Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఆర్థిక వ్యవహారాలను, ప్రభుత్వ విధానాలను ప్రజా దృక్పథం నుంచి పరిశీలించడానికి, విశ్లేషించడానికి అంకితమైన ఈ 'తెలంగాణర్థం' శీర్షిక ఈ వ్యాసంతో వంద వ్యాసాలు పూర్తి చేసుకున్న కీలకమైన మైలురాయి దాటుతున్నది. రెండు వారాల కొకసారి బుధవారంనాడు వెలువడే ఈ శీర్షిక దాదాపు నాలుగున్నర సంవత్సరాల కింద 2015 మార్చి 25న మొదలై తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధానమైన అంశాలన్నిటి మీదా తనదైన పరిశీలనా, విశ్లేషణా, వ్యాఖ్యానమూ, విమర్శా చేసింది. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడుతూ, అదే సమయంలో ఆర్థిక రంగంతో ప్రభావితమయ్యే, ఆర్థికరంగాన్ని ప్రభావితం చేయగల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలెన్నిటినో కూడ ఈ శీర్షిక స్పృశించింది. ఈ వంద వ్యాసాలనూ ఒక్కదగ్గర వరుసగా చదివితే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాజకీయార్థిక చరిత్ర ప్రజల వైపు నుంచి దృశ్యమానమవుతుంది. నిజం చెప్పాలంటే ఎన్నో వనరులున్న ప్రభుత్వమూ, ప్రభుత్వ సంస్థలూ, ప్రభుత్వ సమర్థకులూ కూడా చేయలేని పని ఈ శీర్షిక చేసింది. అసలు వారిలో ఏ ఒక్కరైనా ఇలా తమ విధానాల మీద తామే, పొగడ్తలైనా సరే, ఇంత విరివిగా రాయలేదంటే కూడా అతిశయోక్తి కాదు.
మహా ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం గత ఐదేండ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసే, ప్రజా ప్రయోజనాలను కాలరాసే, రాజకుటుంబానికో, రాజపక్షానికో, రాజాశ్రితులకో మాత్రమే ప్రయోజనం కలిగించే ఎన్నో విధానాలూ పథకాలూ ప్రణాళికలూ రచించి, అమలులోకి తెచ్చింది. అటువంటి విధానాలు కనీసం వారానికొకటైనా ఉండగా, రెండు వారాలకొకసారి మాత్రమే వ్యాఖ్యానించగలిగిన ఈ శీర్షిక ఎప్పుడూ ఇతివృత్తాల కొరతను ఎదుర్కోలేదు. నిజానికి ప్రతి సందర్భంలోనూ నేనంటే నేనంటూ నాలుగైదు సమకాలీన అంశాలు తోసుకొచ్చేవి. ఇవాళ్టికివాళ ఈ వ్యాసం రాసేనాటికి కూడా కనీసం ఐదారు వ్యాఖ్యానించవలసిన, విశ్లేషించవలసిన విషయాలున్నాయి. ఏలిక వాస్తు మూఢనమ్మకాల కోసం పాత చారిత్రక కట్టడాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణం పేరుతో ప్రజాధనం కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నాలు, పోడు భూముల నుంచి ఆదివాసులను వెళ్లగొట్టే దుశ్చర్యలు, ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లు పేరుతో ఉన్నత విద్యను వ్యాపారమయం చేసి, సామాజిక న్యాయ భావనను తొలగించడం, యురేనియం తవ్వకాల పేరుతో నల్లమల సహజారణ్య జీవావరణాన్ని ధ్వంసం చేయడం, నీళ్లను భావోద్వేగ అంశంగా మార్చి చెలరేగుతున్న కాళేశ్వరం ప్రగల్బాలు, నీరయి ప్రవహిస్తూ కాంట్రాక్టర్ల బొక్కసాలకు చేరుతున్న ప్రజాధనం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభాల కోసం తయారవుతున్న లెక్కలేనన్ని ప్రణాళికలు, లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగంలోకి మారుస్తూ భవిష్యత్తు ఆహారభద్రతను దెబ్బతీస్తున్న దురాలోచనలు, కంటికి కనబడని పారిశ్రామికాభివృద్ధి, పెరుగుతున్న నిరుద్యోగ మహమ్మారి... చెప్పాలంటే ఒక్కొక్కటీ ఒక మహా కుంభకోణం. ప్రజావ్యతిరేక మహా స్వార్థ ప్రయోజనం. తరతరాల స్వయం నిర్ణయాధికార, స్వావలంబన, ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఉల్లంఘన.
