Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూకదాడుల నుంచి మన దేశాన్ని ఎలా రక్షించుకోగలం? ఇవి మనదేశ అస్తిత్వానికి, సంస్కృతికీ మచ్చే. ఈ మూక దాడులు ఇంకా పెరిగితే దేశం ముక్కలవుతుంది. వెక్కిరింపుల పాలవుతుంది. ఈ దాడులు చేస్తున్న వారికి ఒక లక్ష్యం ఉంది. దేశాన్ని హిందూదేశంగా మార్చటం. మూకదాడులకు ఓ పార్టీ ప్రోత్సాహమున్నది. ఓ ప్రభుత్వం అండదండలున్నాయి. మరి ఈ దేశాన్ని ఎలా రక్షించుకోగలం? ఈ దాడులు ఎలా అరికట్టగలం?
కొన్నేండ్లుగా ప్రతి విషయానికి.. ప్రతిసమస్యకు, ప్రతి ఆపదకు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాం... ప్రభుత్వమే చర్య తీసుకోవాలని ఒక ప్రకటన పారేసి నిశ్శబ్దంగా ఊరుకుంటున్నాం. ప్రభుత్వమే అదుపుచేయాలి. ఇది మన బలమైన వాదనగా మారింది. ఈ బలమైన వాదన వెనుక మన బలహీనత ఉంది. కానీ ఈ దేశంలోని శ్రామికులు ఇటువంటి తప్పులు చేసేవారు కాదు. సామాన్య జనానికి అంత తీరికలేదు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు మూకదాడులుగా మారిపోరు. ఒక భావజాలానికి చెందిన రాజకీయ కార్యకర్తలు, రాజకీయ అండదండలున్నవారు మూకదాడులు చేస్తున్నారు. ప్రభుత్వలక్ష్యం, మూకదాడుల లక్ష్యం ఒకటే అయినప్పుడు.. మూకదాడుల కర్తలు ప్రభుత్వమే తమదని భావిస్తారు. ఒక దిక్కు ప్రభుత్వమే తమదని వారు భావిస్తున్నారు. మూకదాడులు జరిగినప్పుడల్లా ప్రభుత్వం అరికట్టాలని, వారిపై చట్టపర చర్యలు తీసుకొమ్మని, మనం డిమాండ్ చేస్తున్నాం..!.
మూక దాడులను ప్రభుత్వం అరికడుతుందని నమ్మటం లేదు. ఎంత దుర్మార్గుడైనా తన బిడ్డను తల్లి చంపుకోదు. తల్లిదారిలోనే కొడుకు నడుస్తున్నప్పుడు.. తల్లి కొడుకును రక్షించుకుంటుందే తప్ప వదులుకోదు. కొడుకు దుర్మార్గాలపై చర్య తీసుకోదు. తల్లియే సర్వస్వమైనప్పుడు ముద్దాయి ప్రాసిక్యూషన్, లాయర్, న్యాయమూర్తి అన్నీ అయినప్పుడు.. ఇంకేముంది... కొడుకు అన్ని విధాల రక్షణ పొందుతాడు. మూకదాడుల విషయమూ అంతే.. మూకదాడులను మోడీ సర్కారు అరికడుతుందని, మూకదాడుల కర్తలను శిక్షిస్తుందనీ ఆశపడటం తప్పు.
