Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు కొప్పేసుకుండు. మొకానికి పొడర్ బూసుకుండు. తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు దీస్కుండు. ఒకపారి గవ్విటిని కొట్టి జూస్కుండు. గీపారి యాడ్కిబోవాలె. యాడ్కిబోతె బాగుంటదని జరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు ఎప్పటిలెక్క యాద్గిరి గుట్టకు బోతె బాగుంటదని అనుకుండు. చిర్తలు గొట్టుకుంట నారాయణ నారాయణ అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు.
నడి నాత్రి. అందరు పండుకున్నరు. యాడసప్పుడు లేదు. నర్సిమ్మసామి గుడికి తాలమున్నది. నారదుడు యాద్గిరి గుట్ట మీద దిగిండు. మాయమై గుల్లెకు బోయిండు.
''నారాయన నారాయన'' అన్నడు.
''నువ్వా నారదా! యాలగాని యాల గిట్లొచ్చిన వేంది?'' నిద్రల కెల్లి లేసిన నర్సిమ్మసామి అడిగిండు.
''మీ తోని ముచ్చట బెట్టె తందుకు''
''నా తోని ముచ్చట బెడ్తె ఏమొస్తది''
''గీ దేసంల ఏమైతున్నదో ఎర్కైతది''
''కర్నాటకల డ్రామ నడుస్తున్నది. గా డ్రామ దినం కొక మల్పు దిర్గుతున్నది''
''ఏం డ్రామ సామీ!''
''కుమారసామిని ముక్యమంత్రి కుర్సి మీదికెల్లి దించుడు. యెడ్యూరప్పను ముక్యమంత్రి కుర్సి మీద గూసుండ బెట్టుడు''
''నాకు సమజైత లేదు. జెర కుల్ల కుల్ల జెపు దేవా!''
''కర్నాటకల మొత్తం 224మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవ్వల దిక్కు 113మంది ఎమ్మెల్యేలు ఉంటె గాల్ల సర్కారే వొస్తది. 105మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నరు. 80మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటె 37 మంది జెడిఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నరు. ముందుగాల గవర్నర్ బిజెపికే చాన్సు ఇచ్చిండు. యెడ్యూరప్ప ముక్యమంత్రి కుర్సి ఎక్కిండు. కాంగ్రెస్; జెడిఎస్ ఎమ్మెల్యేలను కొనెతందుకు బిజెపి ఒక్క తీర్గ కోషిస్ జేసినా పాయిద లేకుంట బోయింది. యెడ్యూరప్ప ఏక్ దిన్ కా ముక్యమంత్రి అయ్యిండు. ఇగదాంతోని కాంగ్రెస్; జెడిఎస్ గల్సి కర్నాటకల సర్కార్ బెట్టినయి. గా సర్కార్కు ఇద్దరు ఇండిపెండెంట్లు మదద్ ఇచ్చి మంత్రుల య్యిండ్రు. కుమారసామి ముక్యమంత్రి అయ్యిండు. గప్పటి సంది బిజెపి ఆకర్ష్ కమల్ను షురువుజేసింది.''
''ఆకర్ష్ కమల్ అంటేంది?''
''కాంగ్రెస్; జెడిఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలకు గుంజుడు. యెడ్యూరప్ప సన్నాసుల సుట్టూత దిర్గిండు. వశీకరన యంత్రం నేర్సుకుండు. దినాం గా మంత్రంను ఒక్క తీర్గ సద్విండు. ఎంతగనం సద్వినా పాయిద లేకుంట బోయింది. గాయిన అయస్కాంతం బట్టుకోని దిర్గిండ్రు. గిన్ని కోట్లు ఇస్తం. గన్ని కోట్లు ఇస్తం అన్నడు. ముక్యమంత్రి కుర్సి ప్రాప్త యాగం జేసిండు. ఎన్ని జేసినా పాయిద లేకుంట బోయింది.''
''పాయిద లేకుంట బోతె యెడ్యూరప్ప ఊకుండా?''
''ఊకోలేదు. గాయిన ఊకున్నా బిజెపి ఊకోదు గదా. లోక్ సబ ఎలచ్చన్ల బిజెపికి మెజార్టి వొచ్చింది. మల్ల సంటర్ల బిజెపి సర్కారొచ్చింది. కర్నాటకల గుడ్క బిజెపికి ఎక్వ ఎంపిసీట్లొచ్చినయి. మల్ల బిజెపి ఆకర్ష్ కమల్ షురువు జేసింది. గీపారి కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలకు గుంజుకుంట 16 మందితోని ఎమ్మెల్యే కుర్సిలకు ఇస్తిఫా జేపిచ్చింది.''
