Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామనవమి గాకున్నా దేసంల పతొక్క పట్నం ఊర్లె పందిల్లు ఏసిండ్రు. గవ్విటి కింద రాముని బొమ్మలు బెట్టిండ్రు. పల్లెటూల్లల్ల రాముని పోట్వలు బెట్టిండ్రు. పూజలు జెయ్యబట్టిండ్రు. రామనామము, రామ నామము రమ్యమైనది రామనామము అని పాడుకుంట బజనలు జెయ్యబట్టిండ్రు. బజరంగ్ దల్ లెక్క రామ్దల్ను బెట్టిండ్రు. గాదల్ల ఉన్నోల్లందరు కాషాయ కండ్వలు ఏసుకుండ్రు. గాల్లే బజనలు జేపియ్యబట్టిండ్రు. ముసలోల్లతోని రామకోటిలు రాపియ్యబట్టిండ్రు. గంతేగాదు జైశ్రీరాం అనబట్టిండ్రు. మందితోని అనిపియ్యబట్టిండ్రు. గాల్లు వారానికొక్క దినం లవకుశ, సంపూర్ణ రామాయణం, సీతారామ కల్యాణం, రామాంజనేయ యుద్ధం అసువంటి సిన్మలను పుకట్ల జెనంకు సూపియ్యబట్టిండ్రు. రామాయనం మీద డ్రామలు ఏపియ్యబట్టిండ్రు. బాగోతాలు ఆడిపియ్య బట్టిండ్రు.
ఆరోతరగతి కాడికెల్లి పదోతరగతి దాంక తెలుగు వయ్యిలల్ల రామాయనం పాటాలు బెట్టిండ్రు. అయోద్యకు దశరతుడు రాజు. గాయినకు ముగ్గురు పెండ్లాలు. ముగ్గురు పెండ్లాలున్నా గా రాజుకు పిల్లలు లేరు. పిల్లల కోసం గాయన యాగం జేసిండు. యాగకుండం కెల్లి ఒక దేవుడెల్లి గాయినకు పాసెం ఇచ్చిండు. గా పాసెంను గాయిన ముగ్గురు పెండ్లాలకిచ్చిండు. పాసెం దాగిన పది నెలలకు గాల్లకు పిల్లలు బుట్టిండ్రు. పెద్ద పెండ్లాంకు రాముడు, లచ్మనుడు అనేటి ఇద్దరు మగపిల్లలు బుట్టిండ్రు. నడ్పి పెండ్లాంకు బరతుడు అనేటి పిల్లగాడు బుట్టిండు. ఆక్రి పెండ్లాంకు శత్రగ్నుడు అనేటి పోరగాడు బుట్టిండు. గిది ఆరోతరగతిల ఉన్న పాటం. పదో తరగతి దాంక రామాయన పాటాలను బెట్టిండ్రు. పదో తరగతిల రాముని పట్టాబిసేకమున్నది. జైశ్రీరాం.
కాంగ్రెస్ పార్టీ అద్యచ్చుని కుర్సి మీదికెల్లి రాహుల్ గాంది దిగిండు. కాంగ్రెస్ లీడర్లు ఎంతగనం బత్మిలాడినా గాయిన ఇంట లేడు. కొంతమంది విలేకరులు సంటర్ మంత్రి స్మృతి ఇరాని కాడ్కి బోయిండ్రు.
''కాంగ్రెస్ అద్యచ్చ కుర్సికి రాహుల్ గాంది రాజినామ జేసిండు గదా. గీ దాని మీద మీ రేమంటరు'' అని అడిగిండ్రు.
''జై శ్రీరాం'' అని స్మృతి ఇరాని అన్నది.
''జైశ్రీరాం అనుంటె అంబటి రాయుడికి వరలడ్ కప్ మ్యాచ్లల్ల ఆడేటి మోక దొర్కేది'' అని ఒక బిజెపి లీడర్ అన్నడు.
