Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో పరిశీలనలు, పరిశోధనలు జరిగిన తర్వాత అభ్యుదయగామి అయిన నేటి అత్యాధునిక మానవుడి ఆలోచనా ధోరణి ఎలాఉందో, వేల ఏండ్లనాటి చార్వాకుల ఆలోచనలూ అలాగే ఉన్నాయి. నిజానికి వారి వారసులుగా తరువాతి తరాలు - వారి ఆలోచనా ధోరణిని ముందుకు తీసుకురాకుండా మతవాదులు ఎన్నో కుట్రలు పన్నారు. ఎంతో హింసను ప్రేరేపించారు. జనాన్ని భయభ్రాంతుల్ని చేశారు. వారు చెప్పిందే 'వేద'మని శాసించారు. జనం వాస్తవాలు గ్రహించకుండా చేశారు. ప్రభావితం చేయబడ్డ తప్పుడు ఆలోచనలతో శతాబ్దాలకు శతాబ్దాలే గడిచిపోయాయి. ఇక ఇప్పుడు అత్యాధునికుడు నిజాలు గ్రహించుకోగలిగే స్థోమత ఉండికూడా గ్రహించుకోకపోవడం మరొక పెద్ద తప్పిదమవుతుంది. అందువల్ల ఇంగిత జ్ఞానం ఉన్నవారు తప్పక ఇలాంటి విషయాలు విశ్లేషించుకోవాల్సి ఉంది. మత వాదుల మూర్ఖవాదనల్ని వేల ఏండ్ల నాడే చార్వాకులు ఎలా తిప్పికొట్టారో విషయం సునిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇప్పటికీ వేదాల్ని, వేద సంస్కృతిని పవిత్రంగా భావించేవారున్నారు. అయితే, వారి భావాల్ని వారి వరకే పరిమితం చేసుకోవడం బావుంటుంది. ఈ అత్యాధునిక యుగానికి పనికొచ్చే విషయమేదీ వేదాల్లో లేదని ఆనాడు చార్వాకులన్నారు. ఈనాడు వైజ్ఞానిక స్పృహగల ప్రగతిశీల వాదులంటున్నారు. కొత్త ఉత్సాహంతో ప్రగతికి దారులు వేస్తున్న కొత్త తరాల్ని ఆపే హక్కు ఎవరికీలేదు. ఆపాలనుకున్నా ఇప్పుడిక ఆపలేరు. ఎందుకంటే ఆ వేద సంస్కృతిలోని డొల్లతనమంతా ఇప్పుడు బయటపడి పోయింది గనక! ఉదాహరణకు ఈ శ్లోకం చూడండి.
''త్రయో వేదస్య కర్తారో భండధూర్త నిశాచర్ణా!
జర్ఫరీతుర్ఫరీత్యాది పండితానాం వచ్ణస్మృతం.||''
దీని అర్థం ఏమిటంటే - మూడు వేదాలను రాసిన వాళ్లు కాపరులు, ధూర్తులు, నిశాచరులు జర్ఫరీ తుర్ఫరీలాంటి (ఉత్తుత్తి) పండితులు మాత్రమే - అని చార్వాకులు ఆనాడు వ్యంగ్యంగా చెప్పినా స్పష్టంగానే చెప్పారు.
