Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ఎవరైనా నిస్సహాయులుగా ఉన్నారంటే అది వ్యవస్థలు, పాలకుల వైఫల్యమే. ఆపన్నులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. అది విస్మరించడం క్షమార్హం కాదు. సామాజిక రక్షణ అనేది వృద్ధుల ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అన్న అబ్దుల్ కలాం వ్యాఖ్యలు అక్షర సత్యాలు. 12ఏండ్లు గడిచినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా వయోవృద్ధుల పరిస్థితి దయనీయంగానే ఉంది. సమాజంలోని దివ్యాంగులు, వితంతువులు, ఇతర సామాజికవర్గాలవారు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఐక్య రాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం వృద్ధులకు సామాజిక రక్షణ పరంగా మన దేశం 92వ స్థానంలో ఉండడం నిజంగా సిగ్గు చేటు. జీవిత చరమాంకంలో చుట్టుముట్టే అనారోగ్య సమస్యలు, కన్నవారి నిరాదరణ వంటివి వారి జీవన స్థితిగతులను దుర్భరం చేస్తున్నాయి. సొంతంగా పనులు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వారు ఇతరులపై ఆధారపడడం తద్వారా వారి ఛీత్కారాలకు గురవడం అన్న వైనం బాధాకరం. ఇక గ్రామీణ వృద్ధుల జీవితాలు గాలిలో దీపం చందాన తయారయ్యాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో సామాజిక భద్రత పరంగా కొంత మెరుగ్గా ఉండడం ఆశాజనక పరిణామం. వృద్ధుల నిత్యావసరాలు తీరేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ఇతరచోట్ల వారికి అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం, రైళ్ళు, బస్సులలో ఉచిత ప్రయాణం, ఉచిత ఆంబులెన్సు, వైద్య సౌకర్యాలు, పిల్లలు లేనివారికి ఉచిత అంత్యక్రియలు జరిపించడంతో పాటు వారికి మెరుగైన జీవన స్థితిగతుల కోసం ఒక పటిష్ట ప్రణాళికను కేంద్ర రాష్ట్రాల సహకారం, సమన్వయంతో అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్దేశ్యపూర్వకంగా తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేసే పిల్లలకు కఠినమైన శిక్షలు విధించాలి. దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసాయి. ఆ ప్రతిపాదనకు తక్షణం మోక్షం కల్పించడం ఎంతో ముఖ్యం.
- సిహెచ్, సాయి ప్రతాప్, హైదరాబాద్.