Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిబడ్జెట్ ఉపన్యాసాన్ని లోక్సభలో చదివి వినిపించారు. ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న తొట్రుపాటు బడ్జెట్పాఠం చదువుతున్నప్పుడు మంత్రి గొంతులోనూ వినిపించింది. ఈ తొట్రుపాటు జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన అంకెలను ప్రస్తావించేటప్పుడు కూడా కొనసాగింది. స్థూలంగా నిర్మలాసీతారామన్ బడ్జెట్ టీవీ చర్చల్లో ప్రభుత్వ వాదన వినిపించే పార్టీ ప్రతినిధి తరహాలోనో లేదా ఎన్నికల సందర్భంగా టీవీల్లో జరిగే బిగ్ డిబేట్లో పాల్గొన్న అధికార ప్రతినిధి తరహాలోనో సాగింది. అంతేకానీ సుమారు 135కోట్లమంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఓ కీలక బాధ్యత నిర్వహిస్తున్నామన్న తీవ్రతా నిబద్ధతా కనిపించలేదు. బడ్జెట్ గురించి లోతుగా పరిశీలించే ముందు ఉపన్యాసం ఆధారంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇరవై వేల పదాలున్న ఆర్థిక మంత్రి ఉపన్యాసంలో పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వంటి పదాలకు తావే లేకుండా పోయింది. తొమ్మిదిసార్లు మాత్రం రైతు అన్న పద ప్రస్తావన ఉంది. అది కూడా రైతు నేపథ్యంలో విధానాలు రూపొందించే సందర్భంలో కాక ఈ ప్రస్తావన గత ఐదేండ్ల మోడీ పాలనలో అశేషంగా లబ్దిపొందిన వారి గురించిన ప్రస్తావనలో భాగంగా రైతుల గురించి ప్రస్తావించారు. ఆహార భద్రత గత ఐదేండ్లల్లో రెట్టింపు అయ్యిందని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి సీతారామన్ ఆహారభద్రత రెట్టింపైనప్పుడు పెరుగుతున్న ఆకలి చావులు, రైతాంగ ఆత్మహత్యలకు కారణమేమిటన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుందన్న కనీసం ఇంగితం కూడా లేకుండా మాట్లాడేశారు. స్థూలంగా చూసినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకించి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్లో ఒక్క ప్రస్తావన కూడా లేకపోవటం ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి చెప్పకనే చెప్తోంది. ఈ బడ్జెట్లో కొట్టొచ్చిన మరో అంశం సాంకేతిక పరిజ్ఞానం అన్న పదం. ఈ పదాన్ని పందొమ్మిదిసార్లు ఉపయోగించారు. అన్ని సార్లూ మోడీ పాలనా దక్షతను పొగిడిన సందర్భంగానే ఉంది. పెట్టుబడులు అన్న పదాన్ని కనీసం యాభైసార్లు ఉపయోగించారు. సబ్సిడీ అన్నపదాన్ని కేవలం రెండు సార్లు మాత్రమే ఉపయోగించారు. అది కూడా గ్యాస్ సబ్సిడీ ఉపసంహరణ సందర్భం ఒకటైతే, విద్యుత్రంగ సబ్సిడీల ఉపసంహరణ నేపథ్యంలో మరోసారి ఉపయోగించారు.
ఏ మాత్రం ఆర్థిక అంశాల మీద అవగాహన ఉన్న వారికైనా ఈ బడ్జెట్ ప్రశ్నోపనిషత్తే. అటువంటి ప్రశ్నలు కొన్ని పరిశీలిద్దాం. ఆర్థిక మంత్రి తన ఉపన్యాసంలో గత ఐదేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద గ్రామీణ భారతంలో కోటిన్నర ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిందన్నారు. పురాణ పఠనం, అవధానాలు, పద్య పఠనాలు కాదంటే పౌరాణిక నాటకాల్లో రాగాలాపన జరుగుతుంటే ప్రేక్షకులు ఒన్స్మోర్ అని ఈలలూ చప్పట్లతో నటులను ప్రోత్సహించినట్టే సభలో ఉన్న బీజేపీ సభ్యులు కూడా బల్లలు దద్దరిల్లేటట్టు (చప్పట్లకు బదులు) కొట్టారు. కానీ వాస్తవం ఏమిటి? ప్రభుత్వం గత ఐదేండ్లల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద నిర్మించ తలపెట్టిన ఇండ్లే 66లక్షల 92వేలు. ఇందులో కూడా సగానికి పైగా నిర్మాణం పూర్తి కాలేదనీ, 2018 డిశంబరు నాటికి లక్ష్యాన్ని నెరవేర్చాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి 2018 జూలైలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. మరి ఆర్థిక మంత్రి కోటిన్నర ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని ఎలా లెక్క కట్టారో మోడీకే తెలియాలి. అంతేకాదు. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి అంటే ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకానికి సుమారు 55వేల కోట్లు కేటాయించారు. కానీ 2019 కోట్లు వెచ్చించారు. కానీ 2019-20, 2020-21 సంవత్సరాల్లో కోటి 95 లక్షల ఇండ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే సగటున రోజుకు 27వేల ఇండ్లు పూర్తి చేయాలి. అదికూడా సగం బడ్జెట్లో. ఎందుకంటే ఈ ఏడాది ఈ పథకానికి ఆర్థిక మంత్రి కేటాయించిన పద్దు పాతికవేల కోట్లే.
