Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన స్వాతంత్య్రో ద్యమ లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని భారత టెలికాం రంగంపై ఒక సమీక్ష.
బీఎస్ఎన్ఎల్ను కాపాడాలని మనం చేసే పోరాటంలో ఆర్థిక స్వావలంబన అనే స్వాతంత్య్రోద్యమ లక్ష్యం యిమిడి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనాన్ని అంతం చేసి ఆర్థిక స్వావలంబన సాధించటం స్వాతంత్య్రోద్యమ ముఖ్యలక్ష్యాలలో ఒకటి. మన వనరులను, మన శ్రమ శక్తిని, మన మార్కెట్ను బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు 250ఏండ్లపాటు దోపిడీ చేశారు. బ్రిటిషు పెట్టుబడి ఇష్టారాజ్యంగా మన దేశానికి రావటం, వెళ్లటం జరిగేది. బ్రిటిషు సరుకులపై ఎటువంటి సుంకాలు విధించకుండా మన దేశంలో అమ్మేవారు. కానీ మనదేశంలో తయారైన సరుకులపై సుంకాలు విధించేవారు. దీనివలన మన పరిశ్రమలు, మన చేతి వృత్తులు దెబ్బ తిన్నాయి. బ్రిటిషు పెట్టుబడులకు అప్పులిచ్చే వారు. భారత పెట్టుబడులకు ఇచ్చే వారు కాదు. భారత కార్మికుల, ప్రజల శ్రమశక్తికి చాలా తక్కువ చెల్లించే వాళ్లు. భారత దేశ దారిద్య్రానికి కారణం మన సంపదని బ్రిటిష్ వాళ్లు తరలించుకు పోవటమేనని ''గ్రాండ్ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియా''గా పేరొందిన మహనీయుడు దాదా భాయి నౌరోజీ రుజువు చేశాడు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన సరుకులపై పన్నులు తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాలు పెంచారు. ఆ విధంగా విదేశీ మన మార్కెట్ను సరుకులు చౌకగా రాకుండా రక్షించుకున్నాం. ప్రభుత్వరంగం, ప్రణాళికా సంఘం, ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి, వ్యవసాయరంగంలో ప్రభుత్వ జోక్యంతో అభివృద్ధి వీటన్నింటి వలన మనదేశం ఆర్థిక స్వావలంబన ఒక మేరకయినా సాధించగలిగింది. మన జాతీయతకు పునాది ఆర్థిక స్వావలంబన.
కానీ భారత బడాపెట్టుబడిదారులు ప్రభుత్వరం గాన్ని ఉపయోగించుకుని ఒక మేరకు తమ పెట్టుబడుల్ని పెంచుకున్న అనంతరం ఇక ప్రభుత్వరంగం అవసరం లేదని, విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కై మన ప్రభుత్వరంగాన్ని, మార్కెట్టును, వనరులను కొల్లగొట్టాలని, విదేశీ బడా పెట్టుబడిదారులతో కలిసి విదేశాలలో కూడా తమ వ్యాపారాలు ప్రారంభించాలని నిర్ణయించారు. పాలక వర్గాలైన పెట్టుబడిదారులు భూస్వాములకు నాయకుడుగా ఉన్న బడా పెట్టుబడిదారులు ఈ విధంగా నిర్ణయించినందున 1992 జులైలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ బూర్జువా పార్టీలు అన్నీ ఈ నూతన ఆర్థిక విధానాలనే అమలు చేస్తూ మన దేశ ఆర్థిక స్వావలంబన లక్ష్యానికి తిలోదకాలిచ్చాయి.
