Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శత్రువునూ గుర్తుంచుకోవాలి
జన శత్రువునైతే జర భద్రంగా గుర్తుంచుకోవాలి
చేవ చావకుండా ఉండేందుకు
దోవ మారకుండా ఉండేందుకు
శత్రువునూ గుర్తుంచుకోవాలి
జయాన్ని ముద్దాడేందుకు
జనమే జయులని చాటేందుకు
క్షణమైనా ఏమరుపాటు లేకుండా
శత్రువునూ గుర్తుంచుకోవాలి!
అవున్నేనిప్పుడు సావర్కర్ గురించే మాట్లాడుతున్నాను. విద్వేష హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ (28 మే 1883-1996 ఫిబ్రవరి 26) గురించే మాట్లాడుతున్నాను. సావర్కర్ ఒక హేతువాది. సావర్కర్ ఒక నాస్తికుడు. హిందూమత ఉద్ధారకులమని ఊరేగే హిందూ మతోన్మాదులకు ప్రేరణ శక్తి అయిన సావర్కర్ మతధర్మాలను ఏనాడూ పాటించని వాడు. నేడు ఆయన మన దేశాన్నేలుతున్న కమలనాథుల నవ నాడులలో ప్రవహించే జీవశక్తి.
జాతిపిత గాంధీకి ఆదికాల మిత్రుడైన సావర్కర్ ఆ తరువాత ఆయన హత్యకు కారకుడన్న అభియోగంతో జైలుపాలయిన వ్యక్తి. సావర్కర్ స్వభావమెటువంటిదో తెలుసుకునేందుకు మనం తప్పనిసరిగా ఒక సంఘటన మననం చేసుకోవాలి. అది 1906 అక్టోబర్... ఒక చల్లటి సాయంత్రం వేళ గుజరాతీ వైశ్యుడైన గాంధీ లండన్లోని ఇండియా హౌస్లో అతడ్ని కలవడానికి వెళ్లేసరికి ఆ చింతన్బట్ బ్రాహ్మణుడు, జింటాన్ బ్రాండ్ విస్కీ, మాంసం అంటే మహా ఇష్టపడే సావర్కర్ తన గదిలో రొయ్యలు వేయిస్తూ ఉన్నాడు. ఆంగ్లేయుల వ్యతిరేక రాజకీయాల గురించి ఆవేశంగా మాట్లాడుతున్న గాంధీని ''సరే ముందు భోంచేయండి'' అన్నాడు. సావర్కర్. ''క్షమించండి నేను మాంసం చేపలు తినను'' అన్నారు గాంధీ. అందుకు సావర్కర్ ''మాసం తినని వాళ్లు అవి తినే ఆంగ్లేయుల బలాన్ని ఎలా ఎదుర్కోగలరు చెప్పు'' అంటూ ఆట పట్టించారు. సత్యాగ్రహం ఆందోళనకు అతని మద్దతు తీసుకోలేకపోయిన గాంధీ సావర్కర్ గది నుంచి ఆ రాత్రి ఖాళీ కడుపుతో బయటకు వచ్చారు. ఆ తరువాత 42ఏండ్లకు అదే గాంధీ హత్య కేసులో 8మందితో పాటు సావర్కర్కూడా అరెస్టయ్యారు. ఆ తరువాత ఎర్రకోటలో జరిగిన విచారణలో జడ్జి ఆయనను నిర్దోషిగా, నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే కొంత మంది నిందితులు ఆయన పాదాలమీద పడ్డారు. తరువాత అందరూ కలిసి ''హిందీ-హిందూ - హిందూస్థాన్.. ఎప్పటికీ జరగదు పాకిస్థాన్'' అంటూ నినాదాలు చేసుకుంటూ బయటపడ్డారు.
