Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంట్ సమావేశాలపై మోడీ 2.0 ప్రభుత్వం తన ముద్ర వేస్తోంది. 130 కోట్ల ప్రజల జీవితాలను ముప్పేట కష్టాల్లోకి నెట్టే చట్టాల ఆమోదానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రజాతంత్ర హక్కులను ఖైదు చేయటానికి ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం గమనిస్తే రానున్న కాలం ఇంకెంత ఘోరంగా ఉండబోతోందో అన్న ఆందోళన కలుగుతోంది. సాధారణంగా ప్రభుత్వం చట్టాలు ప్రతిపాదించే టప్పుడు కనీస పార్లమెంటరీ సాంప్రదాయాన్ని పాటించాలి. ముసాయిదా బిల్లులు సభ్యులకు అందచేయాలి. సదరు చట్టాలపై స్థాయీ సంఘంలో లోతైన చర్చ జరపాలి. ప్రజాభిప్రాయం స్వీకరించాలి. తర్వాతే తుది రూపునిచ్చి సభలో ప్రవేశపెట్టాలి. కానీ మందబలం మెండుగా ఉన్న బీజేపీకి ఇవన్నీ కాలయాపన అనిపించి నట్టుంది. గడచిన ఐదేండ్లల్లో వాయిదా వేసిన బిల్లులను ఆగమేఘాల మీద ఆమోదించుకో చూస్తోంది. ప్రజలకు ముప్పేట కష్టాలు తెచ్చిపెట్టే ఆ మూడు చట్టాల గురించి తెలుసుకుందాం.
మొదటిది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ బిల్లు. 2019 జూలై 9న లోక్సభలో ప్రవేశపెట్టారు. 1967నాటి ఈ చట్టానికి ప్రభుత్వం మూడు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టింది. ప్రభుత్వం లేదా దర్యాప్తు సంస్థలు ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా ముద్రవేసే అధికారాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు కావల్సిన సవరణ మొదటిది. ఇప్పటి వరకు ఏ దైశంలోనైనా సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు చట్టాలు ఉన్నాయి. కానీ తాజా సవరణ ప్రకారం ఎవరు ఏ సంస్థతో అనుబంధంగా ఉన్నారు, క్రియా శీలకంగా ఉన్నారు, ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నారు అన్నదాంతో నిమిత్తం లేకుండా ఏ వ్యక్తిపైనైనా ప్రభుత్వం ఉగ్రవాది ముద్ర వెయ్యొచ్చు. ఫలానా వ్యక్తి సంపాదన ఉగ్రవాద మార్గాల ద్వారా వచ్చిందని భావిస్తే దాన్ని వెనువెంటనే స్వాధీనం చేసుకోవటానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్కు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టే సవరణ రెండోది. ఇటువంటి అధికారం ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లోని డీజీపీకి మాత్రమే ఉంటుంది. ఈ సవరణ శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తుంగలో తొక్కనుంది. అయినా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలు ఎవ్వరూ ఈ ప్రమాదాన్ని గుర్తించకపోవటం మునుమ్నుందు పొంచి ఉన్న ప్రమాదాన్ని హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకు ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేసే అధికారం జాతీయ దర్యాప్తు సంస్థలో డిప్యూటీ సూపరిండెంట్ లేదా అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలోని అధికారులు మాత్రమే దర్యాప్తు చేసే అధికారం కలిగి ఉన్నారు. కానీ దీన్ని సవరించి ఇనస్పెక్టర్ స్థాయి అధికారులు దర్యాప్తు చేయాలన్నది మూడో సవరణ.
ఉగ్రవాద కార్యకలాపాలు నియంత్రించ టానికి ఈ సవరణలు ఉపయోపగపడతా యన్న వాదన లోతుపాతులు అర్థం చేసుకోవాలంటే ఇప్పటివరకు ఈ చట్టం ఏ విధంగా పనిచేసిందో తెలుసుకోవటం అవసరం. ఇప్పటి వరకు ఈ చట్టం కింద అరెస్టయిన ముద్దాయిల్లో 68శాతం మంది కోర్టుల్లో నిర్దోషులుగా బయటకొచ్చారు. ఇప్పటికే ఈ చట్టం ప్రజాతంత్ర హక్కులను హరించేదిగా ఉంది. ఈ చట్టం కింద అరెస్టయిన వారిని బెయిల్ ఇవ్వకుండా ఎంతకాలమైనా జైల్లో ఉంచవచ్చు. అలాంటి చట్టాన్ని మరింత కఠినతరంగా మార్చాలన్నది బీజేపీ ప్రయత్నం. భారతీయ నేర శిక్షాస్మృతి ప్రకారం నేరాన్ని లేదా ఆరోపణను రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ తాను ఉగ్రవాదిని కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరుడిపై ఉంటుంది. రాజ్యాంగం ఎన్ని హక్కులిచ్చినా వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యక్తి నిలవగలుగు తాడా? లేదు. అలాంటి స్థితిలో ఈ సవరణలు చట్టంలోని విచక్షణాధికారాలను మరింత విస్తృతపర్చేవిగా మారటం సాధారణ పౌరులకు సైతం ప్రమాదకరంగా మారనుంది.
