Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత రెండేండ్లుగా పన్నులపై కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మందగించింది. అంతకుముందు సంవత్సరంకంటే 2016-17 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్నులపై వచ్చే ఆదాయం 17శాతం పెరిగింది. 2017-18 సంవత్సరంలో 11శాతానికి, 2018-19 సంవత్సరంలో కేవలం 8శాతానికి ఈ ఆదాయం పెరుగుదల రేటు పడిపోయింది. ఈ వృద్ధి నామమాత్రపు వృద్ధి. వాస్తవంలో ఈ వృద్ధి మరింత మందకొడిగా ఉంది. నిజానికి 2018-19 సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంకంటే పన్ను రాబడి వృద్ధిరేటు 3శాతం కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. అది దేశ స్థూల జాతీయ ఆదాయం పెరుగుదల రేటుకంటే చాలా తక్కువ. మరోవిధంగా చెప్పాలంటే స్థూల జాతీయోత్పత్తి, కేంద్ర పన్నుల రాబడిల మధ్యగల నిష్పత్తి తగ్గుతూ వచ్చింది.
జీఎస్టీ వ్యవస్థకు మారటంవల్లనే పన్ను రాబడి మందగించింది. పరోక్ష పన్నుల రాబడిలో ఏర్పడిన తరుగుదల కారణంగానే వాస్తవంలో పన్నులపై రాబడి వృద్ధి మందగించింది. స్థూల జాతీయోత్పత్తిలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి దాదాపు నిలకడగా ఉంది. స్థూల జాతీయోత్పత్తిలో సాపేక్షంగా పరోక్ష పన్నుల నిష్పత్తి పడిపోయింది. 2016-17 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పరోక్ష పన్నులపై వచ్చే రాబడి వృద్ధిరేటు 20శాతంవుంటే 2017-18 సంవత్సరంలో జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత అది 6.3శాతానికి పడిపోయింది. 2017-18 సంవత్సరంలో అది మరింతగా 2.7శాతానికి దిగజారింది. వాస్తవంలో 2018-19 సంవత్సరంలో జీఎస్టీ ద్వారా వచ్చే పన్ను రాబడి క్షీణించి ఉంటుంది.
క్లుప్తంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడి వృద్ధి మందగించటానికి జీఎస్టీ వ్యవస్థే కారణం. నూతన జీఎస్టీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రారంభ సమస్యల కారణంగా పన్ను రాబడిలో మందగింపు ఏర్పడిందని అనుకున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు, మూడు నెలల్లో జీఎస్టీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం (రాష్ట్రాల భాగంతోసహా) నెలకు ఒక లక్ష కోట్లు దాటింది. దీనితో సమస్యలు సమసిపోయాయని, ఇప్పటినుంచి జీఎస్టీ ద్వారావచ్చే రాబడిలో మంచి వృద్ధి ఉంటుందని అధికారులు ఆనందించారు. అయితే మనకు తాజాగా సమాచారం అందుబాటులోవున్న జూన్ నెలలో మొత్తం జీఎస్టీ రాబడి లక్ష కోట్ల దిగువకు పడిపోయినందున పాత భయాలు పునరావృతమయ్యాయి.
పరోక్ష పన్నుల ద్వారా వచ్చే రాబడి మందగించటానికి ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం ఎంతవరకు కారణం, జీఎస్టీ వ్యవస్థకు మారటం ఎంతవరకు కారణం అనే విషయాలను తేల్చటంలో సమస్యలున్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండగా పరోక్ష పన్నులపై వచ్చే రాబడి స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటుకంటే తక్కువగా ఉండటానికి కారణం లేదు. అయితే ఇది జరిగిందనేది వాస్తవం. కేంద్రం జీఎస్టీ రాబడి కేవలం 2.7శాతం మాత్రమే నామమాత్రంగా పెరుగుతుందంటే దీనిని విశ్లేషించటానికి ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్నదనే కారణంపైనే ఆధారపడలేము. అసలు జీఎస్టీ వ్యవస్థలోనే ఏదో స్పష్టమైన లోపంవుంది.