ఇస్తిఫా ఇచ్చిన 16 మందిల ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుఉన్నరు.''
''13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కడ్మ ముగ్గురు జెడిఎస్ ఎమ్మెల్యేలు''
''కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజినామ జేస్తె రాహుల్ గాంది ఏం జేస్తున్నడు''
''డిల్లిల చానక్య తేటర్ల పాప్ కార్న్ దినుకుంట సిన్మ జూస్తున్నడు''
''కర్నాటక ముక్యమంత్రి కుమార సామి ఏం జేసిండు''
''మంత్రులందరితోని రాజినామ జేపిచ్చిండు. అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి కుర్సిలు ఇస్తనని జెప్పిండు''
''ఎమ్మెల్యే కుర్సిలకు ఇస్తిఫా ఇచ్చిన ఎమ్మెల్యేలు ఏంజేసిండ్రు దేవా?''
''ముందుగాల ఇస్తిఫా ఇచ్చిన ఎమ్మెల్యేలల్ల 14 మంది ముంబై బోయి ఒక స్టార్ హౌటల్ల ఉన్నరు''
''గాల్లు ముంబైకే ఎందుకు బోయిండ్రు''
''మహారాస్ట్రల బిజెపి సర్కార్ ఉన్నది. ఇస్తిఫా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుద్గరిచ్చెతందుకు కాంగ్రెస్ లీడర్ శివకుమార్ ముంబై బోయిండు. స్టార్ హౌటల్ల ఒక అర్ర బుక్ జేసిండు. మా పానం దీసెతందుకే గాయిన వొచ్చిండని ఎమ్మెల్యేలు ముంబై పోలీసులకు దర్కాస్తు ఇచ్చిండ్రు. దాంతోని గాయినను పోలీసోల్లుహౌటల్లకు బోనియ్య లేదు. వాన గొండుతుంటె ఛత్రి బట్కోని శివకుమార్ శివశివా అన్కుంట హౌటల్ ముంగటే శానసేపు నిలబడ్డడు. ఎంతసేపు నిలబడ్డా పాయిద లేకుంట బోయింది.''
''ఎమ్మెల్యేలు ఉరాజినామ ఇస్తె స్పీకర్ ఏం జేసిండు''
''ఐదుగురి రాజినామాలే సక్క గున్నయి. కడ్మోల్లయి సక్కగ లెవ్వు అని అన్నడు. దాంతోని రాజినామ ఇచ్చిన ఎమ్మెల్యేలు పెద్ద ఆదాలత్కు బోయిండ్రు. ఏ సంగతి ఒక్క దినంల జెప్పుండ్రి అని అదాలత్ అన్నది. గని రాజినామలను సక్కగ జూసుడే గాకుండ ఎమ్మెల్యేలతోని మాట్లాడాలని స్పీకర్ అన్నడు. దిగు దిగు నాగా దివ్య సుందరి నాగా అని యెడ్యూరప్ప పాడబట్టిండు. దిగను దిగను అస్సల్ దిగను అని కుమారస్వామి అన బట్టిండు.''
ఇంతల తెల్లారింది.
''వొస్త సామీ'' అనుకుంట నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
తోక: మా పటాల చౌరస్తల ఉన్న పాన్ డబ్బ కాడ్కి బోయిన. గాడ మా దోస్తులు పాన్లు దినుకుంట ముచ్చట బెడ్తున్నరు.
''వరల్డ్ కప్ సెమీ ఫైనల్ల మనోల్లు ఓడిపోయిన ఇంత దాంక ఎవ్వరితోని శాతగాని రికార్డ్ బిటాయించిండ్రు'' అని యాద్గిరి అన్నడు.''
''ఏందా రికార్డ్'' అనిసత్నాది అన్నడు.
''రోహిత్; రాహుల్; కోహ్లీ వరుసగ ఒక్కటే పరుగు జేసి పెవిలియన్కు బోయిండ్రు. వన్డే కిరికిట్ మ్యాచ్ల టాప్ ముగ్గురు ఆటగాల్లు గిట్ల ఔటవుడు గిదే ఫస్టు సారి'' అని యాద్గిరి జెప్పిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491