Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 5-7, 2019 భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులుగా నమోదు కానున్నాయి. ఈ మూడు రోజులు జరిగిన పరిణామాలు, పార్లమెంట్ చర్చలనూ, ఆగస్టు 8 సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని గమనిస్తే 1933 మార్చి 6న జర్మనీ హౌంశాఖ మంత్రి గోరింగ్ సగం కాలిన రీచ్స్టాగ్ (జర్మన్ పార్లమెంట్)లో చేసిన ఉపన్యాసం గుర్తుకొస్తుంది. నాటి గోరింగ్ ఉపన్యాసం వలెనే ఆగస్టు 8 రాత్రి మోడీ ఉపన్యాసమూ నూటికి నూరుపాళ్లు అబద్ధాలతో నిండి ఉంది. గోరింగ్ ఉపన్యాసంలో ఉన్న అబద్ధాల వెనక ఉన్న కుట్ర గురించి ప్రపంచానికి తెలియచేయటానికి దాదాపు నాజీ పాలన నాటి 50వేల పేజీలు వెలుగులోకి వచ్చే వరకు ప్రపంచం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ లోగా రెండో ప్రపంచ యుద్ధం, కోట్ల మంది మరణం, నాగసాకి హిరోషిమా 'అణు'మయం అయ్యాయి. మరి మోడీ-అమిత్షాలు భారత ప్రజాస్వామ్యానికి వ్యతికంగా సాగించిన కుట్ర కోణపు వాస్తవ చరిత్ర వెలుగు చూడటానికి ఎన్ని దశాబ్దాలు ప్రపంచం ఎదురు చూడాలో....
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను అణువణువూ జీర్ణించుకున్న బీజేపీ, ఆరెస్సెస్లు జమ్ము కాశ్మీర్ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రద్దు చేయటానికి అదే రాజ్యాంగంలోని లొసుగులు ఉపయోగించుకున్నాయి. ఈ చట్టం 'మీరు, మేము, జాతి యావత్తూ కలిసి తీసుకున్న చారిత్రక నిర్ణయం'గా మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించటం పచ్చి మోసానికి పరాకాష్ట. మోడీ1.0 హయాంలో చినుకు చినుకుగా మొదలైన ఫేక్ న్యూస్ మూక హత్యలు, మతకల్లోలాలతో పుంజుకుని, 2019 ఎన్నికల నాటికి బీజేపీ అధికారిక విధానంగా మారింది. ఎన్నికల అనంతరం జరిగిన తొలిపార్లమెంట్లో బీజేపీ మంత్రుల ఉపన్యాసాలు గమనిస్తే మోడీ 2.0 హయాం ఫేక్ న్యూస్కి స్వర్ణయుగంగా మారబోతుందని స్పష్టమవుతోంది.
ప్రధాని ప్రసంగం మూడు భాగాలుగా ఉంది. మొదటిది 370, 35ఎ అధికరణాల వల్ల జమ్ము కాశ్మీర్లో జీవితం అంధకార బంధురమైందనీ, వాటిని రద్దు చేయటంతోనే అభివృద్ధి అశ్వమేధపు గుర్రంగా పరుగు తీస్తుందన్నది. రెండోది జమ్ము కాశ్మీర్లో విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, సఫాయి కర్మచారీ చట్టం, కనీస వేతనాల చట్టం, దళితులు, ఆదివాసీలపై అత్యాచారాల నిరోధక చట్టం వంటివి అమలు జరగటం లేదంటూ మాటల మాంత్రికుడి విమర్శ. అంతేకాదు.. ఆర్థిక లోటు, ద్రవ్యలోటు, ప్రయివేటు పెట్టుబడులు రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రాకపోవటానికి కూడా ఈ అధికరణాలే కారణమన్నది ఆయన ఉవాచ. ప్రపంచంలోనే పర్యాటకులకు జమ్ము కాశ్మీర్ ఓ స్వర్గం లాంటిది. ఈ స్వర్గాన్ని కూడా స్వర్గంగా మార్చటానికి బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాలు, అవకాశాలు, అనుసరించనున్న వ్యూహాల గురించిన తాయిలాలు మూడో భాగం. ఇప్పుడు ఒక్కో భాగంలో వాస్తవం ఏమిటి? మాయ ఏమిటి అన్నది పరిశీలిద్దాం.
