Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే భారతదేశాన్ని 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యం అంటూ ప్రధానమంత్రి ఉద్ఘాటిస్తూ వస్తున్నారు. మోడీ పలు వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావించడం ఒక ఎత్తయితే, మన దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తమ మొదటి బడ్జెట్ ప్రసంగంలో ఈ 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగానే బడ్జెట్ తయారు చేశామని చెప్పారు. భారత్ ఆర్థికంగా ఎదిగితే అందరికీ సంతోషమే. అయితే 5లక్షల కోట్ల లెక్క కోసం ఆర్థిక వ్యవస్థను మదించే విధానంలో మార్పులు చేస్తే తప్ప రాబోయే ఐదేండ్లలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో లెక్కించబడిన జీడీపీ వృద్ధి పద్ధతి మార్చి, కొత్త విధానంతో లెక్కించడం ద్వారా దాని వృద్ధిలో గణనీయంగా నమోదు అవుతున్నట్టు ప్రభుత్వం చూపిస్తుంది. ఆర్థిక వ్యవస్థ అనగా దేశ స్థూల జాతీయ ఉత్పత్తి... అనగా ఒక నిర్ణీత కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువను ఇది సూచిస్తుంది. వీటి విలువను లెక్కించే విధానాన్ని మార్చి అంకెలను పెంచి చూపటం ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరిగింది అని చెబితే అది అర్థరహితం. (ఖజానాను నింపుకోవడానికి భూముల విలువను పెంచినట్టు) ప్రస్తుత స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు 5.8 కొనసాగితే రాబోయే ఐదేండ్లలో 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడం అసాధ్యం. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 2.7లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నది. ఇది ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే కనీసం 13 నుంచి 14శాతం ప్రతిఏటా జీడీపీ వృద్ధి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులైన భరత్ ఝునున్వాల, మోహన్ గురుస్వామితో పాటు మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా అభిప్రాయ పడుతున్నారు. భారత జీడీపీలో, రమారమిగా, సేవా రంగం 53-54 పారిశ్రామిక రంగం 29-30 వ్యవసాయ రంగం 17-18శాతంగా నమోదవుతున్నాయి. 50శాతానికి పైగా శ్రామికులకు పని కల్పిస్తున్న వ్యవసాయ రంగ వృద్ధి గత ఐదేండ్లుగా 2 నుంచి 4శాతాల మధ్య ఉన్నది. ఎక్కువ మంది ఆధారపడ్డ ఈ రంగం ఇంత తక్కువ వృద్ధి కనబరిస్తే ఆర్థిక వ్యవస్థ ఎలా వృద్ధి చెంద కలదు? వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అంటే ఓ నాలుగు రూపాయలను రైతులకు విసరడం కాదు. ఈరోజు వ్యవసాయ రంగం వెనుక పడటానికి ప్రధాన కారణం నీటి లభ్యత క్షీణిస్తుండటం. దానికోసం సరైన పథకాలు రచించి నీటిలభ్యత ఏర్పాటు చేయాలి. దాని గురించిన ప్రస్తావన ఈ మధ్యకాలంలో వినపడలేదు. ఇక వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారంతా వెనుకబడటానికి ప్రధాన కారణం గిట్టుబాటుధర చెల్లించకుండా వ్యవసాయ ఉత్పత్తులన్నీ దళారులకు ధారాదత్తం కావడం. ఈ వ్యవస్థను కట్టుదిట్టం చేసి సరైన చెల్లింపు జరిగేలా చూసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కృషీవలురకి సరైన ప్రతిఫలాన్ని ఇస్తే, వారి చేతిలో కొనుగోలు శక్తి పెరిగి, ఈ రంగ వృద్ధి తప్పకుండా జరుగుతుంది. ఎన్నికల తాయిలాలుగా ప్రకటించిన రైతు బంధు పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ వంటి వాటిని విరమించుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే నీటి లభ్యత, సాంకేతిక సహాయం అందించే ఆలోచన చేయాలి. 50శాతానికి మించిన జనాభా పని చేస్తున్న ప్రాధాన్యతా రంగం దేశ సంపదలో కనీసం 25శాతమైనా సృష్టించక పోతే దానికి కారణం వనరుల ఉపయోగంలో పరిపాలన లోపంగా భావించాలి.
