Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో లైంగిక హింస ఒక రాజకీయ, సామాజిక ఆధిపత్య ధోరణితో కొనసాగుతోంది. ఉన్నావ్లోని ఒక నవయువతి రకరకాల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ తన బతుకు కోసం చేస్తున్న పోరాటం విషయంలో భారతదేశ న్యాయవ్యవస్థ మనకు పనితీరును చూస్తే నిస్సహాయ స్థితిలో ప్రేక్షకులుగా మిగిలిపోతున్న మరోసారి ఆశ్చర్యం కలుగక మానదు. వ్యవస్థ పనితీరును మెరుగు పరిచేందుకు అనేక దఫాలుగా పోలీసు వ్యవస్థలో, చట్టాలలో సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ, ఆయా విభాగాల సేవలు మానవత్వంతో ఉండాలని చెప్పుకుంటు న్నప్పటికీ పోలీసుస్టేషన్లకు వచ్చేసరికి మాత్రం ఇతర కారకాలే పోలీసులను నడిపిస్తున్నాయి. అవి స్థానిక రాజకీయ అధికారం, వ్యక్తుల ఆర్థిక, సామాజిక, కులమత సమీకరణాలు, స్త్రీల పట్ల ఉండే ద్వేషభావం లాంటి అంశాలతో ముడిపడి ఉంటున్నాయి. అంతేకాక ఒక నేరస్థుడు శిక్షనుంచి తప్పించుకోవడానికి అతనికి పోలీసులలో, ప్రభుత్వ అధికారులలో, వైద్యులలో, రెవెన్యూ అధికారులలో, స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎంతో పరపతి ఉంటే అంత అవకాశాలు ఉన్నాయి.
1970 నుంచి ఇప్పటి వరకూ లైంగిక దాడుల విషయంలో గమనిస్తున్నదేమంటే ఒక గిరిజన మహిళో, దళిత లేక వెనుకబడిన వర్గానికి చెందిన బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదుచేస్తే ఆ ఫిర్యాదును నమ్మకపోగా జరిగిన అన్యాయానికి ఆమెనే నిందించటం, చులకనగా చూడటం, విషయాన్ని కొట్టిపారేయడమే ఎక్కువగా జరుగుతోంది. ఒకవేళ ఆమె తన ఫిర్యాదు తీసుకోవల్సిందిగా గట్టిగా పట్టుబడితే వారు చూపే తీవ్రమైన ఉదాసీనతతో పాటు ఆమె మానసిక స్థైర్యాన్నీ దెబ్బతీస్తారు. ఆమె కుటుంబం కనుక ఆమెను సమర్థించినట్టయితే ఆమెకు కొంత భద్రతా ఊరటా కలుగుతాయి. కానీ మౌనంగా ఉండాలని కుటుంబంలో సహజంగా ఉండే ఒత్తిళ్లతో వారు సమర్థించలేక పోయినట్టయితే మాత్రం ఆమె ఒంటరిగా తన తప్పేమీ లేకపోయినా కళంకిత అనే ముద్రతో ఆమె నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. కనీసం ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావాలంటే చాలా సందర్భాల్లో ఒక ఆందోళనో, ప్రచారమో జరిగితే కానీ అది నమోదు కాదు. లేక దళిత, మహిళా సంఘాలు కానీ, అభ్యుదయ రాజకీయ వర్గాలు, పౌరహక్కుల సంఘాలు కానీ జోక్యం చేసుకుంటేనే ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతోంది.
పౌర ఉదాసీనత
ఉన్నావో ఘటన పరిశీలిస్తే నేరస్తులూ, బాధితురాలి కుటుంబీకులూ ఒకరి కొకరు పరిచయస్తులైనప్పటికీ, ఒకే కులస్తులైనప్పటికీ జరిగిన వరుస సంఘటనలలోనూ అన్యాయంలో ఏమాత్రం తేడాలేదు. దోషిగా ఉన్న వ్యక్తి బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు అతనికి తమ పూర్తి సహకారం అందించారు. బాధితురాలు తనకు న్యాయం జరగాలని పట్టుబట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ముందు ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించిన తరువాతే న్యాయవ్యవస్థ కొంత నిర్ణయాత్మకంగా కదిలింది. ఇంత పెద్ద నేరంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోందేమంటే లైంగికహింస పట్ల ఉన్న పౌర ఉదాసీనతే. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తుల అవసరాలను ఆసరాగా తీసుకొని అధికారంలో ఉన్నవారు హింసకు పాల్పడటం మనం చూస్తుంటాం. 2010లో ఉత్తరప్రదేశ్లోని బండాజిల్లాలో మనం ఈ విధమైన సంఘటన చూశాం. ఒక మైనరు తల్లిదండ్రులు అప్పటి బహుజన సమాజ్పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పురుషోత్తమ్ ద్వివేదీని కలిసి తమ కూతురును కొందరు కిడ్నాప్ చేసి అమ్మేయడానికి చూస్తున్నారనీ, కాబట్టి ఆమెకు రక్షణ కల్పించి సహాయం చేయాలనీ వేడుకున్నారు. కానీ తరువాత సాక్షాత్తూ ఆ ఎమ్మెల్యేనే తనపై లైంగికదాడి చేసినట్టు ఆ బాలిక ఆరోపించింది. అయితే ఉన్నావ్ సంఘటనలో మాదిరి కాకుండా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి ఆమె స్వంతపార్టీ ఎమ్మెల్యే అయినా అతనిపై విచారణకు ఆదేశించారు. అప్పుడు ఆ బాధితు రాలికి ''ఖబర్హరియా'' అనే ఒకే ఒక్క గ్రామీణ మహిళల వార్తా సంస్థ అండగా నిలబడింది.
రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేయడం
ఈ దారుణమైన లైంగికహింసకు సంబంధించిన పరిస్థితులను మనం పరిశీలించాలి. ఉన్నావ్ కేసులోని బాధితురాలు తన పౌరహక్కులో భాగంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేను సహాయం కోరింది. కానీ అతి త్వరలోనే ఆమె తనకు పౌరురాలిగా ఎటువంటి సహాయం అందదని తెలుసుకుంది. ఘోరమైన లైంగిక దాడికి గురయింది. ఈ సంఘటనలో ఆమె తన గౌరవాన్ని కోల్పోవడమే కాక రాజ్యాంగ హక్కులైన జీవించే హక్కు, జీవనోపాధి హక్కులను వరుసగా కోల్పోయింది. ఇవి రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తుల చేతిలోనే కోల్పవడం జరిగింది. ఇవి రాజ్యాంగాన్ని ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ చేతిలోని ఒక ఆభరణంగా చూస్తున్నారే తప్ప అది ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసమనే భావన ఏమాత్రం లేకుండా పోయింది. రెండవది ఉన్నావో, బండాలలో జరిగిన వరుస తప్పిదాలు నేరం చేసిన వారికి పెద్ద తప్పిదాలుగా కనిపించడం లేదు. ఇటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి వారు అనేక మార్గాలు వెతుకుతారు. ముందుగా వారి కుటుంబ సహాయం, తరువాత బంధువులు, వారి కులం వారి సహకారం తీసుకుంటారు. ఎమ్మెల్యే కులదీప్సింగ్ సెంగార్ చేసిన అనేక నేరాల వెనుక అతని తమ్ముడు, అతని అనుచరగణం సహకారం పూర్తిగా ఉంది. అంతేకాక కులదీప్సింగ్, ద్వివేదీల భార్యల మనసులో ఏమున్నా కానీ వారు తమ భర్తలు అటువంటి నేరాలు ఎన్నడూ చేయరనీ వారు చాలా ఉత్తములనీ చెప్పి తమ కుటుంబ పరువు కాపాడటానికి ప్రయత్నించడం కూడా ఒక ముఖ్య విషయం. ఇటువంటి నేరాలు తమ భర్తలు చేశారని ఒప్పుకుంటే అది తమ దాంపత్య జీవితంలో సమస్యలకు దారితీయడమే కాక తమ కులస్తులలో కుటుంబ ప్రతిష్టకు భంగకరమని వారు భావిస్తారు. మహిళలకున్న ఇటువంటి సంక్లిష్ట పరిస్థితి ఆసరాగా చేసుకొని సహజంగానే ఇటువంటి పురుష పుంగవులు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తమను ప్రశ్నించేవారే లేరనే భావజాలంలో ఉంటారు.
ఒకవేళ తమ భార్యలు తమను సమర్థించకపోయినా ఇటువంటి నేరస్తులు అవేమీ పట్టించుకోరు. కుటుంబంలో శక్తివంతుడు పురుషుడే అనే భావదారిద్య్రం వలన మహిళలపై సర్వాధికారాలు కలిగి ఉండటం సహజమైన హక్కుగా వారు భావిస్తారు. కాబట్టి మారిటర్ రేప్ను ఒక సమస్యగా వారు భావించరు. భర్తల కోరికలను తీర్చడం భార్యల విధిగా భావిస్తారు. లేనిపక్షంలో అది మొత్తం వారి సమస్యగానే చూస్తారు. ''మీటూ ఉద్యమం''లో వచ్చిన ఆరోపణలలో కూడా చాలా వ్యతిరేకత రావడం మనం చూశాం.
ఉనికిలో ఉన్న కులవ్యవస్థ
కుల వ్యవస్థ ద్వారా అగ్రకులాలు కొన్ని అధికారాలు గుప్పిట్లో పెట్టుకున్నాయి. పుట్టుకతో వచ్చిన కులాధిపత్యాన్ని నిలుపుకోవడానికి అనునిత్యం అనేక అబద్ధాలు, కుల పెత్తనాలతో ప్రయత్నాలు జరుగుతుంటాయి. కుల వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్ళనూ, పెరుగుతున్న ప్రతిఘటననూ ఎదుర్కొని దాన్ని నిలుపుకోవా లంటే దళితులపై, వెనుకబడిన కులాలకు చెందినవారిపై భావజాలంతోనూ భౌతికంగానూ వారిపై దాడులూ లైంగిక దాడులూ జరపడం ద్వారా కులవ్యవస్థ ఉనికిని కాపాడుతున్నారు. కాబట్టి ఉన్నావో సంఘటనలోనూ, ఇటువంటి ఇతర సంఘటనల లోనూ జరుగుతున్న లైంగికదాడులను మనం ఆ కోణంలో పరిశీలించాలి. మన సమాజంలోని సామాజిక, రాజకీయ ఆధిపత్య భావాలకు ఇవి ఉదాహరణ లుగా ఉన్నాయి. తరచూ జరుగు తున్నా నమోదుకావడానికే అతికష్టంగా మారు తున్న ఇటువంటి నేరాలను మన న్యాయవ్యవస్థ తీవ్రంగా పరిగణించి దృష్టిసారించాలి.
ది హిందూ సౌజన్యంతో..
అనువాదం: కె. నాగలక్ష్మి.
- వి. గీత
సెల్: 9440952110