Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లలో ముఖ్యంగా ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సెకండరీ గ్రేడు టీచర్లు (ఎస్జీటీ) అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతీ వేతన సవరణలోను ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు భారీ వ్యత్యాసం ఉంటోంది. విద్యార్థులలో దాగివున్న అంతర్గత శక్తులను, నైపుణ్యాలను ప్రాథమిక దశ నుంచి వెలికితీసేవారు సెకండరీ గ్రేడు టీచర్లు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతులుంటే అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నా ప్రతీ తరగతికి చెందిన అన్ని పాఠ్యాంశాలను అర్థవంతంగా బోధిస్తూ, బోధనలో అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యేవారు, త్వరగా అనారోగ్యం బారినపడేవారు ఎస్జీటీ ఉపాధ్యాయులే. ఉన్నత తరగతులకు బోధించడం సులువు.. కానీ ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి, రెండవ తరగతుల విద్యార్థులకు అక్షరాలను వల్లెవేయిస్తూ అందమైన దస్తూరితో అక్షరాలను నల్లబల్ల నోటు పుస్తకాలలో రాపిస్తూ ఓపికతో సంయమనం కోల్పోకుండా బోధించి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిలా నిలిచేవారు ఈ టీచర్లే. వేల ప్రాథమిక పాఠశాలల్లో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేరు. సీనియర్ ఎస్జీటీలే ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తూ రిపోర్టులు రాసి పంపడం, మధ్యాహ్న భోజన పథకం అమలు, సిలబస్, పరీక్షల నిర్వహణ నెలవారీగా విద్యార్థుల ప్రగతిని మండల విద్యావనరుల కేంద్రానికి పంపడం, ప్రతీరోజు విద్యార్థుల హాజరు సంక్షిప్త సందేశం ద్వారా చేరవేయడం తదితర పనులను నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఎస్జీటీలకు ఉపాధ్యాయుల ఎంఎల్సీ ఎన్నికలలో ఓటుహక్కు కల్పించకపోవడం బాధాకరం. ఎస్జీటీ ఉపాధ్యాయులలో రెండు నుంచి మూడు పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారు యంఈడీ, పీహెచ్డీ, ఎంఫిల్ చేసినవారున్నారు. కేవలం ఉన్నత పాఠశాలలు, కాలేజీలలో పనిచేస్తున్న అధ్యాపకులు, యూనివర్సిటీలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు తదితరులకు ఎంఎల్సీ ఎన్నికలలో ఓటుహక్కు కల్పించి, ఉన్నత విద్యార్హతలు గల ఎస్జీటీలకు ఓటుహక్కు కల్పించక పోవడంలో ఆంతర్యమేమిటి? ఎస్జీటీ ఉపాధ్యాయులంటే చులకన భావన, చిన్నచూపేనా? ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 పండిట్లు ఎస్జీటీ ఉపాధ్యాయుల హౌదా సమానమైనా వారికి ఎంఎల్సీ ఉపాధ్యాయ ఎన్నికలలో ఓటుహక్కు ఉంది? ఎస్జీటీ టీచర్లు చేసిన పాపం ఏమిటి! వృతి ్తనిబద్ధతతో పనిచేస్తున్న ఎస్జీటీలు ప్రాధమిక విద్యారంగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉన్నత పాఠశాలల వైపు వెళుతున్న విద్యార్థులకు అన్ని రంగాలలో తర్ఫీదునిచ్చేవారు వీరే. ప్రమోషన్ల విషయంలో వివక్ష చూపెడుతున్నారు. సుమారు 30ఏండ్ల నుంచి పనిచేస్తున్న ఎస్జీటీలకు ప్రమోషన్లు లేవు. అదే కేడర్లో పదవీవిరమణ పొందుతున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు ఎస్జీటీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి.
- కె. సతీష్రెడ్డి
సెల్: 9848445134