అగ్నిహౌత్రం, మూడువేదాలు, త్రిదండం, విభూతి ధరించడం తప్పనిసరి - అని నాటి వేద సంస్కృతి ఘోషించింది. వేద సంస్కృతి రూపుదిద్దుకున్న కాలంలోనే ఆ సంస్కృతికి సమకాలీనంగా లేదా సమాంతరంగా చార్వాక సంస్కృతి పరిఢవిల్లింది. దుష్టుడు ఎప్పుడూ బలవంతుడై ఉంటాడు కాబట్టి, నిజాలు చెపుతున్న చార్వాకుల్ని చిత్రహింసలకు గురిచేసి, వారి గొంతులు నొక్కేసి, అగ్రవర్ణ, ఆధిపత్య వర్గాలు తమ వేద సంస్కృతిని విస్తరింజేసుకున్నాయి. తాము తప్ప వేదాల్ని ఎవరూ చదవకూడదు, వినకూడదు అని ఆంక్షలు విధించాయి. అందులోని డొల్లతనం ఎక్కడ బయటపడుతుందోనన్న భయం కూడా కారణం కావొచ్చు. వీరికి ధీటైన సమాధానం చార్వాకుల గురువైన బృహస్పతి చెప్పాడు. ఇతను వేరు-దేవతల గురువు బృహస్పతి కాదు) అగ్నిహౌత్రం అంటే పొద్దున సాయంత్రం చేసే హౌమం. ఆ హౌమం ముందు కూర్చుని చదివే మూడువేదాలు, మత గురువులు ఒంటికి పూసుకునే భస్మాలు, ధరించే మూడు దండాలు వగైరా వగైరా అన్నీ బుద్ధిలేని, పౌరుషం లేనివారు తమజీవనోపాధికి ఏర్పరుచుకున్న చిహ్నాలు - అని చార్వాకులు చెప్పారు. అన్నీ ఈ శ్లోకంలోనే ఉన్నాయి. గమనించండి...
''అగ్నిహౌత్రం త్రయోవేద త్రిదండం భస్మ గణనం|
బుద్ధి పౌరుష హీనానాం జీవికేతి బృహస్పతి||''
వేద సంస్కృతిలో జంతుబలులకు ప్రధాన పాత్ర ఉండేది. అలా యజ్ఞంలో బలి ఇవ్వబడ్డ జంతువు స్వర్గానికి వెళుతుందన్న నమ్మకాన్ని అగ్రర్ణాలవారు జనానికి నూరిపోశారు. అలా స్వర్గానికి వెళ్లడమే నిజమైతే, ఆ యజ్ఞం చేసేవాడు తన తండ్రిని బలి ఇవ్వొచ్చుకదా? దానివల్ల ఆయనకు నేరుగా స్వర్గానికి వెళ్లే అవకాశం లభిస్తుంది. వృద్ధాప్య సమస్యలతో ఈ భూమిమీద ఉంచడం కన్నా ఆయనను శీఘ్రగతిన స్వర్గానికి పంపడమే మేలు కదా? అని నాటి చార్వాకులు హేతుబద్ధంగా ప్రశ్నించి, ఆట పట్టించారు. యుగాలు గడిచిపోయినా వైదిక సంస్కృతి గురించి గొప్పగా చెప్పేవారు ఆ ప్రశ్నకు బదులివ్వలేదు.
''పశుశ్చేన్ని హత్ణ స్వర్గం జ్యోతిష్ఠోమే గమిష్యతి|
స్వపితో యజమానేన తత్ర కస్మాత్ నహింస్కతే?||''
ఈ శరీరం తుచ్ఛమైందని, దీనికొక ఆత్మ ఉంటుందని, అది పరమాత్మలో లీనం కావడమే మోక్షమని వైదిక సంస్కృతి జనాన్ని ఊదరగొట్టింది. మతభావనల్ని బాగా జీర్ణించుకున్న జనం ఇప్పటికీ ఆ భావనని నమ్ముతున్నారు. వైజ్ఞానికులు హేతువాదులు చెపుతూ వస్తున్న మాట ఏమిటంటే - ఈ శరీరమే తప్ప, దీనికి మళ్లీ విడిగా ఆత్మ అంటూ ఏదీలేదని, పునర్జన్మలు ఉండవని, ఉన్న ఈ జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడపాలని!! ఈ విషయాన్ని మూడువేల ఏండ్ల క్రితమే చార్వాకులు గుర్తించారు. మృత్యువు తర్వాత ఏమీ ఉండదని, ఆత్మ, పునర్జన్మ బూటకమని వారు తీవ్రంగానే వాదించారు. బూడిదైన శరీరం ఎలా తిరిగి వస్తుందని వారు వేసిన ప్రశ్నకు శతాబ్దాలు గడిచిపోయినా వేదపండితులు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపో తున్నారు.
