Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశ విద్యారంగం ముఖ్యంగా పాఠశాల విద్య నాణ్యత లేనిదనే ముద్రను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. నాణ్యమైన ఉపాధ్యాయులు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమనే చర్చ కూడా ఉంది. జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదాలో పాఠశాల ఉపాధ్యాయుల గురించి పెద్ద చర్చే చేశారు. ఉపాధ్యాయులకు ఉండాల్సిన విద్యార్హతలు, నియామకాల విధానం, ప్రమోషన్ అవకాశాలు, పని పద్ధతులు వగైరా చాలా విషయాలు క్రోడీకరించారు.. బహుళ విభాగాలు గల విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలల్లో విషయపరంగా, బోధనా విధానంలో అత్యున్నత నాణ్యమైన శిక్షణతో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ అర్హతగలవారే పాఠశాల ఉపాధ్యాయులుగా అర్హులవుతారు. ప్రీప్రైమరీ నుంచి సెకండరీ వరకు వివిధ దశలు, సబ్జెక్టులు వారీగా ఆర్ట్స్, స్పోర్ట్స్, ఒకేషనల్ సహా అన్ని సబ్జెక్టులకు అవసరమైన శిక్షణ పొందిన వారే కావాలి. బీఈడీతో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఈటీ), నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ఏటీ) ద్వారా పొందిన స్కోరింగ్ ఉపాధ్యాయ నియామకాలకు అనివార్యం. టీచర్స్ రిక్రూట్మెంటుకి నిర్వహించే రాతపరీక్షలో పొందే మెరిట్తో పాటు తరగతి గదిలో డెమో, ఇంటర్వూలో లభించే మార్కుల ఆధారంగానే ఉపాధ్యాయులుగా ఎంపిక కాగలరు. ఫౌండేషనల్ (ప్రీప్రైమరీ-1,2 తరగతులు), ప్రిపరేటరీ (3,4,5 తరగతులు) పాఠశాలల్లో పనిచేసే వారిని జనరలిస్ట్ టీచర్స్ అనీ మిడిల్ (6,7,8 తరగతులు), సెకండరీ (9,10,11,12 తరగతులు) స్కూల్సులో పనిచేసే వారిని సబ్జెక్టు టీచర్స్ అనీ అంటారు. వీరితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఆర్ట్ టీచర్స్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అన్ని స్థాయిల పాఠశాల ల్లోనూ ఉండాలని పేర్కొన్నారు.
ముసాయిదా నివేదికలో చెప్పిన విషయాలు, చేసిన సిఫార్సులు చూస్తుంటే ఉపాధ్యాయుల గురించి చాలా గొప్ప శ్రద్ధాసక్తులు కనబరుస్తున్నట్టు ఉంది. అంత బిల్డప్ అవసరమా అనేది ప్రశ్న. నర్సరీ, కేజీ, ప్రైమరీ తరగతులకు, సెకండరీ క్లాసులకు ఒకే విద్యార్హతలు, ఒకే స్థాయి కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించడం సమంజసమేనా? బీఈడీలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ సబ్జెక్టులు ప్రత్యేకంగా వున్నా విద్యార్హత (నాలుగేండ్ల బీఈడీ) స్థాయి ఒకటే. క్వాలిఫికేషన్ ఒకటే అయినా హౌదాల్లో తేడాలు (జనరల్ టీచర్, సబ్జెక్ట్ టీచర్ వగైరా) చూపించారు. సమాన విద్యార్హత గనుక జీతం సమానంగా ఉండాలనే సిఫార్సు మాత్రం చేయలేదు. హైయ్యర్ క్వాలికేషన్స్ గలవారు లోయర్ క్లాసులకు బోధించడానికి ఇష్టపడరని, అందువలన ప్రైమరీ స్కూల్సులో ఇంటర్మీడియట్ + టీటీసీ అర్హత గలవారినే సెకండరీ గ్రేడ్ టీచర్స్గా అనుమతించి బీఈడీ క్వాలిఫికేషన్ వారిని నిషేధించిన అనుభవం కూడా వున్న విషయం తెలిసిందే. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ వగైరా ఒకేషనల్ టీచర్స్ నియామకాలకు కూడా బీఈడీ విద్యార్హతనే ప్రపోజ్ చేయడం అతిగా వుంది. ప్రాథమిక తరగతులకు కూడా నాలుగేండ్ల డిగ్రీ అర్హత గలవారే పాఠాలు చెప్పగలరనడం అతిశయోక్తి కాగలదు. అవసరమైన క్వాలిఫికేషన్స్, ట్రైనింగ్ కావాల్సిందే, వాటితోపాటు పరిపాలనా సామర్ధ్యాన్ని బట్టే ఉపాధ్యాయుల పనివిధానం, నాణ్యమైన బోధన సాధ్యమవుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్స్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు ఒకటే. కానీ వారిపైన ప్రశంసలు వీరిపైన విమర్శలు ఎందుకని?
