Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటాన్ని సమర్థించటానికి రాజ్యసభలో చేసిన ప్రసంగంలో అమిత్ షా కాశ్మీర్ 'అభివృద్ధి' అనే విషయాన్ని లేవనెత్తాడు. మిగిలిన భారతదేశంతో కాశ్మీర్ మరింతగా విలీనం కావటంవల్ల ఆ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు తరలొస్తాయని ఆయన వాదించాడు. కాశ్మీరీ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు రానున్నాయని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. గత 45ఏండ్లలో ఎన్నడూలేనంతగా నిరుద్యోగం రాజ్యమేలుతున్న నేటి స్థితిలో భారతదేశంలో మరింతగా విలీనమైతే కాశ్మీర్లో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయనటం ఆశ్చర్యం. మనం ఈ వాదనను మరింత దగ్గరగా పరిశీలిద్దాం.
ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా లేకపోయినా అమిత్ షా పేర్కొన్నట్టుగా స్థానిక ముడిపదార్దాల వినియోగం లేకుండా భారీ పరిశ్రమలు కాశ్మీర్లోకి వస్తాయని చెప్పటం మూర్ఖత్వమే అవుతుంది. కాశ్మీర్లో ఫ్యాక్టరీ పెడితే రవాణా ఖర్చులు భరించలేనంతగా ఉంటాయి. 'బయటవారు' భూమి కొనటానికి నిరాకరించే 35ఎ అధికరణాన్ని రద్దు చేయటంతో భూమి ధర పెరుగుతుందని, అది 'సానుకూల అభివృద్ధి' అని షానే స్వయంగా చెప్పారు. కాబట్టి ఎటువంటి ప్రతిబంధకాలు లేనందున కాశ్మీర్ లోయలోకి భారీ పరిశ్రమలు అలవోకగా అరుదెంచుతాయని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. ఇదే తర్కం చిన్నతరహా పరిశ్రమలకూ వర్తిస్తుంది.
కాబట్టి ఉన్ని లేక పండ్లు లేక కలప లేక మాంసంవంటి స్థానిక ముడి పదార్థాలను ఉపయోగించే కార్యకలాపాలు మాత్రమే కాశ్మీర్లో వర్థిల్లుతాయి. ఆ రాష్ట్రంలో యిప్పటికే అటువంటి కార్యకలాపాలు బాగా నిలదొక్కుకున్నాయి. వాటిని బాగా ప్రోత్సహించటమే నేటి ఆవశ్యకత. అందుకోసం ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయటం, బయటివాళ్ళు భూమి కొనటాన్ని అడ్డుకునే నియమ నిబంధనల్ని తొలగించటంవంటి చర్యలు కాదు కావలసింది. సహానుభూతి వ్యక్తంచేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలి.
మిగిలిన దేశానికి తలుపులు బార్లా తెరిస్తే బహుళజాతి కంపెనీలు లేక భారతీయ బడా వ్యాపార సంస్థలు ఈ కార్యకలాపాలను అభివృద్ధి చేసి కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తాయని అనుకుంటున్నారేమో. అయితే స్థానికులు ఏ ఆర్థిక కార్యకలాపాలలో నిమగమై ఉన్నారో అదే కార్యకలాపాలలో భారతీయ లేక విదేశీ బడా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడితే ఉద్యోగిత పెరగదు. దానితో స్థానిక ఉత్పత్తిదారులకు స్థానభ్రంశం జరిగి ఉద్యోగిత కుదింపబడవచ్చు. ఒకవేళ అటువంటి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంటే కాలక్రమంలో అటువంటి కార్యకలాపాలలో పెరుగుదలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో స్థానిక ఉత్పత్తిదారులే ఉపయోగించు కోగలుగుతారు. కాబట్టి స్థానిక ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు బడా పెట్టుబడిని ప్రవేశపెడితే కాలక్రమంలో ఉద్యోగిత సృష్టి స్థానిక ఉత్పత్తిదారులు సృష్టించినదానికంటే తక్కువగానే ఉంటుంది. ఉద్యోగిత సృష్టి ఎటువంటి పరిస్థితులల్లోనూ ఎక్కువగా ఉండనే ఉండదు.