కానీ ఈ వందో తెలంగాణార్థం సందర్భంగా ఆ తక్షణ అంశాలను వాయిదా వేసి అసలు ఇటువంటి శీర్షిక అవసరం ఏమిటో చెప్పదలచాను. ఇలా కాస్త పక్కకు జరగడానికి ఒక తక్షణ సందర్భం కూడా ఉంది. ఒక ప్రత్యర్థి రాజకీయ పక్షపు విమర్శల గురించి ఆంతరంగికులతో మాట్లాడుతూ, ''ఆర్నెల్లు అరిచి అరిచి అలిసిపోతడు'' అని మహా ఘనత వహించిన ముఖ్యమంత్రివర్యులు అన్నారని పత్రికల్లో వచ్చిన వార్త ఆ సందర్భం.
పత్రికావార్తల ప్రకారం ఆ రాజకీయ పక్షం భారతీయ జనతా పార్టీ అని తెలుస్తున్నది. ఆ రాజకీయ పక్షం, లేదా ఆ రాజకీయ పక్షపు నాయకుడు ఆర్నెల్లు అరిచి అరిచి అలసిపోతారో, అధికారపక్షంతో కలిసే పోతారో, ఆ పక్షానికీ ఈ పక్షానికీ మధ్య ఏ పవిత్ర, అపవిత్ర కూటములు ఏర్పడతాయో భవిష్యత్తు చూపుతుంది గాని, ముఖ్యమంత్రి మాటలు కేవలం ఆ రాజకీయ పక్షం మీద మాత్రమే కాకపోవచ్చు. తన విధానాల మీద విమర్శకులందరినీ ముఖ్యమంత్రి ఈ గాటనే కట్టివేస్తారని గత, వర్తమాన ఉదాహరణలెన్నో ఉన్నాయి.
ఇలా ప్రత్యర్థిని అలసటకు గురిచేసి, యుద్ధరంగాన్ని వీడిపోయేలా చేసే సైనిక వ్యూహాన్ని యుద్ధ భాషలో వార్ ఆఫ్ అట్రిషన్ అంటారు. తాత్సారం ద్వారా ప్రత్యర్థి దగ్గరి ధనబలం, ఆయుధ బలం, మానవశక్తి తరిగిపోయేలా చేసి, వారిని చికాకు పెట్టి, అలసి పోగొట్టి, అలా బలహీనులయి వారంతట వారే యుద్ధం విరమించుకునే పాతకాలపు యుద్ధాల వ్యూహం అది. అరిచి అరిచి అవతలివాళ్లే అలసిపోయి అరవడం మానేస్తారని అనుకుంటున్న ముఖ్యమంత్రి అది తెలిసి వాడారో, తెలియక వాడారో గాని తాను అమలు చేస్తున్న రాజకీయార్థిక విధానాలలో వార్ ఆఫ్ అట్రిషన్ ద్వారా విజయం సాధించాలని భావిస్తున్నట్టున్నారు. అయితే అది దుర్భ్రమ మాత్రమే. ఎందుకంటే వార్ ఆఫ్ అట్రిషన్ సాధ్యమయ్యే, విజయవంతమయ్యే సందర్భం వేరు. గత చరిత్రలో చూస్తే కూడా ఆ వ్యూహం అన్నిసార్లూ విజయం ఏమీ సాధించలేదు.
మన సొంత చరిత్రనే చూస్తే ఎనిమిది నెలల పాటు అమలు చేసిన వార్ ఆఫ్ అట్రిషన్ వ్యూహం చివరికి విజయం సాధించలేదని తెలుస్తుంది. గోల్కొండ ప్రభువు అబుల్ హసన్ కుతుబ్ షా రాజ్యాన్ని ఓడించదలచిన ఔరంగజేబ్ 1687 జనవరిలో గోల్కొండ కోటను ముట్టడించి, చక్రబంధం చేసి, ఎనిమిది నెలల పాటు వార్ ఆఫ్ అట్రిషన్ నడిపాడు. కుతుబ్ షాహీ రాజ్యం ధనం లేక, తిండిలేక, ఆయుధాలు లేక, అలసిపోయి ఓడిపోతుందనుకున్నాడు. కాని అది జరగలేదు. చివరికి ఔరంగ జేబ్కు విజయం సాధించిపెట్టినది ప్రత్యర్థుల అలసట కాదు, కుతుబ్ షాహీల సైనికాధికారి సరందాజ్ ఖాన్ తన ప్రభువుకు ద్రోహం చేసి గోల్కొండ కోటలో ప్రవేశించే మార్గాన్ని ఔరంగ జేబ్కు చెప్పాకనే ఢిల్లీ సైన్యాలకు గోల్కొండ వశమయింది.
