Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2019-20సంవత్సర బడ్జెట్లో ఇచ్చిన లెక్కలు వాస్తవంలో కనపడటం లేదని ఇప్పటికే స్పష్టమైంది. అందుబాటులో ఉన్నప్పటికీ 2018-19సంవత్సరంలోని వాస్తవ ఆదాయ, వ్యయాలను ఈ బడ్జెట్ దాచిపెట్టింది. ఎందుకంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకూ వాస్తవానికీ చాలా తేడావుంది. 2019-20 సంవత్సర బడ్జెట్ అంచనాలను 2018-19 సంవత్సర బడ్జెట్కు చెందిన సవరించిన అంచనాల ఆధారంగా తయారు చేశారు. అవి తక్కువ స్థాయిలోగల వాస్తవాలను అనుసరించి కాకుండా ఆ సంవత్సర బడ్జెట్ అంచనాలను పోలి వున్నాయి. కాబట్టి రాబోయే సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను పరిగణనలోకి తీసుకోజాలం. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండివుంది.
అయితే బడ్జెట్ లో ఇచ్చిన అంకెలకు అర్థం అంతగా లేకపోయినా దానిలో కొన్ని కలవరపెట్టే ధోరణులున్నాయి. వీటిని మనం దగ్గరగా పరిశీలించాలి. ఇప్పటినుంచి తన అవసరాల కోసం అంతర్జాతీయ మార్కెట్లో అప్పు తీసుకుంటానని ప్రభుత్వం ప్రకటించటం మొదటిది. ఇప్పటిదాకా ఇలా జరగలేదు. అందుకే భారత సార్వభౌమ(ప్రభుత్వ) విదేశీ అప్పు దేశ స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 5శాతమే ఉంది. ప్రపంచంలోని దేశాలన్నింటిలో అతి తక్కువగా అప్పున్న దేశాలలో భారత దేశం ఒకటిగా ఉండటానికి కారణమదే. ఈ పరిమితి ముందు ముందు చేయి జారనుంది.
ప్రభుత్వం అప్పుకోసం విదేశీ మార్కెట్లో వెతకటం వెనుక ఎటువంటి వత్తిడీ లేదు. అది దేశీయ మార్కెట్లో నిధులను సమీకరించలేక కాదు. విత్తలోటు పరిమితిని దాటి వ్యయం చేయటానికి విత్త లోటులో విదేశీ అప్పులను లెక్కలోకి తీసుకోరని అనుకోవటం కూడా కాదు. విదేశీ అప్పులను కూడా దేశీయ అప్పుతో సమానంగా విత్తలోటు గణనలో పరిగణిస్తారు. విదేశీ అప్పు చౌకగా లభిస్తుందని ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వం విదేశాల్లో అప్పు చేయదలచటానికి కారణం వడ్డీరేటులో తేడా అని కూడా చెప్పలేదు.
విదేశీ మారకపు చెల్లింపుల శేషంలో ఏర్పడే లోటును పూడ్చటానికి అవసరమైన విదేశీ ద్రవ్య పెట్టుబడి ప్రవాహాలు దేశంలోకి రాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నదని ఎవరైనా వాదించవచ్చు. తన దేశీయ వ్యయం కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని అప్పుచేసి విదేశీమారక ద్రవ్య నిధిని పెంచుతుందని కూడా వాదించవచ్చు. ఈ వాదన కూడా అర్థం లేనిది. విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల శేషానికి అదనంగా అప్పు తీర్చటానికి విదేశీ మారక ద్రవ్యం అవసరమవుతుందనే వాస్తవాన్ని ఈ వాదన విస్మరిస్తుంది. దేశంలోని పొదుపు నిధులు అందుబాటులో లేనందున ప్రభుత్వం విదేశాలలో అప్పులకోసం ప్రయత్నిస్తున్నదన్న తప్పుడు వాదన ఒకటి ప్రచారంలో ఉంది. ఇది తప్పు. ఎందుకంటే ఒక స్థిరమైన పొదుపు నిధి నుంచి ప్రభుత్వం అప్పుతీసుకోదు. వ్యయం కోసం ప్రభుత్వం అప్పు చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగా కాకుండా వ్యవస్థ పనితీరువల్ల ఆ అప్పు ప్రయివేటు చేతుల్లోకి పోతుంది. ప్రభుత్వం వ్యయం చేస్తూపోతుంటే అదనంగా ఉద్యోగాలు, ఉత్పత్తి, ఆదాయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయాల వల్ల అదనంగా పొదుపు పెరుగుతూ వుంటుంది. ప్రభుత్వం చేయదలచిన అదనపు వ్యయానికి సమానం అయ్యేంతవరకూ ఈ పొదుపు పెరుగుతూనే ఉంటుంది. ఇలా అదనంగా పెరిగిన పొదుపును ప్రభుత్వం తన వ్యయం కోసం అప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం అప్పు చేయటానికి పొదుపు నిధులు అందుబాటులో లేకపోవటమనేది జరగదు. కాబట్టి ప్రభుత్వం అప్పుల కోసం విదేశీ మార్కెట్లను ఆశ్రయించటానికి ఇవేవీ కారణాలు కాదు. ఇప్పటివరకూ అటువంటి అప్పు పెద్దగా లేనందున అది కావాలని చేసిన ఎంపికగానే ఉంది. అయినప్పటికీ ఇదో ప్రమాదకరమైన కార్యాచరణ. ఎందుకంటే దీనితో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనం అనివార్యంగా పెరుగుతుంది.
సాధారణంగా అప్పు చేయదలచిన దేశంలోని ఫైనాన్స్ రంగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా ప్రభుత్వం యాజమాన్యంలోనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకున్న స్వయం ప్రతిపత్తి రాజ్యాధికారం పరిధిలోనే ఉంటుంది. ప్రభుత్వ నియంత్రణలో వున్న దేశీయ ఫైనాన్షియల్ రంగం నుంచి అప్పు చేయటంలో రెండు అంతఃస్సూచనలున్నాయి. మొదటిది, ప్రభుత్వం చేసిన అప్పును సకాలంలో తీర్చజాలని పరిస్థితి ఏర్పడినప్పుడు దేశీయ ఫైనాన్షియల్ రంగం 'మిత వ్యయ' చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బలవంతపెట్టలేదు. రెండవది, రూపాయలలో చేసిన అప్పును ప్రభుత్వం తీర్చలేకపోవటమనేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వానికి పన్నులు విధించే సార్వభౌమాధికారం ఉంటుంది.
కానీ ప్రభుత్వమే గనుక విదేశీ మార్కెట్ల నుంచి అప్పుచేస్తే ఆ అప్పు విదేశీ మారక ద్రవ్య రూపంలో ఉంటుంది. ఒకవేళ విదేశీ మారక ద్రవ్యం కొరత ఏర్పడటమనేదే జరిగితే దేశంలో ఎన్ని పన్నులు విధించినా విదేశీ మారక ద్రవ్యంలో గల అప్పును తీర్చటానికి ఉపయోగపడవు. సరిగ్గా అటువంటి పరిస్థితులలోనే అప్పులిచ్చిన విదేశీ పెట్టుబడిదారులు తమకు తోచిన 'మితవ్యయ చర్యల'ను ప్రభుత్వంపై రుద్దుతారు. ఆహారంపై సబ్సిడీ కోత, సంక్షేమ వ్యయాన్ని తగ్గించటం, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెరుగుదలను వాయిదా వేయటం, ప్రభుత్వ విద్యాలయాలలో శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించటానికి బదులు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించి వ్యయాన్ని తగ్గించిన విధంగా ప్రభుత్వ వ్యయం పరిమాణాన్ని తగ్గించటం వంటి పర్యవసానాలు అలా సూచించబడిన మితవ్యయ చర్యలవల్ల ఉంటాయి. ప్రభుత్వంపై అలా విధించబడిన 'మితవ్యయ' చర్యలతో అప్పులు తీర్చటం జరగలేదనటానికి అనేక ఉదాహరణలున్నాయి. ఈ మధ్యకాలంలో గ్రీస్ను అలాంటి స్పష్టమైన ఉదాహరణగా పేర్కొనవచ్చు.
