Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2017లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ ప్రభుత్వాస్పత్రిలో 72గంటల్లో 63మంది పిల్లలు సమయానికి ఆక్సిజన్ అందక చనిపోయారు. 2019లో బీహార్లోని ముజఫర్పూర్లో నెలలో సుమారు 200 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో మరణించారు. స్వాతంత్య్ర భారతంలో పిల్లల ఆరోగ్యం విషయంలో ఇదీ మనం సాధించిన ప్రగతి. కొన్ని రోజులకు ఈ మరణాల గురించిన వార్తలు మరుగున పడిపోతాయి. మీడియాలో కథనాల కోసం కొత్త అంశాలు ముందుకొస్తాయి. పాలకుల విధానాలలో ఎటువంటి మార్పూ ఉండదు. కనీస వసతులు, సౌకర్యాల కోసం బడ్జెట్లో కేటాయింపులు పెరగవు.
పౌష్టికాహార లోపం వల్ల దేశంలోని బాలల్లో సగం అంటే సుమారు 60లక్షల మంది తక్కువ బరువుతో ఉన్నారు. 45శాతం మంది సరైన ఎదుగుదల లేక పొట్టిగా తయారవుతున్నారు. 75శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండగా 57శాతం మంది పిల్లల్లో ఏ విటమిన్ లోపిస్తోంది. ప్రపంచం మొత్తంలోని పౌష్టికాహార లోపం గల బాలల్లో సగంమంది భారతదేశంలోనే ఉన్నారు. చైనాతో పోలిస్తే పౌష్టికాహార లోపం గల పిల్లలు మనదేశంలో అయిదు రెట్లు ఎక్కువ. (ప్రపంచ బ్యాంకు నివేదిక).
అధికారిక లెక్కల ప్రకారం మనదేశంలో ప్రతిరోజూ సుమారు 21,917మంది పిల్లలు మరణిస్తున్నారు. ఏటా 2.5 కోట్ల మంది పుడుతుంటే, వారిలో 1.75కోట్ల మంది మాత్రమే బతుకుతున్నారు. ఎనిమిది లక్షల మంది ఆరునెలలు కూడా నిండకముందే మరణిస్తున్నారు. (ఐసీడీఎస్, మిషన్ డాక్యుమెంట్, స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ).
మనకు ఆహారభద్రత చట్టం వంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిద్వారా దేశప్రజలకు ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 14ఏండ్లలోపు పిల్లలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కనీస పోషకాహారం అందేటట్టు చూడాలి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) మధ్యాహ్న భోజనం, ప్రసూతి సౌకర్యం మొదలైన పథకాలను సక్రమంగా అమలు చేయాలి. ప్రజా ఆరోగ్య సేవలతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కనీస ఆరోగ్యసేవలు అందించాలి.
ఐసీడీఎస్ పాత్ర : గర్భిణీలు, పిల్లలలో మరణాల రేటును తగ్గించాలని, అలాగే పిల్లలలో అన్ని రకాల అభివృద్ధి 1975లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ స్కీమ్ ప్రవేశపెట్టింది. స్కీమ్ ఉద్దేశ్యం సమగ్రమైంది. అనేక ప్రభుత్వ శాఖలు, సంస్థలతో సమన్వయం ఉండేలా అద్భుతంగా రూపొందించ బడింది. తల్లిగర్భంలో ప్రాణం పోసుకున్నది మొదలు ఆరేండ్ల వయసొచ్చేవరకు పిల్లలకు కావలసిన పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య మొదలైన అన్ని అవసరాలను తీరుస్తుంది. అంతేకాక యుక్తవయస్సు ఆడపిల్లల ఆరోగ్యం దృష్ట్యా తర్వాత కాలంలో వారికి ప్రత్యేక పోషక ఆహారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఎనిమిది కోట్లమంది బాలలు, రెండు కోట్లమంది తల్లులూ లబ్ది పొందుతున్నారు. అనుబంధ పౌష్టికత, ఇమ్యూనైజేషన్, ఆరోగ్య సంరక్షణ, రిఫెరల్ సేవలు, ప్రి-స్కూల్ విద్య మొదలైన సర్వీసుల్ని అందిస్తున్నారు. పేదరికం, ఇతర సమస్యల కారణంగా పెరుగుతున్న పౌష్టికాహార లోపాన్ని తరచూ అంచనా వేసి అందుకనుగుణంగా పోషక ప్రమాణాలను సవరిస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా పిల్లలకు ఇప్పుడు అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని కూడా యిస్తున్నారు.