''యావజ్జీవం సుఖం జీవిత్ నాస్తి మృత్యోరగోచర్ణ|
భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుత్ణ||
మరణించిన వారికి కర్మకాండలు నిర్వహించాలని, మరణించిన వారిపేరుతో బ్రాహ్మణులకు దానధర్మాలు చేయాలని వేదపండితులు నిర్ణయించారు. ఆ పద్ధతి ఇంకా ఈ ఆధునిక యుగంలో కూడా కొనసాగుతూ ఉంది. తమ జీవనోపాధి కోసమే బ్రాహ్మణులు ప్రేతకర్మలు చేయమన్నారనీ, అలాగే మరణించిన వారి పేరుతో బ్రాహ్మణులకు దానధర్మాలు చేయాలని - వారే నిర్ణయించడం వల్ల ఏం తెలుస్తూ ఉంది? వారు వారి జీవనోపాధికి మార్గం సుగమం చేసుకోవడం తప్ప, వాటివల్ల ఇతరులకు ఏ ప్రయోజనం లేదు - అని చార్వాకులు ఘంటాపథంగా చెప్పారు.
''తతశ్చ జీవనోపాయో బ్రాహ్మణైర్విహిత స్త్విహ|
ఘృతానాం ప్రేత కార్యాణి నత్యన్యత్ క్వచిత్||''
శ్రాద్దం పెడితే, మరణించి పరలోకంలో ఉన్నాడని భావించే వాడికి తృప్తి కలిగేట్టయితే పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లిన వాడికి అతని కుటుంబ సభ్యులు అతని ఇంటినుంచే అతనికి అన్నం పెట్టొచ్చుకదా?
''గచ్చతామిహ జంతూనాం వ్యర్థం పాధేయకల్పనం|
గేహస్థకృత శ్రాద్దేన పథితృప్తిరవారితా||''
అలాగే దానాల వల్ల పైన ఉన్నాడని భావించే వాడికి తృప్తి కలిగేది నిజమయితే, కింద గ్రౌండ్ఫ్లోర్లో చేసిన దానాలవల్ల పైన మేడపైన ఉన్నవాడికి సంతృప్తి కలుగుతుందా? అని ఎవరైనా చిలిపిగా అడిగారనుకోండి.. దానికి వైదికుల నుంచి సమాధానం రాదు. అందుకే చార్వాకులు ఆనాడే చెప్పారు. స్వర్గం లేదు. స్వర్గం వెళ్లడం అనేదానికి అర్థమూ లేదు. కాబట్టి, పితృదేవతల పేరుతో బ్రాహ్మణులకు ఇచ్చిన, ఇస్తున్న దానాలన్నీ వ్యర్థమే! చార్వాకుల పదార్థవాదం ఇలాంటి అసంబద్ధమైన మూఢనమ్మకాలను ఏనాడో తీవ్రంగా ఖండించింది. వాటిని నేటి పురోగమన వాదులు గమనించి ఆచరించాలి. ముఖ్యంగా నేటి హేతువాదులు చర్వాక దర్శనాన్ని ప్రచారం చేయాలి.