నాలుగేండ్ల బీఈడీ అర్హతగల వారినే పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించాలనే రికమండేషన్ అమల్లోకి వస్తే లాభాలకంటే నష్టాలు ఎక్కువ జరిగే అవకాశం వుంది. ఒకటి, ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రతిభ గలవారి ప్రవేశం తగ్గిపోగలదు. నాలుగేండ్ల డిగ్రీలుగా వున్న ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు వుండే డిమాండ్ ఉపాధ్యాయ వృత్తికి వుండదు. ఒక ఏడాదిగా వుండే డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ (టిటిసి) కోర్సును రెండేండ్లకు పెంచినపుడే ప్రవేశాలు తగ్గిపోయిన విషయం తెలిసిందే. రెండు, దళితులు, గిరిజనులు, బలహీన తరగతుల వారిలో అత్యధికులు డిగ్రీ దాకా చదవలేక పదో తరగతి, పన్నెండో తరగతితోనే డ్రాపవుట్ అవుతున్నారు. అందువలన ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వుడ్ కేటగిరీ వారి సంఖ్య తగ్గిపోవచ్చు. మూడు, నాలుగేండ్ల బీఈడీతోనే సరిపోదు, టెట్, ఎన్టిఏ స్కోరింగ్ ఉంటేనే ఉపాధ్యాయ ఉద్యోగానికి అప్లై చేసే అర్హత లభిస్తుంది. టీచర్ రిక్రూటుమెంట్ పరీక్ష రాయాలి, క్లాస్రూమ్ డెమోలో పాల్గోవాలి, ఇంటర్వుని ఎదుర్కోవాలి. డిగ్రీతోనే వయసు ఇరవైరెండేండ్లు దాటుతుంది. ఆపైన టెట్, ఎన్టీఏ, రిక్రూటుమెంట్ పరీక్ష,డెమో, ఇంటర్వ్యూ అన్నీ ఒక సంవత్సరంలోనే పూర్తవుతాయని చెప్పలేం. అంతకాలం ఆగలేక వేరే వృత్తుల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. నాలుగు, అన్ని స్థాయిల ఉపాధ్యాయ ఉద్యోగార్థులు బహుళ విభాగాలు గల విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోని నాలుగేండ్ల బీఈడీ కోర్సులే చదవాల్సి వస్తే దేశవ్యాప్తంగా వున్న బీఈడీ, డైట్, పండిట్, పీఈటీ తదితర ఉపాధ్యాయ విద్యా సంస్థలన్నీ మూతబడినట్టే. ఇటీవల పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి సర్టిఫికెట్లు అమ్ముకుంటున్న పదిహేడు వేల సబ్-స్టాండర్డ్ టీచర్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ ను మూసేయాలనే సిఫార్స్ మంచిదే. సబ్-స్టాండర్డ్ అనేది ప్రయివేటుతో పాటు ప్రభుత్వ సంస్థలకూ వర్తిస్తుంది. నాలుగేండ్ల బీఈడీ కోర్సును యూనివర్సిటీలు. మల్టీ డిసిప్లైన్ కాలేజీల్లోనే నిర్వహించాలనే సిఫార్సును కూడా ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలే ఎగరేసుకుపోగలవు.
కాబట్టి ప్రక్షాళన వంకతో, నాణ్యత పేరుతో ఉపాధ్యాయ విద్యను ఉట్టికెక్కించి సరికొత్త సమస్యలను సృష్టించడం అనవసరం. ప్రభుత్వ రంగంలోని ఉపాధ్యాయ విద్యాసంస్థలను సకల సదుపాయాలతో ఆధునీకరించి, అవసరమైనంత ఫ్యాకల్టీతో బలోపేతం చేస్తే సరిపోతుంది. ప్రీప్రైమరీ నుంచి సెకండరీ వరకు ఉపాధ్యాయులను నాలుగు కేడర్లుగా నియమిస్తే బాగుంటుంది. ప్రీప్రైమరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్ (1-5 తరగతులకు), గ్రాడ్యుయేట్ టీచర్స్ (6-10 తరగతులకు), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్సు (11-12 తరగతులకు)గా డిసిగేషన్స్ ఉండాలి. పిపి టీచరుకి పదో తరగతి + పిపిటి ట్రెయినింగ్, ప్రైమరీ టీచర్సుకి పన్నెండో తరగతి + పిటి ట్రెయినింగ్, గ్రాడ్యుయేట్ టీచర్సుకి నాలుగేండ్ల బీఈడీ, పీజీ టీచర్సుకి నాలుగేండ్ల బీఈడీ + పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలుగా వుండాలి. ప్రీప్రైమరీ, ప్రైమరీ, గ్రాడ్యుయేట్ టీచర్లకు ఇన్-సర్వీసులో దూరవిద్య ద్వారా బీఈడీ, పీజీ చదువుకుని ఫై కేడర్లకు ప్రమోషన్లు పొందే అవకాశం కల్పించాలి. విద్యా విధానం ముసాయిదాలో అలాంటి అవకాశం లేదు. ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్సుగా, టీచర్ ఎడ్యుకేటర్సుగా ప్రమోట్ కావచ్చనే నివేదికలోని సూచన వలన చాలా కొద్దిమందికే అవకాశం రావచ్చు. అలాంటి అరుదైన ప్రమోష న్లను, ఉపాధ్యాయుల జీతాల పెరుగుదలను మెరిట్ ప్రాతిపదికన నిర్ణయించాలనే సిఫార్సు కూడా ప్రశ్నార్ధకంగానే వుంది. ఉపాధ్యాయుల నియామకాలు, పనివిధానానికికు సంబం దించిన మరికొన్ని సిఫార్సులను కూడా పరిశీలించి వెంటనే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇందుకోసం ఉపాధ్యాయులు, విద్యారంగ శ్రేయోభిలాషులు ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. లేకపోతే ముసాయిదాలోని సిఫార్సులు యథాతథంగా అమల్లోకి వస్తే పాఠశాల విద్య మరింత పతన మయ్యే ప్రరిస్థితి దాపురిస్తుంది.
- నాగాటి నారాయణ
సెల్: 9490300577