Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరు వాన్ట్ టూ బ్లీడ్ కాశ్మీర్ అది రక్తమోడుతున్నంత కాలంమా పరిపాలనకు తిరుగుండదు
- పర్వేజ్ ముషర్రఫ్
తన కోరిక ఇప్పుడు బలంగా నెరవేరుతుంది. కొంచెం లోతుగా చూస్తే ఈ కోరికే రెండు ప్రభుత్వాలకు ఉపయోగమని అర్థం చేసుకోవడానికి రాజనీతి శాస్త్ర కోవిదులే కానవసరం లేదనిపిస్తోంది. ఆ నెత్తురోడు తున్నది కాశ్మీర్ అనే నేల కాదు... మనుషులు అనే సానుభూతి, మనం కూడా మనుషులమేనన్న యాదిలో వారిపట్ల కాస్త సహానుభూతి ఉంటే యింకా బాగా అర్థం చేసుకోగలం. కేవలం భావోద్వేగం నిండిన శరీరాలై, బార్డర్ అంటే సైన్యం మాత్రమే, మనుషులు కాదు.. అని నమ్మే మరయంత్రాలైనప్పుడు మనమేం అర్థం చేసుకోగలం? పర్వేజ్ ముషర్రఫ్లు వేసిన ముద్రలతోనే మతతత్వ, మతోన్మాదాన్ని మాత్రమే రెచ్చగొట్టే దురాక్రమణదారి ముద్రలకు మనమూ లొంగిపోయామా! ఎందుకంటే వాళ్ల పరిపాలనా సౌఖ్యం కోసం దేశం మెదళ్లను అగ్ని గుండం చుట్టూ తిప్పగల మత మహమ్మారీ ముషర్రఫ్లు అన్ని మతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఆవహించిన కాలం నడుస్తున్నందున వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఔను.. నేను రాసింది మీకు నచ్చకపోవచ్చు. నచ్చేలా లేకపోవచ్చు. నచ్చేలా రాసుంటే బాగుండుననే మీ కోరిక తప్పు కాకపోవచ్చు. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, మనకు యిష్టం ఉన్నా లేకపోయినా వాస్తవం వాస్తవమే.. ఆ వాస్తవాలను వ్యక్తం చేసే సత్యం అసత్యం అవదు కదా! ఇక్కడ అత్యంత కంఫర్ట్జోన్లో కూర్చొని ఏదైనా కోరుకోగలం. ఇక్కడనుంచి గజం కదలకుండా మనకు మనం గీసుకున్న హద్దులు, నెట్వర్క్ సరిహద్దులు దాటకుండా విపరీతమైన భక్తి కుప్పబోయగలం. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో బ్రీత్ ఎనలైజర్ ఊదమన్నప్పుడు, పోర్న్ సైట్ పిచ్చిలో పడి కొట్టేసుకుంటున్నప్పుడు భక్తి కించిత్ కూడా స్పృహలోకి రాదు. ట్రాఫిక్ చలాన్లు కట్టడానికి, ఓటు వేయడానికి, జెండావందనం చేయడానికి, జనగణమన పాడడానికి, ట్రైన్లో వస్తున్న ఆర్మీ కనబడితే లేచి సీటు ఇవ్వడానికి ప్రదర్శించని, గుర్తుకు రాని భక్తి ఫేస్బుక్లో వరదలై పారుతోంది ఎందుకో! అక్షరాలు, పదాలు, వాక్యాలు. ఒక లిపి, ఒక భాష యిదంతా జరగాలంటే, అది శబ్దమై పలకాలంటే అక్కడో జాతి ఉండాలి. అది మానవజాతై ఉండడం సహజాతి సహజం. అది మన జాతేనా కాదా అనేదే ఇక్కడ పెద్ద ఆశ, స్వార్ధం, మానసిక మద్దతు అనేది రెండవ ప్రశ్న.
ఒక జాతిని మనం మనది అని భావించినప్పుడు ఆ జాతి కూడా మనల్ని మనం అన్నట్టే భావించాలి. అలా భావించే విశ్వాసం మనం త్రికరణశుద్ధితో, తిరంగా సాక్షిగా కల్పించాలి. అప్పుడు త్రిలోకాలొక్కటై వచ్చినా వారు మన దాపునే నిలబడతారు. మన కోసమే కలబడతారు. అలా వాళ్లను మానసికంగా మనలో కలుపుకుంటేనే కాపాడుకోగలం. మనం మనం ఒకటని మనింటికి తెచ్చుకున్న వారికి అలాంటి ప్రేమ పంచాలి. ఆ ప్రేమ ఇద్దరిని దాటి ప్రపంచానికి చెప్పాలనుకునే తతంగమైన పెండ్లిలో 370 ఒప్పందాలు 35 షరతులు సహజాతి సహజమే కదా! ఇవి ఉండాలంటే ప్రేమ లేదని అర్థం కాదు కదా! సామాజిక రక్షణలుగా, ఈ సమాజానికి పరస్పరం ఇస్తున్న వాగ్దానాలుగా, జీవన గమనాగమనానికి జవజీవాలనిచ్చే మాతృకలుగా కూడా భావించవచ్చు కదా! పరస్పరం మరింతగా మమేకమవుతున్నప్పుడు అవసరం లేనివి ''వాటంతటవే'' రాలిపోతాయి కదా! వాటిని ఎవరూ రాలగొట్టాల్సిన అవసరం లేదు. అలా కృత్రిమంగానో, బలవంతంగానో రాలగొట్టాలను కుంటే అవి రాలిపోవు. రాజుకుంటాయి.