కాశ్మీర్ లోయలో భూమి కొనటానికి బయటివాళ్లు ప్రవేశించటంపైనే అసలు 'ఆశ' ఆధారపడి ఉందని అమిత్ షా అంటున్నాడు. హిమాచల్ప్రదేశ్, ఇతర పర్వత సరిహద్దు రాష్ట్రాలలో బయటివారు భూమి కొనటానికి ఆంక్షలు కొనసాగుతుండగా కేవలం కాశ్మీర్లో 'అభివృద్ధి' పేరుతో ఆంక్షలు తొలగించటం విడ్డూరమే ఐతే కాశ్మీర్లో అభివృద్ధికి భూమి అమ్మకం కారణమౌతుందా? ఒక వ్యక్తి భూమి కొనుగోలు చేసినప్పుడు అందుకోసం అతను మరొక ఆస్తిని వదులుకుంటాడు. భూమి అమ్మేవాడికి దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఏ ఇతర ఆస్తి అనేదే ఇక్కడ ప్రశ్న. ఒకవేళ భూమి కొనుగోలుదారులు తమ ఉత్పాదక ఆస్తుల్ని వదులుకుని కాశ్మీర్ లోయలో భూమి కొంటే దానితో మిగిలిన భారతదేశంలో తిరోగమన ప్రభావం ఉంటుంది. అయితే ఇలా జరగదనుకుని అమిత్షాకు అనుకూలమైన దృశ్యాన్ని పరిశీలిద్దాం. అదేమంటే భూమి కొనుగోలుదారులు తమ వద్దనున్న నగదుతో భూమిని కొంటారనుకుందాం. దీనితో మిగిలిన దేశంలో ప్రాథమికంగా పెట్టుబడులలో కోత ఉండదనుకుందాం. వాస్తవంలో కాశ్మీర్లోయలో భూమి కొనటానికి బ్యాంకుల వ్యవస్థ అప్పిస్తుందని అనుకుందాం. అందుకు అవసరమయ్యే నగదు సరఫరాకు ఆటంకం ఉండదని కూడా అనుకుందాం.
ఇప్పుడు ముందుకొచ్చే ప్రశ్న ఇలా ఉంటుంది. భూమి అమ్మేవారు తమకు వచ్చే నగదుతో ఏమి చేస్తారు? మనం చర్చించిన కారణాలవల్ల వారు స్థానిక ఉత్పత్తుల ఉత్పత్తిని విస్తృతం చేయటానికి తప్ప మరో రూపంలో కాశ్మీర్ లోయలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. అయితే స్థానిక ఉత్పత్తిని విస్తృతపరచటానికి ఫైనాన్స్ కొరత ఉందనుకోవటానికి ఎటువంటి కారణం లేదు. అటువంటి ఉత్పత్తిని గణనీయంగా విస్తృతపరచటానికి అవకాశం ఉండవచ్చు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వ జోక్యం బలంగా ఉండాలి. కాబట్టి కేవలం భూమి అమ్మగావచ్చిన డబ్బు ఉన్నంత మాత్రాన అది ఉత్పత్తిని పెంచే పెట్టుబడిగా మారదు(లేకపోతే భూమిని అమ్మనవసరం లేకుండానే పెట్టుబడి పెరిగి ఉండేదే). కాబట్టి ఈ నగదును బ్యాంకులలో డిపాజిట్ చేసే అవకాశమే ఎక్కువ. అలా వచ్చిన నగదును బ్యాంకులలో డిపాజిట్ చేసినప్పుడు ఆ నగదును సాధారణంగా స్థానికంగా అప్పు ఇవ్వటానికి ఉపయోగించక పోవచ్చు. మిగిలిన దేశంలో అప్పుగా యివ్వటానికి ఆ నగదును కాశ్మీర్ నుంచి బయటకు తీసుకు రావచ్చు లేదా మహాఅయితే స్థానిక బ్యాంకులలో నిల్వ ఉంచవచ్చు. కాబట్టి దానితో జరిగే మార్పేదైనా ఉంటే అది స్థానికులు డబ్బుకోసం తమ భూమి కోల్పోవటమే అవుతుంది. కొందరి కశ్మీరీల చేతుల్లో ఉన్న ఆ డబ్బు కూడా తరువాత కాశ్మీర్ లోయనుంచి నిష్క్రమిస్తుంది. అలా 'అభివృద్ధి' అనేది లేశమైనా ఉండదు. దానితో ఉద్యోగిత పెరగటమనేదీ ఉండదు.
అయితే మరోవైపు భూభాగం ఎంతమేరకు చేతులు మారుతుందో అంత భూభాగంలో గతంలో జరిగిన కార్యకలాపాలు భూమి చేతులు మారటంతో ఆగిపోతాయి. భూమి కొన్న బయటివాళ్లు ఇతర కార్యకాలాపాలకు కాకుండా రియల్ ఎస్టేట్గా భూమి మార్చి అధిక ధర రాబట్టుకోవాలని చూడటమో లేక ఆ భూమి కాశ్మీర్లో వేసవి విడిదిగా ఉంచుకోవటానికో ఉపయోగిస్తారు. దీనితో కాశ్మీర్లో ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయి ఉద్యోగితా తగ్గిపోతుంది.
