Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీనేజ్లో ఉన్న ఆడపిల్లలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలలో చాలా వరకు తమ పాత్ర లేకుండా బలైపోతున్న బాధితుల వ్యధలతో ఉన్నవే. కానీ కాలేజీలో ప్రేమ పేరుతో ఆరాచకాలకు ఒడిగట్టే యత్నాలు శ్రీలక్ష్మి, మనోహర్ కేసు నుంచి పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రేమించలేదని దాడులు చేసేవారు కొందరైతే, ప్రేమ తర్వాత పెండ్లి నుంచి తప్పించుకోవడానికి హత్యలు చేసేవారు ఇంకొందరు. రెండో కోవకు చెందిన యువతే శ్వేత అగర్వాల్.
2015లో ఇంటర్ స్టేట్ ఫస్ట్ విద్యార్థిని ఆమె..
ప్రేమలో తలెత్తిన వివాదాలు ఆమె హత్యకు
దారి తీసాయి..
ప్రేమ కోసం ప్రాణం ఇస్తాడు అనుకుంది..
కానీ అతడే ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాడు..
ఇది జరిగింది 2017లో. ఈ నెల మూడవ తేదీన నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శ్వేత అగర్వాల్, గోవింద్ సింఘాల్ ప్రేమించుకున్నారు. 2017 డిసెంబర్ 4న ఆమె గోవింద్ ఇంటికి వెళ్లింది. అయితే పెండ్లి విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదం మొదలైంది. దీనితో గోవింద్ శ్వేత తలను గోడకేసి బాదాడు. తలకు బలమైన గాయమవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
తల్లి, సోదరి సాయంతో గోవింద్ శ్వేతపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. విచారణ అనంతరం శ్వేత హత్యకు గురైనట్టు పోలీసులు తేల్చారు. ఆ ముగ్గురిపై హత్య కేసు నమోదు చేశారు. కోర్టవారిని దోషులుగా తేల్చింది. రెండేండ్ల అనంతరం గోవింద్కి మరణశిక్ష, అతని తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ గుహపాటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రేమ (ఆకర్షణ) వలయంలో చిక్కుకుని ఆ భావన లేకపోతే జీవితంలో యవ్వనం వృధా అని బాధపడే యువతే నేడు ఎక్కువశాతం ఉన్నారు. 'ప్రేమ లేదా ఆకర్షణ' అన్న విషయాలను పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఉండేవారు కొందరైతే, అదే జీవితం అనుకుని దాని కోసం చదువు పక్కన పెట్టి ప్రాణాల వరకు తెచ్చుకునే వారు ఇంకొందరు.
ఇదే నెలలో బెంగుళూరులో జరిగిన ఇంకో ఉదంతం అమ్మాయిల భద్రతకే ప్రశ్నలా మారింది. సిరుగుప్ప పట్టణంలో 10వ వార్డుకి చెందిన హారతి 15 రోజుల క్రితం అదృశ్యమైంది. తండ్రి జయసింగ్ హల్వారీ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను అబ్దుల్లా అనే అతను 18మందితో కలిసి కిడ్నాప్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఇలా నెలలో ఒకే వారంలో కనీసం ఓ పది కేసులయినా మన దృష్టికి వచ్చే దురదృష్టకర పరిస్థితులు నేడున్నాయి. ఇటువంటి పరిస్థితులు అనివార్యంగా వస్తూ ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? అన్నదే ప్రస్తుతం సమాజం ముందున్న ప్రశ్న.
ఇన్ని విషయాల మధ్య ఓ ఓదార్పుగా నిలిచింది శ్వేతా అగర్వాల్ విషయంలో నిందితులకు పడిన శిక్ష. ఇటువంటి అత్యాచారాలు ఎన్నో చోటుచేసుకుంటున్నా శిక్షల విషయంలో న్యాయం జరుగుతున్నవి మాత్రం అల్పమే అని చెప్పుకోవచ్చు. టీనేజ్లో ఉన్న పిల్లలు ఎక్కువగా స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అన్ని విషయాలు తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈ వయసులో పిల్లలపై అధిక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వారు ముభావంగా ప్రవర్తిస్తున్నప్పటికీ వారితో రోజుకి ఓ అరగంట లేదా గంట సమయాన్ని కేటాయించాలి. వారు ఎక్కువ సమయం కేవలం ఏకాంతంగా గడపడంలో మొగ్గుచూపుతూ ఉన్నా, లేకపోతే పోన్లలో ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉన్నా, అంత క్రితం ఉన్న అలవాట్లలో ఏమైనా మార్పులు ఉన్నా సరే వారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న విషయాలు తెలుసుకోవాలి. ఏదైనా అనుమానంగా అనిపిస్తే కాలేజీలో వారి ప్రవర్తన, స్నేహితులతో ఎలా ఉంటున్నారు? చదువుకన్నా యితర విషయాలకు ప్రాధాన్యతనిస్తున్నారా? వంటి విషయాలు వాకబు చేయాలి.
అన్నింటిని మనం నివారించలేకపోవచ్చు. కానీ పిల్లల భద్రత విషయంలో అన్ని చర్యలు శ్రద్ధతో తీసుకోవాలి. కనీసం నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం వల్ల సంభవించే ఉదంతాల నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. జీవితంలో అన్నింటికన్నా విలువైంది ప్రాణం. ఒకరు ప్రేమించలేదనో, లేక తమ హీరోయిజం ప్రదర్శించడానికో కొందరు ఆకతాయి కుర్రవాళ్లు చేసే పనులు ఆడపిల్లల ప్రాణాలకు ముప్పు వచ్చే పరిస్థితికి దారితీయొచ్చు. కాబట్టి టీనేజ్లో ఉన్న మగపిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు అప్రమత్తులై ఉండాలి. వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పులు కనిపించినా వెంటనే జాగ్రత్త పడాలి.
ఓ ప్రాణం పోయాకో, నేరం జరిగాకో శిక్ష విధించవచ్చు. కానీ దానివల్ల జరిగిపోయిన నష్టం భర్తీ చేయలేం. కాబట్టి టీనేజ్లో ఉన్న పిల్లల పట్ల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల నిఘా ఉండాలి. ఎందుకంటే అదే వారి భవిష్యత్తుకి రక్షణ.
- రచన శ్రీదత్త
సెల్: 9959181330