Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2019లో కార్మికులకు ప్రకటించిన వరం! ''కార్మిక చట్టాల సవరణ'' దీనిపై 2017 నుంచే కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. నలభైనాలుగు చట్టాలను నాలుగు కోడ్స్గా చేస్తున్నట్టుగా నొక్కి మరీ వక్కాణించారు. ఇంతకీ ఈ సవరణల్ని ఎవరు కోరుకున్నారు? కార్మికచట్టాలను సవరించాలని ఏ కార్మిక సంఘం కోరుకోలేదు. ఎన్నడూ నినదించనూలేదు. అయినప్పటికీ ప్రభుత్వమేర్పడినాక ఆగమేఘాల మీద ఈ సవరణల గురించి ప్రస్తావించడమే గాక బడ్జెట్లో ఒక భాగాన్ని చేశారు. కార్మిక చట్టాల సవరణల వల్ల కార్మికులకు ప్రయోజనం లేదని ఎన్నోసార్లు పలు సంఘాలు నిరసన తెలిపాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టుబట్టి సవరణలకు పూనుకుందంటే యాజమాన్యాల వొత్తిడి ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ ప్రయత్నాలన్నీ యజ మానుల ప్రయోజనాలకేనన్నది అర్థం చేసుకోవాలి.
నిజానికి ఇప్పుడున్న చట్టాలు పూర్తిగా కార్మికుల పక్షాన కూడా లేవు. యాజమాన్యాలకు వ్యతిరేకంగా అస్సలు లేవు. అయినప్పటికీ యాజమాన్యాలు ఎందు కింత పట్టుబట్టి ఈ కార్మిక చట్టాలను సవరించాలని ప్రయత్నిస్తున్నాయి? చట్టాలను అడ్డంపెట్టుకుని కార్మికులు యజమానులను సతాయిస్తున్నారా? లేక కోర్టుల్లో విపరీతమైన కేసులు పెండింగ్లో ఉన్నాయా? ఎంత వెదికినా గణాంకాలన్నీ తక్కువే. ఇప్పుడున్న కార్మిక చట్టాల వల్ల వెసులుబాటు ఏమంటే, ఏదైనా కార్మికుల్ని తొలగించే ముందు నోటీసు ఇవ్వడం లేదా బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా సెటిల్ చేసి పంపించడం వంటివి. ఈ సెటిల్మెంట్లు యజమానికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు? అందుకోసమే మొత్తం కార్మిక వ్యవస్థను ఒక అడ్డా కూలీలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరిని ఎప్పుడు నియమించినా, ఎప్పుడు తొలగించినా యాజమాన్యాలను ఏమీ అనకూడదన్నమాట. కార్మికులంటే యంత్రానికి మరో రూపు అన్న విధంగా చూడడమే యాజమాన్యం లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక స్విచ్ వేస్తే యంత్రం ఎలా పనిచేస్తుందో ఒక మాట చెప్తే ఒక వర్కర్ అలాగే పని చేయాలి మరో ఆజ్ఞకి పని ఆపేయాలి. బదులు ప్రశ్నించరాదు. డిమాండ్లు పెట్టరాదు. వివాదాలేమైనా ఉంటే సదరు సంస్థ పరిధిలోనే సెటిల్ చేసుకోవాలి. ముఖ్యంగా కోర్టుల జోక్యం అస్సలు ఉండరాదు. అన్నిటికన్నా ముఖ్యంగా నియమించుకోవడం, తొలగించడం పూర్తిగా యాజమాన్య హక్కుగా ఉండాలి. ఇంతటి దారుణమైన ఉద్దేశంతోటే కార్మిక చట్టాల సవరణకు పట్టుబట్టి ప్రభుత్వం ద్వారా చేయిస్తున్నారు. కార్మిక సంఘాలను పెట్టుకునే హక్కు, మీటింగ్లు పెట్టుకునే హక్కు లేకుండా చేసి, సంఘానికి బయటి వారు నాయకత్వం వహించకుండా చూసి, ఒక బానిస లేదా అంతకన్నా ఘోరమైన దుస్థితిలోకి చేర్చడం కోసమే ఈ కార్మిక చట్టాల సవరణ ఇంత ఆత్రంగా చేపట్టారా?
