Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ అతుకుల బొంత ప్రభుత్వం వుంటుందా వూడుతుందా అర్థం గాని అనిశ్చితి ఒకవైపున నెలకొనగా ఎప్పుడెప్పుడు గద్దెక్కి కూచోవాలనీ.. బీజేపీ అసహనంతో నిరీక్షిస్తున్నది. మంత్రుల సామూహిక రాజీనామాల కారణంగా ముఖ్యమంత్రి కుమారస్వామి తిరుగుబాటు దార్లను పదవులతో కట్టిపడేసే అవకాశం వున్నా ఇది తాత్కాలికమే. వారికి పదవులు ఇచ్చిన మరుక్షణం ఇప్పుడు పదవులు పోయిన వారు కుట్రలు మొదలెడతారు. అసలు తానే ముఖ్యమంత్రి కావాలని చూస్తున్న కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మనుషులు వూరుకోరు. ఉంటే తమ కుమారుడే ముఖ్యమంత్రిగా వుండాలి తప్ప మరొకరిని బలపర్చే అవకాశం లేదన్నది జేడీఎస్ అధినేత దేవగౌడ స్పష్టమైన విధానం. స్పీకర్ కెఆర్రమేష్ కుమార్ రాజీనామాలు చెల్లవని ప్రకటించినా గవర్నర్ ద్వారా కేంద్రం ఏ చర్య తీసుకుంటుందనే దానిపై భవిష్యత్ పరిణామాలు ఆధారపడి వుంటాయి. రాజీనామాలు చేసిన వారు బీజేపీ పాలనలోని మహారాష్ట్రలో మకాం వేయడం, ఎన్నికల అవసరం లేకుండానే కొత్త ప్రభుత్వం వస్తుందని యెడ్యూరప్ప ప్రకటించడం చూస్తుంటే అవి కొంతవరకూ అర్థమవుతున్నాయి కూడా.
కర్నాటకలో బీజేపీకి 105 స్థానాలు వున్నాయి గనక అధికారం కోసం ఈ రాజకీయ క్రీడలు నడిపిస్తుండొచ్చు. కాని శాసనసభలో ఒక్క స్థానం కూడా లేని ఆంధ్రప్రదేశ్లోనూ ఒక్క స్థానం మాత్రమే వున్న తెలంగాణలో కూడా మేమే వచ్చేస్తామని బీజేపీ హడావుడి చేయడమేమిటి? పైగా అది రాజకీయ ఘనత అన్నట్టు చెప్పుకోవడమేమిటి? మీడియా కూడా వారి గొప్పలకు మరింత ప్రచారం ఇవ్వడమేమిటి? నిన్న గాక మొన్న ఎన్నికలు జరిగి జగన్మోహన రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందో లేదో వచ్చే ఎన్నికల్లో మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ కేంద్ర రాష్ట్ర నేతలు ఎలా చెబుతున్నారు? ఇదంతా ఒక వ్యూహాత్మకమైన మైండ్గేమ్ కాదా? ఎన్ని ఫిరాయింపులైతే అధికార పీఠం అధిష్టించేంత బలం వస్తుంది? ఈ మాట అడిగిన మరుక్షణం బీజేపీ నేతలు తాము త్రిపురలో అధికారంలోకి వచ్చాం చూడమంటారు. దేశంలో 18రాష్ట్రాల్లో తాము అధికారం చేస్తున్నామంటారు. నిజంగా చెప్పాలంటే త్రిపురలో అనేక కుతంత్రాలు దౌర్జన్యాలు నిర్బంధాలతో పాటు కాంగ్రెస్ టీఎంసీ నేతలను సామూహికంగా చేర్చుకోవడం వారికి విజయం చేకూర్చింది. సీపీఐ(ఎం) ఓటింగు చాలా వరకు కాపాడబడింది. గిరిజనులపై నిత్యం దాడులు జరుగుతున్నా సీపీఐ(ఎం) కార్యాలయాలు తగలబెడుతున్నా ఆ పార్టీ ఓపిగ్గా పోరాడుతున్నది. బలం కాపాడుకుంటున్నది. తీవ్రమైన పక్షపాతం చూపినట్టు విమర్శలపాలైన ఎన్నికల సంఘం కూడా అక్కడ రీపోలింగ్ జరపాల్సి వచ్చింది. త్రిపురనే బీజేపీ ఉదాహరణ అనేట్టయితే రేపో మాపో ఆ రాష్ట్రం తప్పక తిప్పికొడుతుంది. బెంగాల్ విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్ నేతల అవినీతి గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కక్ష సాధింపు గురించి బీజేపీ చాలా గగ్గోలు పెడుతున్నది. కానీ సీపీఐ(ఎం) లోగడ విమర్శ చేస్తే మమత ప్రజల మనిషీ నిరాడంబరతలకు మారుపేరని ఇదే బీజేపీ ఇదే మీడియా కూడా మోత మోగించారు. కాంగ్రెస్ కూడా వామపక్ష కూటమిని ఓడించేందుకు ఆమెతో కలసి పనిచేసింది. మావోయిస్టులనేవారు అనేక విధాల మమత కూటమిలో భాగమైనారు. శారదా చిట్ఫండ్ స్కాం గాని, మీడియాపై టీఎంసీ వల పన్నిన తీరుగాని పట్టించుకోలేదు. ఆమె ఇప్పుడు తమకే ఎసరు తెచ్చేసరికి ఉలిక్కి పడుతున్నారు. ధర్మపన్నాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సీపీఐ(ఎం)ను దెబ్బతీసే విషయంలో వీరందరిదీ ఇంచుమించు ఒకటే దారి. కనుకనే మొన్నటి ఎన్నికల్లో టీఎంసీ బీజేపీలు సీట్లూ ఓట్లూ తెచ్చుకున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో కొందరు వామపక్షాభిమానులు కూడా బీజేపీకి ఓటు వేసి వుండొచ్చని సీపీఐ(ఎం) చెప్పింది. కానీ దీన్ని వక్రీకరించి సీపీఐ(ఎం) వారు బీజేపీకి ఓటు వేశారనే అసత్యాన్ని పాలక పార్టీలన్నీ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపున బీజేపీ ఆ టీఎంసీ వారినే ఫిరాయింపులతో చేర్చుకుని బలపడ్డానంటున్నది. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయంగా వస్తామంటున్నది. ఎన్నికల్లో పోటీ పడొచ్చు గాని పోరాటాలూ ఉద్యమాల్లో ప్రత్యామ్నాయ భావజాలంలో సీపీఐ(ఎం) స్థానాన్ని బీజేపీ ఎలా భర్తీ చేస్తుంది? టీఎంసీ సభ్యులలో కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్న తీరు దేశమంతా చూసింది. మరీ తలచెడిన ఒకరిద్దరు కమ్యూనిస్టులు కూడా వుండొచ్చు. వారి దౌర్చల్యాలు ఒకటైతే 40మంది టీఎంసీ ఎంఎల్ఎలు తనతో టచ్లో వున్నారని ప్రధానిమోడీ స్వయంగా చెప్పడం ఎంత దారుణం? 30ఏండ్ల పైబడిన పాలనలో సీపీఐ(ఎం) మత సామరస్యాన్ని కాపాడితే ఇప్పుడు బీజేపీ హిందూత్వ రాజకీయాలు టీఎంసీ ముస్లిం ఛాందస రాజకీయాలు రాష్ట్ర ముఖచిత్రాన్నే వికృతం చేసి వినాశనం వైపు నెడుతున్నాయని ప్రజలు గ్రహించకపోరు. ఇదే ప్రయోగం కేరళలోనూ చేయాలనుకుంటే ఫలితం లేకపోయింది. త్రిపుర కూడా ఇప్పటికీ అట్టుడు కుతూనే వుంది. స్వంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఏడుగురు కాంగ్రెస్ ఎంఎల్ఎలను చేర్చుకున్నారు
టీడీపీలో వుండి బీజేపీపై వీరశైవుల్లా విమర్శలు చేసిన సిఎం రమేష్ వంటివారు అమాంతం అందులోకి దూకడం ఒకటైతే అన్ని తిట్టిన వారిని, తామే అవినీతిపరులుగా అభియోగపత్రాలు చదివిన వారిని అవలీలగా అక్కున చేర్చుకోవడం అవకాశవాదానికి పరాకాష్ట. రాజ్యసభలో టీడీపీ సభ్యులు నలుగురు బీజేపీలోకి వెళ్లడం వెనక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశీస్సులు వున్నాయనే కథనాలు ఇంకా విపరీతమైనవి. మొదట్లో కొంత సణగడం తప్ప తర్వాత కాలంలో ఆ పార్టీ కూడా ఈ విషయమై మాట్లాడ్డం దాదాపు