమృఘ సంరక్షణా చట్టం 1972, అటవీ పర్యావరణ పరిరక్షణాచట్టం - 1980, విపత్తుల నిర్వహణా చట్టం లాంటివి.
ఈ చట్టాలను అమలుచేసి అడవిని రక్షించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు. అలా చేయకుండా వలసకాలం నాటి చట్టాన్ని సవరణల పేరుతో ఎందుకు ప్రభుత్వం మార్చాలంటుందో అర్థం కాదు. ఈ చట్టాలు పుట్టకముందే అడవులలో ప్రజలు నివసించేవారు. అడవులను వర్గీకరించే టప్పుడు వారి నివాస ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని రక్షిత (ప్రభుత్వ) అడవులుగా ప్రకటించేవారు. మన దేశానికి ఆక్రమణదారులుగా వచ్చిన బ్రిటిష్ వారు ఆదివాసుల్ని ఆక్రమణదారులన్నారు. నేటి మన పాలకులు అడవిని నమ్ముకుని బతుకుతున్నవారిని ఆక్రమణదారు లంటున్నారు. చూడండి సెక్షన్.2 (41) నిర్వచనాలు. అలాగే సెక్షన్ 2 (3), సెక్షన్2 (4)లలో నిర్వచించిన ''కమ్యూనిటీ'' ''విలేజ్ ఫారెస్టు'' ఆశ్చర్యకరంగా, గత చట్టాలు చెప్పిన వాటికి విరుద్ధంగా వున్నాయి. కమ్యూనిటీ అంటే జాతి, మతం కులం, భాషా సంస్కృతితో సంబంధం లేనిదట! విలేజ్ ఫారెస్టు ప్రభుత్వానిదట! గత చట్టాలతో లేని ఒక కొత్త వర్గీకరణ ఈ సవరణ చట్టం ప్రతిపాదిస్తోంది. అదే ''ఉత్పత్తి అడవులు'' సెక్షన్ 2 (10), సెక్షన్ 34సి (1) చెప్పేదేమంటే దేశంలో అటవీ ఉత్పత్తులను పెంచాలంటే (నాణ్యత ఉత్పాదకత) ఉత్పత్తిదారులైన కార్పొరేట్ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టాలి.
సెక్షన్ 80(ఎ) ప్రయివేటు అడవులను ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఆధారిత టూరిజం పేరుతో ప్రయివేటు కంపెనీలను ఆహ్వానించటం ఎవరి అభివృద్ధికి? ఆదివాసుల హక్కులను హరించి, మరో చారిత్రక అన్యాయానికి తెరతీస్తోంది.
అటవీ అభివృద్ధి పేరుతో నడుస్తున్న రకరకాల పథకాలు, కార్యాచరణ ప్రణాళికలు గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఉదారవాద ఆర్ధిక విధానాలతో, విదేశీ అప్పులతో మొదలయ్యాయి. వన సంరక్షణ సమితి, జాయింట్ ఫారెస్టు మేనేజ్మెంట్ కమిటీ (జేఎఫ్ఆర్సీ) (వీఎస్ఎస్) లాభాలు పంచి ఆదాయాలు పెంచలేదు. అవినీతికి నిలువెత్తు నిదర్శనాలు సెక్షన్ 28 1 (ఎ), (బి), (సి), (ఇ), (ఎఫ్) ప్రకారం వాటిని స్థానిక సంస్థలతో సమానగుర్తింపు ఇస్తారట. పీసాచట్టం ప్రకారం ఏర్పడిన గ్రామ సభలను కేవలం సంప్రదిస్తారట. ప్రతిపాదించబడిన సవరణచట్టం పీసాచట్టాన్ని కాని, అటవీ హక్కుల చట్టం 2006ని గాని గుర్తించినట్టులేదు.
