Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1956లో జాతీయం చేసి, ప్రభుత్వరంగ సంస్థగా పనిచేస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ (వాటాల రూపంలో పెట్టుబడి సేకరించడం) చేయబోతున్నారంటూ స్థానిక, జాతీయ మీడియా సంస్థలు రిపోర్టులు చేశాయి. భారత జాతీయ భీమా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ 2 ఆగస్టు 2019న భోజన విరామ సమయంలో నినాదాలు చేస్తూ, ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో పెట్టి వాటాల రూపంలో అమ్మవలసిన అవసరం లేదంటూ నిరసన తెలియజేశారు. ఎల్ఐసీని లిస్టింగ్ చేయాలన్న ఆలోచన ఎక్కడ నుంచి గుప్పుమన్నదో గాని పెద్ద చర్చే జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదంటే ప్రభుత్వం ఎల్ఐసీని వాటాలుగా చేసి అమ్మాలనే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది. 2017 సెప్టెంబర్ 1న ఎల్ఐసీ సెంట్రల్ ఆఫీస్కు వచ్చిన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2430కోట్ల డివిడెండ్ చెక్కు అందుకుంటూ ఇంత పెద్ద ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో పెట్టినట్టయితే దీనికి విపరీతమైన విలువ వస్తుందని ఆ రోజే తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఆ తరువాతి కాలంలో అనగా 2018 బడ్జెట్లో జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్లో పనిచేస్తున్న ఐదు ప్రధాన కంపెనీలలో రెండింటిలో జీఐసీ రీ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీలో పదిశాతం చొప్పున వాటాలను ఉపసంహరించడం ద్వారా బీమా రంగంలో మార్కెట్లో లిస్టింగ్కు ఈ ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నట్టు బయటపడింది. దానికి కొనసాగింపే ఇది.
మార్కెట్ లిస్టింగ్ నష్టదాయకం
బీమారంగాన్ని ప్రయివేటుపరం చేయ కూడదు. ఇది సేవారంగం. సేవారంగంలో బీమా సంస్థలు అమ్మేది వస్తువులు కాదు ఒక వాగ్దానాన్ని మాత్రమే. ఒక వాగ్దానాన్ని ఇచ్చి నగదు వసూలు చేసి సదరు వాగ్దానాన్ని నిలబెట్టుకునేదే బీమా వ్యాపారం. ఈ వ్యాపా రానికి కావాల్సింది పెట్టుబడులు కాదు ప్రజల నమ్మకం. యజమానికి కూడా 100శాతం జవాబు దారీతనం ఉండాలి. ప్రభుత్వాన్ని మించిన జవాబుదారితనం ఏ ప్రయివేటు సంస్థకు ఉంటుంది?
ఎల్ఐసీ లిస్టింగ్ కోసం ముందుకు వస్తున్న వాదనలేమంటే, గ్రేటర్ ట్రాన్స్ఫరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, టీసీఎస్, రిలయన్స్ కంపెనీలను మించిన పెద్ద సంస్థగా ఏర్పడే అవకాశం ఉన్నదనీ, పెట్టుబడులు పెరిగి మార్కెట్ మరింత విస్తరిస్తుందని. ప్రభుత్వరంగ సంస్థలన్నింటిలోనూ అత్యధిక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కలిగి ఉన్న సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ. ప్రపంచంలోనే అవినీతిరహిత సంస్థగా ఎల్ఐసీకి పేరుందని పార్లమెంటు సాక్షిగా అనేకమంది మంత్రులు కొనియాడారు. ఐఆర్డీఏ ఏర్పడిన తర్వాత కూడా అకౌంటబిలిటీ విషయంలోనూ లేదా ట్రాన్స్ఫరెన్సీ విషయంలోనూ లేదా పన్నుల చెల్లింపు విషయంలోనూ ఏనాడు ఎల్ఐసీ రాజీ పడలేదు. ప్రయివేటు