Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ స్వరూపం ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, మాటల మాయాజాలం, సామాన్యులకు పన్నుల బాదుడుగా ఉంది. ఈ బడ్జెట్ తెలుగు రాష్ట్రాలను తీవ్ర నిరాశపర్చింది. కాళేశ్వరం, పోలవరం గురించి నామమాత్రమైన ప్రస్తావన కూడా లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, నిరసనలను కూడా పట్టించుకోకుండా కేంద్రం తనదైన ప్రతీకారధోరణినే ప్రదర్శించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో ప్రాజెక్టులు, వనరుల పంపిణీ, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడం బాధాకరం. పన్నుల్లో రాయితీలపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న వేతనజీవులు, మధ్యతరగతి ప్రజానీకానికి నిరాశే మిగిల్చింది. మరోవైపు కార్పొరేట్లకు అనేక రాయితీలు కల్పించింది. పన్నుల రాయితీలో కార్పొరేట్లకు ఒక ఆర్థిక నీతి, మధ్యతరగతి వర్గానికి మరో ఆర్థికనీతి అన్నట్టు వ్యవహరించింది. దేశాభివృద్ధికి, ఆర్థిక ప్రగతికి వెన్నెముకలాంటి విద్య, ఉపాధి రంగాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టింది. పెట్రోలు, డీజిల్పై లీటరుకు రూపాయి సెస్ విధించడం ద్వారా సామాన్యులపై పెనుభారం మోపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఆర్, ట్రిపుల్ ఐటీలకు అవసరమైన నిధులను కేటాయింపుల్లో ఎక్కడా పేర్కొనలేదు. గత 45ఏండ్ల కాలంలో ఏనాడూ లేనంతగా గరిష్టస్థాయికి నిరుద్యోగం చేరినప్పటికీ ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోలేదు.
- సి సాయిప్రతాప్