Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భావోద్వేగాలు, జాతీయ అతివాదాన్ని ప్రేరేపించి రెండోసారి గద్దెనెక్కిన మోడీ ఓడదాటాక తెప్ప తగలేస్తాడనడంలో సందేహం లేదు. ఇది ఊహించిందే. ఓడలోని జనాన్ని నడిసంద్రంలో ముంచుతాడనేది కూడా ఊహకందే విషయమే. కానీ ఆ పని రాకెట్ వేగంతో చేస్తాడని మాత్రం దేశ ప్రజలు ఊహించి ఉండరు. గెలిచి సరిగ్గా రెండు నెలలు కాలేదు. ఇంతలోనే జనంపై వేట మొదలెట్టాడు. పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు లక్ష్యంగా ఆర్థిక దాడికి పూనుకున్నాడు. సామాజిక అన్యాయం తలపెట్టే నిర్ణయాలకు తెగబడ్డాడు. రెండోసారీ అధికారం కట్టబెట్టిన జనంపట్ల, వారి సమస్యలపట్ల మరింత బాధ్యత పెరగాలి. పేదరికం తగ్గించడానికి చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు సరైన మందు వేయాలి. ఉపాధి సమస్యను పరిష్కరించాలి. అందుకు అవసరమైన శాస్త్రీయ చికిత్సకు అడుగులేయాలి. కానీ ఏ జనమైతే భారీ మెజార్టీ కట్టబెట్టారో ఆ జనాన్ని, ఈ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే వినాశకర చర్యలకు సిద్ధపడ్డాడు.
'దేశంలోని 45 పరిశ్రమలను ప్రయివేటుపరం చేస్తాం'.. నెల రోజుల క్రితం ప్రభుత్వంలో భాగమైన ఓ ముఖ్యమైన వ్యక్తి చేసిన కీలక ప్రకటన ఇది. స్వయంగా నిటి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ చెప్పిన చేదు నిజమిది. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు అది నిజమే అని ప్రకటన వెలువడ్డ వారం రోజుల్లోనే తేలిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సాక్షిగా దీన్ని ధృవీకరించారు. 'నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రయివేటు పరం చేస్తాం. లాభాల్లో ఉన్న పరిశ్రమలను అమ్మేస్తాం'. అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ యేడు లక్షా ఐదు వేల కోట్ల ప్రభుత్వరంగ వాటాలను అమ్మడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె సెలవిచ్చారు. అంటే రాజీవ్ చెప్పిన మాట అక్షరాలా అమలవుతుందన్నది కాదనలేని సత్యం.. గతేడాది అనుభవమూ దీన్ని రుజువు చేస్తున్నది. 2018-19 బడ్జెట్లో 80 వేల కోట్ల ప్రభుత్వరంగ వాటాలు అమ్మాలనేది కేంద్రం లక్ష్యం. కానీ లక్ష్యానికి మించి ప్రభుత్వరంగంలోని 85 వేల కోట్ల వాటాలు గతేడాది అమ్మేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో లక్ష్య సాధనలో ఆమడ దూరంలో ఉన్న సర్కారు..ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడంలో మాత్రం అత్యంత వేగం ప్రదర్శించింది. ఈ క్రమంలోనే ఈ యేడు ఆ లక్ష్యాన్ని లక్షకోట్లు దాటించింది. ఇదే జరిగితే పర్యవసానం ఊహించిందే. కోట్లాదిమంది కార్మికుల బతుకులు తెల్లారినట్టే. లక్షలాది మంది రోడ్డునపడ్డట్టే. ప్రభుత్వరంగంలోనే కనీస వేతనాలు, భద్రత కరువైన దశలో.. ప్రయివేటు పరిశ్రమల్లో పరిస్థితి ఎంత దుర్భరమవుతున్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రయివేటులో ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. అప్పుడు సామాజిక రిజర్వేషన్ల మాటే ఉండదు. ప్రజా సేవలు కాస్తా వ్యాపారమయమవుతాయి. ప్రభుత్వరంగ సంస్థల వద్ద ఉన్న వేల కోట్ల విలువ చేసే జాతి సంపద కార్పొరేట్ల పరమవుతుంది. ఈ ఒక్క నిర్ణయంతోనే ఓ వైపు ఆర్థిక దోపిడీ, మరోవైపు సామాజిక అణచివేతకు దారి పడుతుంది.
