Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిటిఆయోగ్ జనరల్ కౌన్సిల్, దాని సభ్యులైన భారతదేశ ప్రజా ప్రతినిధుల దృష్టికి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకు రావాలనుకొంటున్నాను. అలాగే ఈ అంశాలకున్న ప్రాధాన్యత రీత్యా ఆరోగ్యకరమైన ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాలనే విస్తృత ప్రయోజనాన్ని ఆశించి ప్రయోజనకరమైన చర్చ జరగాలని కోరుతున్నాను.
మన సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి తరచూ మాట్లాడుతుంటాం. ఒక సామూహిక ప్రయోజనానికి సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే అన్ని పరిపాలనా శాఖలను భాగస్వాములను చేయాలనేది సహకార సమాఖ్య ఉద్దేశ్యం. మన ఆచరణ అందుకు అనుగుణంగా ఉందా అని మనం విమర్శనాత్మకంగా పరిశీలించాలి. సహకార సమాఖ్య విధానం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. గత నాలుగేండ్లలో ఏవో కొన్ని స్వల్ప వ్యవస్థాగత మార్పులు మాత్రం చేయబడ్డాయి.
15వ ఆర్థిక కమిషన్ తన సిఫారసులను తయారుచేసే పనిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం 2019 అక్టోబర్ నాటికి తుదిరూపం తీసుకోవచ్చు. ఆర్థిక కమిషన్ ప్రతిపాదించిన కొన్ని అంశాలపై కేరళ సహా ఇతర రాష్ట్రాలు కొన్ని న్యాయమైన అనుమానాల్ని వెలిబుచ్చాయి. వాటిపై వీలయినంత వెంటనే చర్చించాలి. ఇక్కడ మరొక విషయం కూడా ప్రస్తావించడం అవసరం. ఎప్పుడైతే జాతీయ స్థాయిలో పంచవర్ష ప్రణాళిక తన ఉనికి కోల్పోయిందో ఫలితంగా గతంలో వాలే గాడ్గిల్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు వారి ప్రణాళికలు అమలుకు లభించే గ్రాంట్లు నిలిచిపోయాయి. పైగా కేంద్రం ప్రాముఖ్యంగా భావించి ప్రవేశపెట్టిన కేంద్ర స్కీమ్లలో రాష్ట్రాల వాటా సగటున 25 నుంచి ఒకేసారి నలభై శాతానికి పెరిగింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిపోయింది.
నిటిఆయోగ్ ఒక ఫెసిలిటేటర్గా గత నాలుగేండ్లలో తన పాత్రను ఆశించిన మేరకు పోషించలేదనే విషయంలో నా సహచర ముఖ్యమంత్రులు ఏకీభవిస్తారని భావిస్తున్నాను. గత ప్రణాళికా సంఘానికి నిటిఆయోగ్ సరైన ప్రత్యామ్నాయం కాదనే ఆలోచన క్రమంగా బలపదుతోంది.
కేరళ రాష్ట్రంలో పంచవర్ష ప్రణాళిక కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం13వ పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రణాళికా సంఘం నిటిఆయోగ్గా రూపం మార్చుకున్న ఫలితంగా కేరళ వంటి రాష్ట్రాలు తమ రాష్ట్ర పంచవర్ష ప్రణాళికా విధానాన్ని కొనసాగించేందుకు అవసరమైన నిధులను కొరత ఏర్పడింది. ఇది ఒక అననుకూల ప్రభావం చూపింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇవి మన ఫెడరల్ వ్యవస్థలో ఇంకా అపరిష్కతంగా ఉన్న అంశాలలో కొన్ని. ఇక గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అజెండా అంశాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తాను.
1. వర్షపు నీటి సంరక్షణ :
తాగునీరు కొరత తీర్చటానికి వర్షపు నీటి సంరక్షణ చాలా ముఖ్యం. రుతుపవనాల ద్వారా వచ్చే సాధారణ వర్షపాతం తగ్గుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. మరోవైపు అసాధారణ వర్షాల పెరుగుదల కూడా మనం చూస్తున్నాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు, ప్రజలను ఇందులో భాగస్వాములను చేస్తోంది. ఇంటి పైకప్పు పై వర్షపునీటిని నిల్వచేయటానికి ఒక ప్రయోగం చేసాం. దీనికోసం ఒక ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి పైకప్పు నుంచి క్రింద తవ్విన బావులలోకి నీటిని ప్రవహింప చేయటంద్వారా భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది.