మనకు కావాల్సింది వారి కాలికింది నేల. అవును నేల మాత్రమే. సరిగ్గా ఇలాంటప్పుడే తొడుగులు పడిన మన మెదళ్లకు ఓ ప్రశ్న తట్టాలి. మనది మార్కెట్ దేశభక్తా? మనిషి దేశభక్తా? మనం ఆ స్థానంలో ఉంటే యిలానే ఆలోచిస్తామా? అస్సలు అలా ఆలోచించం. కానీ కొంతమంది తమ క్షేమ జీవితం నుంచి బయటకు తొంగిచూడలేని సూడో దేశభక్తులు వారి భక్తికి హిట్లర్ దగ్గర పేటెంట్ హక్కు కొనుక్కొచ్చుక్కున్నట్టే మాట్లాడుతున్నారు. వారిని చూసిన సూడో మనుషులు మరికొంతమంది భకగ్రేసరుల అవతారమెత్తుతున్నారు. వారికి కాపీ పేస్ట్ తప్ప కాశ్మీర్ శ్రీనగర్ మాత్రం తెలిసుండదు. కలపడం విడగొట్టడం సెల్ వన్ నుంచి జియోకి పోర్టబులిటి పెట్టుకున్నంత సహజంగా మాట్లాడగలరు. కనీసం కల్సి ఉన్నదాన్ని మళ్ళీ కలపడమేంటిరా అని అడిగే నాలెడ్జి లెస్ ఫెలోస్ బయలెల్లారు. వీరంతా దాన్ని శవాలదిబ్బగానో, శ్మశాన గడ్డగానో మార్చగలరు తప్ప మానవీయ ప్రాంతంగా మార్చలేరు. ఇలాంటి వారు మాత్రమే చచ్చిన శవాల పుర్రెల్లో నుంచి మేకు దిగగొడుతూ కంచె వేసుకుని, కాలీ కాలని శవాల కమురు వాసనలు పీల్చుతూ పండుగలు జరుపుకోగలరు. ఇలాంటి దేశభక్తిని శవాల బేహారులు, నెత్తురు తాగ మరిగిన మృగాలు, నరహంతక ధరాధిపత్య మనస్తత్వం ఉన్నవారు మాత్రమే సొమ్ము చేసుకోగలరు. అలాంటి అమెరికా తన ఇద్దరు జూనియర్ భాగస్వాములైన పాకిస్థాన్, భారత్లకు ఆయుధాలు అమ్మడానికే ఇజ్రాయిల్లో ఓపెన్ చేసిన ఆయుధాగారం నుంచి ఇండియా నుంచి అనుకున్నంత గిరాకీ రావడం లేదు. కాబట్టి ఇండియా కూడా పాకిస్థాన్లా హిందూస్థాన్ అయితేనే దాని మార్కెట్ మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలు అన్నట్టు ఉంటుంది. ఈ మార్కెట్ దేశభక్తి మనం తాకట్టు పెడుతున్నామా చెక్ చేసుకోవాలి.
1947 అక్టోబర్లో కాశ్మీరీయులు మనతో కలిసి మనం అని నమ్మారు. ఇప్పటి వరకు మనతో ఉన్నారు. ఉండటం అంటే నీలా నాలా కాదు.. నిలబడి ఉన్నారు. మన దేశమని, మన దేశంకోసమే నిలబడి ఉన్నారు. పాకిస్థాన్తో కలబడ్డారు. వాడి సైన్యం పారిపోయేలా ఎగబడ్డారు. అందుకు ప్రతి ఇంటికి ఒక్కన్నైనా పోగొట్టుకున్నారు. ఆస్తుల్నీ, ఆరోగ్యాలనూ పోగొట్టు కుంటూనే ఉన్నారు. కండ్లను పోగొట్టుకొని హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నవారు కోకొల్లలు. దేశం కోసం మనమేం ఇచ్చాం. బతుకే యుద్ధమైన సైన్యంలాంటి ప్రజలు, సైన్యం అక్కడుంది కాబట్టే మనకీ భద్రజీవితం. అయినా వాళ్లపై అనుమానాలు, అపార్థాలు, అభాండాలు. ఇక్కడ లేరా ద్రోహులు? గోకుల్ చాట్లో, లుంబినీపార్క్లో, మక్కా మసీద్లో బాంబులు పేల్చిన వారిలో ఒక్క కశ్మీరీ కూడా లేడు కదా! దేశం లోపలి వారే కదా! ఆ దుర్మార్గాలకు ఒడిగట్టింది. అలానే అక్కడ కొంతమంది ఉగ్రవాదులతో చేతులు కలుపొచ్చు. అది క్షమించరానిదే. స్మార్ట్ ఫోన్కి వైరస్ రావడానికి