Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలను బానిసలుగా చేసి, ప్రాతివత్యానికి కుదించి, వంటింటి కుందేళ్ళుగా మార్చినవి మత భావనలే. స్త్రీలను బురఖాల్లోకి నెట్టిన మతాలెన్నడూ వారిని మనుషులుగా చూడలేదు. అభ్యున్నతి సాధించా మనుకుంటున్న ఈ 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా స్త్రీల పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదు. ఒకప్పుడు వారికి ఓటు హక్కు లేదు. ఉద్యోగాలు చేసినా పురుషులతో సమానంగా జీతాలు లేవు. కూలిపనిలో సైతం మగవారికి దొరికినంత కూలి దొరకలేదు. ఇలాంటి ఎన్నో సామాజిక అవకాతవకలకు మూలకారణం మతభావనలే. అవగాహన రాహిత్యమే. మహిళా వ్యోమగాములు అంతరిక్షం చుట్టివస్తారు గానీ, కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశించలేరు. మన భారతీయ మహిళా శాస్త్రవేత్తను రాయల్సొసయిటీ గుర్తిస్తుంది కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ముట్టుగుడిసె లుంటాయి. అర్థనారీశ్వరుణ్ణి సృష్టించుకుని, వ్యర్థ పూజలు చేస్తారు గానీ, కుటుంబ వ్యవస్థ బలంగా కొనసాగడానికి పూర్తి సమయం వెచ్చిస్తున్న మహిళల్ని మాత్రం తక్కువగానే చూస్తారు. దైవభావనలో మునిగిన మతాలన్నీ కలిసికట్టుగా స్త్రీలను అనేక రకాల అణచివేతలకు గురిచేస్తూ వచ్చాయి. పురుషులు బయట తమ జీవితాల్ని శాసించే పెత్తందార్ల అణచివేతకు గురయితే, మహిళలు - బయట పెత్తందార్ల అణచివేతకు, ఇంట్లో పురుషుల అణచివేతకూ గురికావల్సి వచ్చింది. అధిపత్య వర్గాల మీద పెరిగిన కసీ, కోపం ఎక్కడా వెళ్ళగక్కలేక, అదంతా తెచ్చి పురుషులు ఇంట్లో స్త్రీలమీద తీర్చుకోవడం జరిగేది. అగ్రవర్ణాలు-స్త్రీలకురూపొందించిన కట్టుబాట్లు ఇతర ఆధిపత్య వర్గాలవారు, అణగారిన వర్గాలవారు కూడా పాటించడం జరుగుతూ వచ్చింది. అగ్రవర్ణాల వారు గొప్పవాళ్ళయినట్టూ, వారి అడుగుజాడల్లో తాము నడవాల్సి వచ్చింది. అగ్రవర్ణాలవారు గొప్పవాళ్ళయినట్టూ, వారి అడుగుజాడల్లో తాము నడవాల్సి ఉంటుందన్నట్టూ మిగతావారంతా భావించుకునేవారు. అలా అనుకరణ సాగుతూవచ్చింది. ఇదే పరాయీకరణ. గొప్పవారి లాగ తామూ బతకాలనుకోవడమే పరాయీకరణ.
అణగారిన వర్గాలు విద్యకు, వివేకానికీ దూరం చేయబడి, గుడ్డిగా అగ్రవర్ణాల్ని అనుసరిస్తూ వచ్చారు. వారు పూజించే దేవుళ్ళనే తమ దేవుళ్ళనుకున్నారు. వారి ఆచారాలు, చాదస్తాలు కూడా తమవే అనుకున్నారు. అలా అనుకునే విధంగా ప్రభావితం చేయబడ్డారు. స్త్రీల గురించి వారు రూపొందించిన నియమ నిబంధనల్ని వీరు కూడా జీవితంలో పాటిస్తూ వస్తున్నారు. ఇది సమకాలీనంలో కూడా చూస్తున్నాం. మనుధర్మశాస్త్ర ప్రకారం బ్రాహ్మణులకున్న స్థాయి కింది కులాల వారికి, అంటే బ్రాహ్మణేతరులకు లేదు. మరి ఈ క్రింది కులాల వారుపట్టుబట్టలు కట్టి, దేవతార్చనలు చేసి, యాగాలు నిర్వహించి, మఠాధిపతుల కాళ్ళమీద పడీ - ఎందుకీ నానా యాతన? అంటే - కేవలం పరాయీకరణ! తాము కానిదేదో అయిపోవాలని తాపత్రయం. మత పెద్దలతో మంచి వాళ్ళనిపించుకోవాలనే దుగ్ధ. ఆత్మద్రోహం చేసుకుని, అవన్నీ చేయడం వల్ల వీరేమైనా ఉన్నతమైన సామాజిక వర్గానికి మారిపోతారా? లేదు కదా?