బీహార్లో మెదడు వాపు వ్యాధివల్ల సంభవించిన బాలల మరణాల కారణాల గురించి నిర్వహించిన సోషల్ ఆడిట్ వల్ల తేలిందేమంటే పిల్లల తల్లిదండ్రులలో 82శాతం మంది కార్మికులే. వీరిలో ముప్పాతికమంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరి సగటు నెలసరి ఆదాయం సుమారు 4,465 మాత్రమే. అలాగే మూడోవంతు కుటుంబాలకు రేషన్ కార్డుల్లేవు. కార్డులు ఉన్నవారి కూడా రెండు నెలలుగా సరుకులు దొరకలేదు. జబ్బుపడిన రోజు రాత్రి చాలామంది పిల్లలు ఏమి తినలేదు. 60శాతం మందికి ఇండ్లల్లో మరుగుదొడ్లు లేవు.
పౌష్టికాహార లోపం సంబంధించి జరిపిన సర్వేలు వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పౌష్టికత లోపం కలిగిన కేసుల్లో సగం బీహార్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ - ఈ ఆరు రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. ఎదుగుదల లేని పిల్లల్లో 13శాతం మంది బీహార్లోనే ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది. కానీ ఈ రాష్ట్రాలలోనే ఐసీడీఎస్ అమలు పరమ అధ్వానంగా ఉంది. ఇక్కడ సగానికి పైగా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. అంతేకాక 2013లో పెరిగిన సెంటర్ అద్దెలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల అద్దె దేశమంతటా రూ.750 చెల్లిస్తుండగా, బీహార్లో కేవలం 250 ఇస్తున్నారు. అందువల్ల తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం ఇవన్నీ లేని భవనాల్లోనే సెంటర్లు నడుపుతున్నారు. ఇక కరెంటు, ఫ్యాన్ల సంగతి వేరే చెప్పక్కర్లేదు.
కేంద్రాలలో పాలు, వారానికోసారి గుడ్డూ పెట్టాలి. కానీ బీహార్లో ఇవేవీ అమలు కావటంలేదు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆహార పదార్థాల సరఫరాకు బదులు దానికి అవసరమైన డబ్బును వర్కర్ల బ్యాంక్ అకౌంట్కు జమ చేస్తున్నారు. ఆ డబ్బుతో ఆహారపదార్థాలు కొని పిల్లలకు పెట్టటం వర్కర్ బాధ్యత. బడ్జెట్ కేటాయింపులో కేంద్రం కోత విధించడం, అలాగే అంగన్వాడీ కేంద్రాలకు ఖర్చు చేయాల్సిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో ఫుడ్ సప్లయికి చెల్లించాల్సిన డబ్బులు నెలల తరబడి బకాయిలుంటున్నాయి. పైగా స్థానికంగా ఉండే షాపులలో అప్పుగా సరుకులు తీసుకోవాలని, బడ్జెట్ వచ్చిన తర్వాత వారికి చెల్లించాలని వర్కర్లను వత్తిడి చేస్తున్నారు. సరుకుల ధరలు రోజూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇచ్చే సొమ్ము తెచ్చిన అప్పులకు సరిపోవటం లేదు. అంతేకాక రాష్ట్రంలో ఉన్న అన్ని సెంటర్లకు ఈ సదుపాయం అందుబాటులో లేక అనేక సెంటర్లలో ఫుడ్ సప్లయి నిలిచిపోతోంది. లబ్దిదారుల సంఖ్య తగ్గించి చూపి పౌష్టికాహారంలో బాగా కోత విధిస్తున్నారని అంగన్వాడీ వర్కర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదాహరణకు నవాడా జిల్లాలోని రూక్సానా ఖాతున్ సెంటర్కు పిల్లల ఆహారం కోసం గతంలో ఇచ్చే రూ.20 వేలను అమాంతం తగ్గించి రూ.16 వేలు ఇస్తున్నారు. ఈ సొమ్మును పిల్లలందరికీ సర్దుబాటు చేయటం కష్టమవుతుందని ఆమె వివరించింది.