జూన్ త్రైమాసిక లెక్కల ప్రకారం పారిశ్రామిక రంగం కూడా బాగా దెబ్బతిన్నది. దీనికి కారణం ఏమిటి? వ్యవసాయ రంగం వెనకబడుతున్నప్పుడు తత్సంబంధిత పరికరాలకూ గిరాకీ తగ్గుతుంది. ఇది ఒకటైతే, పారిశ్రామిక రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్నది వాహన, గృహ, ఇతర ఉపకరణాల వినియోగం. వీటి అమ్మకాల్లో క్షీణత ఏర్పడింది. అంటే మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లింది. దీనిని దృష్టిలో పెట్టుకోవడం వల్లనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పావు శాతం తగ్గించింది. రెపో రేటు మార్కెట్లో నగదు సప్లయి పెంచవచ్చు కానీ ఉపాధి అదే నిష్పత్తిలో పెరగదు. మరో విషయమేమంటే దీర్ఘకాలిక ఉపాధి మాత్రమే పారిశ్రామికరంగాన్ని రక్షించ గలుగుతుంది. ఉదాహరణకు ఒక కాంట్రాక్టు ఉద్యోగి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నా, 10లక్షలు వెచ్చించి ఒక కారు కొనుక్కోవడానికి సిద్ధపడకపోవచ్చు. ఎందుకంటే ఆ ఉపాధి ఎప్పుడు ఆగిపోతుందో అన్న ఒక అభద్రతా భావంతో. కానీ నెలకు 50,000 మాత్రమే ఆర్జించే ఒక దీర్ఘకాలిక ఉపాధి దారుడు 10లక్షలు వెచ్చించి కారును కొనుక్కునే అవకాశం ఉన్నది. ఎలాగంటే రానున్న దీర్ఘకాలంలో నెలకు కొంత చొప్పున చెల్లించి ఆ వస్తువును తన స్వంతం చేసుకోగల భరోసా వల్ల. ఉపాధులలో నిలకడ లేనప్పుడు ఆర్థిక వ్యవస్థలో కూడా నిలకడ అసాధ్యం అన్న విషయాన్ని గ్రహించాలి. కానీ ఇప్పుడున్న పారిశ్రామికవాదులంతా కోరుకుంటున్నది హైర్ అండ్ ఫైర్ మీద ఉద్యోగులను నియమించుకుని తాత్కాలికంగా పని కానిచ్చుకొని వదిలివేసే విధానాలను. తాత్కాలిక ఉపాధి తాత్కాలిక డిమాండ్ సృష్టించగలదు. ఇలాంటి డిమాండ్ భారీ పరిశ్రమలు ఉత్పత్తి చేసే ధీర్ఘ కాలిక వినియోగ వస్తువులకు నిరుపయోగం. భారీ పరిశ్రమలు మందగిస్తే చిన్న మధ్యతరగతి సంస్థలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అందుకే అన్ని రకాల పరిశ్రమలు కళకళలాడాలంటే ధీర్ఘ కాలిక డిమాండ్ కల్పించే దీర్ఘ కాలిక ఉపాధి అవశ్యం.
ఇప్పుడు జీడీపీలో సేవారంగం వాటా 53శాతం. ఇది దాదాపు 60శాతానికి కూడా చేరుతుందన్న అంచనాల నుంచి తగ్గుతూ వస్తున్నది. దీనిలో పెరుగుదల లేక పోవడానికి కారణం ఏమంటే సాఫ్ట్వేర్ రంగం కొంత స్తబ్దతకు లోనయ్యింది. విదేశాలకు ఎగుమతి చేసే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో క్షీణత ఏర్పడింది. ఏ దేశానికాదేశం టెక్నాలజీ బదలాయింపుతో స్వీయ సంతుష్టత చెందుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నంత స్థిరత్వపు ఉపాధి (స్టెబిలిటీ) సేవా రంగంలో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండదు. ఎందుకంటే పారిశ్రామిక ఉత్పత్తుల వినియోగపు కాలం కన్నా సాఫ్ట్వేర్ రంగం ఉత్పత్తుల వినియోగపు కాలం తక్కువ. సాఫ్ట్వేర్ రంగంలో టెక్నాలజీ మారినట్టుగానే జనరేషన్స్ కూడా త్వరితగతిన మారిపోతూ ఉండాలి. యువకుల్లో ఉన్నంత ఇన్నోవేషన్ మధ్య వయస్సు వారిలో కూడా ఉండదు. అందుకే అక్కడ దీర్ఘకాలిక ఉపాధి తగ్గిపోతున్నది. అంచేత ఈ రంగం వారిలో తాత్కాలిక కొనుగోలుశక్తి దీర్ఘకాలిక కొనుగోలు శక్తి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యవస్థ అభివృద్ధికి మంచి సంకేతం కాదు. అందరికీ దీర్ఘకాలిక ఉపాధి ఇవ్వాలంటే నైపుణ్యత తగ్గిన సీనియర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఇవ్వాలి. ఉదాహరణకు మిలిటరీ నుంచి 40 ఏండ్ల వయసుకే రిటైరైన అందరికీ నైపుణ్యానికి తగిన ఉపాధి ఇతర రంగాలలో ఇవ్వాలి. ఇలాంటి ప్రత్యామ్నాయం వెతకక పోవడం వల్లనే ఈరోజు దేశమంతా 24 లక్షల మంది ఎక్స్ సర్వీస్ మెన్ పెన్షనర్లుగా ఉన్నారు. వీరందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తే పెన్షన్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. దేశంలోని ప్రభుత్వ ప్రయివేటు రంగాల్లోని శ్రమను అనుసంధానిస్తే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయగలదు.