ఇది ఇలా ఉండనిస్తే మనుధర్మ శాస్త్రంలోనూ, ఇతర పురాణాల్లోనూ స్త్రీల గురించి, వారి వ్యక్తిత్వం గురించి ఏం చెప్పారో చూద్దాం! మరి వాటిని అగ్రవర్ణం కానివారు, ఇతర సామాజిక వర్గాలవారు ఎందుకు ఆచరిస్తున్నారూ? ఆలోచించుకోవాలి. విజ్ఞతతో విశ్లేషించుకోవాలి. ఎవరో అగ్రవర్ణం వారు చెప్పారు కదా అని గంగిరెద్దులా తలూపుతూ పాటించడమేనా? శ్రమ తెలియని, శ్రమ విలువ తెలియని మూర్ఖపండితుల బోధనల్ని ఖాతరు చేయడం ఎందుకూ? స్త్రీల గురించి ఏఏ శాస్త్రాల్లో ఏముందో ఒకసారి గమనించండి. దాదాపు ఇవే భావాలు ఇతర మత గ్రంథాల్లోనూ ఉన్నాయి. వెతికి తీసి, విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. యజ్ఞవల్క స్మృతి 1:87లో విషయాలు ఇలా ఉన్నాయి. భర్త ఆజ్ఞలేకుండా స్త్రీ బయటకుపోరాదు. చప్పుడు అయ్యేట్టు నడువరాదు. అపరిచితులైన పురుషులతో మాట్లాడరాదు. చీర మడమల వరకు కట్టుకోవాలి. నాభి భాగం కనపడనీయరాదు. రొమ్ముభాగం వ్యక్తం కానీయరాదు. నోటిని కప్పుకోవాలి తప్ప, నోరు తెరిచి బిగ్గరగా నవ్వరాదు. ఇక కూర్మపురాణంలో మరొక మూర్ఖపు ఆలోచన రాసి ఉంది. స్త్రీలు చేసే మానసిక వ్యభిచార ఫలితంగానే వారికి నెల నెలా ముట్టురూపంలో మైలరావడం జరుగుతూ ఉంది. మనుధర్మ శాస్త్రంలో స్త్రీలను కించపరిచే అంశాలు చాలా ఉన్నాయి. ఏ బ్రాహ్మణుడైతే శూద్రస్త్రీని తన పానుపునెక్కించుకుంటాడో అతను అధోగతి పాలవుతాడు. ఆమెతో సంతానాన్ని పొందితే బ్రాహ్మణ్యాన్నే కోల్పోతాడు (3-17) ఏ కన్యకైతే తండ్రెవరో తెలియదో, తోడబుట్టిన వాడుకూడా ఉండడో అలాంటి కన్యను వివాహమాడ కూడదు. స్త్రీలు మనసుని అదుపులో పెట్టుకోలేరని రుగ్వేం (3:33:17) చెపితే, స్త్రీల లోపాల్ని, దుర్గుణాల్ని చెప్పాలంటే నూరు నాలుకలకు నూరేళ్ళ కాలమైనా చాలదు - అని మహాభారతం (8:74:78) చెప్పింది.
గొప్పగా చెప్పుకునే మనుస్మృతిలో స్త్రీని గురించిన అభిప్రాయాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. పురుషుల్ని చెరచడం స్త్రీల స్వభావం. వారు అజ్ఞానుల్నే కాదు, విజ్ఞుల్ని కూడా భ్రష్టు పట్టిస్తారు. వయసులో ఉన్నాడా చక్కనివాడా? అనేవి కూడా చూడరు. మగవాడైతే చాలు! పురుషుణ్ణి చూడగానే అతని పొందుకోరుకుంటారు. వ్యభిచార శీలత వారి సహజలక్షణమని వేదాలు చెప్పాయి. ఈ వ్యభిచార కాంక్షవల్లనే స్త్రీకి భర్తమీద అనురాగం ఉండదు. తల్లి, చెల్లి, కూతురితో నైనా సరే, పురుషుడు ఒంటరిగా కూర్చోకూడదు. వ్యభిచారం చేసిన స్త్రీ తరువాతి జన్మలో నక్కగా పుడుతుంది. భర్త చనిపోతే ఆమె మళ్ళీ పెండ్లి చేసుకోగూడదు. కానీ, భార్య చనిపోతే అంత్యక్రియల అనంతరం పురుషుడు మళ్ళీ పెండ్లి చేసుకోవచ్చు. స్త్రీలు చపలచిత్తులు కాబట్టి వారు సాక్ష్యానికి పనికిరారు. కొంచెం ఇటూ అటుగా ఇవే భావాలు అన్ని మతాలు ప్రచారం చేశాయి. స్త్రీని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా అణిచిపెట్టాయి. పురుషుల్లాగ వారు కూడా మనుషులేనన్నది గుర్తించలేదు. స్త్రీలను అణిచిపెట్టడంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలతో సహా ఇంకా అనేక ఇతర మతాలూ ఒకే విధంగా ప్రవర్తించాయి. ఒకప్పటి మాతృస్వామ్య వ్యవస్థను పితృస్వామ్య వ్యవస్థగా మార్చేశాయి. మూలవాసుల్ని అణగదొక్కి, వలసవచ్చిన వారే అధికారం చేపట్టినట్టు - ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఒకే విధంగా ఉంది. మతాలన్నీ స్త్రీలకు నీచమైన నియమ నిబంధనల్ని రాసిపెట్టాయి. అరబ్ దేశాల వృద్ధులు, వారికి మనుమరాళ్ళ వయసులో ఉన్న ఇక్కడి బాలికల్ని వివాహం చేసుకుని, తీసుకుపోయి, వారిని బానిసలుగా వాడుకోవడం మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మతాలు గొప్పవైతే అవి వాటి గొప్పతనాన్ని కాపాడుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు.