సంస్థలకు విపరీతమైన జరిమానాలు ఐఆర్డీఏ విధించడం జరిగింది. దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగి ఉండి అత్యధిక పొదుపును కలిగి ఉన్న సంస్థలు మార్కెట్లో పెట్టడం ద్వారా కచ్చితంగా అది పెద్ద సంస్థగా అవతరిస్తుంది. కానీ దానివలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం పెద్ద సంస్థగా అవతరించడం కోసమే లిస్టింగ్ చేయాలనడం మూర్ఖత్వం అవుతుంది. ఇక పెట్టుబడులు అవసరం లేని సంస్థలో వాటిని సేకరించి ఆ పెట్టుబడులను తిరిగి ఇన్వెస్ట్ చేయించి, వాటిపైన లాభాల్ని ఆర్జించడానికి ప్రయత్నించి వాటాదారులకు లాభాలు అందించేందుకు ప్రయత్నించడంలో బీమా రంగ ముఖ్య ఉద్దేశ్యం దెబ్బతింటుంది. బీమారంగం ముఖ్య ఉద్దేశం బీమా దారులకు సరైన కాలంలో క్లెయిమ్లు చెల్లించాలి. వారు చెల్లించిన ప్రీమియమ్ సక్రమంగా పెట్టుబడులు పెట్టి మరణం లేదా మెచూరిటీ సందర్భంలో నమ్మకంగా తిరిగి చెల్లించాలి. అందుకోసమనే ఎల్ఐసీ ఏర్పడినప్పుడే ఎల్సీి యాక్ట్ ప్రకారం సెక్షన్ 27ఎ క్రింద ఎల్ఐసీ పెట్టుబడుల్లో కనీసం 25శాతం కేంద్ర ప్రభుత్వంలో, మరో 25శాతం ప్రభుత్వం నిర్ధారించిన మౌలికరంగాల్లో పెట్టాలనీ మరో 15శాతం అనుమతినీయబడిన సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలని, మిగతా 35శాతం మాత్రం అప్రూవుడ్ ఇతర విభాగాల్లో పెట్టుబడులుగా పెట్టాలని నిర్దేశించబడి ఉన్నది. అంత పకడ్బందీగా పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టే ఎలాంటి నష్టం లేకుండా ప్రజలకు తిరిగి చెల్లించగలుగు తుంది జీవిత బీమా సంస్థ. ఎల్ఐసీకి బ్రాండ్ విలువ ఉన్నది. ఆస్తులున్నాయి కనుక మార్కెట్లో దీని విలువ చాలా ఎక్కువగానే పలికే అవకాశం ఉన్నది. కానీ వాటాల రూపంలో నగదు సేకరిస్తే నగదును పెంచి పోషించడం కోసం ఒక పెట్టుబడి సంస్థగా బీమా సంస్థ మారిపోయే ప్రమాదముంది. ప్రజలు లేదా పెట్టుబడిదారులు వాటాల రూపంలో సొమ్ము పోగేసి ఆ సొమ్మును అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే బీమా రంగమే అవసరం లేదు, మిగతా ఆర్థికరంగ సంస్థల ద్వారా లాభాలను గడించవచ్చు. ఇప్పుడు ఆర్జిస్తున్న లాభాలలో 95శాతం పాలసీదారులకు బోనస్ రూపంలో చెల్లించబడుతుంది. బీమారంగం లిస్టింగ్ అయిన తర్వాత వాటాల రూపంలో కొత్త హక్కు దారులు చేరినాక వచ్చిన లాభాల్లో 95శాతం పాలసీ దారులకు ప్రకటించిన తరువాత వాటాదారులను 5శాతం లాభాలకే పరిమితం చేయగలరా? వాటాల అమ్మకం జరిగిన తర్వాత మూడు ప్రధానమైన మార్పులు చోటుచేసుకుంటాయి. 1. వచ్చిన లాభాల్లో 95శాతం పాలసీదారులకు పంచడం జరగదు. 2. సేకరించిన పొదుపులను ఇన్వెస్ట్ చేయడం కోసం ఇప్పుడున్న పద్ధతులు మార్చి మార్కెట్కు అనుసంధానం చేయడం వల్ల విపరీతమైన ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నది. 3. బీమా కల్పించాలనే ఉద్దేశం పోయి లాభార్జనే ముందుకొస్తుంది. గత 20 ఏండ్లుగా ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న ఏ ఒక్క జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని మించిన బోనస్ ప్రకటించకపోవడం ఇందుకు ఉదాహరణ.
