Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడులు లేక, ఉద్యోగాల సృష్టి జరగక, ఆర్థికాభివృద్ధి కుంటుపడుతున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధికి ఊతం ఇస్తుందని, ఉద్యోగాల సృష్టికి సాయపడుతుందని చాలామంది ఆశించారు. కానీ సామాన్య ప్రజల కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రభుత్వం తెలియచేసింది.
గత ఐదేండ్ల బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే కార్పొరేట్లకు ప్రయోజనం చేకూరేట్లుగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేసిందని తెలుస్తోంది. ఈ ఐదేండ్లలో రూ.4లక్షల 32వేల కోట్లు కార్పొరేట్లకు పన్ను మినహాయింపులుగా కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇది మొత్తం పన్ను ఆదాయంలో 7.6శాతం. కార్పొరేట్లకు ఇచ్చిన పన్ను మినహాయింపులను, సామాన్యులకు వివిధ స్కీమ్ల ద్వారా అందజేసిన మొత్తాలతో పోల్చినప్పుడు ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం అవుతున్నది. ఈ ఏడాది బడ్జెట్లో గ్రామీణ ఉపాధి పథకానికి, మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ, శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ముతో కార్పొరేట్లకు ఇచ్చిన మినహాయింపుల్ని పోలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యాలు అర్థమవుతాయి. కార్పొరేట్లకు ఇచ్చే పన్ను మినహాయింపులను టాక్స్ ఇన్సెంటివ్స్గా లేదా ట్రాక్స్ ఎక్స్పెండిచర్గా ప్రభుత్వం వర్గీకరిస్తున్నది. విద్యకు, వైద్యానికి, రైతులకు ఇతర సామాజిక రంగాలకు నిధుల కేటాయింపునకు తమ దగ్గర వనరులు లేవని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఈ రంగాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వాలు చెపుతూ ఉంటాయి. కానీ కార్పొరేట్ల ప్రయోజనాల విషయానికి వచ్చేసరికల్లా ప్రభుత్వానికి ఎక్కడాలేని నిధులు సమకూరుతాయి. కార్పొరేట్లకు పన్ను మినహాయింపుల వల్ల ఆర్థికాభివృద్ధి జరిగి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటారు. కానీ గత అయిదేండ్లలో ప్రయివేట్ పెట్టుబడులలో ఎలాంటి వృద్ధి లేదు. పెరిగిన ఉద్యోగాలు కూడా ఏమీ లేవు. ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు వాటి లాభాలను పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనాల్లేవు.
దేశ అభివృద్ధి జరగాలంటే మౌలిక వసతుల్లో పెట్టుబడులూ అలాగే సామాజికరంగంలో పెట్టుబడులు పెరగాలి. ఈ పెట్టుబడులు పెరగాలీ అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి. ప్రభుత్వ ఆదాయం పెరగకుండా ప్రభుత్వ ఖర్చులు పెరుగుతుంటే ద్రవ్యలోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు పెరగకుండా ఉండాలంటే కార్పొరేట్లపై విధించే ట్యాక్సులు పెరగాలి. మన ట్యాక్స్-జీడీపీ నిష్పత్తి ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఎంతో తక్కువ. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదన వల్ల ఈ నిష్పత్తి గతేడాది కన్నా బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ట్యాక్స్-జీడీపీ నిష్పత్తి 16 నుంచి 17శాతంగా ఉన్నది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ నిష్పత్తి చాలా తక్కువ. దీన్ని 24 నుంచి 25శాతం వరకు పెంచుకోవచ్చు. మనదేశంలో సంపదపై పన్ను లేదు. అలాగే వారసత్వంగా వచ్చే ఆస్తుల మార్పిడిపై పన్నులేదు. 80శాతం పైగా పేదలు ఉన్న మన దేశంలో ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. కానీ మనకన్నా పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా ట్యాక్స్-జీడీపీ నిష్పత్తి చాలా ఎక్కువుంది. ఈ నిష్పత్తి గణనీయంగా పెంచుకునే అవకాశాలున్నాయి. కానీ ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టవు.