విదేశాలలో అప్పు చేసినా చేయకపోయినా విదేశీ మారక ద్రవ్యం కొరత ఏర్పడితే ఈ 'మితవ్యయ' చర్యలు ప్రభుత్వంపై ఎటూ మోపబడతాయనే వాదన ముందుకొస్తుంది. అయితే ప్రభుత్వమే అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు దానిపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల నియంత్రణ పెరుగుతుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళ వత్తిడి నుంచి బయటపడటానికి, మారకపు సంక్షోభం తీవ్రత తగ్గటానికి దిగుమతులపై నియంత్రణలను విధించటం వంటి అనేక స్థూల ఆర్థిక శాస్త్ర ప్రత్యామ్నాయ విధానాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి.
క్లుప్తంగా చెప్పాలంటే మరేవిధంగానూ జరగటానికి వీలుకానిది ఈ విధంగా అప్పులిచ్చిన విదేశీ పెట్టుబడిదారుల ప్రత్యక్ష ప్రభావంలోకి ప్రభుత్వం నెట్టబడుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదే జరుగుతుంది. ఇది ఆ తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలన్నింటి చేతులనూ కట్టేస్తుంది. ఒకవేళ కార్మికుల, కర్షకుల మద్దతుగల ప్రభుత్వం అధికారంలోకి వస్తే నయా ఉదారవాద కక్ష్య నుంచి దేశాన్ని బయటపడేసే దమ్ము ఆ ప్రభుత్వానికి ఉంటుందనేది నిజం. అప్పుడు ఆ ప్రభుత్వానికి విదేశీ పెట్టుబడిదారులతో తలపడే సామర్థ్యం ఉంటుంది. అయితే అలాంటి ప్రభుత్వానికైనా విదేశీ రుణ భార వారసత్వం ఎక్కువగావుంటే దానికి కూడా తన లక్ష్యాలను చేరుకోవటం కష్టమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సాధారణంగా నయా ఉదారవాదంతో కుందింపబడే ప్రజాస్వామ్యం, జాతీయ సార్వభౌమత్వం విదేశీ అప్పులతో మరింత కుదింపునకు గురవుతాయి. అయినప్పటికీ నిష్కారణం గా ఎన్డీఏ ప్రభుత్వం దీనినే అనుసరించబోతున్నది.
ఈ బడ్జెట్తో ప్రవేశించిన రెండవ కలవరపెట్టే ధోరణి వనరుల కేంద్రీకరణ. జీఎస్టీ సేకరణలో ఏర్పడిన తరుగు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేసింది. ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం సర్ చార్జీలను, సెస్సులను విధించి ఈ బడ్జెట్లో ఆదాయాన్ని పెంచాలని చూస్తోంది. ఉదాహరణకు రెండుకోట్ల నుంచి ఐదు కోట్లు, ఆపైన ఆదాయంగల అత్యంత సంపన్నులపై ఈ బడ్జెట్లో విధించదలచిన అదనపు పన్ను సర్చార్జీ పెంచటంగా ఉంది. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు. తత్ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు విత్త సంక్షోభాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి రావలసిన ఆదాయం అందుబాటులో ఉండదు.
జీఎస్టీతో కూడా రాష్ట్రాల హక్కులు కుదింపునకు గురయ్యాయి. సరిపడా ఆదాయాన్ని సమకూర్చటంలో దాని వైఫల్యం కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. ఎందుకంటే కేంద్రం లాగా కాకుండా రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోవలసిన అదనపు ఆదాయాన్ని పంచకుండా సమీకరిస్తే రాష్ట్రాల పరిస్థితి మరింతగా దిగజారుతుంది. అలా జరిగినప్పుడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం చూస్తాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగావున్న రాష్ట్రాలకు సహాయంచేసి, రాజకీయంగా అననుకూలంగావున్న రాష్ట్రాలపట్ల వివక్ష చూపుతుంది.
దేశ రాజకీయాలు మితవాద నియంతృత్వం దిశగా పయనిస్తున్న నేటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, వనరులు కుదింపబడటం చిన్న విషయం ఏమీ కాదు. ఈ ధోరణినే ఈ బడ్జెట్ కర్కశంగా ముందుకు తీసుకుపోతోంది.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
- ప్రభాత్ పట్నాయక్
సెల్: 8886396999