''తీవ్ర పౌష్టికాహార లోపంతో'' బాధపడే పిల్లల సంఖ్య తగ్గించి చూపాలని కూడా అంగన్వాడీ వర్కర్లను ఆదేశిస్తున్నారు. అలా చూపి వారికి కేటాయించాల్సిన ఆహారంలో కోత పెడుతున్నారు. ఇలాగే అనేక రాష్ట్రాల్లో జరుగుతోంది. బీహార్లో మెడికల్ కిట్లు, ప్రి స్కూలు కిట్లు ఇవ్వడం ఎప్పుడో నిలిపివేశారు. ఇక ూవీవ్ీూ పథకం కింద గర్భిణీలకు అందాల్సిన సదుపాయాలేవీ అందుబాటులో లేవనే ఫిర్యాదు సర్వసాధారణం. అన్ని రాష్ట్రాల కన్నా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. అదీ నెలల తరబడి చెల్లించటం లేదు. పైగా ఐసీడీఎస్ ఏతర పనులను కూడా వీరికే కేటాయిస్తున్నారు.
ఐసీడీఎస్ పథకం ఎన్నో సానుకూల ఫలితాలను తీసుకువచ్చిందని అనేక సంస్థలు చేసిన అధ్యయనాలు వెల్లడించాయి. మాతా శిశుమరణాలు, పౌష్టికాహార లోపం తగ్గాయి. స్కూలుకు వెళ్లే పిల్లల సంఖ్యా పెరిగింది. అయితే పథకం అమలు తీరులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని కూడా అధ్యయనాలు అభిప్రాయపడ్డాయి. దేశ ఉజ్జ్వల భవిష్యత్ కోసం ఐసీడీఎస్ను మరింత నాణ్యతా ప్రమాణాలతో అందరికీ అందుబాటులోకి తెచ్చి, ఈ పథకాన్ని బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పటమే కాదు అనేక ప్రభుత్వ కమిటీలు కూడా సిఫారసు చేశాయి.
అయితే దురదృష్టవశాత్తు కేంద్రంలోని ప్రభుత్వాలు ఈ సిఫారసులను పెడచెవిన పెట్టాయి. అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ, క్రెచ్లుగా మార్చి పూర్తి సౌకర్యాలు కల్పించి, వర్కర్లకు మెరుగైన శిక్షణ అందించి, వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమించడం ద్వారా పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం, ఆరోగ్య అవసరాలు, విద్య మొదలైనవన్ని అందించవచ్చు. కానీ ప్రభుత్వాల ఆలోచన వేరేవిధంగా ఉంది. యూపీఏ-2, ఎన్డీఏ-1 ప్రభుత్వాలు ఐసీడీఎస్ బడ్జెట్లో కోతలు విధించి, ఈ పథకాన్ని బడా కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టాలని చూసాయి. తద్వారా దొడ్డిదారిన ప్రయివేటీకరణకు మార్గం వేయాలని ప్రయత్నించాయి. బీజేపీ ప్రభుత్వం ఈ చర్యలను వేగవంతం చేసింది. దానిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే మధ్యాహ్న భోజనాన్ని కొన్ని చోట్ల అక్షయపాత్ర వంటి సంస్థలకు అప్పజెప్పింది. అలాగే ప్యాకెట్ల ద్వారా ఫుడ్ సప్లయి కాంట్రాక్టును దిగ్గజ కంపెనీలకు ధారాదత్తం చేస్తోంది. ఐసీడీఎస్ పనితీరు బాగాలేదని, ఫలితాలు రావట్లేదనే పేరుతో అంగన్వాడీ సేవలకు మంగళం పాడి దాని స్థానంలో నగదు బదిలీ పథకం తేవాలని ఆలోచిస్తోంది.
పౌష్టికాహార లోపం, ఆకలిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే వ్యవసాయ సంక్షోభాన్ని నివారించటానికి దీర్ఘకాల చర్యలు తీసుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి కల్పన, కార్మికులకు కనీసవేతనాలు ఇవన్నీ దీనిలో భాగమే. వీటన్నిటి అమలుకు చర్యలు తీసుకోవాలి. వీచీ=జు+A, మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్ స్కీమ్లను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి సరిగ్గా అమలయ్యేలా చూడటం ద్వారా మాత్రమే ఇటువంటి మరణాలను, కష్టాలను నివారించగలం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకునే విధంగా మనం పోరాటం చేయాలి.
అనువాదం: పద్మశ్రీ,
- ఎ.ఆర్. సింధు
సెల్: 9490098687