Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంద్రాగస్టులు వస్తున్నారు పోతున్నారు. దేశంలోని కోట్లాది నిష్టదరిద్రులకు చివరికి మూడు రంగుల జెండాలమ్మే వారికి సైతం పంద్రాగస్టు ప్రాధాన్యత తెలియదు. వారంతా ఆ రోజూ రెక్కలమ్ముకుంటూ రోడ్లెక్కాల్సిందే! ఉన్నత విద్యాధికులైన యువతకూ అంతుపట్టని దినం పంద్రాగస్టు! తెల్సిన ముసలి వాళ్లు తమ గల్లీలో ఎవరైనా జెండా ఎగరేస్తే భక్తిగా అక్కడికెళ్ళి ఓ సెల్యూట్ పడేస్తారు. రోడ్లెక్కడానికి సిగ్గుపడే మధ్యతరగతి జీవులకు లీలగా కొన్ని విషయాలు చదివినట్టు గుర్తున్నా, భావోద్వేగాల దుమారంలో గాడ్సే ఫొటోల ముందు మోకరిల్లే ఒక సందర్భం వచ్చి పాడైంది.
పంద్రాగస్టు వచ్చిన ప్రాధాన్యత తెలిస్తే, తెచ్చిన వారి గురించి తెల్సుకుంటాం. ఇంతకాలం దానికి తామే వారసులమని టముకేసుకున్న వారి గురించి తెల్సుకుంటాం. అలానే తమకు జాతీయోద్యమంతో ఏ సంబంధం లేదని బ్రిటిష్ అధికారులకు వాంగ్మూలమిచ్చి అండమాన్ జైలు నుంచి బయటపడ్డ వి.డి సావర్కార్ వంటి అపర ఉత్తరకుమారుల గురించి కూడా తెల్సుకుంటాం. బ్రిటన్ భారతదేశాన్ని ఏ స్థాయిలో దోచుకుందో, ఏ విధంగా దోచుకుందో అర్థమైతే సామ్రాజ్యవాదాన్ని ద్వేషించడం నేర్చుకుంటాం. తెల్లదొరల పైశాచికత్వం, భారత ప్రజల వీరోచిత పోరాటాలు, అసమాన త్యాగాలు అర్థమైతే నేడు దోపిడీ ఏ రూపంలో జరిగినా అడ్డుకుంటాం.
స్వాతంత్య్రం వచ్చింది ఇలా....!
జాతీయోద్యమంలో గాంధీ పాత్రను తక్కువ చేసి చూడకున్నా, ఆయన అహింసా సిద్ధాంతమే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భయపెట్టలేదు. సహాయ నిరాకరణోద్యమం తోను, విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన వాటిలో కోట్లాది మంది భారతీయులు పాల్గొన్న విషయం నిజం. సురేంధ్రనాథ్ బెనర్జీ, మోతీలాల్ నెహ్రూల కాలంలో బ్రిటిష్ వారికి విజ్ఞప్తులు చేసే స్థితి లాల్, బాల్, పాల్ (లాలా లజపతి రారు, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్) హయాంలోనే పోయింది. గాంధీ గుజరాత్లోని బార్డోలిలో చేసిన శాసనోల్లంఘన ప్రయోగం, దండిలో ఉప్పు సత్యాగ్రహం, అప్పటికే బీహార్ లోని చంపారన్లో నీలిమందు రైతుల పోరాటం ఆయన్ని ప్రజలకు దగ్గర చేశాయి. దీనికితోడు ఆనాటి అత్యధిక మంది భారతీయులను పోలిన ఆయన వస్త్రధారణ, హరిజనోద్ధరణ, హిందూ ముస్లిం ఐక్యత నినాదాలు గాంధీ పిలుపులకు స్పందన కోట్లలో ఉండింది. పైన పేర్కొన్న స్పందనలకు కారణం ఇవే.