సాధారణ ప్రజలకు అవసరమైన వస్తువుల ధరలపై మాత్రం పన్నులు పెరుగుతూనే ఉంటాయి. 2014 నుంచి రెండుసార్లు చమురు ధరలు తగ్గగా 9సార్లు ధరలు పెరిగాయి. మొన్నటి బడ్జెట్లో కూడా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను ఆర్థిక మంత్రి పెంచేసారు. పెట్రోల్ లీటరుకు రూ.2.40 పైసలు పెరగగా డీజిల్ ధరలు రూ.2.36పైసలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఏడాదికి రూ.28వేల కోట్లను అదనంగా సంపాదించాలని ప్రభుత్వ ఆలోచన. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీకి అదనంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ విధిస్తాయి. దీనివల్ల పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుంది.
బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను మరింత వేగవంతం చేస్తాయి. రూ.1,05,000 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా సమీకరించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. పీఎస్యూలో ప్రభుత్వ వాటాలు తగ్గిపోతూ వస్తున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలలో ప్రభుత్వ వాటా 51శాతం కన్నా తగ్గినా వాటిని ప్రభుత్వరంగ సంస్థలుగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం, ఇతర ప్రభుత్వరంగ సంస్థల వాటా 51శాతంగా ఉంటే అది ప్రభుత్వరంగ సంస్థేనని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ వాటా 50శాతానికి కన్నా తక్కువగా ఉన్నా ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని చెప్పడం తప్పుదోవ పట్టించడమే.
ప్రతి ప్రభుత్వరంగ సంస్థలలో కనీస పబ్లిక్ హౌల్డింగ్ 25శాతం నుంచి 35శాతానికి పెంచారు. అంటే ఇకముందు ఒక ప్రభుత్వరంగ సంస్థలో ప్రయివేటు వాటా కనీసం 35శాతంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. గతేడాది ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ద్వారా రూ.45వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా వచ్చాయి. ఈక్విటీ లింక్డ్డ్ సేవింగ్ స్కీమ్స్ లాగానే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ కూడా ఒక పెట్టుబడి ఆప్షన్గా ప్రజల ముందు బలంగా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అలాగే దేశీయ కార్పొరేట్ వ్యవస్థను అంతర్జాతీయ వ్యవస్థలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలలో విదేశీ షేర్ హౌల్డింగ్ పరిమితులను పెంచే ప్రయత్నాలను కూడా ప్రభుత్వం వేగవంతం చేయబోతున్నది. అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వరంగ పెట్టుబడుల ఉపసంహరణ, దానిలో పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం అవసరమని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను సులభతరం చేసి వాటిని మార్కెట్కు అనుగుణమైన వాణిజ్య సంస్థలుగా తీర్చిదిద్దే ప్రయత్నం బడ్జెట్ ప్రతిపాదనలలో మనకు కనబడుతోంది. ప్రభుత్వరంగ సంస్థలు, జాతీయ ప్రయోజనాల కన్నా ప్రయివేట్ వ్యక్తులకు, సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందని అర్థమవుతోంది.