44 కార్మిక చట్టాలను కలిపేసి నాలుగు కోడ్స్గా ఈ విధంగా సెలవిచ్చారు. 1. వేజ్ కోడ్, 2. ఇండిస్టియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ 3. ఇండిస్టియల్ రిలేషన్స్ 4 సోషల్ సెక్యూరిటీ. 2017లో రూపొందించిన ముసాయిదా ప్రకారం, వేజ్ కోడ్లో వేతనాలను లేదా జీతాలను యజమాని వర్కర్ కలిసి కూర్చుని నిర్ణయించుకోవాలి. ప్రభుత్వానికి ఏ రకమైన పాత్ర ఉండదని స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల వర్కర్ లేదా ఉద్యోగి తన వేతనాన్ని తన నైపుణ్యాన్ని బట్టి కోరుకోవడం వల్ల ఉద్యోగికి యజమానికి సత్సంబంధాలు ఉంటాయి అని చెబుతున్నారు. ఈ పద్ధతి వల్ల ఎంత నైపుణ్యమున్నా అప్పుడే మార్కెట్లోకి అడుగిడుతున్న ఆశావాహి యజమాని దగ్గర బేరమాడగలడా? ప్రభుత్వ నియంత్రణ లేకుంటే సరైన పనికి సరైన ప్రతిఫలం లభిస్తుందా? ఈరోజు కార్మికవర్గ పేదరికానికి ప్రధాన కారణం సరైన పనికి సరైన ప్రతిఫలం లభించకపోవడమే. ఈ వేజ్ కోడ్ అమల్లోకి వస్తే ఒక కంపెనీలో ఒకేరకమైన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో తేడాలు మొదలవుతాయి. వయసును బట్టి వేతనాల వ్యత్యాసాలుండవచ్చు. సీనియర్లకు జూనియర్ల కన్నా తక్కువ పేమెంట్లు... మొదలగు అసమాన పద్ధతులకు ఆస్కారముంది. ఈ ప్రతిపాదనల్లో ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అప్రెంటీశ్షిప్ విధానాలు. ఫిక్స్ టర్మ్ ద్వారా ఎల్లప్పుడూ యువకులను మాత్రమే నియమించుకుని మలి వయసు కాదు గదా మధ్య వయస్కులను కూడా తొలగించే కుట్ర పన్నబడింది. అప్రెంటిస్షిప్ అనగా నియామకమైన మొదటి రోజుల్లో ఆరు లేదా కొన్ని నెలలు మాత్రమే ట్రెయినింగ్ రూపంలో పనిని చేయిచుకోవడం, దానికి ప్రతిఫలంగా కొంత ఫిక్స్డ్ వేతనాన్ని చెల్లించడం. కానీ నేడు అప్రెంటిస్ షిప్ కాలపరిమితి లేదు. తక్కువ మొత్తం చెల్లిస్తూ, అప్రెంటిస్ పేరు మీద రెగ్యులర్ ఉద్యోగుల కన్నా ఎక్కువ పని చేయించుకోవటానికి మార్గం వేసుకుంటున్నారు. ఈ రకమైన ప్రతిపాదన లకు ముందు కార్మిక సంఘాలని సంప్రదించక పోవడం మరింత తప్పు కాదా?
ఇక ఇండిస్టియల్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి చూసినప్పుడు, ఏ కంపెనీకైనా దాని సేఫ్టీ సెక్యూరిటీ కాపాడాల్సిన బాధ్యత కార్మికులపై రుద్దాలని చూస్తున్నారు. నిజానికి కంపెనీ సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత యజమానిది. నిర్ణయాధి కారం లేని కార్మికులకన్నా లాభాలను అనిభవించే యజమాని నిరంతరం కంపెనీ సేఫ్టీ సెక్యూరిటీ చూడాలి. భవిష్యత్తులో ఏ రకమైన నష్టాలేర్పడినా కార్మికులను బాధ్యులను చేయడం కోసమే ఈ ఇండిస్టియల్ సేఫ్టీ సెక్యూరిటీ కోడ్ ఉద్దేశ్యమైతే, అది ప్రమాదమే. ఇక ఇండిస్టియల్ రిలేషన్స్ అంశాన్ని పరిశీలించినప్పుడు ఏ వివాదాన్నైనా కంపెనీ నియమాల పరిధికి లోబడే పరిష్కరించుకోవాలి. కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లకూడదు. ఇతరత్రా న్యాయస్థానాలను సంప్రదిం చడం కుదరకుండా చేయడమే ఈ ఇండిస్టియల్ రిలేషన్స్ కోడ్ లక్ష్యం. దీని ద్వారా పారిశ్రామిక వివాదాల చట్టం, పదవీ విరమణ బెనిఫిట్ల సంబంధిత వివాదాలన్నీ కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలి. సోషల్ సెక్యూరిటీ అనగా ఉద్యోగుల భవిష్య అవసరాల కోసం కంపెనీ ఎలాంటి ప్రయత్నం చేయదు. ఉద్యోగి తన భవిష్యత్ అవసరాల కోసం తానే పొదుపు చేసుకోవలసి ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అందులో ఒక భాగమే. ఈ కోడ్ అమల్లోకి రాగానే ఇప్పుడున్న గ్రాట్యుటీకి, ప్రావిడెంట్ ఫండ్స్ నిర్ణీత వడ్డీ చెల్లింపులకు కాలం చెల్లే రోజులు దగ్గరైనట్టే.