ఇక ఈ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించినప్పుడు ప్రపంచంలో మన దేశం 5వ స్థానాన్ని ఆక్రమించాలంటున్నారు. మనకన్నా ముందున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా(20 లక్షల కోట్ల డాలర్లు) చైనా(16), జపాన్(11), జర్మనీ(3.7), ఇంగ్లాండ్(2.9). భారత్ ప్రస్తుతం ఆరవ ఆర్థిక వ్యవస్థ (2.7). అయితే ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు. ఎంత స్థిరమైనదన్నది చాలా ముఖ్యం. అనగా పైన పేర్కొన్న దేశాలలో స్థిరమైన ఉపాధి కల్పిస్తున్నది చైనా జపాన్లు మాత్రమే. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్దది అయినప్పటికీ అక్కడ ఉపాధి స్థిరత్వం లేకపోవడం వల్లనే ట్రంప్ అమెరికా ఫర్ అమెరికన్ అనే సున్నితత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాలంలో రెండు నెలలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్ డౌన్ పేరు మీద మూత పడింది. ఇంగ్లాండ్ లోనూ ఉపాధి స్థిరత్వం తగ్గిపోతున్నందుననే బ్రెగ్జిట్ పేరుపైన యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని రాజకీయ సంక్షోభం ఏర్పడింది, దేశ ప్రధాని తెరిసా మె అర్ధాంతరంగా వైదొలగింది. జనాభా ప్రాతిపదికన చూసినప్పుడు 30కోట్లు ఉన్న అమెరికా 20లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు 130 కోట్లు ఉన్న భారత్ 80లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలి. అందుచేత పెద్ద ఆర్థిక వ్యవస్థ కన్నా ముఖ్యంగా ఉండవలసింది తలసరి ఆదాయంలో సాపేక్ష పెరుగుదల. అనగా దేశం మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగించడం కాదు.. దేశంలోని ఏ మూలకి వెళ్లి ఒక సమూహాన్ని తీసుకొని పరిశీలించినా దాదాపు అదే రీతిన తలసరి ఆదాయం కనపడాలి.
క్వికనామిక్స్ అనే సంస్థ 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం తలసరి ఆదాయాలుగా చూసినప్పుడు మొదటి పది దేశాలు కింది విధంగా ఉన్నాయి. 1. లగ్జంబర్గ్ - 1,04,103 (యూఎస్ డాలర్లు), 2. స్విట్జర్లాండ్ -80, 189, 3. నార్వే-75,504, 4. ఐస్లాండ్-70,056, 5. ఐర్లాండ్-69,330, 6. ఖతార్-63,505, 7. అమెరికా-59,531, 8. సింగపూర్-57,714, 9. డెన్మార్క్ - 56,307, 10. ఆస్ట్రేలియా - 53,799. అమెరికా ఏడవ స్థానంలో ఉండగా ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ తలసరి ఆదాయంలో ఎంతో వెనుకబడి ఉన్నాయి. 160కోట్లు జనాభా ఉన్న చైనా 16,760 డాలర్ల తలసరి ఆదాయం కలిగి ఉంటే భారత్ 7,060 డాలర్లు కలిగి ఉంది. ఈ 10 దేశాలలో తలసరి ఆదాయంలో మాత్రమే కాదు మానవ అభివృద్ధి సూచిక నమూనాగా ప్రతిబింబించే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఈక్వాలిటీ, హెల్త్ ఇండెక్స్, లా అండ్ ఆర్డర్, హ్యాపీనెస్, స్త్రీ సురక్ష మొదలయిన అన్ని కోణాల్లోనూ ముందంజలో ఉన్నాయి. ఇక చివరిగా, భారత ఆర్థిక వ్యవస్థ తప్పకుండా పెరుగుతుంది... ఎందుకంటే ఉపాధిలో పాలుపంచుకునే యువత ఎక్కువగా ఉన్న దేశం మనదే. అయితే పెరిగేందుకు ఏ రకమైన కొత్త మార్గాలు అన్వేషించకుండా ఆర్థిక వ్యవస్థను పెంచుతాము అని చెప్పి, పెరిగిన తర్వాత అది మా వల్లే సాధ్యమైంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే అది సరైంది కాదు. ఇప్పుడు భారత్కు కావలసింది పెద్ద ఆర్థిక వ్యవస్థగా నమోదు కావడం కాదు. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు కారకులైన వారికి సాపేక్ష పంపిణీ జరగాలి. అలా కాకుండా సంస్థ ఉద్ధరణకు కారకులైన ఒక్క శాతం మందికి తొంభై శాతం లాభాలు, తొంభైతొమ్మిది శాతం మందికి ఒక్క శాతం వేతనాలు ఇస్తూ పోతే వ్యవస్థ పెరగడంలో చురుకుదనం లోపిస్తుంది. సమాజ పుష్కల అభివృద్ధి జరగక చంద్రునిపై గుర్తుల్లా అక్కడక్కడ మాత్రమే అభివృద్ధి కన్పిస్తుంది.
- జి. తిరుపతయ్య
సెల్:9951300016