''స్వర్గ స్థితా యధాతృప్తిం గుచ్చేయు తత్ర దానత్ణ|
ప్రాసా దస్యోపరిస్థానం యాత్ర కస్మాత్ నదీయతే||''
జీవితంలో ద్ణుఖం ఉంది గనక, ఈ జీవితం వ్యర్థం అని చెప్పే వేదాంతతత్వాలు పనికిరానివని మనిషి ఏనాడో గ్రహించాడు. జీవితాన్ని శుష్యింపజేసి, మోక్షజ్ఞానాన్ని పొందాలని మత గురువులు ఉద్భోదించారు. వాటిని చార్వాకులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ఈలోకంలో సుఖంగా జీవించడం తెలియక, పరలోక జీవనం గురించి పూజలు, క్రతువులు, ఉపవాసాలు చేస్తూ బతికే వారిది నిజంగా వ్యర్థజీవితమే! పొట్టు ఉందని ధాన్యాన్ని వదిలేయలేం. ద్ణుఖం ఉందని జీవితాన్ని వదిలేయలేం. పొట్టు తీస్తాం. ద్ణుఖాన్ని అధిగమిస్తాం. జీవితం ఉన్నది జీవించడానికే నన్నది ఆధునికుడి భావన కూడా!
పానీయంలో చేర్చబడ్డ ఇతర పదార్థాల మిశ్రమం వల్ల మాదకశక్తి ఏర్పడినట్టుగానే, మానవదేహం కూడా భౌతికపదార్థాల మిశ్రమం అనీ, అందుకే చైతన్యం, అంతర్వాణి, అహం అనే భావన కలుగుతున్నాయి తప్ప, ఇందులో ఆత్మకు పరమాత్మకూ తావేలేదని చార్వాకులు చెప్పారు. పదార్థాల మిశ్రమాన్ని చార్వాకులు గుర్తించారు. కాబట్టి, వారిదే ముందుడుగు.. పదార్థాల కలయిక గురించి వేదాలు చెప్పలేకపోయాయి. అందుకే ఆధునిక వైజ్ఞానిక స్పృహ గలవారిని అవి ఆకట్టుకోలేవు.
''లోక సిద్ధో భవేత్ రాజా పరిశోనా పరస్మృత్ణ|
దేహస్య నా శోముక్తిస్తు నాజ్ఞానాత్ ముక్తి రిష్యత్||''
''అంగనా లింగనాత్ జన్య సుఖవేవ పూవర్ధతా!
కంటకాది వృథాజన్యం ద్ణఖం నిరయ ఉద్యతే||''
పరిపాలించే రాజు గొప్పవాడే కానీ, అతనికంటే గొప్పవాడు ఈశ్వరుడు పైనున్నాడు. ఈ దేహాన్ని నశింపజేసి, ఆత్మజ్ఞానం పొందడమే ముక్తి - అని బోధించిన వేదజ్ఞానుల్ని చార్వాకులు తీవ్రంగా విమర్శించారు. ఈశ్వరుడెవరూ లేరని, మోక్షం పొందడమంటే దేహాన్ని విడువడమేనని చెప్పారు. స్త్రీ పురుషుల కలయిక వల్ల కలిగేదే సుఖమని, ముల్లు గుచ్చుకోవడమే ద్ణుఖమని - పంచేద్రియాలకు కలిగే అనుభవం, అనుభూతే సుఖ ద్ణుఖాలూ - స్వర్గ నరకాలనీ నాటి భౌతికవాదులైన చార్వాకులు స్పష్టం చేశారు. నేటి ఆధునిక అభ్యుదయ భావుకులు చెప్పేది కూడా ఇదే. దేవుణ్ణీ మోక్షాన్ని, ముక్తిని వైజ్ఞానికులు గుర్తించలేదు. చార్వాకుల వారసత్వాన్ని కొనసాగించకపోవడం, ఈ దేశం వెనకబడి పోవడానికి మూలకారణం!
(డాక్టర్ నరేంద్ర దబోల్కర్ స్మృతిలో 20. ఆగస్టును
వైజ్ఞానిక స్పృహదినంగా జరుపుకుంటున్నాం)
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త,
బయాలజీ ప్రొఫెసర్, మెల్బొర్ నుంచి
- డాక్టర్ దేవరాజు మహారాజు