ప్రశ్నోపనిషత్తులో మరో అధ్యాయం వివిధ పథకాలు వాటికి కేటాయించుకున్న లక్ష్యాలు, అవి సాధించటానికి కేటాయించిన నిధుల గురించి. స్థల పరిమితి రీత్యా మరొక్క పథకం గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. కోటిన్నర రూపాయల కన్నా తక్కవ వ్యాపారం చేసే దుకాణం దారులందరికీ సుమారు మూడున్నర కోట్ల మందికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ల కోసం 8,900కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ బడ్జెట్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరో మూడున్నర కోట్ల మందికి ఈ సౌకర్యం విస్తరించాలి. కానీ ఈ పథకం కింద కేటాయించిన నిధి మాత్రం 9,200 కోట్లే. అంటే పెంచింది కేవలం మూడుకోట్లు. మూడు కోట్ల రూపాయలతో మూడున్నర కోట్ల మందికి నెలనెలా పింఛను ఇవ్వడం ఎలా సాధ్యం..! ఇలాంటి లక్ష్యాలు సాధించటంలో బీజేపీకి ఎవ్వరూ సాటిరారు. అందుకే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో మీరిచ్చే లెక్కలు నమ్మబుద్ధి కావటం లేదు.. మహా ప్రభో..! అని మొత్తుకుంది.
బడ్జెట్ ప్రారంభంలోనే దశాబ్ది లక్ష్యాలు అని ఓ జాబితా పేర్కొన్నారు. ఈ జాబితాకూ ఎన్నికల వాగ్దానాలకూ పెద్దగా తేడా లేదు కాబట్టి ఏకరువు పెట్టుకోవాల్సిన అవసరంలేదు. ఈ లక్ష్యాలు ఈ ప్రభుత్వ మేధో సృజనాత్మక ఫలితంగా వచ్చిని కావు. ఓ ఆదివారం పత్రికలో ఫీచర్ రాసే వ్యాఖ్యాత కూడా ఇంతకన్నా గొప్పగానే బుల్లెట్పాయింట్లు పెట్టగలడు. కానీ బడ్జెట్ ఉపన్యాస పాఠం తర్వాతి పేజీల్లో ఉన్న కీలకమైన ప్రస్తావనలు ఈ దశాబ్ది లక్ష్యాల్లో కనిపించలేదు. ఈ విషయాన్ని గమనిస్తే బడ్జెట్ తయారీ క్రమం తెనాలి రామలింగడు తిమ్మిని బమ్మినిచేసే గారడీ కథలకు ఏమాత్రం తీసిపోదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన వివరాలు ప్రస్తావిద్దాం. ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్లో ప్రస్తావించిన ఆదాయ వివరాలకు ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్లో ప్రతిపాదించిన వివరాలకూ మధ్య పెద్దగా తేడా లేకపోవటాన్ని గమనిస్తే ఇవి కట్ పేస్ట్ లెక్కలేనని స్పష్టమవుతాయి.
బడ్జెట్ లెక్కల డొల్లతనాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని వివరాలు ప్రస్తావిస్తాను. ఆర్థిక సర్వే ఇచ్చిన వివరాల ప్రకారం 2017-18లో ఆర్థిక వ్యవస్థ 7.2శాతం వృద్ధిరేటు సాధించింది. ఆ ఏడాది జీఎస్టీ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం నాలుగు లక్షల నలభైరెండు వేల కోట్లు. తర్వాతి ఏడాది (2018-19) ఆర్థికాభివృద్ధి రేటు 6.8శాతానికి తగ్గింది. అంటే 0.4 నాలుగు శాతం వృద్ధిరేటు పడిపోయింది. కానీ వృద్ధిరేటు తగ్గిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు ఆరున్నర లక్షల కోట్లకు పెరిగాయి. అంటే సుమారు రెండు లక్షల కోట్లు. ఇది ఎలా సాధ్యం? వృద్ధి రేటుకు, పన్ను ఆదాయానికి మధ్య తేడా ఇదొక్కటే కాదు. ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్ల విషయంలో కూడా ఈ తేడా కనిపిస్తోంది. ఒకవైపున ఆర్థిక వ్యవస్థ ఖాయిలా దశకు చేరింది. కంపెనీలు తీసుకున్న అప్పులు కట్టలేకపోతున్నాయి, పారు బకాయిలు పెరుగుతున్నాయి అని చెప్తున్న ప్రభుత్వమే తమ పాలనా దక్షతతో కార్పొరేట్ పన్ను గత రెండేండ్లల్లో లక్ష కోట్లు పెంచామని, ఈ ఏడాది మరో లక్ష కోట్లకు పెంచుతామని చెప్తోంది. ఈ లెక్కలన్నీ గమనిస్తే ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు గాను ద్రవ్యలోటు తక్కువగా ఉందని చూపించే ప్రయత్నంలో కాకిలెక్కలు కట్టిందని చెప్పకతప్పదు. ఈ బడ్జెట్ వాస్తవ జాతీయ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, ధోరణులకు భిన్నంగా ఊహాలోకాల్లో విహరించండనీ.. దేశ ప్రజలకు చెప్తోంది.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037