''రాజకీయాలను హిందువీకరించడం - హిందువులను సైనికీకరించడం'' అంటూ ఫక్తు హిందూ మతోన్మాద రాజకీయ నినాదం ఇచ్చిన హిందూ మతోన్మాదుల తొలి మార్గదర్శి సావర్కర్. ఈ నినాదాన్ని వెన్నెముకగా మలచుకునే ఇప్పుడు హిందూ మతోన్మాదం దేశంలో చెలరేగిపోతోంది. 'మార్గం కాదు లక్ష్యం ముఖ్యమని' సావర్కర్ ఇచ్చిన అంతర్గత ఆదేశంతోనే అడుగడుగూ పేర్చుకుంటూ నేడు అందలమెక్కి కూర్చుంది. అవును! ఆధునిక భారతదేశ చరిత్రలో సావర్కర్ అత్యంత విలక్షణుడు. వివాదాస్పదుడు. మనువుకు మనుమడు. మోడీకి మార్గదర్శకుడు.
మత విశ్వాసం వేరు. మతోన్మాదం వేరు. ఏ మతధర్మమైనా సమభావాన్ని చెప్పకపోయినా, సహభావాన్ని చెబుతుంది. నిజంగా మత విశ్వాసాలను పాటించేవారు, అందరూ సమానంగా ఉండాలని కాంక్షించి, అందుకు కృషి చేయకపోయినా, సహభావాన్ని పాటిస్తూ, తోటివారి పట్ల సహనాన్ని పాటిస్తారు. ఇతరులను ద్వేషించి, ఆ ద్వేషభావాన్ని వ్యాప్తిచేసి తమ పబ్బం గడుపుకోరు. కానీ, మతోన్మాదులకు విద్వేషమే ఊపిరి. తమ వ్యక్తిగత అధికారం కోసం, ఆధిపత్యం కోసం సమాజాన్ని మతం పేరుతో నిలువునా చీల్చేస్తారు వీళ్ళు. ఒక స్పష్టమైన ఎజెండాతోనే, వ్యవస్థీకృతంగా ఈ పని చేస్తారు. తమ స్వార్థం కోసం దేశ శత్రువులతో సైతం జత కడతారు. సాటి మనుషులను మాత్రమే కాదు, తాము ఉద్ధరిస్తున్నామని చెప్పే సాటి మతస్తులను సైతం కాటికి పంపుతారు. మత ధర్మాలను తుంగలో తొక్కడంలో మొనగాళ్ళు వీళ్ళు. మతాన్ని ఉపయోగించుకోవడమే తప్ప, మతస్తులను వాడుకోవడమే తప్ప ఉపయోగ పడడం తెలియదు. వీళ్ళ మాటలు నమ్మిన ఆ మతస్తులు 'హతులూ-హంతకులూ' వారే అవుతారు. ఇందుకు గాంధీ-సావర్కర్లే సాక్ష్యం. మత విశ్వాసికి గాంధీ ప్రతీక అయితే. మతోన్మాదికి నిదర్శనం సావర్కర్. గాంధీ తన మత విశ్వాసాలను సంపూర్ణంగా నమ్మేవారు. ఆ విశ్వాసాల మేరకు నడుచుకునేవారు. అయినా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం మతాన్ని ఏనాడూ వాడుకోలేదు. పరమత సహనాన్నే తప్ప ద్వేషాన్ని రేకెత్తించలేదు. మతోన్మాది అయిన సావర్కర్ ఇందుకు పూర్తి విరుద్ధం. మత ధర్మాలను ఆయన ఏనాడూ పాటించలేదు. నియమాలకు కట్టుబడలేదు. తొమ్మిదేండ్ల ప్రాయంలోనే మసీదులపై రాళ్ళు రువ్విన ఘనత సావర్కర్ది. పైకి దేశాభిమానిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా ఫోజులు కొడుతూ సామ్రాజ్యవాద తెల్లదొరల కాళ్ల ముందు సాగిలపడిన చరిత్ర సావర్కర్ది. తొమ్మిదేండ్ల 3నెలల జైలు జీవితంలో తెల్లదొరలకు 6సార్లు క్షమాపణ లేఖలు రాసి, బయట పడ్డ తరువాత