రాజీవ్కుమార్ చేసిన ఈ ప్రకటన మొదలు కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే అనేక చేదు వార్తలు, ప్రజలను మరింత దివాలా తీయించే నిర్ణయాలు కేంద్రం వెలువరిస్తున్నది. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, సాధారణ ప్రజల లక్య్షంగా పిడుగుల వర్షం కురిపిస్తున్నది. మొన్నటి వరకు పెద్దగద్దలకు దోచిపెట్టిన ఫలితంగా వెంటిలేటరెక్కిన మన ఆర్థికవ్యవస్థను బాగుచేస్తామనే పేరుతో పేదలు, సామాన్యుల నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన, పెడుతున్న చందంగా వ్యవహరిస్తున్నది. పెట్రోల్, డీజిల్పై రూ.రెండు చొప్పున పన్నులను బడ్జెట్లోనే వడ్డించింది. ఫలితంగా సరుకు రవణా ఛార్జీలు, తద్వారా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలూ చుక్కలనంటాయి. ఈ భారం దేశంలోని ప్రజలందరిపైనా పడింది. రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్న ఎరువులు, విత్తనాల సబ్సిడీలు ఇక నుంచి ఉండబోవని బడ్జెట్ సాక్షిగా పరోక్షంగా ప్రకటించారు.
వ్యవసాయ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడుల పేర ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే జరిగితే దేశంలోని 60 శాతనికి పైగా ఉపాధి చూపుతున్న వ్యవసాయరంగాన్ని మరింత దివాళా తీయించనుంది. 12 వేలుగా ఉన్న కనీస వేతనాల జీవోల బుట్టదాఖలుకు సిద్ధపడింది. రూ.13 వేలుగా ప్రతిపాదించిన నిపుణుల సూచనలను చెత్తబుట్టలో వేసింది. రోజుకూలి కేవలం రూ.179గా నిర్ణయించింది. ఇదే అమలైతే దేశంలోని సుమారు 40 కోట్ల మంది వేతన జీవులకు వెన్నుపోటు పొడిచినట్టే. మరోవైపు మీరు నడుస్తున్న, వాహనాలు నడుపుతున్న రోడ్లు మీరే వేయించుకోవాలని సర్కారు చెబుతోంది. కేంద్రం రోడ్లేయించే పరిస్థితిలో లేదని ఆ భారం ప్రజలే భరించాలని స్వయంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ ప్రకటించారు. వసూళ్ల గడువు ముగిసినా టోల్ఫ్లాజాలు ఉంటాయని, అవి జనం తోళ్లు తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులకు చేదు గులికేసింది. జీపీఎఫ్ వడ్డీ రేట్లను 8శాతం నుంచి 7.5శాతానికి తగ్గించింది. తద్వారా ఉద్యోగుల ఖాతాలో నుంచి వేల కోట్లు కొట్టేయబోతున్నది. కోట్లాది ప్రజలకు ప్రస్తుతం కారు చౌకగా ఉన్న రైల్వే ప్రయాణాలు దూరం చేస్తున్నది. రైల్వేలను ప్రయివేటుకు అప్పగించనున్నట్టు బడ్జెట్లోనే ప్రకటించింది. కేంద్రం అత్యంత వేగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, వెలువడుతున్న ప్రకటనలు కోట్లాది మంది ప్రజలను, ఆర్థిక నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి గురించి ఆలోచించేలోపే మరో ప్రమాదకర ఆలోచన చేస్తున్నట్టు తెరపైకొచ్చింది. 'ఉపాధి' చట్టం ఇక ఉండబోదంటూ స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్తోమర్ ప్రకటించారు. దీన్ని కొనసాగించలేము అంటూ సెలవిచ్చారు. కోట్లాది గ్రామీణ ప్రజల కడుపునింపుతున్న చట్టమిది. కూడు, గూడు, నీడ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. తిండైనా పెట్టండి, పనైనా చూపండీ.. అంటూ కొన్నేండ్లుగా కొట్లాడిన ఫలితంగా వచ్చిన ప్రతిష్టాత్మక చట్టమిది. వామపక్షాల ఒత్తిడి మేరకు యూపీఏ-1 ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంత కూలీలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించిన చట్టమిది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాతే ప్రజల కొనుగోలుశక్తి మెరుగుపడిందని, ఇది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ తోడ్పడిందని స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి సైతం దీన్ని దృవీకరించింది. ఇంతటి గొప్ప చట్టానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడవబోతున్నది. బొక్కలు పడ్డ మన బొక్కసాన్ని బాగు చేసే పేరుతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఎంత మాత్రమూ ఆరోగ్యకరమైనవి కావు. పైగా ఇవి జనాన్ని మరింత దివాళా తీయిస్తాయి. ఫలితంగా ప్రజల కొనుగోలుశక్తి తగ్గుతుంది. కొనేవారే లేకపోతే మార్కెట్ మందగిస్తుంది. దాని ప్రభావం మళ్లీ మన ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దేశం మరింత సంక్షోభంలోకి వెళుతుంది. సమస్యకు పరిష్కారాలు ఇవి కావు. కార్పొరేట్ సంస్థలు బొక్కసాల్లోకి వెళ్లిన లక్షల కోట్లు కక్కించండి. ఏ విధానాలైతే దేశాన్ని ఈ దుస్థితిలోకి నెట్టాయో వాటికి స్వస్తిపలకండి.
- కె. నాందేవ్
సెల్: 9490099387