Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం అంటే ప్రభుత్వమని, దేశ అవసరాలంటే ప్రభుత్వ అవసరాలని కొత్త అర్థాలు తీసి ప్రభుత్వ అవసరాలకు దేశ సంపదను ఫణంగా పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సరైంది కాదు. దేశమంటే ప్రజలు, ప్రభుత్వం అంటే పరిపాలన కోసం ఎన్నుకోబడిన లేదా నియమింపబడిన యంత్రాంగం. ప్రజల జీవన విధానానికి సహకరించడమే ప్రభుత్వ లక్ష్యం. దేశం బాగుపడడం అంటే ప్రజలు బాగుపడటం అని అర్థం. ప్రజల సంపదల్లో పెరుగుదల జరగాలి కానీ ప్రభుత్వం దగ్గర ఖజానా నిండటం అని అర్థం కాదు. ప్రభుత్వ ఖజానా నిండటం రాజరికంలో సబబు కావచ్చు కానీ ప్రజాస్వామ్యంలో కాదు. ప్రజల సంపద పెరగడానికి ప్రభుత్వం సహకరించాలి, అనగా ప్రజలు చేయగలిగిన పని సౌలభ్యతను అందుబాటులో ఉంచాలి. కానీ ప్రజల ద్వారా పోగు పడిన సొమ్మును ప్రభుత్వం లాగేసుకుని తమ కార్యకలాపాలను నడపడం కాదు. ప్రభుత్వం నడిచేందుకోసం కావలసిన రొక్కాన్ని ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసుకోవాలి తప్ప మిగతా ఏ ఆస్తులను ఉపయోగించుకున్నా అది ప్రజలకు నష్టం చేసినట్టే అవుతుంది. ప్రభుత్వ రంగాలను ఏర్పరచి ప్రజలకు చేదోడుగా ఉండవలసిన ప్రభుత్వం ఈ రంగాలలో పోగైన సొమ్మును లాగేసుకుంటే అది ప్రజల నుంచి దోచుకున్నట్టే అవుతుంది. ఇది తప్పు.. అని ప్రశ్నిస్తే, దేశ బాగు కోసమే అని సమాధానం ఇస్తున్నారు. కాబట్టి దేశమే ప్రజలను దోచుకోవడం సమంజసమా? కాదు కదా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు తొమ్మిది లక్షల కోట్ల వరకు మిగులు నిధులు ఉన్నాయి కాబట్టి అందులోంచి ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్రభుత్వం ఎన్నాళ్ళుగానో ఒత్తిడి తెస్తోంది. ఈ ఒత్తిడి రఘురామ్ రాజన్ గవర్నర్గా ఉన్న కాలం నుంచే ఉన్నది. ఆయన తర్వాత నియమితుడైన ఆర్.బి.ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చి చట్ట ప్రకారం యివ్వాల్సిన మొత్తాన్ని మాత్రమే బదిలీ చేశాడు. ఇదే అంశంపై గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య రాజీనామా కూడా చేశారు. తమ మాట వినలేదని ప్రభుత్వం భావించిందేమో ఉర్జిత్ పటేల్ని కూడా సాగనంపి శక్తికాంతదాస్ను కొత్త గవర్నర్గా నియమించింది. వారు పదవి చేపట్టగానే మరో 30 వేల కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేశారు. మూడు లక్షల కోట్ల రూపాయల వరకూ ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి రావాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకోసమే పలు సందర్భాల్లో ఆర్థిక మంత్రి ద్వారా, ఆర్బీఐ డైరెక్టర్ల ద్వారా అది బయట పడింది. ఈ సొమ్మును అప్పనంగా తరలించుకుపోవడం సరైన పద్ధతి కాదని, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు లాంటి వారు కూడా హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ దగ్గర పోగై ఉన్న సంపద లేదా మిగులు అంతా ప్రభుత్వం కష్టపడి సంపాదించినది కాదు, లేదా ప్రభుత్వం పెట్టుబడి పెట్టి దానిపై ఆశించే రాబడి(రిటర్న్) కూడా కాదు. ఇదంతా బ్యాంకు రేట్ల రూపంలో, ఇతర ఫీజుల రూపంలో ఆర్బీఐ క్రింది స్థాయి నుంచీ సేకరించి పెట్టిన మొత్తం. అంటే ఇదంతా ప్రజలకు సంబంధించిన, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన మొత్తం అని అర్థం. ఈ మిగులు సొమ్మునంతా సదరు హక్కుదారులకు బదిలీ చేయడంలో అర్థం ఉంది కానీ ప్రభుత్వం లాగేసుకోవడం ముమ్మాటికీ దౌర్జన్యమే.