అటవీ హక్కుల చట్టం ఎఫ్ఆర్ఏ గిరిజన తెగలకు ఇతర అటవీ నివాసులకు జరిగిన చారిత్ర అన్యాయాన్ని సరిచేస్తూ భారత పార్లమెంట్ చేసిన చట్టం ఇది. ఏమిటా చారిత్రక అన్యాయం? అది గిరిజనుల హక్కులకు సంబంధించింది. వలస చట్టాలు, స్వాతంత్య్రం తర్వాత చట్టాలు ఉ|| 1967 ఏ.పీ. అటవీ చట్టం సెటిల్మెంట్ అధికారులను నియమించాలని, వారి హక్కులను గుర్తించాలని చెప్పాయి. అయినా పాలకులు పట్టించుకోలేదు. పోడు చేసి బతకటం ఒక అటవీ నేరంగా పరిగణించబడి జైలు శిక్షలూ జరిమానాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఏపీలో పోడు పునరావాసం పేరుతో సాగుదారుడికి రూ.25 వేలు ఇస్తామని భూమి లాక్కున్నారు. డబ్బులివ్వలేదు. ఈ స్థితిలో 2006లో యూపీఏ-1 వామపక్షాల మద్దతుతో గడిచిన ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పోడుహక్కు గుర్తించి కుటుంబానికి 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వడం గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించటం, ఉమ్మడి హక్కులుగా రోడ్డు, మేపుభూమి, స్మశాన భూములు కేటాయించాలంది. పర్యావరణ పరిరక్షణకు గిరిజనులను అడవుల నుంచి నెట్టేయరాదని చట్టం చెప్పినా, దీన్ని అమలు చేయలేదు. ఈ సవరణ చట్టం సెక్షన్10 ఇప్పుడు సెటిల్మెంట్ ఆఫీసర్లను నియమించమంటోంది. అంటే ఏమిటి? 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదని ధృవపడుతోంది. ఎఫ్ఆర్ఏ చట్టంలో లబ్దిదారుల గుర్తింపు, పట్టాల పంపిణీకి ఎఫ్ఆర్ఏ కమిటీ ద్వారా జరగాలి. కానీ ఈ చట్టం మళ్ళీ ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్లకు అప్పగించటం దేన్ని సూచిస్తోంది? డిపార్టుమెంట్ పెత్తనాన్ని కాదా?
2013 ఎల్ఏఆర్ఆర్ చట్టం అమలులో వుండగా ఈ పాత చట్టంలో (అంటే 1894 చట్టం) సవరణలు అవసరమా? సెక్షన్ 11(1), (2), (3) Ê (4) ప్రతిపాదిత సవరణలు చాలా అసందర్భంగా వున్నాయి. అటవీ భూములను అటవీయేతర పనులకు (ప్రాజెక్టులు, మైనింగ్ కార్యకలాపాలు) బదిలీ చేయటానికి సంబంధించి 1980 అటవీ పర్యావరణ చట్టం, తదనంతర గైడ్లైన్స్ చాల నిర్దిష్టంగా ఉన్నాయి. వాటిని అమలుచేయకుండా పాత చట్టాలకు సవరణలు ఎవరి ప్రయోజనాల కోసం? కార్పొరేట్ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టటానికా ఈ తాపత్రయం?
ఈ సవరణకు అర్ధం ఏమిటి?
పోడుసాగు ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన ఐదేండ్లలో అంతం కావాలట. సెక్షన్ 10 (3) (ఎ), సెక్షన్ 20(1)(సి) ప్రకారం పోడుసాగు ఐదేండ్ల తర్వాత యథావిధిగా అటవీ నేరంగా పరిగణిస్తారన్నమాట. ఉన్న చట్టాన్ని అమలు చేసి భూములు ఇవ్వనిరాకరిస్తున్న ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మరో చారిత్రక అన్యాయానికి సిద్ధపడటం కాదా?
అటవీ నేరాలు - శిక్షలు
1927 చట్టంలో అటవీ నేరాలపై కేసులు పెట్టే అధికారం కేవలం ఫారెస్టు - పోలీసు అధికారికే వుండేది. ఇప్పుడు సవరణ చట్టంలో రెవిన్యూ అధికారికి కూడా సెక్షన్ 52(1) ద్వారా సంక్రమిస్తుంది. కేవలం అనుమానం ప్రాతిపదికగా వారెంట్ లేదా నోటీసు లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయొచ్చు. సెక్షన్ 64(1) (ఎ) (బి) (సి) (2) అధికారం ఇస్తున్నాయి. ఫారెస్టు రేంజర్కే నేరాలు పరిశోధించే అధికారం, సెక్షన్ 190 సి.ఆర్.పి.సి ప్రొసీజర్ 1973 వినియోగించే అధికారం సెక్షన్ 64 (బి), (సి) ఇస్తున్నాయి. అటవీ నేరాలను మైనర్-మేజర్ నేరాలుగా విభజించటం సెక్షన్ 64(4) ద్వారా లభిస్తుంది. అటవీభూమికి సంబంధించినవి మేజర్ నేరాలుగా పరిగణిస్తారు.