కేరళ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగు రంగాలను ఎంచుకుంది. వాటిలో 'హరితకేరళం' పేరుతో ఏర్పడ్డ గ్రీన్ మిషన్ ఒకటి. నీటివనరులను పరిరక్షించటం, శుభ్రపరచడం, సరఫరా చేయటం ఈ మిషన్ ఉద్దేశ్యం. మిగతా మూడు లక్ష్యాలు - వైద్య, విద్యా, గృహానిర్మాణాలలో అభివృద్ధి, వీటికోసం ఆర్థిక వనరులను కల్పించటం.
మా రాష్ట్రంలో భవననిర్మాణాలకు మున్సిపల్ శాఖ అనుమతి కావాలంటే వర్షపు నీటి సంరక్షణకు ఏర్పాటు (ఇంకుడుగుంటలు) తప్పనిసరి. వీటన్నింటితోపాటుగా నీటిసంరక్షణ ప్రాధాన్యతను దేశ భవిష్యత్తుకు ములస్తంభాలైన యువతకు అర్థం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా నేను బడిపిల్లలకు ఈ విషయాన్ని తెలియజేస్తూ లేఖ రాసాను. వర్షాకాలంలో మనకు లభించే నీటిని నిర్లక్ష్యం చేసి, వేసవికాలంలో నీటికి ఆరాటపడటం మంచిపని కాదని నేను ఆ లేఖలో చెప్పాను.
నీటి సంరక్షణ, సరఫరా, వినియోగాన్ని పర్యవేక్షించటానికి కేరళలో బలమైన చట్టాలున్నాయి. నీటి సంరక్షణ దృష్ట్యా వరిసాగు పెంచటానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఇంకుడుగుంటలూ బావుల తవ్వకం చేపట్టాం.
2. కరువు పరిస్థితులు - సహాయక చర్యలు:
కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒకవైపు పొదుపు చర్యలు పాటిస్తూనే మరోపక్క డిమాండ్ ఆధారిత ఉపాధి కార్యక్రమాలకు ఖర్చు చేయటానికి మాత్రం వెనుకాడకూడదనేది నా అభిప్రాయం. దీనికి మీ అందరి మద్దతు ఉంటుందని భావిస్తున్నాను, కరువు సమయంలో లాభదాయకమైన ఉపాధి లేకపోవడం, డిమాండ్ మందగించడం వలన ఆర్థిక వ్యవస్థ మరింత కుంటుపడటానికి దారితీస్తుంది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా దీనిని మనం నివారించటానికి ప్రయత్నించాలి.
2018-19లో నైరుతి రుతుపవనాల సమయంలో, ఆ తరువాత కూడా కేరళ అనూహ్యమైన వరదలను ఎదుర్కొంది. కానీ ఈశాన్య రుతుపవనాల సమయంలో ఎప్పటికన్నా 3.34శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉండటం, వర్షాకాలంలో వర్షాలు ఆలస్యం కావడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడింది. అధిక వేడివల్ల ప్రజలు వడదెబ్బ, వేడి బొబ్బల బారినపడ్డారు. వీటి నివారణకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం, స్థానిక ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేశాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలలో విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించారు. తాగునీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి నీటి సరఫరా సక్రమంగా జరిగేటట్టు ఏర్పాట్లు చేశారు.
3. ఎంపిక చేసిన ఆశావహ జిల్లాలు - కార్యక్రమాలు : విజయాలు, సవాళ్లు
దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు కొన్ని జిల్లాలు సామాజిక ఆర్థిక సూచీలో వెనుకబడి ఉన్నాయి. ఇటువంటి జిల్లాల అభివృద్ధికి ప్లాన్ రూపొందించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. కేంద్ర రాష్ట్ర పథకాల ప్రభావం ఈ జిల్లాల పైన ఏ విధంగా ఉందనేది అంచనా వేయాలి.
పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు అన్ని సవాళ్లకి ఒకేరకమైన కేంద్ర పథకాలు ప్రత్యామ్నాయాన్ని చూపించవు. ఇది సహకార సమాఖ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని కేరళ భావిస్తున్నది. ఆశావహ జిల్లాల కార్యక్రమ అమలు ద్వారా ఇది మరొక అడుగు ముందుకు వెళ్లిందని మా అభిప్రాయం. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించటానికి కేంద్రం నుంచి ఒక అధికారి నియమితులయ్యారు. అలాగే జిల్లాలను కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల, నిటిఆయోగ్కు కేటాయించారు. కేంద్ర పథకాల అమలుకు రాష్ట్రాలకు కేంద్రం చేసే కేటాయింపులను దానాధర్మంగా పరిగణించకూడదు. వీటి అమలులో రాష్ట్రాలు కూడా తమవాటా భరిస్తున్నాయి. రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల సరైన అమలుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా బాధ్యత తీసుకుని ఆ దిశగా కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు తన నిర్మాణంలో అట్టడుగు స్థాయి కింద కేంద్రం పరిగణించటం సరికాదు. ఇది సహకార సమాఖ్య లక్ష్యానికి, సమగ్రతకు కూడా మంచిది కాదు.
రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం ఖర్చును క్రమంగా పెంచుతూ పోతోంది. దీనివల్ల సంక్షేమ పథకాలు కొన్ని రంగాలకే పరిమితమవుతాయి. ఆర్థిక కారణాల రీత్యా చూసినపుడు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఈ పథకాల అమలును మరింత సమర్ధవంతంగా చేయగలవు. అంతేకాక పథకాలన్నీ కేంద్రీకృతం కావటంతో సామాజిక ఆర్ధిక రంగాల్లో అమలుకు రాష్ట్రాలకు కావలసినంత వెసులుబాటు ఉండటం లేదు. స్థానిక సంస్థలు తమ ప్రజలకు సేవలను అందించే క్రమంలో నూతన పద్ధతులు పాటించలేక పోతున్నాయి.
ఒక జిల్లా లేదా స్థానిక పరిపాలనలో వారి అవసరాలు, ఆకాంక్షలు సక్రమంగా నెరవేరాలంటే అధికారం ప్రజాస్వామ్య యుతంగా వికేంద్రీకరించటమే సరైన మార్గం. రాజ్యాంగంలోని 73, 74 సవరణలో ఈ విషయం పేర్కొంది. అందువల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఆశావహ జిల్లాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరటానికి గట్టిగా కృషి చెయ్యాలి. కేరళలో సమర్ధవంతమైన చర్యలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలలోకి కేంద్రం మితిమీరిన జోక్యం మన సమాఖ్య వ్యవస్థను, స్ఫూర్తిని బలహీనపరుస్తోంది. ఈ విషయాన్ని గవర్నింగ్ కౌన్సిల్ విస్మరించరాదు.
4. మన అజెండాలో మరో ముఖ్యమైనది వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో సంస్కరణలు.
వ్యవసాయ రంగంలో మార్పులు - వ్యవస్థాగత సంస్కరణల నేపథ్యంలో (ఏ) వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) చట్టం (బీ) నిత్యావసర సరుకుల చట్టం, 1955లపై కేంద్రీకరించాలి.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాల ప్రాముఖ్యతా రంగాలలో ఇది కూడా ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వంత చట్టాలు ఉన్నాయి. కేరళకు ఏపీఎంసీ చట్టం లేదు.
ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒకేరీతిలో వర్తించే విధంగా కొత్త ముసాయిదా మోడల్ చట్టం, 2017ను మనకు అందించారు. నేను అన్ని క్లాజులలోకి వెళ్లను.. కానీ కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. డ్రాఫ్ట్ మోడల్ చట్టం దృష్టి మొత్తం కార్పొరేట్ వ్యవసాయం పైన కేంద్రీకరించినట్టు తోస్తోంది. రైతుల ఆదాయాలు పెరుగుతాయనే సాకుతో రైతుల భవిష్యత్తును నేరుగా వాణిజ్య సంస్థల ఆధీనంలోకి నెట్టేవిధంగా ఉంది.
బేరసారాలాడే శక్తిలో అసమానతలు, కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యం కలిగిన ఈ సమాజంలో అన్ని వ్యవహారాలలో దోపిడీ మరింత అధికమవుతోంది. ప్రజల భాగస్వామ్యం, సహకారోద్యమం, ప్రభుత్వ జోక్యంతో వ్యవసాయ ఉత్పత్తులను సరసమైన ధరలకే సేకరించడం సాధ్యమని మా ప్రభుత్వం నిరూపించింది. రైతులకు కనీస మద్దతు ధరలను ఇచ్చి భరోసా కల్పించటం ద్వారా వరి సేకరణ సమర్ధవంతంగా జరిగింది. ఈ విషయం పట్ల మనం విశాలదృష్టితో ఉండాలి. ప్రజల మన్నన పొందిన పద్ధతులు అనుభవాలనుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి.
నిత్యావసర వస్తువులు, సరుకుల నిల్వలపై నియంత్రణ జారీచేస్తూ నిత్యావసర సరుకుల చట్టం, 1955 తీసుకురాబడింది. సరుకులను అధిక మోతాదులో నిల్వచేయటం వల్ల సప్లయి తగ్గిపోయి ధరలు కృత్రిమంగా పెరుగుతాయి. అందువల్లనే ఈ చట్టం పరిమితికి మించిన సరుకు నిల్వలను నిషేధించింది.
