Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షం లేని శాసనసభగా మారింది. తిరుగులేని మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలో ఉండగా, కాంగ్రెసు చతికిలబడింది. దాదాపు నడ్డివిరిగి కుప్పకూలినంత పనైంది. ప్రధాన నాయకులు మినహా ఉన్న కొద్దిపాటి శాసనసభ్యులను టీఆర్ఎస్ కలిపేసుకున్నది. దేశాన్నీ, రాష్ట్రాన్నీ సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెసు, ఈ స్థితిని ఊహించి ఉండదు. దాని ప్రజావ్యతిరేక విధానాలు, అవకాశవాద ధోరణులే ఈ స్థితికి నెట్టాయి. ఇప్పుడీ శూన్యాన్ని పూరించేదెవరు? ప్రజాఉద్యమాలతో ప్రజలపక్షం రూపొందనున్నదా? లేక బీజేపీ పావులు కదుపుతున్నట్టుగా అడుగులు పడనున్నాయా?
నిజానికి క్షేత్రస్థాయిలో బీజేపీకి ప్రజాపునాది పరిమితమే. గత ఐదేండ్లలో ప్రజా సమస్యల మీద పనిచేసిందీ లేదు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకత్వాల మధ్య లాలూచీ కుస్తీ నడిచింది. అయినా... రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కాబోతున్నదని హౌంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మరో అడుగు ముందుకేసారు. రెండేండ్లలో తెలంగాణలో మళ్ళీ ఎన్నికలొస్తాయన్నారు. ఏపీలో బీజేపీకి ఒక్కసీటు కూడా లేదు. పైగా ఎక్కువ కాలం గత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. తెలంగాణలో బీజేపీకి ఒకే ఒక్క శాసనసభ్యుడున్నాడు. ప్రజా సమస్యలపైన పనిచేసి ప్రజల హృదయాలు చూరగొనటం ద్వారా ఐదేండ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తామే వస్తామని చెప్పుకోవచ్చు. అందుకు వారు ప్రయత్నించనూ వచ్చు. కానీ, ప్రస్తుతం ఉన్న శాసనసభలలోనే తాము ప్రధాన ప్రతిపక్షం కాబోతున్నా మంటున్నారు. ఇక్కడ ఎన్నికలొస్తా యంటున్నారు. ఎట్లా సాధ్యం? రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్య యుతంగా ఆలోచిస్తే అది సాధ్యం కాదు. దీనిమీద స్పందించిన మరో బీజేపీ నేత రఘురామ్ మాత్రం.. ''చూస్తూ ఉండండి. వారే వస్తారు'' అంటున్నారు. అంటే అర్థం ఏమిటి?
శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఉన్న స్థానాలు సైతం కోల్పోయింది. పార్లమెంటు ఎన్నికలతో దానికి ఆశలు మళ్ళీ చిగురించాయి. గత ఐదేండ్ల మోడీ పాలన ఫలితాలు ఎన్నికల్లో ఎజెండా కాకుండా చూడటంలో బీజేపీ సఫలమైంది. భావోద్వేగాలు ముందుకు తెచ్చి మెజారిటీ సాధించగల్గింది. ఆ ప్రభావానికి తోడు, రాష్ట్రంలో గెలిచిన నాలుగు స్థానాల్లోనూ అనేక స్థానిక అంశాలు తోడైనాయి. ప్రత్యేక పరిస్థితులలో వచ్చిన తాత్కాలిక ఫలితమిది. దీనిని ఉపయోగించుకుని ముందుకు సాగాలని బీజేపీ ప్రయత్నం. అదీ దొడ్డిదారిలో అందలమెక్కాలన్న తాపత్రయం. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆశీర్వాదాలు అందే అవకాశాలు కనుమరుగైనాయి. అందుకే అడ్డదారుల్ని ఆశ్రయించింది.