తీవ్ర రక్తపాతంతో బ్రిటిష్ వారు అణిచివేసినా 17, 18వ శతాబ్దాలలోనే దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో గిరిజన తెగల పోరాటాలు ముఖ్యంగా పశ్చిమ మిడ్నపూర్ నుంచి దక్షిణ బీహార్ వరకు, ఛోటా నాగపూర్ నుంచి ఒరిస్సా వరకు విస్తరించిన ప్రాంతంలో సంతాల్లు, కోల్ తెగవారు, ముండా తెగ వారి తిరుగుబాట్లు, అస్సాంలో ఖాసీతెగ, ఒరిస్సాలో గోండ్ల తిరుగుబాట్లు, మొదలైనవి బ్రిటిష్ వారిని గడగడ లాడించినాయి. 1776-1800 మధ్య జరిగిన సన్యాసి, ఫకీర్ తిరుగుబాట్లు కూడా బ్రిటిష్ వారికి కునుకులేకుండా చేశాయి. తెలుగు వారికి అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్లు తెలుసు. తమిళలకు వీరపాండ్య కట్టబొమ్మన తెలుసు. కేరళ వారికి వజస్సీరాజా, వేలుతంపి దలావా తెలుసు. 1800-1801 మధ్య జరిగిన వీరి సాయుధ తిరుగుబాట్లను 'ప్రథమ భారత సంగ్రామం'గా మధురై విశ్వవిద్యాలయానికి చెందిన రాజయ్యన్ తన పరిశోధనాత్మక థీసిస్లో పేర్కొన్నారు. (భారత జాతీయోద్యమ చరిత్ర ఇఎంఎస్) వీరంతా బ్రిటిష్ పాలకులను గడగడ లాడించిన వారే. 1857-59 మధ్య జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా మార్క్స్ పేర్కొన్న పోరాటం దెబ్బతిన్న రైతులు, చితికిపోయిన చేతివృత్తుల వారు సాయుధులై తిరగబడ్డ యుద్ధం. దాని వెన్నంటే సాగిన (1859-60) బెంగాల్ నీలిమందు రైతుల తిరుగుబాటు.
18, 19 శతాబ్దాల్లో జరిగిన పై సాయుధ పోరాటాలకు తోడు 20వ శతాబ్దంలో సాగిన ముఖ్యంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు - అది పున్నప్రవాయిలార్ అయినా, తెభాగ ఐనా, సుర్మావ్యాలీ పోరాటమైనా, వీటన్నింటికి మించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైనా బ్రిటిష్ వారు అప్పటి వరకు ఆధారపడ్డ ఫ్యూడల్ వ్యవస్థ పునాదులను కుదిపివేసింది. వివిధ ప్రాంతాల్లో జాతీయ విప్లవకారులు గదర్ పార్టీ, అనుశీలన్, జుగాంతర్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వంటి సంస్థలు స్థాపించి అనేకచోట్ల చేసిన సాయుధ దాడులు కూడా బ్రిటిష్ అధికారులను భయాందోళనకు గురిచేశాయి. 40,000 సైన్యంతో నేతాజి తయారుచేసిన ఆజాద్ హింద్ఫౌజ్ కూడా బ్రిటిష్ వారిని బెదరుగొట్టింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన కార్మికోద్యమం మరో ఎత్తు. జీతాల పెంపుదల కోసం 1877లో టాటా గారి 'ఎంప్రెస్' మిల్లో 5000మంది కార్మికులు నాగపూర్లో చేసిన సమ్మె మొదలు 1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ (ఆర్.ఐ.