ఇక ఆధునిక చరిత్రలోనైతే ఇటీవలి ఈజిప్ట్ - ఇజ్రాయిల్ యుద్ధంలో కూడా వార్ ఆఫ్ అట్రిషన్ ప్రయోగించారు గాని అది విజయానికేమీ దారితీయలేదు. ప్రస్తుత యుద్ధాలలో ప్రత్యర్థిని అలసిపోగొట్టి బలహీనుణ్ని చేయడం కన్న మించిన మరెన్నో నిర్ణాయక శక్తులు ఉనికిలోకి వచ్చాయి. తెలంగాణాధీశులు ఆ మాటలను బీజేపీని ఉద్దేశించి అన్నారనుకుంటే, ఈ సందర్భంలో ప్రత్యర్థి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న శక్తిగా ''ఆర్నెల్లు అరిచి అరిచి అలిసిపోయే'' శక్తి కాదు. సామ దాన భేద దండోపాయాలలో అన్నిరకాలుగా తెలంగాణ ఏలిక కన్న బలసంపన్నమైన శక్తి. ఆ కేంద్రాధికార ప్రతినిధులను అలసిపోగొట్టి ఓడించడం సాధ్యం కాదు. రాష్ట్రంలో అన్ని రకాల భిన్నాభిప్రాయాలనూ, భిన్న రాజకీయ పక్షాలనూ అణచివేసి, నోరెత్తకుండా చేసి, శూన్య వాతావరణం సృష్టించి కేంద్రాధికార జగన్నాథ రథ యాత్రకు మార్గం సుగమం చేసినది స్వయంకృతాపరాధమే గనుక ఇప్పుడు ఆ అరుపులు ఆర్నెల్లలో సమసిపోతాయని భ్రమ పడడమూ కుదరదు.
ఇంతకూ ఆ మాట రాజకీయ ప్రత్యర్థులతో యుద్ధం గురించి కాక, తమ విధానాల విమర్శకుల గురించి అని ఉన్నట్టయితే అది కూడా అమాయకత్వమే అనాలి. ఎందుకంటే ఆయుధాల యుద్ధంలోనైనా ప్రత్యర్థి ఆయుధ, ధన, మానవ శక్తులను అయిపోగొట్టి, అలసిపోగొట్టి, వార్ ఆఫ్ అట్రిషన్లో గెలుపు సాధించడం సాధ్యమేనేమో గాని, ఆలోచనల యుద్ధంలో అది ఎంతమాత్రమూ సాధ్యం కాదు. ఆలోచనల విస్తరణకు, ప్రశ్నల చిగుళ్లు మోసులెత్తడానికి, ధిక్కారపు గాలులు వీయడానికి ఆయుధాలు అవసరం లేదు, ధనప్రాబల్యమూ అవసరం లేదు, సామూహిక శక్తి ఉంటే మంచిదే గాని, అది లేకున్నా వ్యక్తులు ఒంటరిగానైనా ఆలోచనలు వెదజల్లగలరు, ప్రశ్నలు సంధించగలరు, ధిక్కారాన్ని ప్రకటించగలరు. ఆ ఆలోచనలను, ప్రశ్నలను, ధిక్కారాన్ని అరవడంగా, అరిచినవాళ్లు ఆరు నెలల్లో అలసిపోయేవారుగా చిన్నబుచ్చడం ఆత్మ సంతృప్తినివ్వవచ్చు గాని అది చరిత్ర పట్ల అవగాహన లేమికి చిహ్నం.