ఈ విధానాలలో భాగంగా టెలికాం రంగంలో పరాధీనత పెరుగుతున్నది. టెలికాం పరికరాల దిగుమతులపై సుంకాలను పూర్తిగా రద్దు చేశారు. దాని వలన విదేశీ పరికరాలు చౌక కాబట్టి మన ప్రయివేటు టెలికాం కంపెనీలు వాటినే కొంటున్నాయి. దీనితో మన స్వదేశీ టెలికాం పరికరాల తయారీ పరిశ్రమ, అందులో భాగంగా ఐటీఐ తదితర టెలికాం పరికరాల కంపెనీలు దెబ్బ తిన్నాయి. మన టెలికాం నెట్వర్క్ విస్తరణకి వాడే పరికరాలలో 83శాతాన్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకు ఏడాదికి సుమారు రూ.50వేల కోట్లు విదేశాలకు చెల్లిస్తున్నాం. ఈ లెక్కన యిప్పటికీ సుమారు ఆరు లక్షల కోట్లు పైగా విదేశాలకు చెల్లించి ఉంటాం. కాగా టెలికాం రంగంలోకి 1.4.2000 నుంచి 30.9.2017 వరకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూ. 1,69,900 కోట్లు మాత్రమే. కాబట్టి మన దేశంలోకి వచ్చే దానికన్నా వెళ్ళే సంపద చాలా ఎక్కువ. ఇంతేగాక గతంలో 14ప్రయివేటు టెలికాం సర్వీసుల కంపెనీలుండగా ఇప్పుడు కేవలం రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ మాత్రమే ఉన్నాయి. ఈ మూడు కలిసి 90శాతం మార్కెట్టును నియంత్రిస్తున్నాయి. మిగతా పది శాతం మార్కెట్టు మాత్రమే బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్కు ఉన్నది. కానీ ఈ మూడూ కూడా ఒక్కొక్కటి లక్ష కోట్ల పైచిలుకు అప్పులలో ఉన్నాయి. అప్పులు తీర్చటానికి ఎయిర్టెల్ తన వాటాల్ని విదేశీ కంపెనీలకి అమ్ముతానని, అందువలన ఎయిర్టెల్ నూటికి నూరుశాతం విదేశీ కంపెనీ అవుతుందని, అందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇక వోడాఫోన్ ఐడియాలో యిప్పటికే 45శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఉంది. ఇది ఇంకో 6శాతం పెరిగితే విదేశీ కంపెనీ అవుతుంది. కాబట్టి ఈ విధానాల వలన మన టెలికాం రంగంలో పరాధీనత పెరుగుతున్నది. ఈ రంగంలో మనం సాధించిన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నదని ఎంత చెప్పుకున్నా వాస్తవం ఇందుకు విరుద్ధం. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్(ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ) 2017లో ప్రకటించిన లెక్కల ప్రకారం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ డెవెలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం ప్రపంచ దేశాలలో 134వ స్థానంలో చాలా వెనకబడి ఉన్నది. చైనా 80వ స్థానంలో ఉంది. ఒకప్పుడు మనకన్నా టెలికాం రంగంలో వెనకబడిన చైనా ఈనాడు అన్ని దేశాలకు తన టెలికాం పరికరాలను (జడ్టీఈ, హువాయి) విరివిగా ఎగుమతి చేసే స్థాయికి ఎలా ఎదగ గలిగింది? చైనా ప్రభుత్వం టెలికాం సర్వీసులలో ప్రయివేటు కంపెనీల్ని అనుమతించ లేదు. అంతా ప్రభుత్వరంగంలోనే ఉంచింది. అందువలన టెలికాం సర్వీసుల మార్కెట్ ప్రభుత్వ అధీనంలో ఉన్నది. కాబట్టి చైనా ప్రభుత్వం ఇతర దేశాల టెలికాం పరికరాల తయారీ కంపెనీలకు తమ దేశంలో అనుమతినిచ్చే సందర్భంగా ఒక షరతు విధించింది. అవి చైనాలో తమ పరిశ్రమని పెట్టి దానిలో ఒక చైనా కంపెనీని భాగస్వామిగా చేసి తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ కంపెనీకి బదిలీ చేయాలని షరతు విధించింది. ఆ విధంగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యేలా చేసి దానిని ఆ తరువాత సొంతంగా అభివృద్ధి చేసి విదేశాలకు అమ్మగలుగుతున్నది. జడ్టీఈ, హువాయి ఈ విధంగానే అభివృద్ధి చెందాయి. కానీ మన దేశంలో టెలికాం సర్వీసుల మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థల్ని దెబ్బతీసి ప్రయివేటు కంపెనీలను ప్రోత్సహించి వాటికి 90శాతం మార్కెట్ను అధీనం చేసినందున ప్రయివేటు కంపెనీలను మన దేశంలో తయారయిన పరికరాలనే కొనాలని నిర్దేశించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రయివేటు టెలికాం సర్వీసుల కంపెనీలపై యిటువంటి నిబంధన విధించలేదు. ప్రభుత్వరంగ సంస్థలపై మాత్రమే ఈ నిబంధన విధించగలదు. కానీ ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్పై ఈ నిబంధన విధించినా వాటి మార్కెట్ వాటా కేవలం 10శాతమే అయినందున ఉపయోగం లేకుండా పోతున్నది.