ఆపేసింది. తెలంగాణలోనూ టీడీపీ నేతలు చంద్రబాబు సన్నిహితులు చాలామంది బీజేపీలోకి ఫిరాయించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు గురించి ఎంతో ఇదయిపోయిన బీజేపీ నేతలు సాక్షాత్తూ నాదెండ్ల భాస్కరరావునే చేర్చుకున్నారు! జాతీయంగా తామే దాన్ని ఎదుర్కొంటామని చెప్పిన ముఖ్య కాంగ్రెస్ నేతలూ కొందరు మారిపోయారు. ఇంకా కొందరిపై సంకేతాలున్నాయి. విశేషమేమంటే ఇవన్నీ స్వయంగా బీజేపీ అధ్యక్షుడు హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరగడం! తెలంగాణలో పార్టీని శరవేగంగా పెంచడం కోసం తాను నెలకోసారి వస్తానని ఆయన హడావుడి చేసి వెళ్లారు. అదే రోజున ఆయన సహాయమంత్రి కిషన్రెడ్డి ఏపీలో పర్యటించి ఫిరాయింపుల క్రతువు పూర్తి చేశారు. చంద్రబాబుపై కక్ష సాధింపు వుండబోదనే కీలక వ్యాఖ్య కూడా చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా తమతో వస్తారన్నట్టు తాడూ బొంగరం లేని కథలతో గందరగోళం పెంచుతున్న బీజేపీ తెలంగాణలో హరీష్ రావు వస్తాడనే ప్రచారాలు ఉధృతం చేసింది. ఆయన తెచ్చే ఎంఎల్ఎలతో ఏకంగా ప్రభుత్వమే మారిపోతుందన్నది కూడా వారి ప్రచారాస్త్రంగా వుంది. కేసీఆర్, జగన్లు బీజేపీ పట్ల మెతకగా వున్నా వారిని రాకుండా చేస్తామని ఆ పార్టీ నేతలు చిందులు తొక్కుతున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. తెలుగుదేశంలో మరోసారి ఆగస్టు సంక్షోభం వస్తుందని ఆ పార్టీ శాసనసభా పక్షం విలీనమవుతుందని చెబుతున్నారు. ఇలాటి హడావుడితోనే ప్రభుత్వాలు మారిపోవడం అధికారంలోకి రావడం తేలిక కాదన్నది స్పష్టమే గాని దీని వెనక వున్న వ్యూహాలను చూడకపోతే పొరబాటే. రాజీనామా చేయకుండా జగన్ ఇతరపార్టీల వారిని రానివ్వరు గనక బీజేపీ ఫార్ములాను ప్రయోగిస్తారన్నది ఒక కథనం. దేశంలో పరిణామాలు బీజేపీ బరితెగింపు చూసినపుడు తెలుగు రాష్ట్రాలలోనూ దాని పాచికలను తక్కువ అంచనా వేయడానికి లేదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలూ బీజేపీ మత రాజకీయాలపై ప్రత్యక్ష పోరాటం గాని కేంద్రం నిర్లక్ష్యంపై రాజ్యాంగబద్ధమైన ఘర్షణ గానీ చేయలేని పరిస్థితి, కాంగ్రెస్ దుస్థితీ ఇందుకు కారణమవుతున్నాయి. ఈ కుటిల రాజకీయ వ్యూహాలను ఫిరాయింపుల క్రీడనూ బీజేపీ ఘనంగా చెప్పుకోవడం సిగ్గుచేటే. అయితే 1996లోనూ, తర్వాత 1997లోనూ స్వంత బలం లేకుండానే ప్రధానిగా ఫిరాయింపుల సహాయంతో నిలబడాలని చూసిన వాజ్పేయి కాలం నుంచి ఇప్పటి వరకూ బీజేపీకి అలవాటైన విద్యే అది. కర్నాటకలో యెడ్యూరప్ప కూడా 2018లో ప్రమాణ స్వీకారం చేసి దిగిపోయిన సంగతి మర్చిపోకూడదు. ఉత్తరాఖండ్, అరుణాచల ్ప్రదేశ్ గోవా మిజోరాం వంటి చోట్ల ఫిరాయింపుల తోనే అధికారం చలాయించిన తీరు కూడా వుంది. ఈ నీతిబాహ్య వ్యూహాలు నిబంధనలకు పాతేసే ఫిరాయింపులు అవకాశవాద రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతాలే.
- తెలకపల్లి రవి