అటవీ హక్కుల చట్టం - 2006 సెక్షన్ 3, సబ్ సెక్షన్(1) క్లాజు (సి) ప్రకారం ఆదివాసులు, ఇతర అటవీ నివాసులు తేలికపాటి అటవీ ఉత్పత్తులు సేకరించుకోవటానికి, కలిగి ఉండటానికి, రవాణా చేసుకోవటానికి, అమ్ముకోవటానికి హక్కు కలిగివున్నారు. కాని ప్రస్తుత సవరణ చట్టం సెక్షన్ 2 (3), (ఎ) ప్రకారం అడవీ ఉత్పత్తులు సేకరించటం, కలిగి ఉండటం, రవాణా, అమ్మటం అటవీ నేరాలుగా పరిగణిస్తారు. అంటే ఇప్పటి దాకా గిరిజనులు ఉచితంగా సేకరించిన పలు ఉత్పత్తులు, ఇప్పుడు అటవీ నేరాలవుతాయి. విశాఖ ఏజన్సీలో అడ్డాకుల సేకరణ, తునికాకు సేకరణ, కొండరెడ్లు సేకరించిన తేనె ఎవరైనా కలిగి వుంటే అటవీ నేరమౌతుంది. ఈ సవరణచట్టం సెక్షన్ 78(1) ప్రకారం 6నెలల జైలుశిక్ష, రూ.10 వేల జుల్మానా విధిస్తారు. ఇది 1927 చట్టంలో ఒక నెల జైలు, రూ.500 జరిమానాగా ఉంది.
ఈ చట్టం సెక్షన్ 78(1) (ఎ) ప్రకారం, సెక్షన్ 26లో పేర్కొన్న నేరాలు అంటే తాజాగా పోడుకోసం చెట్లు నరకడం, అడవిలో అగ్ని రాజేయటం, పశువులు మేపటం, చేపలు పట్టటం లాంటి నిషేధిత పనులు చేస్తే మొదటి దఫా శిక్షగా మూడేండ్లు జైలు శిక్ష లేదా రూ.5-50 వేలు జరిమానా లేదా రెండు కలిపి కూడా విధించవచ్చు. ఇదే నేరాలు రెండోసారి చేస్తే ఒక ఏడాది కఠిన జైలు శిక్ష, జరిమానా గరిష్టంగా రూ.2 లక్షల వరకు విధించవచ్చు.
ప్రయివేటు అడవులకు అనుమతి
ఈ సవరణ చట్టం సెక్షన్ 80, 80(ఎ) ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు, కంపెనీలకు పనికిరాని అటవీ భూములనిచ్చి మేలైన అటవీ ముడిసరుకులు తయారు చేసుకునే అవకాశం ఇస్తారట. ఇవి సంయుక్తంగా కూడా నిర్వహించవచ్చునట. ఇందుకు జాతీయ ఫారెస్టు రీబోర్డు (సెక్షన్ (1), (2), (3), (4)) ఏర్పాటు చేస్తారట. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.
భారతీయ అడవుల చట్టం - 2019కి ప్రతిపాదించిన సవరణలు అడవి మీద ఆధారపడి జీవించే ప్రజలకు వ్యతిరేకంగా వున్నాయి. చట్టం పీఠికలో వారి సంక్షేమం కోసం సవరణ చేస్తున్నట్టు చెప్పి, వారి ఉనికినే ప్రశ్నార్ధకంచేసే సవరణలు ప్రతిపాదించారు. వీటిని పూర్తిగా పునఃపరిశీలన చేయాలని, ఉపసంహరించాలని కోరుతూ ఉద్యమించాల్సిన తక్షణ కర్తవ్యం మనమందు ఉన్నది.
- డా|| మిడియం బాబూరావు