అలా ఏవిధంగా చూసినా కాశ్మీర్కు గల ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటం, బయటివారు భూమి కొనటంపై గల ఆంక్షను తొలగించటం వల్ల ఉద్యోగిత లేశమైనా పెరగదు. అందుకు భిన్నంగా ఢిల్లీ, ముంబాయి నగరాలకు చెందిన సంపన్నుల చేతుల్లోకి భూమి చేరటం వల్ల కాశ్మీర్లో ఉద్యోగిత తగ్గే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటంతోనే రాష్ట్రాభివృద్ధికి అవకాశాలు మెరుగుపడటమే నిజమైతే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేటప్పుడు యిద్దరు ముఖ్యమంత్రులతో సహా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులనూ నిర్బంధించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉండేది కాదు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తరువాత రాష్ట్రంలో అనివార్యంగా హింస పెరిగింది. అలా హింస పెరగటం కారణంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానాధారమైన టూరిజం పరిశ్రమ కూడా ప్రతికూలంగా ప్రభావితమైంది. అదీ కాశ్మీరీ యువత ఉద్యోగావకాశాలను దెబ్బతీసింది. క్లుప్తంగా చెప్పాలంటే 'అభివృద్ధి' నినాదం కేవలం ఒక ముసుగు మాత్రమే. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యిలా ఎందుకు చేసింది? ఈ ప్రశ్నకు ఇది హిందూత్వశక్తుల దీర్ఘకాలిక డిమాండ్ అనేది సర్వసాధారణ సమాధానం. దేశంలోని ఏకైన ముస్లిం మెజారిటీ రాష్ట్ర జనాభా మేళనాన్ని పాలస్తీనాలో ఇజ్రాయిల్ చేస్తున్నట్టుగా మార్చాలనేది అసలు లక్ష్యంగా ఉందనటంలో సందేహం లేదు.
ఇది వాస్తవ రూపం ధరిస్తుండగా మనం దీనికి మరొక లక్ష్యం ఉందన్న విషయాన్ని విస్మరించ కూడదు. నిజానికి ఈ ప్రభుత్వం హిందూత్వ- కార్పొరేట్ల మైత్రి ప్రాతిపదికన ఏర్పడింది. హిందూత్వను ప్రోత్సహించటాన్ని పక్కన బెడితే ఈ ప్రభుత్వం చేసేదంతా దాదాపు కార్పొరేట్ ఎజెండాకు అనుబంధంగానే ఉంటుంది. ఉత్పాదక కార్యకలాపాల విస్తృతికి అంతగా కాకుండా తన కార్పొరేట్ పోషకుల రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం భూమి సేకరించటానికి లేదా భూమి ధరను పెంచే చట్టా వ్యాపారానికి కాశ్మీర్ లోయను బార్లా తెరిస్తే అది కూడా కార్పొరేట్లకు అదనపు ప్రోత్సాహకం అవుతుంది. అలా రియల్ ఎస్టేట్ను అభివృద్ధి చేయటం వల్ల ఉద్యోగిత స్థాయి ఏమంతగా పెరగకపోవటం అటుంచీ అదే భూభాగాన్ని అంతకుముందు ఏవైనా ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించినట్టయితే ఉద్యోగిత తగ్గిపోతుంది.
పర్యావరణం దెబ్బతింటుందని చెప్పనవసరం లేని పర్యవసానం స్పష్టంగా ఉండటం అటుంచి కాశ్మీర్లోయను రియల్ ఎస్టేట్ కంపెనీలకు బార్లా తెరవటం వల్ల కాశ్మీర్ అందచందాలు నాశన మౌతాయి. ఉత్పాదక కార్యకలాపాలకు ఆలవాలమైన కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ చట్టా వ్యాపారులకు, భూకబ్జాకోరులకు స్వర్గధామం అవుతుంది. అలాంటి చట్టా వ్యాపారంతో అనివార్యంగా నేరాలు పెరుగుతాయి. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పెరిగే నేరాలు అనివార్యంగా పెంపొందే టెర్రరిజానికి అదనం అవుతాయి. నిజానికి ఈ రెండు వెల్లువలు వేరే సందర్భాలలో డ్రగ్స్, టెర్రరిజంవలే ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.
నిజానికి భూస్వామ్య వ్యతిరేక భూసంస్కరణ లను అమలుచేయటంలో దేశానికి నాయకత్వం వహించిన రాష్ట్రానికి ఇదొక విషాదకర దుస్థితి. అయితే ఈ దుస్థితినే అమిత్ షా 'అభివృద్ధి' అని అభివర్ణిస్తాడనటంలో సందేహం లేదు.
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్ నంబర్: 8886396999