గాంధీనీ, కాంగ్రెస్నూ, ముస్లింలను వ్యతిరేకించాలని వైస్రారు లిన్లిత్గోతో ఒక లిఖిత ఒప్పందం చేసుకుని, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి నెలకు 60రూపాయల పెన్షన్ పొందిన ఘనాపాటి. తాను క్షమాపణలు అడగడం, బ్రిటిషోళ్లకు సహకరించడం సబబేననేందుకు సిగ్గుపడలేదు. తాను రాసిన 'హిందూత్వ - హుఈజ్ హిందు' గ్రంథంలో మొదటిసారి హిందూత్వను ఒక రాజకీయ ఆలోచనా విధానంగా రూపొందించాడు సావర్కర్. 'ఈ దేశంలో మనిషి ప్రాథమికంగా హిందువే' అని సిద్ధాంతీకరించారు. 'ఎవరి పితృభూమి, మాతృభూమి, పుణ్యభూమి భారత దేశమో వారే దేశ పౌరుడు అవుతాడని' స్పష్టం చేసాడు. 'పితృ భూమి, మాతృ భూమి, అందరికీ ఉంటుంది. కానీ పుణ్యభూమి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు ఉంటుంది. ముస్లింలు, క్రైస్తవులకు ఇది పుణ్య భూమి కాదు' అన్నారు. మతోన్మాద మూకలు ఇప్పుడు సావర్కర్ కన్నా మరో అడుగు ముందుకేసి ముస్లింలు, క్రైస్తవులతోపాటు కమ్యూనిస్టులనూ కలిపాయి. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులను దేశ ద్రోహులుగా, హిందూ శత్రువులుగా చిత్రీకరిస్తున్నాయి. కమ్యూనిస్టులను హిందు వులకు వ్యతిరేకులుగా ముద్ర వేసేందుకు కమ్యూనిజాన్ని కూడా ఒక మతంగా పేర్కొంటూ ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిజాలను పరాయి (ఇతర దేశ) మతాలుగా ప్రచారం చేస్తున్నాయి. తమ పూర్తి సమర్థకులను తప్ప మిగిలిన ఎవరినైనా హిందువులకు శత్రువులుగానే జమకడతారు. ప్రచారం చేస్తారు. ప్రతీకారం తీర్చుకుంటారు హిందూ మతోన్మాదులు. గాంధీ హత్యే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మతసామరస్యంతో, సోదరభావంతో బతుకుదామన్నందుకు పూర్తి హిందూ మత విశ్వాసకుడు, హిందూధర్మ ఆచరణీయుడూ అయిన జాతిపిత గాంధీని దేశ రాజధాని నడిబడ్డున పిట్టను కాల్చినట్టు కాల్చేశారు హిందూ మతోన్మాదులు. ఇక వీళ్ళు ఇతర మతస్తులను, కమ్యూనిస్టులను ఎలా వొదులుతారు? నిజానికి హిందువులకు శత్రువులంటూ ఎవరైనా ఉన్నారంటే- వాళ్ళు ఈ హిందూ మతోన్మాదులే! సావర్కర్లా మత ధర్మాలను, మత నియమాలను ధ్వంసం చేస్తూ, దోపిడీదారులూ, సామ్రాజ్యవాదులూ, ప్రజా శత్రువులతో కుమ్మక్కై, సాటి మతస్తులలో పరమత ద్వేషాన్ని నింపి ద్రోహం చేస్తున్నారు. నిజమైన హిందూ మత విశ్వాసకులు ఎవరైనా వీరిని ద్వేషించాలి. ఎండగట్టాలి. అది వారి ధర్మం. హక్కు. అవసరం. ఈ మతోన్మాదులను ఇలాగే వదిలేస్తే హిందూమతం ఒక నేరగాళ్ల ముఠాగా తయారు కావడం ఖాయం. ఇందుకు