ఈ నాలుగు రకాల కోడ్ల వల్ల ఇంతకుముందు 44 చట్టాల రూపంలో అమలులో ఉన్న కనీస వేతనాల చట్టం, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఒకే పని చేసే వారికి లింగబేధం లేని చెల్లింపులు (ఈక్వల్ రెమ్యునరేషన్ ఫర్ ఆల్ జెండర్స్)- ఇలాంటివెన్నో మాయమైపోతాయి. ఇప్పటికే స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) రూపంలో ఏర్పడిన పెద్ద పెద్ద కంపెనీలో ఇప్పుడున్న కార్మిక చట్టాలు వర్తించవు. అక్కడ సమాన పనికి సమాన వేతనం అన్న కాన్సెప్ట్ లేదు, యూనివర్సల్ టైమింగ్స్ లేవు, కామన్ హాలిడేస్ లేవు, వయస్సుకు తగిన పనిని ఇవ్వాలన్న నిబంధన కూడా లేదు. అంతేకాకుండా కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్టర్ రూపంలో పని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఉత్పత్తి ఆధారిత వేతనాలు (పీస్ రేటు విధానం) చెల్లించబడతాయి. పదవీ విరమణ కాన్సెప్ట్ కూడా లేదు. చేసినంత కాలం చేయాలి చేతకాకపోతే వెళ్ళి పోవాలి లేదా యజమానే తీసేస్తాడు. వెరసి అదొక ఇష్టా రాజ్యంగా నడుస్తున్న కంపెనీల స్వీయ సామ్రాజ్యం లాంటిది. కార్మిక చట్టాలు అడ్డంగా ఉన్నాయన్న నేపథ్యంతోనే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని పేరు పెట్టి, వందల ఎకరాల భూములను ధారాదత్తం చేసి, పుష్కలంగా లభిస్తున్న శ్రమశక్తిని వాళ్లకు అప్పనంగా అందించింది ప్రభుత్వం. ఇప్పుడు ప్రతిపాదించిన ఈ కార్మిక చట్టాల సవరణలు ద్వారా దేశమంతా స్పెషల్ ఎకనామిక్ జోన్గా తయారవుతుందన్న మాట. నిజానికి అసంఘటిత రంగంలో, సాఫ్ట్వేర్ తదితర ప్రదేశాల్లో కార్మిక చట్టాల అమలు దాదాపు శూన్యం. భయపెట్టి లేదా మభ్యపెట్టి కార్మికులను అడ్డగోలుగా పని చేయించుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నయి. రియల్ఎస్టేట్ వ్యాపారులు, పెద్దపెద్ద దుకాణాదారులు, రోజు కూలీలతో పని చేయించుకుంటున్న అసంఘటితరంగ పెట్టుబడిదారులు అత్యంత దారుణంగా దోచుకుంటున్నది చిన్న చిన్న శ్రామికులనే. వ్యవసాయ కూలీలకు వ్యవసాయ ఆధారిత పనులు చేసుకునే వారికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు ఉపయోగపడడమే లేదు. ఇటువంటి వారికి కొత్త కార్మిక చట్టాలు తెచ్చి సహాయ పడాల్సింది పోయి ఉన్న కార్మిక చట్టాలను సవరించి యజమానులకు మరింత వెసులుబాటు కల్పించడం అతి దారుణమైన అంశం. ఇంతటి నష్టపూరిత సవరణలపై శ్రామికులంతా ఐక్యంగా ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016