Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. దానికి ధీటుగా చైనా తాను చేయాల్సింది తాను చేసుకుపోతోంది. ఒక వైపు హాంకాంగ్లో అల్లర్లను రెచ్చగొట్టి ఏదో ఒక పెద్ద ఉదంతం జరిగేలా చూసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేస్తోంది. మరోవైపు తైవాన్కు తాజాగా 220కోట్ల డాలర్ల మేర ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించి చైనాను రెచ్చగొడుతోంది. చైనా నుంచి 300బిలియన్ డాలర్ల దిగుమతులపై పదిశాతం సుంకాన్ని పెంచనున్నట్టు ట్రంప్ ప్రకటించాడు. దానికి ప్రతిగా చైనా యువాన్ విలువ తగ్గించటం లేదా పతనాన్ని నిరోధించకుండా చైనా ఉపేక్షించిందని వార్తలు వచ్చాయి.
హాంకాంగ్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా నేరాలు చేసిన వారిని విచారించేందుకు ప్రధాన భూ భాగానికి అప్పగించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించరాదనే డిమాండ్తో అక్కడ తొమ్మిది వారాల క్రితం ఆందోళన ప్రారంభమైంది. ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నామని, అది రద్దయినట్టే అని పాలక మండలి ప్రకటించిన తరువాత కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అలాంటి బిల్లును ఎన్నడూ పెట్టకూడదు అంటూ ఆందోళనకారులు పాలనా మండలి భవనం మీద దాడి చేశారు. రోజుకో పేరుతో ఆందోళనకు వీధుల్లోకి వస్తూ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మీద దాడులు చేసి రెచ్చగొట్టటం, తద్వారా శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. అంతేకాదు, తమకు మరింత ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బ్రిటన్, అమెరికా తదితర దేశాలు వంతపాడుతున్నాయి.
తాజాగా ఐదు రోజుల నిరవధిక ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం నుంచి మెట్రో స్టేషన్లలో ప్రవేశించి ప్రయాణీకులను దించేయటం, తలుపులను మూసుకోకుండా చేసి రైళ్లను కదలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దానిలో భాగంగానే విమానాశ్రయాల్లో ప్రవేశించి తిష్టవేయటం, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని అడ్డుకోవటం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేయటం వంటి చర్యలూ ప్రారంభించారు. ఇంతగా రెచ్చగొట్టినప్పటికీ పాలనా యంత్రాంగం, స్ధానిక పోలీసులు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మిలిటరీ దళాలను రంగంలోకి దించేందుకు పాలక మండలికి అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించలేదు. ఆందోళనకారుల వెనుక అమెరికా ఇతర దేశాల హస్తం ఉందని గ్రహిస్తున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. మరోవైపు శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా ఆందోళనకారుల చర్యలు ఉన్నాయి. ఈ పూర్వ రంగంలో చైనా ప్రభుత్వం ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పూనుకున్నట్టు ముఖ్యంగా పశ్చిమ దేశాల మీడియాలో వీటి గురించి చిలవలు పలవలుగా కధనాలు వండి వార్చుతున్నది. మిలిటరీని దించబోతున్నారన్నది వాటిలో ఒకటి.
జూన్ 9నుంచి ఇప్పటి వరకు చట్టవిరుద్ధంగా సమావేశాలు జరపటం, పోలీసుల మీద దాడి, కొట్లాటలకు దిగటం వంటి చర్యల్లో పాల్గొన్నందుకుగాను 420మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ఒక్క సోమవారంనాడు అరెస్టు చేసిన వారే 82మంది ఉన్నారు. కొందరు సిబ్బంది సమ్మెకారణంగా 170విమానాలు నిలిచిపోయాయి. వారాల తరబడి జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆర్ధికంగా కొన్ని రంగాలు దెబ్బతిన్నాయి. టూరిజం, దాని సంబంధిత కార్యకలాపాలు, దుకాణాల్లో అమ్మకాలు, స్టాక్ మార్కెట్లో సూచీలు పడిపోయాయి. హాంకాంగ్ పాలనా మండలి అధ్యక్షురాలు లామ్ రాజీనామా చేయాలన్నది ఆందోళనాకారుల డిమాండ్లలో ఒకటి. అయితే తాను పదవి నుంచి తప్పుకోబోవటం లేదని, నగరంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు. నిరసన తెలిపే హక్కును గౌరవిస్తామని అదే సమయంలో నిరసనకు దూరంగా వున్న వారి హక్కులను నిరసనకారులు కూడా గౌరవించాలని అన్నారు. ఆందోళన ప్రారంభంలో చేసిన డిమాండ్లకు బదులు ఇప్పుడు కొత్తవాటిని ముందుకు తెస్తున్నారని, ప్రాణాలకు సైతం తెగించి అమీ తుమీ తేల్చుకుంటామని చెబుతున్నారని ఆమె చెప్పారు. మరోవైపున ఆందోళన నిర్వహిస్తున్న వివిధ బృందాలలో అంతర్గత విభేదాలు కూడా వెల్లడయ్యాయి. శాంతియుత నిరసన స్ధానంలో హింసాపూరితమైన వేర్పాటువాద శక్తులు ప్రవేశించారని సామాజిక మాధ్యమంలో కొందరు విమర్శించారు. 2016జూలై ఒకటిన ఇచ్చిన నిరసన పిలుపు విఫలం కావటంతో తీవ్రవాద బృందాల మధ్య మీరంటే మీరు కారకులనే ఆరోపణలు చివరకు దెబ్బలాటలకు దారితీశాయని పరిశీలకులు గుర్తుచేశారు.