ఎన్) తిరుగుబాటుకు మద్దతుగా బొంబాయి కార్మికులు చేసిన వీరోచిత పోరాటం, చేసిన అనుపమాన త్యాగాలు బ్రిటన్ పాలకులు 'తుది నిర్ణయం' చేయడం తప్ప ఏమీ మిగల్చలేదు. ఇంగ్లాండ్లో అనేక కార్మిక చట్టాలున్నా, భారతదేశంలో మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, 1906లో ఎలక్ట్రిక్ బల్బ్లు వచ్చిన తర్వాత రాత్రిళ్ళు కూడా చాకిరీ చేయించుకునే విధానంపై తప్పటడుగులు వేసుకుంటూ ప్రారంభమైన భారత కార్మికోద్యమం 1920లో సంఘటితపడి, 1928, 29లో మిలిటెంట్ పోరాటాల్లో రాటుదేలింది. బ్రిటిష్ ప్రభుత్వ మెడలువంచి 1923లో వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ను, 1926లో ట్రేడ్ యూనియన్ చట్టాన్ని, ఫ్యాక్టరీ చట్టం (ప్రాథమిక రూపంలో) 1881, కొన్ని సవరణలతో 1891లోను, మరికొన్ని సవరణలతో 1911లోను, ఇంకొన్ని సవరణలతో 1922, 1934లోనూ కార్మికోద్యమం సాధించింది. 1928లో బొంబాయి బట్టల మిల్ కార్మికుల మిలిటెంట్ సమ్మె, 1929లో బెంగాల్ జూట్ కార్మికుల సమ్మెల తర్వాత దేశంలో సమ్మెల విస్తృతిని నియంత్రించేందుకు 1929లో ట్రేడ్ డిస్ప్యూట్ చట్టం తెచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. నేటి ఐ.డి యాక్ట్కు మాతృక ఇది.
కుట్ర కేసులతో అణిచివేసే ప్రయత్నం చేసినా బంతిలా పైకెగిసి పడింది కార్మికోద్యమం. కాన్పూర్ కుట్ర కేసు మోపబడ్డ నలుగురూ - ఎస్.ఎ.డాంగే, ముజఫర్ అహ్మద్, నళిణి భూషణ్ గుప్తా, ఎస్.వి.ఘాటే లందరూ ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న కమ్యూనిస్టు నాయకులే. మీరట్ కుట్ర కేసు నిందితులు 33మంది ట్రేడ్ యూనియన్ నాయకులే. వారిలో ముగ్గురు బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు చెందిన వారు. కార్మికోద్యమం పెరిగి, రాజకీయ చైతన్యం పొందితే 1917లో సోవియట్ యూనియన్లో ఏమి జరిగిందో బ్రిటిష్ పాలకులకు తెలియంది కాదు. అందుకే, మొగ్గులోనే చిదిమేసే ప్రయత్నం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది వీరే. కొందరు 'బాబుల' దృష్టిలో వీరంతా 'అలగా జనం', 'మట్టి మనుషులు'.
ఆగస్టు 15కు అర్థమేంటి ?
ఆగస్టు 15 కేవలం ఒక తారీఖేనా? దానికో అర్థమూ, అంతరార్థమూ లేవా? ఉన్నాయి. దాన్లో 200 ఏండ్ల ప్రజా పోరాటాల ఆకాంక్ష నిండి ఉంది. వివిధ భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు కలగలిసిన తీరుంది. 'భారతీయత' ఆ కలబోత సారాంశమే. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఉట్టిపడిన ఉదంతమే భారతీయత.
ఇంగ్లీషు వాడి దోపిడీ చవిచూసిన తరం స్వాతంత్య్రానంతర భారతదేశం తన కాళ్లపై తాను నిలబడాలనుకోవడం ఆ భారతీయతలో భాగం. ఆ తరం దార్శనికతలో భాగమే మన ప్రభుత్వ రంగం. దాన్లో భాగమే 1956 పారిశ్రామిక విధాన ప్రకటన. ప్రణాళికాబద్ధ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ దార్శనికతలో భాగమే.