250 కోట్ల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ 25శాతంగా ఉండేది. 25శాతం కార్పొరేట్ ట్యాక్స్ను ఇప్పుడు 400కోట్ల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలన్నింటికీ వర్తింపజేశారు. దీనివల్ల 90శాతం ప్రయివేట్ కంపెనీలు లాభపడతాయి. ప్రభుత్వ బ్యాంకుల రుణాలిచ్చే సామర్థ్యం తగ్గిపోయిందని, వాటి మొండి బకాయిలు పెరిగిపోయాయని కాని తాము అవలంబించిన విధానాల వల్ల రూ.1,00,000కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని ఆర్థికమంత్రి తెలిపారు. కానీ గత ఆర్థిక సంవత్సరంలో రద్దు చేసిన రూ.2,00,000 కోట్ల రుణాలు గురించి మాత్రం మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రూ.75,000 కోట్లు ఇవ్వడం మంచిదే అయినా అది చివరకు ఎవరికి సహాయకారిగా ఉంటుంది అన్న ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆస్తులను బ్యాంకులు కొనుగోలు చేస్తే దానికి వన్ టైం గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఐఎల్ఎఫ్ఎస్, దీవాన్ హౌసింగ్ సంక్షోభాల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం ప్రయివేట్ సంస్థలకే ప్రయోజనం కలిగిస్తుంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ఎక్కువగా దేశ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చే ప్రతిపాదనలను బడ్జెట్లో పెట్టారు. విమానయానం, మీడియా, ఎనిమేషన్, బీమారంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను పెంచారు. ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ (బ్రోకర్స్, ఇన్సూరెన్స్ రిపాసిటర్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్)లలో 100శాతం ఎఫ్డీఐని అలాగే సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఉన్న పరిమితుల్ని సరళతరం చేయడాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. బీమా రంగంలో ఎఫ్డీఐ పెంపుపై కమిటీ ఏర్పాటు, రీఇన్సూరెన్స్ కంపెనీలను ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడిని రూ.5000 కోట్ల నుంచి 1000 కోట్లకు తగ్గించడం, బీమా రంగాన్ని మరింత ప్రయివేటీకరించడమే. బీమా ప్రీమియమ్లపై విధించిన జీఎస్టీ తగ్గింపు గురించి గానీ అలాగే బీమా ప్రీమియమ్పై ప్రత్యేక సెక్షన్ ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ప్రజల డిమాండ్పై ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం.
రానున్న ఐదేండ్లలో పదివేల రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేస్తామని దాని ద్వారా రైతులు పండించిన పంటలకు సరైన ధరలు తీసుకువస్తామనీ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ రైతులకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది. వ్యవసాయరంగంలో మార్కెట్ వ్యవస్థను సంస్కరించే విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉంది. పంటలకు కనీస మద్దతు ధర, ఎరువులు, పెస్టిసైడ్స్పై సబ్సిడీలు ఇవ్వడం గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు.
గత ఐదేండ్లలో ఆర్థిక వ్యవస్థ 2.7 మిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగిందని రానున్న ఐదేండ్లలో ఇది మరింత పెరిగి భారతదేశం 5 ట్రెలియన్ డాలర్ల ఎకానమిగా ఎదుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు. కనీసం ప్రభుత్వం, గరిష్ట పాలన ద్వారా అలాగే డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా లాంటి ప్రణాళికలతో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకుంటామని మంత్రి చెప్పారు. గ్యాస్ గ్రిడ్స్, వాటర్ గ్రిడ్స్, ప్రాంతీయ విమానాశ్రయాలు, రింగ్ రోడ్లు, మెట్రో రైల్ ట్రాక్లతో భారతదేశం సూపర్ పవర్గా అవతరించబోతుందని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రానున్న ఐదేండ్లలో రూ.100లక్షల కోట్లను మౌలిక వసతులను కల్పించడానికి అందిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు. అయితే ఇవన్నీ ఎలా సాధ్యం? వనరులను ఎలా సేకరిస్తారో మాత్రం ఆర్థిక మంత్రి చెప్పలేదు. ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఖర్చును రూ.9, 21,000 కోట్లకు నుంచి 8,76,000 కోట్లకు తగ్గించారు. ఇది ఆర్థిక వ్యవస్థను ఎలా ఉత్తేజ పరచ గలదో, ఆర్థిక మంత్రి వాగ్దానం చేసినట్లు భారత్ ఎలా సూపర్ పవర్ కాగలదో అర్థం కాదు. ప్రజలకు అనుకూలమైన విధానాలు చేపట్టకుండా బడ్జెట్ పత్రాలను గోధుమ రంగు బ్రీఫ్ కేస్లో కాకుండా ఎర్రని బ్యాగులో తీసుకువచ్చినంత మాత్రాన పశ్చిమ దేశాల బానిసత్వం నుంచి విముక్తి చెంది భారత్ సూపర్ పవర్ అవుతుందని అనుకోవడం ఉత్తి భ్రమే...
- కె. వేణుగోపాల్
సెల్:9440244277