ఇందుకు భిన్నంగా కొత్త మోడల్ చట్టం వ్యవసాయ ఉత్పత్తులను పెద్దఎత్తున నిల్వ పెట్టుకునే అవకాశం కల్పిస్తోంది. అందువలనే నిత్యావసర సరుకుల చట్టం లోని నిల్వల పరిమితి నుంచి వ్యవసాయ సరుకులను మినహాయించాలని ఇందులో ప్రతిపాదించాం.
వ్యవసాయ సరకుల నిల్వల పరిమితిని సడలించినట్టయితే దానిని వ్యాపారులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మార్కెట్లో ధరలను పెంచటానికి సరుకులను దాచేస్తారు. ఇప్పటికే మన దేశంలో ఆహారాధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల చాలా సహజమైన విషయంగా ఉంది. వినియోగదారుల, ప్రత్యేకించి సమాజంలోని పేద, అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ప్రజలను ధరల పెరుగుదల నుంచి కాపాడటం కోసం, మార్కెట్ను రక్షించుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి.
5. వామపక్ష తీవ్రవాదం నుంచి రక్షణ :
సమాజంలో పేదరికం, దానికి సహాయపడే పరిస్థితులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వామపక్ష తీవ్రవాదం తన మనుగడ కొనసాగిస్తోంది. తీవ్రవాద ప్రభావిత జిల్లాలు, ప్రాంతాలపై దృష్టి సారించాలి. సామాన్య ప్రజల శాంతి భద్రతలకు తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల విఘాతం కలగకుండా సరైన రక్షణ చర్యలు చేపట్టాలి. కేరళ ప్రభుత్వం ఈ రెండు అంశాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తోంది.
అర్ధవంతమైన సహకార సమాఖ్య కోసం మనం ఏమి చెయ్యాలి?
సహకార సమాఖ్య అర్థవంతంగా అమలవ్వాలంటే రాజ్యాంగం చెప్పిన విధంగా అధికార వికేంద్రీకరణ ముఖ్యం. సామాజిక రంగాలలో తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించటానికి రాష్ట్రాలకు ఆర్ధిక వెసులుబాటు ఉండాలి. తమకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాన్ని, అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతంగా నిర్వహించగలవని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగలవనీ కేరళ ప్రభుత్వం విశ్వసిస్తోంది. బడ్జెట్లో లోటును పూడ్చుకునేందుకు యాంత్రిక విధానాలు అనుసరించటం వల్ల ఈ స్ఫూర్తి నీరుగారుతుంది. ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు, వాస్తవాలకు అనుగుణంగా ఆర్ధిక లోటును అధిగమించడానికి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.
ఆర్థిక విధానాలలో కఠినమైన నిర్ణయాల వల్ల 2018లో కేరళకు వరదల సమయంలో మేము ఇతర దేశాలనుంచి సరైన ఆర్థిక సహకారం అందుకోలేకపోయాము. వరద తీవ్రతను ఆర్థికంగా అంచనా వేయాలంటే ఆ సందర్భంగా రాష్ట్రం సుమారు రూ. 31,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇది రాష్ట్ర స్థూలఉత్పత్తిలో సుమారు నాలుగు శాతం. అంత తీవ్రమైన పరిస్థితులను మేము ఎదుర్కొన్నాము.
15వ ఆర్థిక కమిషన్ రిఫరెన్స్ ప్రకారం కొన్ని ప్రాధాన్యతా రంగాలలో రాష్ట్రాల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక బలమైన దేశాన్ని నిర్మించటానికి బలమైన కేంద్రంతో పాటు బలమైన రాష్ట్రాలు, శక్తిమంతమైన స్థానిక ప్రభుత్వాలు కూడా అత్యంత ఆవశ్యకం.
ఇటువంటి సమావేశాలకు ఎజెండా నిర్ణయించేటప్పుడు ముఖ్యమంత్రులను కూడా సంప్రదించాలి. రాజ్యాంగ సంస్థలను, అంతర్రాష్ట్ర కౌన్సిల్ను తిరిగి శక్తివంతంగా తయారు చేయాలని, ముఖ్యమంత్రులు ప్రతిపాదించిన ముఖ్య అంశాలపై కూడా చర్చ జరపాలని గవర్నింగ్ కౌన్సిల్కు ఒక సూచన చేస్తూ ముగిస్తాను. సహకార సమాఖ్య నిర్మాణాన్ని, దాని ఉదేశ్యాన్నీ కాపాడటమే మన ముఖ్య కర్తవ్యం.
(జూన్ 15న ఢిల్లీలో జరిగిన నిటి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి పినారారు విజయన్ ఉపన్యాసం పూర్తి పాఠం)
అనువాదం: ఎం. పద్మశ్రీ,
- పినరరు విజయన్
సెల్: 9490098687