జీఎస్టీ వ్యవస్థ చిన్న ఉత్పత్తి రంగాన్ని బాగా దెబ్బతీసింది. గతంలో చాలా యూనిట్లు అసలు పన్ను చెల్లించేవే కావు. ఇప్పుడు పన్ను చెల్లింపుల పరిధిలోకి వచ్చిన ఈ యూనిట్లు రిఫండ్స్ను తీసుకోవటానికి అకౌంట్లను జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం, టాక్స్ రిటర్నలను సమర్పించవలసిన అవసరం ఏర్పడింది. అందుకోసం వారు అకౌంటెంట్ల సేవలను పొందవలసి ఉంటుంది.
నిజానికి దీనిలో ఒక 'అవిభక్త' అంశం ఉంది. వ్యాపార పరిమాణానికి అనుగుణంగా రిటర్న్ల ఫైలింగ్కు అయ్యే ఖర్చు పెరగనప్పటికి పెద్ద సంస్థలకు ఈ విషయంలో వెసులుబాటు ఉంటుంది. పెద్ద సంస్థలకు వ్యయం తక్కువైతే చిన్న సంస్థలకు వ్యయం ఎక్కువ అవుతుంది. దీనివల్ల చిన్న ఉత్పత్తి రంగానికి చెందిన అనేక చిన్న సంస్థలు ఎక్కువ వ్యయ భారాన్ని మోయవలసివుంటుంది. ఈ పరిస్థితి చిన్న సంస్థలు వ్యాపారంలో నిలదొక్కుకోవటాన్నే కష్టంగా మార్చింది.
దీనికి సమాధానంగా పన్నులు కట్టేవారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనే వాదనను జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ముందుకు తెచ్చారు. అయితే చిన్న ఉత్పత్తిపై వత్తిడి కొనసాగినంతకాలం పన్నులపై వచ్చే ఆదాయం అటువంటి వత్తిడి లేనికాలంలోకంటే తక్కువగా ఉంటుంది. వేరే మాటల్లో చెప్పాలంటే జీఎస్టీ వ్యవస్థ బడా వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. వీటి టర్నోవర్కు సాపేక్షంగా ఇవి మోసే పన్ను భారం తగ్గుతుంది. దీనినిబట్టి అర్థమౌతున్నదేమంటే జీఎస్టీ వ్యవస్థలో పన్ను చెల్లించే యూనిట్ల సంఖ్య పెరగటం కారణంగా పన్ను పునాది విస్తృతమైనప్పటికీ స్థూల జాతీయోత్పత్తికి అనుగుణంగా సమకూరే జీఎస్టీ రాబడి గతంలో పరోక్ష పన్నులపై వచ్చిన రాబడికంటే తక్కువగా ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ రాబడులు కలిసి వుండటం వల్ల రాష్ట్రాల జీఎస్టీ కూడా పడిపోయివుంటుంది. జీఎస్టీవల్ల రాష్ట్రాల హక్కులకు విఘాతం ఏర్పడటమే కాకుండా దానితో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కొన్ని సరుకులు జీఎస్టీ పరిధికి ఆవల ఉండటంవల్ల రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉండటం నిజమే. అయితే అసలు జీఎస్టీనే రాష్ట్రాల పరిస్థితిని దిగజార్చింది.
జీఎస్టీ రాబడి వృద్ధిలో మందగమనం ఏర్పడటంవల్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలలో తీవ్రస్థాయి లోటు ఏర్పడుతుంది. నిజానికి 2018-19 సంవత్సర బడ్జెట్ అంచనాలతో పోల్చినప్పుడు ఈ లోటు 1.6లక్షల కోట్లవరకు ఉంది. 2019-20 సంవత్సర బడ్జెట్ అంచనాలు కూడా ఇదే విధంగా వాస్తవ రూపం దాల్చటంలో విఫలమవుతాయి.
