Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ పులుల లెక్కలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం మనుషులను ప్రేమిస్తుందా? మానవులను ప్రేమించటం మానవత్వానికి నిదర్శనం. పులులను ప్రేమించటం...? పులులు మనుషులు కనిపిస్తే తినేస్తాయి. మనుష్యులలో పులి రక్తం పంచుకొన్న వారున్నారు. వారెంతమంది ఉన్నారు? లెక్కలు తేలటంలేదు.
పులుల రక్షణ, పెంపకం, లెక్కలు రాజ్యాంగ బద్ధం కాకపోతే స్వయంగా ప్రధాని మోడీ పులుల లెక్కలు చెప్పేవారు కాదు. ఎప్పుడో రాసిన రాజ్యాంగంలో పులుల ప్రస్తావన లేకపోవచ్చు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఎన్నో చట్టాలు తెస్తున్న మోడీ ప్రభుత్వం పులుల మీద ప్రేమతో ఒక చట్టం తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పులులకు స్వేచ్ఛ, సమానత్వం ఇతరత్రా హక్కులన్నీ యిచ్చి పులులు స్వేచ్ఛగా నగరాలలో, గ్రామాలలో తిరగవచ్చునని, భద్రత ఉంటుందని చట్టం తెచ్చినా షాక్ తినాల్సిన అవసరం లేదు. పులులు మనుషులను చీల్చి తినవచ్చు కానీ, మనుషులు పులులను చంపటం నేరం అనే చట్టం తెస్తే.. పులులు భద్రంగా తమ జాతిని పెంచుకుంటాయి. అప్పుడు మోడీ ప్రభుత్వం 'పులులను పెంచామని ఐదువందలే కాదు వెయ్యిపైగా ఉన్నాయని' లెక్క చెప్పి ఓట్లు అడిగినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. పులుల్ని పెంచటం, లెక్కించటం లెక్క చెప్పటం వీరత్వ లక్షణం.. ప్రధాని మోడీ తనను తాను వీరునిగా భావిస్తున్నారు.
ఈ కథలో అర్థం కానిదొకటే! పులుల లెక్క దేశానికి అవసరమా? పులుల లెక్క కోసం కొన్ని కోట్లు ఖర్చుచేయటం అవసరమా? పులుల లెక్కను దేశ ప్రధాని ప్రకటించటం అవసరమా? పర్యావరణ వేత్తలు, అటవీశాఖాధికారులు, పులుల లెక్క కోసం ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెల్సి వాడిన ప్రతిభావంతులకు ప్రధాని మోడీ మనసు తెలుసుకావచ్చు. ఆ కథ సగానికి వదిలేద్దాం! ప్రధాని మోడీ భారతదేశంలోని పులుల లెక్క చెప్పిన తర్వాత భారత సర్కారుకు ఒక విషయాన్ని చెప్పాలని.., భారతదేశంలోని క్రిమినల్స్ లెక్క చెపితే చాలా బాగుండేది. నా దేశంలో క్రిమినల్స్ లెక్క అవసరం.. పులుల లెక్క తేల్చటానికి కొన్ని వందల కోట్లు ఖర్చు చేసినట్టు ఒక అంచనా. నిజం కావచ్చు, కాకపోవచ్చు. దేశంలోని క్రిమినల్స్ లెక్క తేలవల్సిన అవసరముంది. ఈ లెక్కను కూడా మోడీ ప్రకటిస్తే ప్రజలు సంతోషిస్తారు. రాజకీయరంగంలో క్రిమినల్స్ ఎంతమంది? తనపార్టీలో ఎందరున్నారు? తన శిష్యులలో ఎందరున్నారు? అసలు మొత్తం దేశంలో క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారు? ఇది తేలాల్సిన అవసరముంది. అప్పుడు దేశ స్వరూపం అర్థమవుతుంది. ఏ వ్యవస్థలో క్రిమినల్స్ ఉన్నారు? రాజకీయ వ్యవస్థలో ఎందరున్నారు? బయట ఎందరున్నారు?
ఎందుకంటే పులులకంటే దేశంలోని క్రిమినల్స్ చాలా ప్రమాదం. పులులు అడవిలోనే ఉంటాయి. కానీ క్రిమినల్స్ వివిధ రూపాల్లో ఉన్నారు. తేనెపూసిన కత్తిలా ఉంటారు. మన మధ్యనే ఉంటారు. నీతి పలుకులు మాట్లాడుతూనే కత్తి విసురుతారు. మన దేశమంతా క్రిమినల్స్ అని ఎవరైనా అంటారేమో... ఈ రాజకీయ వ్యవస్థను, లైంగిక దాడులను, స్మగ్లర్లను అవినీతీ చూసి మొత్తం క్రిమినల్స్ అంటారేమో! అలా అనటం తప్పు. దేశభక్తి ఉన్న వారెవరూ ఆ మాట అనలేరు. మనదేశంలో రైతులు, కార్మికులు, శ్రామికులు చెమటోడ్చేవారు క్రిమినల్స్ కాదు. వీళ్లశాతం 70-80శాతం ఉంటుంది. మనది శ్రామికదేశం. కొందరు క్రిమినల్స్ రథం పగ్గాలు తమ చేతుల్లో ఉంచుకొని, దేశాన్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు. ఆ క్రిమినల్స్ ఎంతమందో తేలాలి. పులుల సంఖ్య అవసరం లేదు. అవసరం లేని పనులు చేయటం, అవసరమున్న పనులు చేయకపోవటం ప్రధాన నరేంద్రమోడీకి అలవాటయ్యింది.
- సిహెచ్. మధు
సెల్: 9949485122