ఈ సమావేశాల్లో ప్రజల డీఎన్ఏ వివరాలు వినియోగించే చట్టం. అంటే వ్యక్తుల శరీర భాగాలను వైద్య పరీక్షలకు పంపి ఈ పరీక్షల్లో వచ్చిన జన్యు, అనువంశిక వివరాలను సేకరించి వాటన్నింటినీ భద్రం చేయటానికి జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ డేటా బ్యాంకులు ఏర్పాటు చేయటం వాటికి అప్పగించటం ఈ బిల్లు లక్ష్యం. జూలై 8న లోక్సభలో ప్రవేశపెట్టారు. డేటా బ్యాంకులు ఎలా (దుర్) వినియోగం అవుతాయో తెలుసుకోవటానికి ఈ మధ్యనే ముగిసిన శాసనసభ లోక్సభ ఎన్నికలు తాజా ఉదాహరణ. నేరాలు నియంత్రించేందుకు ఈ బిల్లు అవసరం అన్నది ముక్తాయింపు. ఈ బిల్లుతో ఉన్న ప్రమాదాలేమిటి?
ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం ఇది నాల్గోసారి. ఎన్నికలకు ఓ సంవత్సరం ముందు మూడోసారి ప్రవేశపెట్టారు. ఈ మూడు సార్లు బిల్లుతో ఉన్న ముప్పు గురించి వచ్చిన ఆందోళనల కారణంగానే ఈ బిల్లును పదే పదే పెండింగ్లో పెట్టారు. ఈ బిల్లు ఆమోదిస్తే ఇప్పటికే ఉన్న ఆధార్ ముప్పుతో కలిసి ఇక ప్రజలకు వ్యక్తిగతం అన్నది మిగలకుండా పోతుంది. ఉదాహరణకు రెండ్రోజుల క్రితం ఓ బ్యాంకు ఖాతా వివరాలు ఓ మిత్రుడికి మొబైల్ మెస్సేజ్ ద్వారా పంపాను. వెంటనే మొబైల్లో మరో మెస్సేజ్ వచ్చింది. మీరు ఫలానా సాఫ్ట్వేర్ ద్వారా మీ బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్నది సారాంశం. దీన్నిబట్టి మనకు అర్థమవుతుందేమిటి? మనం ఏమి ఆలోచిస్తున్నామో ఏమి చేయబోతున్నామో ముందుగా ఈ యంత్రాలు కనిపెట్టి మన జీవితాలను తమ చేతుల్లోకి తీసుకుంటాయి. ఇక ఈ డీఎన్ఏ చట్టం కూడా వస్తే మనం ఏ టానిక్, మాత్ర కొనుక్కున్నా ఫలానా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోండి అన్న చిట్టి సందేశాలు వచ్చి వాల్తాయి. దీనికి తగ్గట్టుగానే ఏ చిన్న మందు బిళ్ల కొనుక్కున్నా బిల్లు అడిగితే మన ఫోన్ నంబరు అడుగుతున్నారు. షాపు దాటి బయటకు రాకముందే నాలుగైదు ఆసుపత్రుల నుంచి ఓ నాలుగు కాల్ సెంటర్ల నుంచి ఫోన్లు మెస్సేజ్లతో ఫోన్లు హాంగ్ అవటం ఖాయం.
ఇక మూడో చట్టం ఆధార్, ఇతర చట్టాల సవరణ బిల్లు. జూలై 4న లోక్సభలో ఆమోదం పొందింది. 9న రాజ్యసభకి వచ్చింది. ఆధార్కార్డుతో పాటు పౌరుల వద్ద సేకరించిన వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ సవరణలు ప్రతిపాదిస్తున్నామన్నది ప్రభుత్వ వాదన. ఇప్పటికే ఫిబ్రవరిలో వచ్చిన ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేయాలి. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన మరునాడే ఆధార్కార్డు వినియోగం అనివార్యం చేస్తూ ప్రభుత్వం సవరణ ప్రతిపాదించ నున్నదని నాటి న్యాయశాఖ మంత్రి రవిశంర్ ప్రసాద్ ప్రకటించారు. తాజా బడ్జెట్లో ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేయటానికి పాన్కార్డుకు బదులు ఆధార్కార్డు కూడా వాడొచ్చని ఆర్ధిక మంత్రి లోక్సభలో ప్రకటించారు. తద్వారా ఆధార్కార్డు వినియోగాన్ని నియంత్రించేందుకు వినియోగం పరిధి కుదించేందుకు సుప్రీం కోర్టు ఆదేశిస్తే దీనికి భిన్నంగా ఈ వినియోగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంతేకాదు. ఆధార్ వివరాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధికారులకు అందచేయాలన్న సవరణ కూడా (సుప్రీం కోర్టు ఆదేశానికి భిన్నంగా) ఉంది.
ఈ సవరణలు ఎవరికోసం? మొబైల్ నంబరు - ఆధార్ నంబరు- బ్యాంకు ఖాతాలను జోడించటం ద్వారా మొత్తం ప్రజల ఆర్థిక వివరాలు, దైనందిన జీవిత వివరాలు మార్కెట్ కంపెనీలకు ఎరగా వేయటానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. తాజాగా వాహన యజమానుల వివరాలు అమ్మటం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 35 కోట్ల ఆదాయం వచ్చిందని విన్నాం. ఈ విధంగా జోడించటం స్వచ్ఛందంగా ప్రజలు అంగీకారంతో జరగాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే సదరు ఆదేశాన్ని తుంగలో తొక్కి బిగ్ డేటా కంపెనీల ప్రయోజనాలు కోసం ప్రజాతంత్ర హక్కులకు విఘాతం కలిగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మూడు చట్టాలు ఆమోదం పొందితే ప్రజలకు ముప్పేట కష్టాలు తప్పవు.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037