కారణం డేటా వాడటమే కాబట్టి ఇంటర్నెట్ రద్దు చేసినట్టు 370 రద్దు చేయడం దుర్మార్గం కాదా? పైగా వాళ్లేదో ఐసీయూలో ఉన్నట్టు ఫోన్లు, ఇంటర్నెట్, వార్తలు, రాకపోకలు బంద్ చేయడమెందుకు? ప్రజలను నిర్బంధించి చట్టాలను రద్దు చేయడమేమిటి? ఇవన్నీ నియంతృత్వమే తప్ప ప్రజాస్వామ్యం మాత్రం కాదు. సందట్లో సడేమియా అంటూ రేపు పాకిస్థాన్తో యుద్ధం వస్తే గెలవాలన్నా కాశ్మీర్ ప్రజల మద్దతు సైన్యానికి అవసరం. ప్రజామోదం ఉన్నదే ప్రభుత్వ పాలన. ప్రజామోదం లేని సైన్యమైనా సరే ప్రజా సైన్యం చేతిలో ఓటమి చవిచూడక తప్పదని ప్రపంచ చరిత్ర చెప్తోంది. ఆ రకంగా కాశ్మీర్ ప్రజలే ప్రాథమిక సైన్యం. సైన్యం ప్రజల చేతిలో రక్షణాయుధాలు మాత్రమే. ఈ విషయం అర్థం చేసుకోకుండా ఆవేశపడి సపోర్టు చేసే సాధారణ ప్రజల వైఖరి మతోన్మాదులు, ఉగ్రవాదులకు మాత్రమే సాయపడగలదు తప్ప దేశానికి కాదు. కాశ్మీర్ గురించి ఆలోచించడమంటే కాశ్మీర్ ప్రజల గురించి ఆలోచించడం. వారి జీవితాల్లో ఒక లౌకిక పునాది ఉంది. కాశ్మీర్ సమస్యకు పరిష్కారానికి ఆర్టికల్ 370 ప్రాతిపదికగా మనం అర్థం చేసుకోవాలి. వారిది కాని జీవితంలో వారిది కాని భవితవ్యంలో వారిది కాని రాజకీయ ఎజెండాలో వారు ఇరుక్కుపోయారు. అందుకే కాశ్మీర్ను ప్రభుత్వ దృష్టితో కాకుండా అక్కడి ప్రజల దృష్టితో చూడడమే ప్రజాస్వామిక దృక్పథం. అక్కడి స్త్రీలు బురఖాలేసు కోవాలనే టెర్రరిస్టుల ఆదేశాలను కూడా పాటించడం లేదు. కాశ్మీర్ అనేది ఒక సరిహద్దు కాదు. అక్కడ మనుషులున్నారు. వారికీ మనోభావాలు, దృక్పథా లున్నాయి. ఎవరూ గుర్తించని గుడ్డి దేశభక్తితో వారిని ఇంకా ఎన్నిరోజులు బలిపెడదాం అని నిన్నూ నన్నూ ప్రశ్నిస్తాడు. ఆ మేధావి ప్రశ్నలకు సమాధానమే కాశ్మీర్ గురించి కాసేపాగి ఆలోచించి మాట్లాడడం.
ఇలా 370ని రద్దు చేయడం మత ఛాందస వాదులకు ఊతమిచ్చే పద్ధతి. కావాలనే ఇలా రద్దు చేసారని తేటతెల్లమవుతోంది. ఇది భారతదేశ లౌకిక పునాదికే ప్రశ్నార్థకం. ఒకచోట లౌకికతత్వానికి మంట చుట్టుకుంటే సర్వసాధారణంగా అది దేశమంతటా చుట్టుకుంటుంది. అది నిన్నూ నన్నూ అందులో కాల్చుకు తింటుంది. ఇరు దేశాల పాలకులు మాత్రం పక్కన కూర్చుని ఈ మంటలతో చలికాపు కుంటుంటారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్లోనే అంతర్భాగం. ప్రజలూ వారి మనోభావాలతో సహా ఎప్పుడో విలీనం జరిగిపోయినదాన్ని ఇప్పుడు విలీనం.. విభజన.. అని ప్రకటించడం బీజేపీ అంతర్నాటకం. 370తో సహా కాశ్మీర్ను దేశాన్ని ఆ మతోన్మాద ప్రమాదం నుంచి కాపాడడమే మన తెలివిడి. అందుకే పర్వేజ్ ముషరఫ్ లాంటి పాలకులు పాకిస్థాన్లోనే కాదు భారత్లో కూడా పరివ్యాప్తమై జతకట్టి తిరుగుతున్నారు. ఆయనకు గడ్డం ఉండదు. వీరికి ఉంటుంది. మిగతాదంత సేమ్ టూ సేమ్.. తస్మాత్ జాగ్రత్త!
- ఎం. విప్లవకుమార్
సెల్: 9030546896