ఆందోళనకారులపై మిలిటరీ చర్య తీసుకుంటే చైనా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అమెరికా టీవీ సీఎన్ఎస్ బెదిరించింది. హాంకాంగ్ వీధుల్లో చైనా మిలిటరీ కవాతు గురించి కొద్ది వారాల క్రితం ఊహించ లేదని ఇప్పుడు ఆ అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యాత పేర్కొన్నారు. నిరసనకారుల హింసాకాండను సహించరాదని హాంకాంగ్లోని కమాండర్ వ్యాఖ్యను ఉటంకిస్తూ మిలిటరీ రంగంలోకి దిగే అవకాశం ఉందని అమెరికా మీడియా చెబుతోంది. 1989లో తియాన్మెన్ మాదిరి జరగవచ్చని ఊహాగానాలను కుమ్మరిస్తోంది. హాంకాంగ్లో పరిస్థితి చేయిదాటి పోయినప్పుడు అక్కడున్న ఆరువేల మంది సైన్య సహాయం కోరేందుకు అక్కడి పాలనా వ్యవస్థకు చట్టబద్దమైన అవకాశం ఉంది.
ఒకే దేశం రెండు వ్యవస్థలు అనే విధానాన్ని అమలు జరిపి 2050వరకు చైనాలో విలీనమైన హాంకాంగ్, మకావో దీవుల్లో విలీనానికి ముందున్న వ్యవస్థల్నే కొనసాగిస్తామని వాటి అప్పగింతల సమయంలో బ్రిటన్, పోర్చుగీసులతో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అందువలన అనేక బహుళజాతి కంపెనీలకు యిప్పటికీ హాంకాంగ్ ఒక కేంద్రంగా కొనసాగుతోంది. దీని వలన చైనాకు ఎంతో లబ్ది కలుగుతోంది. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్న వారి వెనుక అమెరికా హస్తం ఉందని యిప్పటికే చైనా విమర్శిం చింది. ఆందోళనలతో హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం ద్వారా చైనాకు నష్టం కలిగించాలన్న దుష్టాలోచన కూడా అమెరికాకు ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తన మార్కెట్ను అంతర్జాతీయ కంపెనీలకు పూర్తిగా తెరవకుండానే హాంకాంగ్ ద్వారా చైనా లబ్ది పొందుతోంది. 2016లో చైనాకు వచ్చిన ఎఫ్డీఐలో 61శాతం హాంకాంగ్ నుంచే ఉందని సీఎన్ఎన్ పేర్కొన్నది. చైనా సైన్యం కనుక ఆందోళనకారులను అణచివేస్తే ప్రపంచ స్టాక్మార్కెట్లో హాంకాంగ్కు ఉన్న ఐదవ స్థానం తీవ్రంగా పడిపోతుందని, కంపెనీలు సింగపూర్కు తరలిపోతాయని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. హాంకాంగ్కు ఉన్న సానుకూల వాణిజ్య హౌదా రద్దు చేయాల్సి ఉంటుందని కొంతమంది అమెరికా ఎంపీలు బెదిరించారు. ఒక వేళ సైన్యాన్ని దించి మరో తియాన్మెన్ ఉదంతం పునరావృతమైతే దాన్ని ప్రపంచానికంతటికీ ప్రత్యక్ష ప్రసా రం చేస్తారని ఆస్ట్రేలియాకు చెందిన బెన్బ్లాండ్ హెచ్చరించాడు.