''నల్గురు తెలుగు దేసం ఎంపిలను మీ పార్టిలకు ఎందుకు గుంజిండ్రు'' అని ప్రతాని మోడీని అడిగితె -
''మేము గుంజలేదు. జైశ్రీరాం అనెతందుకే గాల్లు గోడ దుంకిండ్రు. అయోద్యల రామునికి గుడి గట్టిపిచ్చేది మేమే గదా. రాముని జమానలనే గోడదుంకుడున్నది. గాయిన జమానలనే గాలి మోటర్లున్నం. పుష్పకం అనేటి గాలి మోటర్ల ఎంత మంది గూసున్నా ఇంకొకలకు జాగ ఉండేది. చందమామ తాన్కి బోతున్నం. అంగారకుని తాన్కి బోతం అన్కుంట ఇప్పటోల్లు గల్ల ఉడాయిస్తుండ్రు. గని త్రేతాయుగం హన్మంతుడు సూర్యుని తాన్కి బోయిండు'' అని ప్రతాని జెప్పిండు.
జైశ్రీరాం, జై హన్మాన్ అంటవాలేదా అని జార్కండ్ల కొంతమంది అన్సారీ అనేటాయనను బగ్గగొట్టిండ్రు. గాయినతోని జైశ్రీరాం అని అనిపిచ్చిండ్రు. కాషాయపోల్లు గొట్టిన దెబ్బలకు గాయిన సచ్చిపోయిండు. పట్టిపట్టి పంగనామాలు బెడ్తె గోడ సాటుకు బోయి తుడ్సుకుంటరు. పశ్చిమ బెంగాల్ల జైశ్రీరాం అనుమని హిందూ సమితోల్లు ఒక మదర్సా టీచర్ను గొట్టిండ్రు. లోక్సబల ప్రమానం జేసినంక ఇద్దరు బిజెపి ఎంపీలు జైశ్రీరాం అన్నారు. ఎంపీలు ప్రమానం జేస్తుంటె జైశ్రీరాం అన్కుంట బిజెపి ఎంపి ఎక్కిరిచ్చిండ్రు. కుత్కె బిస్కి జైశ్రీరాం అని అనిపియ్యొద్దు ప్రేమతోని కాగలిచ్చుకొని జైశ్రీరాం అనుమనాలె అని సంటర్ మంత్రి ముక్తార్ నక్వి అన్నడు. గాయిన గట్లనంగనే బిజెపోలు ఎవల్ని బడ్తె గాల్లను కాగలిచ్చుకో బట్టిండ్రు.
''బిజెపి ఆడోల్లను తక్వ జేస్తున్నది. జైశ్రీరాం అంటున్నది. ఉత్తర్ప్రదేస్ల గుడ్క జై సీతారాం అంటరు. సీతను దీసేసి జై శ్రీరాం అంటరా. నెరీ గింత అన్నాలమా? గాందీజీ గుడ్క 'రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం' అని పాడెటోడు. ఆడామె ముక్యమంత్రని నా సర్కార్ను కూలగొట్టె తందుకు బిజెపి కోషిస్ జేస్తున్నది'' అని మమతా బెనర్జీ అన్నది.
గది దునియ యోగా దినం. ఉత్తర్ ప్రదేస్ల షాజహాన్పూర్కు రాస్ట్ర మంత్రి లచ్చి నారాయన బోయిండు. గాయిన చెట్టులెక్క నిలబడ్డడు. ఒక సర్కార్ జీతగాడు మోకాల్ల మీద గూసోని గాయినకు బూట్లు దొడిగిండు. బూట్ల దారాలు గట్టిండు. గిదేమన్న బాగుందా సార్ అని అడిగితె రాముని చెప్పులను కుర్సిమీద ఉంచి బరతుడు రాజ్జెం నడిపిచ్చిండు. రాముని దయతోనే మన దేసం సూపర్ పవర్ అయితున్నదని అన్నాడు. రాం నామ్ జప్నా పరాయి ఎమ్మెల్యేలు అప్నా అనుకుంట కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను గుంజి కర్నాటక సర్కార్ను కూలగొట్టెతందుకు బిజెపి కోషిస్ జేస్తున్నది. జైశ్రీరాం అనుమని మైనార్టీలను కాషాయ గుండాలు ఒక్క తీర్గ కొడ్తున్నరు. మతపిచ్చి ఎక్వయితున్నది. 'మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ.'
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491