అన్నివైపులా కమ్ముకొచ్చే విధంగా బీజేపీ పథకరచన చేసింది. ఇక నుంచి టీఆర్ఎస్ పాలన మీద దూకుడుగా సాగాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ పాలనను ఎండగట్టేందుకు, నాయకత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదలుచుకోలేదు. ఐదేండ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కాళ్ళూ చేతులూ కట్టేసిన కేంద్ర నాయకత్వం ఇప్పుడు కట్లు విప్పేసింది. తొలి చర్యగా మీడియాలో టీఆర్ఎస్ నాయకత్వం మీద విరుచుకుపడటం మొదలైంది. ఐదేండ్ల పాలన మీద వస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో, మీడియాలో టీఆర్ఎస్ నాయకత్వం అధికార ప్రతినిధులను ఉపసంహరించుకున్నది. ఇదే అవకాశంగా బీజేపీ రాజకీయ దాడి పెంచింది. మరోవైపు శాసనసభ ఎన్నికలకు ముందే, లాలూచీ కుస్తీ కాలంలోనే 'ఆపరేషన్ ఆకర్ష్'కు బీజేపీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ నాయకులను కలుపుకోవటం మొదలుపెట్టింది. ప్రస్తుతానికి పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ నేతలలో ఒక్కరు మినహా ఇతరులకు పెద్దగా ప్రజా పునాది లేదు. అయినా తెరవెనుక ప్రయత్నాలన్నీ నడుస్తూనే ఉన్నాయి. నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల నుంచి కొంత ప్రజాపునాది గల నేతలే చేరబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంకా అనేకమంది టచ్లో ఉన్నారని ఫీలర్స్ వదులుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల నుంచి ఆకర్షించడానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలో కుల సంఘాలను సమీకరించే ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నది. ఈ మధ్యనే కేంద్ర బీసీ కమిషన్ నేతలు రాష్ట్రాన్ని పర్యటించారు. బీసీ, ఎంబీసీ కుల సంఘాల నాయకులతో రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. కానీ కమిషన్ సభ్యులెవరూ బీసీ కమిషన్ ప్రతినిధులుగా మాట్లాడలేదు. బీజేపీ నాయకులుగానే మాట్లాడారు. నిన్నటి దాకా సామాజిక న్యాయం గురించి మాట్లాడిన నాయకులే ఇప్పుడు బీజేపీ పంచన చేరుతుండటమే ఇక్కడ గమనించవల్సిన విషయం. ఆ వేదికమీద ప్రభుత్వాధి కారులు కూడా లేరు. సమీకరించింది బీసీ కమిషన్ పేరుమీద. కథ నడిపిందంతా బీజేపీ నేతలుగానే.. బీజేపీ ప్రభుత్వం ప్రతినిధులుగానే! ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కుల సమీకరణలతో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే దిశలో పావులు కదుపుతున్నది. దానిలో భాగమే కేంద్ర బీసీ కమిషన్ పర్యటన. బీజేపీ ప్రయోగించే మరో ఆయుధం భావోద్వేగాలు రెచ్చగొట్టటం. రకరకాల సంఘాల పేరుతో సంఘ పరివారమే ఈ పనిచేస్తుంది. బీజేపీ చేతికి మట్టి అంటకుండానే ఈ పని కానిస్తుంది. నాలుగైదేండ్లకు ముందు, తెలంగాణలో హనుమాన్ జయంతి ప్రజలు జరుపుకోవటం పెద్దగా ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ ప్రజల పండుగల్లో దసరా, బతుకమ్మ, దీపావళి, బోనాలు వంటివి చాలా కాలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సంఫ్ుపరివారం ఒక పథకం ప్రకారం హనుమాన్ జయంతి పేరుతో యువతను సమీకరించే ప్రయత్నం చేస్తున్నది. ప్రదర్శనల పేరుతో సున్నిత ప్రాంతాలలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నది. ఇలాంటివే అనేకం పండుగల పేరుతో మతపరమైన భావోద్వేగాలకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్లో విలీనమైన సందర్భాన్ని విమోచన దినోత్సవం పేరుతో మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. రానున్న కాలంలో మతపరమైన విభజన సృష్టించి హిందువుల ఓటుబ్యాంకు సృష్టించుకునేందుకు చేయగల్గిందంతా చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నది. ఇది ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం దెబ్బతినడానికీ, జన జీవనంలో అశాంతి పెరగడానికీ దారితీయొచ్చు. ఓట్ల కోసం మత భావాలను వాడుకోవటం ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉన్నది. వీటన్నింటితో పాటు మీడియాను కంట్రోలు చేసే ప్రయత్నాలు మొదలైనాయి. ప్రస్తుతం మీడియా అంతా రాష్ట్ర పాలకుల చేతుల్లోనే ఉన్నదని వీరి అంచనా. ఇప్పటికే ఒక పత్రికనూ, రెండు టీవీ చానళ్ళనూ తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మీడియాలో కూడా దూకుడు ప్రదర్శించగల్గిన సీనియర్ పాత్రికేయులతో కూడా మంతనాలు సాగుతున్నాయని వార్తలొస్తున్నాయి.