తైవాన్ ఒక దేశం కాదు. ఐక్యరాజ్యసమితి వేదికలపై దాన్ని చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తున్న అమెరికా శాంతియుత పద్ధతుల్లో విలీనం కాకుండా చేయాల్సిందంతా చేస్తోంది. తమ కౌలు గడువు ముగిసిన తరువాత హాంకాంగ్ను బ్రిటిష్ వారు తిరిగి చైనాకు అప్పగించారు. తైవాన్ గత ఏడు దశాబ్దాలుగా తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది. దానిని స్వాధీనం చేసుకోవటానికి చైనాకు కొద్ది గంటలు చాలు, అయినా అక్కడి జనం అంగీకారంతో జరగాలి గనుక ఎలాంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. హాంకాంగ్ విలీనమైనా అక్కడి పరిస్థితుల కారణంగా వెంటనే ప్రధాన భూభాగంతో మమేకం చేయకుండా ఒకే దేశం, రెండు వ్యవస్థల పేరుతో 2050వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని, ప్రత్యేక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని విలీన సమయంలో ఒక హామీ పత్రం రాసి ఇచ్చింది. ఇదే సూత్రాన్ని తైవాన్కు కూడా వర్తింప చేసేందుకు చైనా ఆ విధానాన్ని ఎంచుకుంది. పోర్చుగీసు కౌలు నుంచి విలీనమైన మకావో దీవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింప చేసింది.
తాజాగా తైవాన్ ప్రభుత్వానికి 220కోట్ల డాలర్ల విలువ గల ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించుకుంది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తున్నాం కనుక తాము ఆయుధాలు విక్రయిస్తాం అంటూ అమెరికా అడ్డగోలు వాదనలు చేస్తోంది. అమెరికా చర్యకు ప్రతిగా చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. ఇంకేముంది చూడండి తైవాన్ స్వాతంత్య్రం కోరే వారిని భయపెట్టేందుకే అమెరికా నానాయాగీ చేస్తోంది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే మిలిటరీ విన్యాసాలు నిర్వహించాలని చైనా నిర్ణయించింది. అయితే ఈ చర్య తైవాన్ స్వాతంత్య్రం కోరుకొనే వారిని బెదిరించటమే అని అమెరికా మీడియా వక్రీకరిస్తోంది. తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకే తాము ఆయుధాలు అందచేస్తున్నా మని, ఆ ప్రాంతానికి మిలిటరీ తరలిస్తున్నామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది. అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని దెబ్బతీసేందుకు, తన ప్రయోజనాలను కాపాడు కొనేందుకు చైనా ప్రయత్నిస్తోంది. సోమవారంనాడు యువాన్ విలువ అనూహ్యంగా పతనమైంది. చైనా తలచుకుంటే దాన్ని నివారించవచ్చని అయితే కావాలనే ఉపేక్షించిందని వార్తలు వచ్చాయి. యువాన్ పతనమైతే చైనా నుంచి సరుకులను దిగుమతి చేసుకొనే వారికి లబ్ది కలుగుతుంది. ట్రంప్ కనుక దిగుమతులపై ఇంకా సుంకాలను పెంచితే యువాన్ విలువ ఇంకా పతనమవుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఇంకా పెరిగి అమెరికా నష్టపోనుంది. వాస్తవానికి అమెరికా వాణిజ్య బెదిరింపులను తట్టుకొనేందుకు ఒక్క చైనాయే కాదు అనేక దేశాలు తమ కరెన్సీల విలువల పతనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపున తన ఎగుమతులను పెంచుకొనేందుకు డాలరు విలువ తగ్గించాలని అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఈ పూర్వరంగంలో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. నిరసనకారులు ఎంతగా రెచ్చగొడు తున్నా వారి మీద స్థానికుల్లో వ్యతిరేకత మరింత పెరిగే వరకు మౌనంగా వున్నవారు నిరసనకు వ్యతిరేకంగా గళం విప్పే వరకు హంకాంగ్ విషయంలో చైనా వేచి చూసే అవకాశం ఉంది. తైవాన్కు ఆయుధాలు విక్రయించటం అమెరికాకు ఇదే కొత్త కాదు. ఇక వాణిజ్య యుద్ధం మరింత ముదరనున్నదనే వార్తల పూర్వరంగంలో చైనా కరెన్సీ యుద్ధ రంగాన్ని తెరిచేందుకు నిర్ణయించిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. రానున్న రోజుల్లో యువాన్ విలువ కదలికలను బట్టి ఒక అంచనాకు రావాలి తప్ప ప్రస్తుత పతనాన్ని బట్టి నిర్ధారణలకు రాలేము.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288