కాబట్టి మన దేశం టెలికాం రంగంలో స్వావలంబన సాధించాలన్నా, ప్రభుత్వం చెప్పినట్టు ఐసీటీడీ ఇండెక్స్లో 134 నుంచి 2022 నాటికి మొదటి 50దేశాలలో ఒకటిగా ఎదగాలన్నా బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ మార్కెట్ వాటాని పెద్దఎత్తున పెంచాలి. అప్పుడే అవి స్వదేశీ పరికరాలను చెప్పుకోతగిన స్థాయిలో కొనగలుగుతాయి. కాబట్టి బీఎస్ఎన్ఎల్ను కాపాడేందుకు మనం చేస్తున్న పోరాటంలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి అయిన ఆర్థిక స్వావలంబన అనే లక్ష్యం ఉన్నది. బీఎస్ఎన్ఎల్ను కాపాడేందుకు, మరింత బలం చేకూర్చేందుకు మనం పోరాటం కేవలం మన ఉద్యోగాలు కాపాడుకునేందుకో, వేతన సవరణకో మాత్రమే కాదు. ప్రజలకు మెరుగైన సర్వీసు అందించేందుకు లేదా వెనుకబడిన ప్రాంతాలలో సర్వీసు లందించేందుకు, ప్రయివేటు కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచకుండా ఉండేందుకు మాత్రమే కాదు. స్వాతంత్య్ర్రోద్యమ లక్ష్యమైన ఆర్థిక స్వావలంబన కోసం కూడా మనం పోరాడుతున్నామనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.
టెలికాం రంగంలో గానీ మరే ఇతర రంగంలో గానీ ఆర్థిక స్వావలంబన బలపరిచేందుకు ప్రజల కొనుగోలుశక్తిని పెంచే విధానాలను అవలంబించాలి. తద్వారా మన మార్కెట్ పెంచాలి. ఆ విధంగా మన పరిశ్రమల సామర్థ్యం పూర్తిగా వినియోగించు కోగలగాలి. ప్రభుత్వరంగాన్ని పటిష్టం చేయాలి. విదేశీ పెట్టుబడులు, విదేశీ అప్పులపై ఆధారపడకుండా సంపన్నులపై పన్నులు పెంచటం ద్వారా వనరులను సమీకరించాలి. విదేశీ పెట్టుబడిదారులు వారితో కుమ్మక్కవుతున్న స్వదేశీ పెట్టుబడిదారుల సంతోషం కోసం కాకుండా ప్రజల సంతోషం కోసం ఆర్థిక విధానాలను రూపొందించాలి. ఉత్పత్తిని ఉద్యోగితనీ పెంచాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని షరతులు విధించి అందుకు అంగీకరించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని పరిమితంగా అనుమతించాలి. స్టాక్ మార్కెట్లో ఆస్తుల విలువ కృత్రిమంగా పెంచే విధానం కాకుండా భౌతిక ఉత్పత్తులను పెంచే విధానాలను అవలంబించాలి. కేంద్రంలో ఉండే పాలకులకు తగిన రాజకీయ సంకల్పం ఉంటే ఇది సాధ్యమే. కానీ బడా పెట్టుబడిదారుల సంతోషం కోసం పని చేసే ప్రభుత్వాల వలన ఇది సాధ్యం కాదు. కార్పొరేట్సు కోసం కాకుండా ప్రజల కోసం విధానాలను రూపొందించే ప్రత్యామ్నాయ రాజకీయశక్తి బలపడ కుండా మన దేశం నిజమైన ఆర్థిక స్వావలంబన సాధించ లేదు. ఒక వంక దేశ ఆర్థిక వ్యవస్థని విదేశీ పరం చేస్తూ ప్రజలను దేశ భక్తి పేరుతో మతం పేరుతో ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని రెచ్చగొట్టటం కుహనా జాతీయత అవుతుందేగానీ నిజమైన జాతీయత కాదు. ఇటువంటి కుహనా జాతీయవాదాన్ని బలపరచే విధంగా మీడియా విపరీతంగా పని చేస్తున్నాయి. దేశం అంటే సరిహద్దులకు పరిమితమైన ఒక భూభాగం మాత్రమే కాదు. దేశమంటే మట్టి కాదోరు.. దేశమంటే మనుషులోరు.. అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. మన దేశంలో ఉండే ప్రజలందరిదీ మన దేశం. ''సబ్ కా దేశ్ హమారా దేశ్'' అనే నినాదాన్ని గౌరవించలేని వాళ్లు కుహనా దేశ భక్తులే. బీఎస్ఎన్ఎల్ను కాపాడేందుకు మనం చేసే పోరాటం మన ఆర్థిక స్వావలంబనని కాపాడే దేశ భక్తియుతమైన పోరాటంగా మనం గుర్తించాలి. ఈ పోరాటం జయప్రదమయ్యేందుకు అన్ని విధాలుగా మన కృషి ఉండాలి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ కర్తవ్యానికి పునరంకితం కావాలి.
- పి. అశోక్బాబు