ఇవన్నీ ఒక భాగం. టీఆర్ఎస్ నుంచి మాత్రం శాసనసభ్యులు ప్రస్తుతం ఎవ్వరూ బీజేపీ వైపు చూస్తున్నట్టు లేదు. రాష్ట్రంలోని అధికారపక్షాన్ని వదలి బీజేపీ వైపు రావటం వల్ల ఒరిగేదేముంటుందన్న లెక్కలు వేసుకుంటూ ఉండవచ్చు. బీజేపీకి కూడా అధికార పక్షం నుంచి ఐదుగురో, పదిమందో రావటం వల్ల ఒరిగేదేమీ లేదు కదా! అందుకే మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అంటే.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యంతోనే పథకరచన సాగుతున్నదన్న మాట. టీఆర్ఎస్ శ్రేణుల్లో, ముఖ్యంగా మంత్రులూ, శాసనసభ్యులలో గూడుకట్టుకున్న అసంతృప్తినే అవకాశంగా తీసుకునే ప్రయత్నంలో బీజేపీ నేతలున్నారన్న విషయంలో సందేహం లేదు. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో చీలిక కోసం ఎదురుచూస్తున్నారన్న మాట. చిచ్చు పెట్టేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలబోదన్న మాట!
మోడీ రెండవసారి అధికారంలోకి రాగానే, ఇందుకనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కిషన్రెడ్డిని హౌంశాఖ సహాయ మంత్రిగా నియమించటం ఈ దిశలో జరిగిన తొలిచర్య. ఆయన కూడా మంత్రి కాగానే హైదరాబాద్ టెర్రరిస్టు హబ్గా మారిందని ప్రకటన చేసారు. పార్లమెంట్లో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకార సమయంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన బీజేపీ నేతలతో 'జైశ్రీరాం' అని నినాదాలు కూడా కిషన్రెడ్డి ప్రోత్సహంతోనే ఇచ్చారని వార్తలు వచ్చాయి. మొత్తం మీద కేంద్రంలో అధికారాన్నీ, పెద్దఎత్తున తమ దగ్గర పోగైన వనరులనూ ఉపయోగించుకుని రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం తమకనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నంలో బీజేపీ బీజీగా ఉన్నది. రాష్ట్రంలో ఇటీవల టీఆర్ఎస్ అనుకూల వ్యాపార సామ్రాజ్యాధినేత ఆస్తుల మీద కేంద్ర ప్రభుత్వ అధికారుల తనిఖీలను కూడా ఈనేపథ్యంలోనే చూడాలేమో!
