Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన యుద్ధం సంపద కోసమో, అధికారం కోసమో కాదుబీ మన యుద్ధం స్వేచ్ఛ, మానవ వ్యక్తిత్వ పునరుద్ధరణ కోసం' అని అంటారు మహానీయుడు డాక్టర్ బిఆర్. అంబేద్కర్. మరీ నేడు పౌరుల అభివృద్ధి కోసం పాటుపడటంలో పాలకులకు 'నైతిక బాధ్యత అనే స్పృహా, ప్రజాక్షేమం అనే ధ్యాస' ఎంతవరకు ఉంటుంది అంటే చెప్పడం కష్టమే. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో, ప్రజాభివృద్ధిలో 'స్వేచ్ఛాయుత ఎన్నికలు', 'పౌర హక్కులు - చట్టాల అమలు', 'ప్రతిపక్షాల నిర్మాణాత్మక పాత్ర' లాంటి అంశాలు కీలక పాత్రవహిస్తాయి. అంతేకాకుండా, ప్రభుత్వాలు రూపొందించే ఎటువంటి అభివృద్ధి పథకమైన, కార్యక్రమమైన 'ఆవశ్యకత', 'నిబద్ధత', 'నిర్మాణాత్మకత' అను మూడు ప్రధానాంశాలను కూడా కలిగిఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లోపించినా అది లోపభూయిష్టంగా తయారవుతుంది. ఈ అంశాల ఆధారంగా చూస్తే తెలంగాణలో, కేంద్ర-స్థాయిలో పరిపాలన ఏ మార్గంలో ఎటువైపు సాగుతుందో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.
ఇటీవలి ఎన్నికలలో ప్రజలు అటు కేంద్రంలో అలాగే ఇటు రాష్ట్రంలో ఆయాపార్టీలకు మెజారిటీకన్నా ఎక్కువ స్థానాలు కట్టబెట్టి సమర్థవంతంగా పరిపాలించాలని తీర్పునిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకీ 88శాసనసభ స్థానాలు, కేంద్రంలో బీజేపీకి 303 లోకసభ స్థానాలు వారు ఊహించినదానికంటే ఎక్కువగానే అంటే రాజకీయ పరిభాషలో 'బంపర్ మెజారిటీ' వచ్చింది. మరీ ఇంత అత్యధిక సంఖ్యలో గెలిపించిన ప్రజల పట్ల ఆయాప్రభుత్వాల బాధ్యత కూడా అంతే ఉండాలి కదా! ప్రజా-సమస్యల సత్వర పరిష్కారం, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పేదరిక నిర్మూలనలాంటి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పకడ్బందీగా అమలుచేయడంలో ఈ 'బంపర్ మెజారిటీ'ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ, ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపుకో, ఇష్టారీతిన అధికార వినియోగానికో, ఒక మతాభివృద్ధికో, స్వప్రయోజనాలకో, పార్టీ ప్రయోజనాలకో కాకూడదు. ఈ విధమైన అనవసర చర్యలు నియంతృత్వ, ఫాసిజమ్' లాంటి విధానాలకు దారితీస్తాయి.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకేరీతిన పరిపాలన కొనసాగుతుందేమోనన్న అనుమానం కలుగుతోంది. దేశ స్థాయిలో అధికారపార్టీలోకి చేర్చుకోవటానికి 'ఆకర్ష్-కమలం' పేరున పార్టీ ఫిరాయింపులు తెలుగు రాష్ట్రాలలోనూ దేశంలో అన్నిచోట్లా కూడా జరుగుతున్నాయి.
రైతుల సమస్యలను పరిష్కరించి వారి 'ఆత్మ-హత్యలు' జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. అలాగే, దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ స్థాయి (గత 45ఏండ్లలో చూస్తే ఇదే అత్యధికం) మందగించిన ఆర్థికవృద్ధిలాంటి సమస్యలు తిష్టవేశాయి. వీటికి పరిష్కార మార్గాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇకా తెలంగాణ విషయానికి వస్తే తాండవిస్తున్న నిరుద్యోగం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించదు. ఎంతసేపు భవనాల కూల్చివేత నూతన కట్టడాలనమూనాలే వారికి అత్యధిక ప్రాధాన్యత. వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోర్టుల్లో కూడా నిరంతర వాదనలు వినిపిస్తారు. ఇటు కేంద్రంలో, అతి పెద్ద కట్టడాల పేరున నిర్మాణాలు దానికి మీడియాలో పెద్దఎత్తున ప్రచార ఆర్భాటాలు. ఇంకా నేడు కేంద్రస్థాయిలో చేపడుతున్న చర్యలలో భాగంగా దేశభక్తి అనే భావనలో ''ప్రజాస్వామ్య ఆదర్శాలు'' లోపించగా జాతీయవాదమనే గుడ్డి నమ్మకంలో ''రాజ్యాంగ విలువలు'' లోపించాయి. మొన్న ప్రజా సమస్యల దృష్టిని మరల్చటానికి కేంద్రం తమకున్న మెజారిటీతో అత్యంత సంక్లిష్టమైన ''కాశ్మీర్ విలీనం'' అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. కర్నాటక రాజకీయ సంక్షోభం, కాశ్మీర్-విలీనం లాంటి రాజకీయ అంశాలు దేశ సమాఖ్య విధానాలను, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసాయి.
మరోపక్క తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ''కాళేశ్వరం ప్రాజెక్టు'' అనే అంశాన్ని తీసుకుని ప్రజా సమస్యలైన 'ఉద్యోగాల కల్పన', 'సామాజిక న్యాయం' అనే విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చటంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మందబలంతో దుందుడుకు చర్యలు కాకుండా ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం నడుంబిగించాలని ఆశిద్దాం.
- చాకేటి రాజు
జేఎన్యూ, న్యూఢిల్లీ.