Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల లోక్సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దక్షిణాది ప్రాంతానికీ మోడీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపడంపై ఆగ్రహం వెల్లడవు తున్నది. బడ్జెట్ ప్రసంగంలో కూడా అణువణువునా దక్షిణాది పట్ల వివక్ష పొడచూపినట్టు ఆయా రాష్ట్రాల నేతగణం తీవ్రంగా మండిపడు తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలకు కేంద్రం రిక్తహస్తమే చూపించింది. విభజన సమస్యలపై దాటవేత ధోరణి ప్రదర్శించింది. స్పష్టమైన కేటాయింపులు లేకుండా అస్పష్ట బడ్జెట్ను దిగువసభలో మంత్రి ప్రవేశపెట్టారు. కేంద్రం బడ్జెట్లో కీలక రంగాలను విస్మరించడం ఏమాత్రం సమర్థనీయం కాదన్న వాదనలు మెండుగా వినిపిస్తున్నాయి.
ఇక బడ్జెట్లో ''హర్ ఘర్ జల్'' అనే పథకాన్ని మంత్రి సీతారామన్ సభా సాక్షిగా ప్రకటించారు. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే తాగునీరు ఇస్తుందన్నారు. కానీ, ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రక్షిత మంచి నీరు పథకం అమలులో ఉంది. ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని త్వరలో పూర్తి చేసి అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. మరి, ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఏ విధమైన నిధులు ఇస్తుందో పద్దుల్లో పేర్కొనలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటింటికి మంచినీరు పథకానికి సుమారు రూ.24 వేల కోట్లు ఖర్చు అయినట్టు అధికారులు చెబుతున్న అంచనా. దేశవ్యాప్తంగా ఇటువంటి పథకం అమలులోకి తీసుకురావాలంటే దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని నీరుపారుదల రంగం నిపుణులు గణాంకాలతో సహ వివరిస్తున్నారు. మోడీ సర్కారు ఈ ప్రాజెక్టును 2024లోపే పూర్తి చేస్తామని తెలిపింది. కేటాయిచిన నిధుల తీరు చూస్తే, ప్రాజెక్టు 2050 వరకు అయినా పూర్తి కాదని నిపుణులే వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఆ పథకం లక్ష్యాలు... ఉద్దేశ్యాలు బడ్జెట్లో ఎక్కడా ప్రకటించనూ లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. మోడీ సర్కారు గత బడ్జెట్లలో చెప్పినట్టు దేశంలోని ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి సడక్ యోజక కింద రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. కానీ, ఆ మాటలు నేటి వరకు కూడా ఆచరణ రూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వం అసలు ఆ పథకంపై ఏ విధమైన దష్టి పెట్టలేదని మనం అవగతం చేసుకోవచ్చు. ఈ ఏడాది బడ్జెట్లోనూ మంత్రి సీతారామన్ తమ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కానీ, మోడీ సర్కారు నిర్వచిస్తున్న మౌలిక వసతులలో ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారన్న విషయంపై మంత్రి కనీస వివరణ ఇవ్వలేదు. ఇక, సర్కారు చేసే పనుల్లో అందులో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ఉంటుందని ఆమె మరొక విషయం చెప్పారు. కానీ, ఎంతమేర ప్రయివేట్ భాగస్వామ్యం ఉంటుందో, నియంత్రణ బాధ్యత ఎవరిదన్న దానిపై కేంద్రం సభకు వివరణ ఇవ్వలేదు. ఇక ప్రతి పేదవాడికీ ఇండ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని సైతం స్వయంగా చేపడుతున్నాయి. కేరళలోని ఎల్డీఎఫ్ కూటమి భూమి, ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇంటి నిర్మాణానికి సుమారు రూ.4 లక్షలు ఇస్తుంది. దేశంలోనే అన్ని రాష్ట్రాలు ఇచ్చే దానికంటే ఇది అధికం. ఇక కేంద్రం మాత్రం పీఎంవై కింద కేవలం రూ.1.2 నుంచి రూ.1.3 లక్షలు ఇస్తున్న పరిస్థితి ఉంది. దానితోడు 2 నుంచి 3.5 లక్షల వరకు ఇంటి నిర్మాణానికి వడ్డీ మినహాయింపు ఇస్తామని మంత్రి సభలో వెల్లడించారు. అసలు భూమి, డబ్బులు లేనివాడికి అప్పుఇచ్చి వడ్డీ ఇవ్వనక్కర్లేదు అనడంలో ఔచిత్యమేమిటో సర్కారు తెలుసుకోవాలి. భూమి, డబ్బు లేనివాడనే కదా పేదవాడి కోసం ప్రభుత్వం పథకం పెట్టేది. ప్రస్తుతం ముడిసరుకు, కార్మిక శక్తి భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చే డబ్బులు సగటు పేదవాడి ఇంటి నిర్మాణానికి ఏ విధంగా సరిపోతాయన్నది సర్కారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. నిధులు ఒక్క పైసా పెంచకుండా భారీగా లక్ష్యాలు పెట్టుకుంటే ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమవుతాయని చెప్పక తప్పదు. బహుశా కేంద్ర ప్రభుత్వం కోరుకునేది కూడా ఇదేనెమో!