గత ఐదేండ్లుగా టీఆర్ఎస్ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలే పార్టీ లోపలా, వెలుపలా వ్యక్తమవుతున్న లుకలుకలకు పునాది. ఓట్ల పథకాలు తప్ప ఇతర ప్రజా సమస్యలను విస్మరించారు. పార్టీలో, పాలనలో అప్రజాస్వామిక విధానాలు ఏకపక్ష ధోరణులూ అసంతృప్తులకు దారితీస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను కలిపేసుకోవటం ద్వారా విలువలకు తిలోదకాలిచ్చారు. అశాస్త్రీయ భావాలు, మూఢ విశ్వాసాలు పాలకులే ప్రోత్సహిస్తున్నారు. రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని విస్మరించారు. లౌకిక విలువల పట్ల అవకాశవాద ధోరణి ప్రదర్శించారు. కీలకమైన అన్ని ప్రజావ్యతిరేక విధానాలలోను కేంద్ర బీజేపీ పాలకుల చర్యలకు మద్దతునిచ్చారు. బీజేపీ, సంఫ్ుపరివార్ మతోన్మాద చర్యలనెప్పుడూ ఖండించలేదు. కులవివక్షనూ కులదురహంకార దాడులనూ ఖండించలేదు. ఒకవైపు ఎంఐఎంతో అనైతిక పొత్తు సాగిస్తూ మరోవైపు కేంద్రంలో బీజేపీతో లాలూచీ కుస్తీ నడిపారు. కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీలో చేరకుండా, తానే ముందుగా గాలం వేసి కలిపేసుకున్నాడని కొందరి వాదన. కానీ.. ఒకసారి విలువలకు తిలోదకాలు ఇచ్చి కలుపుకున్న తర్వాత, ఇదే ప్రయోగం టీఆర్ఎస్ మీద బీజేపీ చేస్తే ఏమని ప్రశ్నించగలరు? ఇప్పుడు బీజేపీ కదలికలన్నీ ఆవైపు చూపిస్తున్నాయి కదా!
దక్షిణ భారతదేశంలో బలపడాలని బీజేపీ భావించింది. కానీ గత ఎన్నికల్లో ఆ కల చెదిరింది. అప్పటికే పునాదులున్న కర్నాటకలో మినహా ఎక్కడా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు తెలంగాణ మీద మరో ప్రయత్నం చేయబో తున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజావ్యతిరేక విధానాలు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. లౌకికవిధానాల కోసం కచ్చితంగా నిలబడే నిబద్ధత లేదు. అవకాశవాదానికి పరాకాష్ట కాంగ్రెస్. పదవీ దాహం, సంపాదన మార్గాల వేట, తమ బలహీనతల మీద కేంద్రం నొక్కుతుందేమోనన్న భయం కలగలిసి కాంగ్రెస్ నేతలను బీజేపీబాట పట్టిస్తున్నది. బీజేపీ నీతిసూత్రాలను పక్కనబెట్టింది. కాంగ్రెస్ చెప్పుల్లో కాళ్ళు దూర్చింది. విలువలకు తిలోదకాలివ్వటంలో కాంగ్రెస్ను తలదన్నింది. ప్రతిపక్ష నేతల చట్ట విరుద్ధ చర్యల చిట్టాగుప్పిట్లో పెట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వ అధికారులతో దాడులు చేయించటం, బ్లాక్మెయిల్ చేసి లొంగదీసు కోవటం విధానంగా మల్చుకున్నది. ఏపీలో టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్లను దారిలోకి తెచ్చుకున్న తీరు తెలుగు ప్రజలందరూ గమనించారు కదా! అధికారం, వనరులూ ఉన్న తర్వాత రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవేముంది?
రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్షం లేకుండా చేసింది టీఆర్ఎస్ నాయకత్వం. కానీ ప్రజలలో ప్రశ్నించే తత్వం లేకుండా చేయజాలదు కదా! అందుకే ఇప్పుడు ప్రజలే ప్రతిపక్షం. ఈ ప్రజలనూ ప్రజా ప్రయోజనాలనూ వదిలిపెట్టి, అధికారం, ధనబలంతో అడ్డదారిలో ఎదగాలని ఎత్తుగడలు వేస్తున్నది బీజేపీ. ప్రజలే ఊపిరిగా, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే వామపక్షాలకు ఇది పరీక్ష. వామపక్షాలు ఏమేరకు ప్రజలతో మమేకమైతే, ఏ మేరకు ప్రజా ఉద్యమాలను చేపడితే ఆమేరకు ప్రజల విశ్వాసం పొందగలవు. ఏమేరకు సొంత పునాది పెంచుకుంటే, ఆ మేరకు రాజకీయ రంగంలో ఫలితాలు సాధించగలవు.
- ఎస్. వీరయ్య