ప్రధాని ప్రస్తావించినట్టు ఈ రాజ్యాంగబద్ధమైన కుట్రలో మొత్తందేశం భాగం కాదు. కాలేదు. తమ రాష్ట్రాలకు ప్రత్యేక హౌదా కావాలని డిమాండ్ చేస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు జమ్ము కాశ్మీర్కున్న ప్రత్యేక హౌదా రద్దు చేస్తుంటే చప్పట్లు కొట్టడం వెగటుగా ఉంది. పక్క వాళ్ల ఇల్లు తగలబడుతుందంటే పొయ్యి వెలిగించి మరీ నిప్పందించే సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ఈ పార్టీలను పార్లమెంట్కు పంపినందుకు జనంతో సిగ్గుతో చస్తున్నారు. ఇది కేవలం బీజేపీ, ఆరెసెస్ల కుట్ర. పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ఈ విషయం బట్టబయలైంది కాబట్టి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు మాటల మాంత్రికుడు రంగంలోకి దిగాడు.
ఇక జమ్ము కాశ్మీర్లో అభివృద్ధి గురించి మోడీ కార్చిన కన్నీరు ముందు చిన్నప్పుడు చదువుకున్న కథలో కోతి గుండె కోసం మొసలి కార్చిన కన్నీరు కూడా వెలవెలాబోతుంది. మచ్చుకు కొన్ని వివరాలు చూద్దాం. 2017 లెక్కల ప్రకారం శిశుమరణాల రేటు జాతీయ సగటు 33ఉంటే జమ్ము కాశ్మీర్లో 23మాత్రమే. సుదీర్ఘకాలం బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లో ప్రతి వెయ్యిమంది బాలల్లో 47మంది ఐదేండ్లు కూడా నిండకముందే చనిపోతున్నారు. అంటే జమ్ము కాశ్మీర్ కంటే రెట్టంపు పిల్లలు మధ్యప్రదేశ్లో చనిపోయారు. చనిపోతున్నారు. సగటు భారతీయుడి ఆయుష్షు 68.7ఏండ్లు అయితే సగటు జమ్ము కాశ్మీర్ పౌరుడి ఆయుష్షు 73.5ఏండ్లు. దీర్ఘకాలం బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో ప్రజల సగటు జీవితకాలం 65లోపే. అంటే బీజేపీ పాలనలోని ప్రజలకంటే నేషనల్ కాన్ఫరెన్స్ పాలనలోని ప్రజలు ఐదు పదేండ్లు ఎక్కువగా జీవిస్తున్నారు. ప్రతి వెయ్యిమంది పురుషులకు దేశంలో 896మంది మహిళలుంటే జమ్ము కాశ్మీర్లో 917మంది మహిళలున్నారు. సగటు స్థూల జాతీయోత్పత్తి 5.9శాతం ఉంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి 5.5శాతం ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 22శాతం పేదరికం ఉంటే జమ్ము కాశ్మీర్లో పేదరికం రేటు 10శాతం మాత్రమే. నిరుద్యోగం దేశంలో 6శాతం ఉంటే జమ్ము కాశ్మీర్లో సుమారు 5శాతం మాత్రమే. మరి ఆర్థిక వెనకబాటుతనమే రాజ్యాంగపు హక్కులు రద్దు చేయటానికి ప్రాతిపదిక అయితే బీజేపీ ప్రభుత్వంలోని మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, లాంటి అనేక రాష్ట్రాలు కశ్మీర్ కంటే వెనుకబడి ఉన్నాయి. మరి అక్కడ కూడా రాజ్యాంగ హక్కుల రద్దుకు పూనుకోనుందా?