మోడీ పుణ్యమా అని 2014 మొదటి స్వాతంత్య్ర దినం నాడే ప్రణాళికా సంఘం రద్దైపోయింది. దాని స్థానంలో ఏంతేవాలో నిర్ణయం కాకుండానే ముందైతే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసేశారు. దేశ, విదేశీ పెట్టుబడిదార్లు అంత తొందరగా ఉన్నారన్న మాట! 2015 జనవరి 1 నుంచి నిటి అయోగ్ అవతరించింది. నేడు ప్రభుత్వరంగం పని అయిపోతోందని ఏడ్చేవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోరా?! నిన్నటి నిర్మలమ్మ బడ్జెట్లో ఒక లక్షా 5వేల కోట్ల ప్రభుత్వరంగ వాటాలను అమ్మేస్తామని కోటాలు తీసుకున్నారు. రైల్వేలను కూడా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ అంటూ విడివిడి కార్పొరేషన్లుగా విడగొడతారట! దీనికి వ్యతిరేకంగానే మొన్న వారణాసి, రారుబరేలి, కపుర్తలా, చిత్తరంజన్, పెరంబూర్లలో కార్మికులు నిరసన సమ్మె చేశారు.
మొదటి వంద రోజుల్లో రైల్వేలనేమి చేయాలి? కార్మిక చట్టాలనేమి చేయాలి? ప్రభుత్వ రంగాన్నేమి చేయాలి? అంటూ పథకాలు రచించి పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం. జాతీయోద్యమంతో సంబంధమున్న వారంతా రక్త కన్నీరు కారుస్తున్నారు. 1991లో పి.వి., మన్మోహన్సింగ్లు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు నేడు దేశాన్ని అక్కడికి చేర్చాయి. ఇందాక చెప్పుకున్న 'భారతీయత'లో కుల, మతా లకు తావులేదు. నేడు మోడీ పాలన మతం చుట్టూ, వారు తినే తిండి చుట్టూ, కట్టుకునే బట్టచుట్టూ తిరుగు తున్నది. ఎవరు, ఎవరితో సన్నిహితంగా ఉండాలో, ఎవర్ని పెండ్లి చేసుకోవాలో బీజేపీ పీఠాధిపతులు నిర్ణయం చేస్తున్నారు.
మోడీ 2వ సారి అధికారంలోకి రావడంతో ఒకవైపు ''హిందూ రాష్ట్ర'' లక్ష్యంగా ప్రయాణం సాగుతూ 2వ వైపు సరళీకృత ఆర్థిక విధానాల వేగం పెంచింది బీజేపీ. దాని సారాంశమే పైన చెప్పినవి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వారి ఆర్గనైజర్ పత్రిక సమాధానం చెపుతుంది. ''సానుకూల దృక్పథం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంటే అనేక అడ్డంకులు తొలగిపోతాయి. ఇది దేశాన్ని మొత్తం హిందూ సమాజానికే ప్రయోజనకరం''. దేశాన్ని ''హిందూ రాష్ట్ర'' వైపు బీజేపీ నడిపిస్తోందనేందుకు ఇటీవల కాలంలో ఎన్నో ఉదాహరణలు కనబడుతున్నాయి. మోడీ-1 పాలనలో గొడ్డు మాంసం తింటున్నారనే పేరుతో మూకదాడులను చూశాం. మోడీ-2 పాలనలో ఏకంగా ''జై శ్రీరాం'' అనమంటూ జరిగే మూకదాడులు చూస్తున్నాం.
వాస్తవానికి 1947 ఆగస్టు 15న మనకు సంప్రాప్తించిన దేశం ఆశించింది వేరు. జాతీయోద్యమ స్ఫూర్తి వేరు. నేడు జరుగుతున్నది వేరు. ఆ ప్రేరణ తిరిగి పొందాలి. నాడొక ఇంగ్లీష్ సామ్రాజ్యమే! నేడు ఎన్నో సామ్రాజ్యాలు, ఎన్నో కంపెనీలు. ఉదారవాద విధానాలు తలకెక్కిన ప్రధానంగా మధ్యతరగతి. వారు ప్రవచించే సిద్ధాంతాలు, వాటికి లోనయ్యే సామాన్య జనం. అందుకే వాటిని ఎదిరించాలంటే సరైన వ్యూహాలుండాలి, ప్రజల్ని కదిలించే నైపుణ్యముండాలి. ప్రజల్తో మమేకం కాకుండా పైపైన పని చేసే తత్వానికి చరమగీతం పాడాలి.
- ఆర్. సుధాభాస్కర్
సెల్: 9490098025