మళ్లీ మన చరిత్ర దగ్గరికే వస్తే రాజ్య అక్రమాల మీద ప్రశ్నలు ఎక్కు పెట్టిన వారు ఎప్పుడూ అలిసిపోలేదు. మునుం పెట్టిన ఒక వ్యక్తి ఆగిపోయినా ఆ ప్రశ్నల కొడవలి చేబూని మరొక వ్యక్తీ ఇంకొక వ్యక్తీ ఆగకుండా ముందుకే కదిలారు. సర్వంసహాధికారం ఉండిన మహా ఘనత వహించిన నిజాం ప్రభువుల వారే హైదరాబాద్ రాజ్యపు వనరులను విదేశీ సంస్థలకు కట్టబెట్టి చాందా రైలు మార్గం వేయదలచినప్పుడు ఆలోచనల యుద్ధం ప్రారంభించినది ఇద్దరు వ్యక్తులే. వారూ ఒకరు స్వయంగా నిజాం ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి, మరొకరు నిజాం ప్రభుత్వంలో ఉద్యోగి. వారి ఉద్యోగాలు ఊడగొట్టినా, దేశ బహిష్కారం చేసినా వారు అలసి పోలేదు, ప్రశ్నలు ఆగిపోలేదు. అప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినదాకా ఈ నూట యాభై సంవత్సరాల తెలంగాణ చరిత్రలో ప్రజల ప్రయోజనాలే ప్రధానమైనవిగా ఎంచి ప్రభువులతో ఢకొీన్న మహామహులు డజన్ల కొద్దీ ఉన్నారు. వారిలో అంతకంతకూ ఎక్కువగా అరిచిన వాళ్లే తప్ప అలిసిపోయి ఆగిపోయినవాళ్లు లేరు.
అలా ప్రశ్నలు రేకెత్తించినవాళ్లు, ప్రభుత్వ అక్రమాలను నిలదీసినవాళ్లు, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను విశ్లేషించినవాళ్లు, ప్రజల పక్షాన నిజాలు ప్రకటించినవాళ్లు, నిజాలతో ప్రజలను సమీకరించినవాళ్లు ఆంక్షలకూ, నిర్బంధాలకూ, బహిష్కరణలకూ, హత్యలకూ కూడా గురై ఉండవచ్చు. ఎక్కువసార్లు ఓడిపోయి కూడా ఉండవచ్చు. కానీ చరిత్రలో పాలకుల అక్రమాలు ఎట్లా నమోదై ఉన్నాయో, ఆ అక్రమాలను ప్రశ్నించిన, నిలదీసిన, ప్రజలకు నిజాలు చెప్పిన ఒక మహత్తర సంప్రదాయం ఉన్నదనే ఉజ్వల ఉదాహరణలు కూడా అంతగా నమోదై ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అటువంటి ప్రశ్నల స్వరాల వారసత్వాన్ని ఎన్నోసార్లు ఎత్తిపట్టడం జరిగింది. నిజానికి చాల సందర్భాలలో పాలకుల పేర్లు చరిత్రలో చెరిగిపోయాయిగాని, వారిని ప్రశ్నించిన వారి పేర్లూ, ప్రశ్నలూ, సందర్భాలూ అరుణారుణంగా వెలుగుతున్నాయి. స్పార్టకస్ పేరు గుర్తున్నంతగా స్పార్టకస్ను శిలువెక్కించిన ప్రభువు పేరు గుర్తులేదు. భగత్ సింగ్ పేరు గుర్తున్నంతగా ఆ ఉరిశిక్ష వేసిన అన్యాయమూర్తి పేరు గుర్తులేదు. అది ప్రజల పక్షాన వెలువడిన ప్రశ్న కాబట్టి, అరిచిన, ప్రశ్నించిన ప్రత్యర్థి అలసిపోయినా, అపజయం పాలైనా, అమరుడైనా సరే ప్రశ్న మాత్రం నిలిచే ఉంటుంది.
మాట్లాడే, రాసే చివరి నిమిషం దాకా ప్రజల కోసం అరిచే వాళ్లుంటారు. వాళ్లు అరిచి అరిచి అలిసిపోతారనుకుంటే అది భ్రమో, ఆత్మవంచనో, ఆశ్రితుల మనోధైర్యాన్ని ఉద్దీపింపజేసే చర్యో మాత్రమే గాని ప్రజాస్వామ్య రాజకీయ వైఖరి కాదు. ఇంకొక వంద వ్యాసాల తర్వాతనైనా తెలంగాణర్థం మాత్రం ప్రజల కోసం అరవడం ఎప్పుడూ ఆపదని, అలిసిపోదని హామీ.
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028