మానవాభివృద్ధిలో జమ్ము కాశ్మీర్ జాతీయ సగటు కంటే ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అమలు జరిగిన భూసంస్కరణలు, వాటి ఫలాలు. ఈ భూసంస్కరణల ఫలాలు కాపాడుకునేందుకు మాత్రమే రాష్ట్రేతర పౌరులకు భూముల కొనుగోలును నాటి ప్రభుత్వం నియంత్రించింది. ఇప్పుడు రాష్ట్రేతర పౌరులు, స్వదేశీ, విదేశీ గుత్తపెట్టుబడిదారులకు ఊడిగం చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ జమ్ము కాశ్మీర్లో తిరిగి పాతకాలపు భూకేంద్రీకరణకు తెరతీసే ప్రయత్నంలోనే ఆ ప్రాంత ప్రజలకున్న ప్రత్యేక హక్కులు రద్దు చేసింది. ఈ వాస్తవం ప్రజలకు చేరకుండా ఉండటానికి ఫేక్ న్యూస్ ప్రొడక్షన్లో ఫేస్బుక్నే మించిపోయిన ప్రబుద్ధులు ఉన్మాదమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు.
చివరిగా దేశంలో అమలు జరుగుతున్న చట్టాలు, జమ్ము కాశ్మీర్లో అమలు జరుగు తున్నాయా లేదా అన్నది పరిశీలిద్దాం. దేశంలో వందల చట్టాలు ఉన్నాయి కాబట్టి మోడీ నోటి వెంట వచ్చిన కొన్ని చట్టాలకే మన పరిశీలన పరిమితం చేద్దాం. కార్మిక చట్టాలు, కనీస వేతన చట్టాలు అమలుతో దేశమంతా కార్మికులు భోగభాగ్యాలతో తులతూగుతుంటే జమ్ము కాశ్మీర్ కార్మికులు వీటికి దూరంగా ఉన్నారన్నది మోడీ నోట మాట. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ వెబ్సైట్ లేబర్.గౌ.ఉఇన్ను తెరిచి చూస్తే కనీస వేతనాలు చట్టం దేశం మొత్తానికి వర్తిస్తుందని తేటతెల్లమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సిబ్బందికి వేతన సెలవులు ఉన్నట్టే జమ్ము కాశ్మీర్లోనూ ఉన్నాయి. 2002లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విద్యా హక్కు చట్టం ప్రాతిపదికన జమ్ము కాశ్మీర్ పాఠశాల విద్య చట్టం 2005 అమలు జరుగుతోంది. సమాచార హక్కు చట్టం 2009లో జమ్ము కాశ్మీర్ శాసనసభ ఆమోదం పొందింది. చట్టసభల్లో రిజర్వేషన్లు లేవన్నది మరో దుష్ప్రచారం. కుల వ్యవస్థ హిందూమతానికి ఉన్న పేటెంట్. ముస్లిం మతంలో కుల వ్యవస్థ లేదు. అందువల్లనే ముస్లిం ప్రజానీకం ఉన్న కాశ్మీర్ లోయలో ఉన్న సీట్లల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు లేవు. హిందూమతాన్ని పాటించే జమ్ము ప్రాంతంలో ఈ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మొత్తం జమ్ము కాశ్మీర్లో 87అసెంబ్లీ స్థానాలుంటే అందులో 7సీట్లు ఎస్సీ రిజర్వుడ్ సీట్లు.
పాత పత్రికలు తిరగేసినా, కొద్దిగా సమయం తీసుకుని గూగుల్ ప్రొఫెసర్ను అడిగినా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అలాంటిది పార్లమెంట్లో కూర్చుని రాజ్యాంగపు హక్కులను భూస్థాపితం చేయటానికి బల్లలు చరుస్తూ ఓటు వేసిన 370మంది పార్లమెంట్ సభ్యులకు, ఈ హక్కులు భూస్థాపితం చేయాలని ప్రతిపాదించిన హౌం మంత్రికి, ప్రధానమంత్రికి ఇవన్నీ తెలీదనుకుంటే ఘోరమైన పొరపాటు అవుతుంది. మత్తు ఇంజక్షన్ తీసుకున్న పేషేంట్కు గుండె కోసినా తెలీదు. కిడ్నీలు తీసినా తెలీదు. మత్తు దిగాక గానీ తాను పోగొట్టుకుంది ఏమిటో తెలుసుకోలేం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మతం ఇంజక్షన్ మత్తులో పడి మనలను మనం మోసగించుకోవద్దు. సిగ్గు ఎగ్గు లేకుండా బరితెగించి ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్న పాలకులను ప్రశ్నించాల్సిన సమయం దగ్గరపడుతోంది.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037