ఉత్తరప్రదేశ్ బీజేపీ మహిళానేత సునీతా సింగ్ గౌర్ తాజా ప్రకటనే నిదర్శనం. ''భారతదేశాన్ని రక్షించాలంటే హిందూ సోదరులు పది, ఇరవై మంది గుంపులుగా ఏర్పడి ముస్లింల ఇండ్లలోకి చొరబడి వారి తల్లులనూ చెల్లెళ్ళనూ సామూహిక అత్యాచారానికి గురిచేయాలి. వారిని ఇండ్లలో నుంచి బయటకులాగి వీధుల్లో రేప్ చేసిన తరువాత బహిరంగంగా ఉరితీయాలి'' అంటూ పిలుపునిచ్చారు. మనిషన్నవాళ్ళు ఊహించలేని ఈ దుర్మార్గాతిదుర్మార్గ విద్వేష పలుకులకు మూలం ''లక్షలాది హిందూ మహిళలు ముస్లింల చేతిలో అత్యాచారాలకు గురయ్యారు. దేశ వ్యాప్తంగా వారి ఆర్తనాదాలు మారుమోగాయి. కాబట్టి, హిందువులు విజయం సాధిస్తే ముస్లిం మహిళలపై భయంకరంగా పగతీర్చుకోవాలి. ఆ ప్రతీకారం చూసి భయంతో వణికిపోవాలి'' అన్న సావర్కర్ సిద్ధాంతంలోనే ఉంది. సావర్కర్ బాటలో సాగుతుండబట్టే ''హిందువులకు ముస్లింలకు మధ్య ధార్మికయుద్ధం తప్పదు. హిందువులు - ముస్లింలు కలిసి ఉండలేరు. ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను తీసుకుపోతున్నారు. వాళ్ళు ఒక్క అమ్మాయిని తీసుకుపోతే మేం వందమందిని పట్టుకొస్తాం. ఒక్క హిందువును వాళ్ళు చంపితే మేం వందమందిని చంపుతాం'' అంటూ గతంలో పెట్రేగి పోయారు నేటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్. లైంగిక దాడులనూ, హత్యలనూ రాజకీయ ఆయుధంగా వాడుకోవడం సావర్కర్ లక్ష్యం. గౌర్, యోగి, ప్రగ్యా... గుజరాత్ మారణహౌమానికి పాల్పడిన హిందూ మతోన్మాదుల లక్ష్యం కూడా అదే.
పైకి ఎన్ని మాటలు చెప్పినా.. అఖండ భారత్లో హిందూ మతోన్మాద రాజ్యాన్ని స్థాపించడమే సావర్కర్ శిష్యులైన సంఘీయుల లక్ష్యం. ఈ విషయాన్ని 1940లోనే గ్రహించిన అంబేద్కర్ ''ఒకవేళ హిందూ దేశం ఏర్పడినట్టయితే అది దేశానికి భారీ ప్రమాదం అవుతుందనడంలో సందేహం లేదు. హిందువులు (హిందూత్వవాదులు) చెప్పేది ఏదైనా కావచ్చుకానీ, హిందూత్వ అనేది స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం, సమానత్వం అన్న భావనలకు ప్రమాదకరం. అలా చూసినపుడు ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అణుగుణమైనది కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ హిందూ రాజ్యం ఏర్పాటును వ్యతిరేకించాలి'' అని పిలుపునిచ్చారు.
అవును! ప్రమాదం మన కండ్ల ముందుంది
పరిష్కారం మనచేతుల్లో ఉంది.!
హిందువులనుంచి హిందూ మతోన్మాదులను వేరుచేద్దాం!
హిందువులకు - హిందూ మతోన్మాదులకూ సంబంధమే లేదని చాటి చెబుదాం!
- కోప్ర
సెల్: 6301289321