జీఎస్టీ వ్యవస్థకు మారటంవల్ల రాబడి వృద్ధిలో ఏర్పడిన మందగమనమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు కూడా క్షీణించటం వల్ల అదనంగా మరో మందగమనం ఏర్పడింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వమే గనుక తన వ్యయాన్ని తగ్గించుకుని విత్త లోటు పరిధిలో ఉంటే అది ఆర్థిక కార్యకలాపాలను మరింతగా కుంగదీస్తుంది. అలాకాకుండా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతుగా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకొనకుండా వుంటే 2019-20 సంవత్సర బడ్జెట్లో వేసిన అంచనాకు మించి విత్త లోటు పెరుగుతుంది.
విత్తలోటు విస్తృతమైతే వచ్చే సమస్య బూర్జువా ఆర్థికవేత్తలు చేప్పే సమస్య కాదు. విత్త లోటుతో ద్రవ్యోల్బణం ఏర్పడుతుందనే ఆలోచన వెనుక ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నదన్న కారణంగా సరఫరా పెంచటం కుదరదనే ఊహన ఉంది. భారతదేశంలో అటువంటి పరిస్థితిలేదు. అలాగే ఏ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కూడా అటువంటి పరిస్థితి తలెత్తలేదు. విత్త లోటుతో అసలు సమస్యేమిటంటే తనతో సమానమైన ప్రయివేటు సంపదను ఎటువంటి కారణం లేకుండా సృష్టిస్తుంది. ప్రయివేటు సంపన్నులు ఏమీ చేయకుండానే ఈ సంపద సృష్టించబడుతోంది(బూర్జువా ఆలోచనాధారకు చెందిన నియమాలు దీనిని వివరించజాలవు).
ప్రయివేటు రంగం అప్పటికే పొదుపు చేసినదాని నుంచి అప్పు తీసుకోవటంగా విత్తలోటు ఉంటుందనే పొరపాటు భావన ఉంది. అయితే వాస్తవంలో విత్తలోటు ప్రయివేటు రంగానికి తెలియకుండా ప్రయివేటు చేతుల్లో పెట్టటంగా ఉంటుంది. ఈ చేతుల్లోనుంచే ప్రభుత్వం అప్పు చేస్తుంది.
ఇది జరిగే పద్ధతి ఇలా ఉంటుంది: విత్తలోటు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సృష్టిస్తుంది. దానితో ఉత్పత్తి పెరుగుతుంది. అంటే ప్రయివేటు చేతుల్లోకి లాభాలు చేరతాయి. దీనిలో కొంత పొదుపు చేయటం జరుగుతుంది. ఈ ప్రక్రియ విత్తలోటుకు సరిపడా ప్రయివేటు చేతుల్లో పొదుపు(సరళత్వం కోసం విదేశీ లావాదేవీలు లేవనే ఊహనను అనుసరించాం) సమకూరేదాకా కొనసాగుతుంది. ఈ పొదుపు ప్రయివేటు సంపదకు చేరుతుంది. కాబట్టి విత్తలోటు ప్రయివేటు సంపదకు జోడింపబడుతుంది.
ఒకవేళ ప్రయివేటు సంపదకు అటువంటి జోడింపును చేర్చకపోతే ప్రభుత్వ వ్యయానికి కావలసిన ఆదాయాన్ని ప్రయివేటు లాభాలపైనా లేక మరింత అర్థవంతంగా ప్రయివేటు సంపదపైన పన్ను విధించి సమకూర్చుకోవాలి.
ఒకవైపు పరోక్ష పన్నుల ద్వారా వచ్చే రాబడి పెరుగుదల మందగమనంలో ఉండగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థ మాంద్యంవైపు దూసుకెళుతుండగా ప్రభుత్వ వ్యయాన్ని ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ వ్యయాన్ని పెంచాలి. అలాచేయటానికి కావలసిన వనరులను సమకూర్చుకోవటానికి విత్తలోటును కాకుండా సంపదపై పన్ను వేయటం ఉత్తమం. అయితే సంపదపై పన్నుతోపాటు వారసత్వ పన్ను కూడా విధించాలి. లేకపోతే సంపన్నులు పన్ను కట్టకుండా ఉండటానికి తమ సంపదను వారసులమధ్య విభజిస్తారు.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
- ప్రభాత్ పట్నాయక్
సెల్:8886396999