Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఓరుగల్లును స్మార్ట్సిటీగా తీర్చి దిద్దుతాం. మురికివాడలు లేని సుందర నగరమే ధ్యేయం. ఏటా 300 కోట్లు ఓరుగల్లు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ కేటాయింపులు''. పాలకులు వల్లించిన మాటలివి. ఓరుగల్లు మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం అందుకనుగుణమైన పనులు చేపట్టకపోగా నగరంలోని పలు ప్రాంతాల అభివృద్దికి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది కాదనలేని సత్యం. ఇందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో తిష్టవేసి ఉన్న సమస్యలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిపి ట్రైసిటీగా పేరొందిన ఓరుగల్లు మరికొన్ని విలీన గ్రామాలను కలుపుకొని 58 మున్సిపల్ డివిజన్లతో కూడిన 'మున్సిపల్ కార్పొరేషన్'గా ఉంది. ఇందులో సుమారు 50కిపైగా లోతట్టు ప్రాంతాలుగా స్లమ్స్ ఏరియాలున్నాయి. ఒక వరంగల్ తూర్పు నియోజకవర్గం 26 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లోనూ స్లమ్ ఏరియాలు ఉన్నాయనేది గమనార్హం. ఈ స్లమ్ ఏరియాలు ఏమాత్రం వర్షం కురిసినా చాలు జలమయంగా మారటం జరుగుతూనే ఉంది. 2016లో కురిసిన వర్షాలతో భారీ వరద నగరాన్ని అతలాకుతలం చేసింది. దీంతో అప్పుడు కార్పొరేషన్ అధికారులు, పాలకులు భవిష్యత్లో యిలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని చెప్పినప్పటికీ, నగరంలోని నాలాలను పటిష్టం చేస్తామని పాలకులు చెప్పినప్పటికీ మురికివాడల్లో పరిస్థితులు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. స్లమ్స్ అభివృద్ది పట్ల అటు పాలకులు, ఇటు అధికారులు ఏ మాత్రం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నారనేది తేటతెల్లం మవుతోంది. ఒక ఏడాదికి 300కోట్లు ఓరుగల్లు కార్పొరేషన్ అభివృద్ది బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు ఏటా 300కోట్ల చొప్పున నాలుగేండ్లలో 1200కోట్లు అభివృద్ది కోసం ఎక్కడ ఖర్చు పెట్టారో.. మురికి వాడల అభివృద్ధికి చేపట్టిన చర్యలు ఏపాటివో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నగరంలో ఏ మాత్రం చిన్నపాటి వర్షం కురిసినా కూడా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయనేది గమనార్హం. వరంగల్ ప్రాంతంలోని ఎంహెచ్ నగర్, ఎన్పిఆర్ నగర్, ఆర్ఎస్ నగర్, ఎన్ఎన్ నగర్, కొత్తవాడ, డాక్టర్స్ కాలనీలతో పాటు కాశిబుగ్గ, దేశాయిపేట, మాధురీనగర్, సూర్జిత్నగర్, గాయత్రికాలనీ, ఉర్సు, కరీమాబాద్, రంగంపేట, ఎస్ఆర్ఆర్ తోట, చింతల్, శివనగర్, ఖిలావరంగల్, అండర్బ్రిడ్జి, సిఎస్ఆర్ గార్డెన్, హంటర్రోడ్డు, హన్మకొండ, న్యూశాయంపేట, పెగడపల్లిరొడ్డులోని వెంకట్రామయ్య నగర్, గుండ్ల సింగారం, కాజీపేట దర్గా, కడిపికొండ, బాపుజీనగర్, వంటి తదితర కాలనీలు జలమయంగా మారుతూ అభివృద్ది పట్టని పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడే తూ..తూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకోవటం పాలకులకు అలవాటుగా మారింద నటంలో సందేహం లేదు. ఇక ఓరుగల్లు మున్సిపల్ అధికారుల పరిస్థితి 'దూపైనప్పుడే బావితవ్వుకున్న చందం' గా ఉందనేది గమనార్హం. ఎందుకంటే 2016 నుంచి యిప్పటి వరకు స్లమ్స్ అభివృద్ధికి శాశ్వత చర్యలు చేపట్టకపోవటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. ఏటా 300కోట్ల బడ్జెట్తో కూడిన ఓరుగల్లు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు ఏమిటో, చేసిన ఖర్చు ఎంతో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు సమాధానం చేప్పాల్సిన అవసరం ఉంది. పాలకుల తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారనేది కూడా మర్చిపోకూడదు. మురికివాడల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులను, అధికారులను నగరవాసులు ప్రశ్నించి నిలదీసేందుకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. పాలకవర్గం కూడా మాటలకే పరిమితం కాకుండా అభివృద్ది కోసం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
- దుబ్బ శ్రీనివాస్
సెల్ : 9885035279