ప్రభుత్వం కన్ను కేవలం ఆర్బీఐ మీద మాత్రమే పడలేదు, నిన్నటికి నిన్న సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుంచి కూడా మిగులును బదిలీ చేయాలని కోరింది. ఈ మేరకు సెబీ చట్టం 1992కు సవరణలు చేస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టింది. దానిద్వారా సెబి దగ్గర ఉన్న మిగులులో 25శాతం మాత్రమే రిజర్వుకు తరలించి మిగతా 75శాతం ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న నిబంధన ఉన్నది. బ్యాంకుల దగ్గర వున్న ఖాతాదారుల తాత్కా లికంగా అన్క్లయిమ్డ్ మొత్తాన్ని కూడా తమ నిధికి పంపించ వలసిందిగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఇలాంటి మొత్తాలు ఏవైతేున్నాయో అటువంటి వాటినన్నిటిని తమకు బదిలీ చేయాలని ఎన్నాళ్లుగానో ఒత్తిడి తెస్తూ ఉన్నది. అయితే పాలసీదారులు వచ్చినప్పుడు వారికి చెల్లించడం మా బాధ్యత అని ఎల్ఐసీ హెచ్చరించడంతో కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రభుత్వం మళ్లీ అదే ప్రతిపాదన తెచ్చింది. సీనియర్ సిటిజన్ ఫండ్ క్రింద ప్రభుత్వం దగ్గర ఉంచండని, దానిని చెల్లించవలసిన బాధ్యత ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి లేఖరాసి తీసుకోండని ఎల్ఐసీకి ఆదేశాలిచ్చింది. ఇలాంటి మొత్తాలను క్రమం తప్పకుండా బదిలీ చేయించుకుంటోంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసుకు కూడా ఈ విధంగానే ఆదేశాలిచ్చి బదిలీ చేయాలని కోరింది. ఇవన్నీ బయటపడిన వివరాలు. ఇక ముందు ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ ఎలెక్షన్ కమిషన్ వంటి అనేక ప్రీమియర్ సంస్థల నుంచి మిగులు మొత్తాలను కోరే ప్రమాదం లేకపోలేదు. ఆర్బీఐ కానీ సెబీ గానీ లేదా బ్యాంకులు ఇన్సూరెన్స్ సంస్థలన్నీ కూడా విధిగా చెల్లించవలసిన డివిడెండ్లు, ఫీజులు క్రమం తప్పకుండా చెల్లిస్తూనే ఉన్నాయి. వాటి పరిపుష్టి కోసం ఏర్పడిన మిగులును వాటి దగ్గరే ఉంచితే అవి పటిష్టంగా ఉండి ఏదైనా విపత్తు ఏర్పడినప్పుడు నిలదొక్కుకోగలుగుతాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మిగిలిన డబ్బులను ఇంతలా లాగేసుకుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది.
భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా నిలుపుతామని కలలుగన్న ప్రభుత్వానికి అవి కల్లలుగా మారి పోయాయి. అంతర్జాతీయ రేటింగు సంస్థలు భారత్ను ఏడవ స్థానంలో నిలిపాయి. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల తరువాతి స్థానం భారత్కు దక్కింది. 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మాట ఏమో కానీ ఆర్థికమాంద్యం ఇప్పుడు భారత్ పైన పడే ఛాయలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా పారిశ్రామిక రంగం తిరోగమన వృద్ధి నమోదు చేసింది. మారుతి కంపెనీ, గిరాకీ లేని కారణంగా 10శాతం ఉత్పత్తిని తగ్గించింది. తదనుగుణంగా ఉద్యోగులను తొలగించింది. ఆటోమొబైల్ రంగం నికరంగా రెండు లక్షల ఉద్యోగులను తొలగించినట్టు బహిరంగంగా ప్రకటించింది. పారిశ్రామిక రంగం పుంజుకో వాలంటే ఎగువ మధ్యతరగతికి కొనుగోలు శక్తి పెరగాలి. ఇది జరగాలంటే ఉద్యోగ నియామకాలు జరగాలి కానీ ఇప్పుడన్నీ తొలగించే కార్యక్రమాలే ఉన్నాయి. జూలై మాసాంతానికి కూడా వ్యవసాయ రంగ పనులు ఊపందుకోక పోవడం వల్ల సరైన ఉపాధి అక్కడా దొరకడం లేదు. ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా తమ ఖజానాను నింపుకోవడం కోసం పులి తన పిల్లలను తానే తిన్నట్టుగా ప్రభుత్వరంగ సంస్థల్లోని డబ్బును కాజేయాలని ప్రయత్నిస్తే భవిష్యత్తు సంగతేమిటి..?
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016