మన దృష్టిలో మూకదాడులు చేసే వారు క్రిమినల్స్... ఏలినవారి దృష్టిలో వారు జాతీయవాదులు, హిందూ దేశ సంరక్షకులు హిందూ భావజాల వ్యాపకులు సర్కారు దృష్టిలో కానీ సర్కారును నడిపిస్తున్న పార్టీ దృష్టిలో కానీ వారు క్రిమినల్స్ కాదు. మూకదాడి చేసి ఒక ఆటోడ్రైవర్తో జైశ్రీరామ్ అనిపించినా.. మూకదాడి చేసి జార్ఖండ్లో 24ఏండ్ల యువకున్ని చావబాది జైశ్రీరామ్ అనిపించినా.. అది వారికి జాతీయవాదమే..! ఇటువంటి వెన్నో జరుగుతున్నాయి. గోవు మాంసం అమ్ముతు న్నారని, తింటున్నారని, గోవులను చంపుతున్నారని ఇలా రకరకాల కారణాలతో మైనారిటీలపై, దళితులపై మూకదాడులు జరుగుతున్నాయి. ఎందరి బతుకులో బలి అయ్యాయి. ఈ మూకదాడులు మోడీ ప్రధాని అయినతర్వాతే విపరీతంగా పెరిగాయి. మోడీ ఐదేండ్ల కాలంలో 255 దాడులు జరిగినట్టు ఓ లెక్క...
జార్ఖండ్లో అన్సారీపై జరిగిన మూకదాడిలో ఆయన చనిపోయాడు. మూకదాడి ఎందుకు జరిగింది. ఆయనతో జైశ్రీరామ్ అనిపించటానికి ఎన్నికల తర్వాత కొత్తగా జరిగిన మూకదాడి ఇది. దీనిమీద ప్రధాని మోడీ స్పందించటం లేదని ప్రతిపక్షాలు గోలచేస్తే ప్రధాని ఖండించారు. వారి ఖండన మూలంగా మూకదాడులు తగ్గితే మంచిదే! హిందూభావమూక దాడులు తగ్గితే మంచిదే! హిందూ భావజాల వ్యాప్తిలో ఆయన ఒక సైనికుడే తప్ప సారధి కాదు. ఎలా తగ్గుతాయి? ప్రభుత్వాధినేతగా ఖండించారు అంతే తప్ప వేరేకాదు. చట్టపరమైన చర్యలుంటాయన్నారు. మంచిదే! చట్టం తన పని తాను చేయాలని అన్నారు. గొప్పదే! చట్టం ఏమి చెప్పిందీ? మూకదాడుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రధానికి తెలియవా? ''లౌకిక విలువలు, విభిన్న సాంప్రదాయాలను, శాంతి భద్రతలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే'' అని చెప్పింది కోర్టు. మోడీ వీటి జోలికి పోలేదు. ''మూక హత్య బాధాకరం'' అన్నారు. కానీ ఇందులో ప్రాథమిక హక్కుల హత్య ఉంది. భారత సంస్కృతి హత్య ఉంది. ఈ దాడులన్నీ భారత రాజ్యాంగంపై జరుగుతున్న మూకదాడులు..
కానీ మన ప్రాథమిక హక్కులు హత్యకు గురి అవుతున్నాయి. ఎవరితోనైనా జైశ్రీరామ్ అని బలవంతంగా అనిపించటం ఆయన ప్రాథమిక హక్కులను ధ్వంసం చేయటం కాదా? మతం, భక్తి, వ్యక్తి స్వంత విషయాలు. జైశ్రీరాం అని బలవంతంగా ఎలా అనిపించగలరు? దేశంలోని ప్రజలకు వాళ్ళ స్వంత దేవుళ్లున్నారు. వెంకన్న, సాయిబాబా, అయ్యప్ప, మల్లమ్మ, ఎల్లమ్మ, అల్లా, జీసస్ ఇలా దేవుళ్లున్నారు. ఎవరి సెంటిమెంట్ వారిది? బలవంతం చేసే హక్కు ఎవరికుంది? మతం మార్చుకొమ్మనే హక్కు, బలవంతం చేసే హక్కు అందు కోసం మూక దాడులు చేయటం చట్టాన్ని ధిక్కరించటమే. రాజ్యాంగాన్ని అగౌరవం చేయటమే. ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేయటమే. సెంటిమెంట్ ఉచ్చులో మూకదాడులు పెరిగే ప్రమాదముంది. ప్రజాస్వామ్య వాదులు లౌకికవాదులు ఏకం కావల్సిన అవసరం ఉంది.
- సిహెచ్. మధు
సెల్: 9949486122