బైబిల్లో ఆడవారి గురించి ఇలా ఉంది...
అక్క చెల్లెల్ని చూసి - 'నిన్న రాత్రి తండ్రితో నేను శయనించితిని. ఈ రాత్రి నీవు అతనితో శయనించు' - ఆ విధంగా లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారు క్రైస్తవ మతమునకు మూలకారకులు. (బైబిల్ ఆది కాండం 19:31-38) చనిపోయిన అన్న పిల్లల కోసం మరిది వదినను పెండ్లి చేసుకోవాలి. లేకపోతే వెలివేయబడతారు (ద్వితియోపదేశ కాండము 25:12) నీవు చూచుచుండగానే నేను నీ భార్యను తీసి, నీ చేరువవాని కప్పగించెదను. పగటియందు వానితో శయనించును (2 సమాయేలు 12:11) భర్తగల స్త్రీ కంటే ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది - అని యెహౌవా చెపుతున్నాడు (యెషయా 54:1) స్త్రీలు వలల మాదిరి ప్రమాదకారులు. వారి హృదయాలు వలల్లాంటివి. వాళ్ళ చేతులు గొలుసుల్లాంటివి. స్త్రీ చేతిలో చిక్కడం మరణం కంటే హీనం. వెయ్యిమందిలో ఒక్క స్త్రీ కూడా మంచిది కనబడలేదు. (ప్రసంగి: 7:26-29) పొద్దున లేస్తే వార్తాపత్రికల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న వార్తలు.. లైంగిక దాడులు, హత్యలు, గృహహింస, ఆత్మహత్యలు వగైరా.. వీటన్నింటికీ స్త్రీల పట్ల మతాలు నేర్పించిన అభిప్రాయాలు కారణం అవునా? కాదా? మనిషి నైతిక పతనానికి ఇవి కారణం అవుతున్నాయా? లేదా? విశ్లేషించుకోవాలి. మత భావనల్ని వదిలించుకోలేని జనం, మరి వాటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు కదా?
భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఒకసారి ఇలా అన్నారు. ''నాలాగా భర్తలేని స్త్రీలు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళంతా గుళ్ళలోకి రాకూడదు అనే దుష్ట సంప్రదాయాన్ని మీరు ప్రవేశపెట్టారు. అనుసరిస్తున్నారు.కానీ, నాలాంటి విధవరాలు కూడా దేశాన్ని పరిపాలించే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాజ్యాంగం ప్రసాదించింది. నన్ను గుళ్ళోకి రావొద్దని ఆంక్షలు విధించిన వారిని సైతం శాసించే అధికారాన్ని ప్రధాన మంత్రిగా నాకు రాజ్యాంగమిచ్చింది.'' రామాయణంలో రాముడు సీతను అడవులకు తీసుకుపోయ్యాడు. మరోసారి ఒంటరిగా అడవిపాలు చేశాడు. బాబా సాహెబ్ రాజ్యాంగం ద్వారా స్త్రీలకు సమాన హక్కులు కల్పించాడు. వారిని అసెంబ్లీకి, పార్లమెంట్కూ పంపించాడు. ఒక కల్పిత పాత్రకు భజనలు చేస్తూ కూర్చోవడమా? లేక మానవుడి ఔన్నత్యాన్ని పెంచిన రాజ్యాంగ స్ఫూర్తితో మానవీయ విలువల్ని స్థాపించు కోవడమా? అందరూ ఆలోచించుకోవాల్సిన సమయమిది! ముఖ్యంగా స్త్రీలు ఆలోచించుకోవాల్సిన విషయమిది!!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త,
బయాలజీ ప్రొఫెసర్, మెల్బొర్న్ నుంచి.
- డాక్టర్ దేవరాజు మహారాజు