జాతీయకరణ ప్రధాన ఉద్దేశ్యాలు
బీమారంగం జాతీయకరణకు ముందు దేశంలో 245 ప్రయివేటు కంపెనీలు జీవిత వివాహ వ్యాపారం చేస్తూ ఉండేవి. ఇన్ని కంపెనీలు ఉన్నప్పటికీ కూడా బీమా కల్పించడం కేవలం పట్టణాలకు లేదా సెలెక్టెడ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. జీవిత బీమా కలిగి ఉండాలన్న అవగాహన ఆ రోజుల్లో అతి తక్కువ మందిలో ఉండేది. యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులంతా రోడ్డున పడే దుస్థితి మారాలంటే జీవిత బీమా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. బీమా చేయడాన్ని ఎవ్వరూ అవసరంగా భావించరు కాబట్టి ఆ పని చేయగలిగేది ప్రభుత్వరంగం మాత్రమే. కాబట్టి 245 ప్రయివేటు కంపెనీ లన్నిటినీ కలిపి భారతీయ జీవిత బీమా సంస్థగా 1956లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా, సి.డి. దేశ్ముఖ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో జాతీయం చేయబడింది. ప్రతి మారుమూల ప్రాంతానికి బీమా రంగం విస్తరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని, ప్రజలు దాచుకున్న సొమ్ముకు భద్రత కల్పిస్తూ ఇచ్చిన మాట ప్రకారం చెల్లింపులు చేయాలని, ప్రీమియం రూపంలో ప్రజల దగ్గర నుంచి కూడ గట్టిన డబ్బునంతా జాతీయ ప్రాజెక్టుల్లో- మౌలిక సదుపాయాల కల్పనలో ఉపయోగించాలనే ముఖ్య ఉద్దేశాలను నిర్ణయించారు. ప్రీమియంపై వచ్చిన సంపాదనలో, ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వం పెట్టింది కాబట్టి 5శాతం ప్రభుత్వానికి చెల్లించాలని పాలసీదారులకు 95శాతం బోనస్గా ప్రకటించా లని ఆనాడు చట్టమైంది. నిర్దేశించిన ఈ లక్ష్యాలను తూచా తప్పకుండా జీవిత బీమా సంస్థ పాటిస్తూ వచ్చింది. జాతీయకరణం చేయబడిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ ప్రత్యక్షంగా ఎల్ఐసీ అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. ఉద్యోగులు ఏజెంట్లు కలిసికట్టుగా శ్రమించి పాలసీదారుల నమ్మకానికి తగ్గట్టుగా ఉండటంవల్ల ఈ రోజు మహావృక్షమై నిలిచింది ఈ సంస్థ.
కేవలం ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో, పదివేల సంఖ్య కన్నా తక్కువ ఏజెంట్లతో మొదలైన ఎల్ఐసీ నేడు 31 లక్షల కోట్ల ఆస్తుల్ని కలిగి, 28లక్షల కోట్ల మిగులుతో 12లక్షల మంది ఏజెంట్లు, లక్ష పదకొండు వేల ఉద్యోగులతో దేశంలోనే అత్యంత పెద్ద ఆర్థికరంగ సంస్థగా ఎదిగింది. 2048 శాఖలను 1430 ఉప శాఖలను, పన్నెండు వందల దాకా మినీ ఆఫీసులను కలిగి ఉంటూ ప్రజలకు చేరువై, బీమాకు ప్రత్యామ్నాయ పేరుగా అభివృద్ధి చెందింది. గత 60ఏండ్ల అప్రతిహత ప్రయాణంలో ప్రజల పొదుపులను సేకరిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వానికి కావాల్సినంత ధనాన్ని అందిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్రపోషించింది. ఇప్పటి వరకు ఏర్పరచిన అన్ని పంచవర్ష ప్రణాళికలకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అందించింది. లిస్టింగ్ చేయాలన్న నిర్ణయం అమలయితే ఈ ప్రభుత్వ, ప్రజల ప్రయోజనాలన్నీ దెబ్బతింటాయి.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016