జీడీపీ పెరుగుదలపై సర్కారు డాంభికాలు!
ఇవన్నీ ఒక ఎత్తయితే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే-2019, బడ్జెట్ ప్రకటన సమయంలో కొన్ని డాంభికాలు కొట్టిందని చెప్పకుండా ఉండలేం. దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందని మంత్రి దిగువ సభలో వ్యాఖ్యానించారు. జీడీపీ 7శాతం ఉంటుందని అంచనా వేశారు. భవిష్యత్లో మరింత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో 2024 వరకు ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని రూపొందిస్తామని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, జీడీపీతో దేశ ప్రజానీకం ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతాయని మంత్రి చెప్పడం ఎంత హాస్యాస్పదం. ఈ విషయం పూర్తిగా సత్యదూరమని ఆమెకు తెలియనది కాదు. కాబట్టి ఇది దేశ ప్రజానీకాన్ని మభ్యపెట్టడమే అనుకోవాలి..! దేశంలో అంబానీలు, ఆదానీల ఆస్తులు అత్యంత పేదవాడి ఆస్తి కలిపి భాగిస్తే వచ్చిన లెక్కలతో అంతా సౌఖ్యంగా ఉందని చెప్పడం ఎంత అర్థరహితం. మంత్రి చెప్పింది నిజమే అయితే, దేశంలో గత 45ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ రేటు పెరిగిందని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ సాంపిల్ సర్వే వెల్లడించిన విషయం అబద్ధమా? వ్యవసాయ రంగం రోజురోజూకి ఎందుకు కుదేలవుతుంది? గత ఐదేండ్లలో సుమారు 45వేలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు పలు ప్రముఖ యూనివర్సిటీల అధ్యయనాలు ఎందుకు ఘోషిస్తున్నాయి..?
దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష
కేంద్ర ఆర్థిక బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీవ్రంగా వివక్ష చూపింది. కనీసం ఆయా రాష్ట్రాలకు విద్యా, ఉద్యోగాల్లో ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చే పథకాలు ఇవ్వలేదు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.65 పైసలు మాత్రమే ఇస్తున్నది. ఈ వివక్ష సాంప్రదాయం కాంగ్రెస్ పాలనలో సైతం ఉండేది. కానీ, బీజేపీ హయాంలో ఆ వివక్ష పరాకాష్ఠకు చేరుకుందని దక్షిణాది నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రానికి మాత్రం పన్ను రూపంలో రూ.1 వస్తే... రెండు రూపాయలు ఇస్తున్నారు. అంటే మరొక రూపాయి అదనంగా కేంద్రం కేటాయిస్తున్నది. ఈ కేటాయింపులతో దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. చివరగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాదికి చెందిన మహిళ అయినప్పటికీ, మోడీ చేతిలో కీలు బొమ్మ అయ్యారన్నది స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం.
- వి.సాగర్
- సెల్: 9494041258