Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలరోజుల వ్యవధిలో వెల్లడైన రెండు ఘటనలు కులాంతర వివాహాలపై బీజేపీ వైఖరిని చెప్పకనే చెప్పాయి. ఒకటి వ్యక్తిగత స్థాయిలో జరిగిన ఘటన కాగా రెండోది శాసనసభ స్థాయిలో జరిగింది. కులాంతర పెండ్లి చేసుకొన్న జంటలపై ఖాప్ పంచాయతి పేరుతో విధించే మూకశిక్ష పద్ధతిని అడ్డుకోవడానికి ఈనెలలోనే రాజస్థాన్ ప్రభుత్వం ఒక బిల్లును తెచ్చి శాసనసభ ఆమోదం పొందింది. ఎవరిని పెండ్లి చేసుకోవాలో నిర్ణయించుకొనే వ్యక్తిస్వేచ్ఛను ఆ బిల్లు గుర్తిస్తుంది. ఆ స్వేచ్ఛను ఆటంకపర్చడం నేరమని బిల్లు చెప్తుంది. అక్కడి ప్రతిపక్ష బీజేపీ బిల్లును వ్యతిరేకించింది. అడ్డగోలు వాదనలు చేసింది. ఆ చట్టాన్ని రాజస్థాన్ సర్కార్ ఏ మేరకు అమలు కానిస్తుందన్న ప్రశ్నను అలా ఉంచితే బిల్లు అభ్యుదయకరమైంది. దానిపై బీజేపీ సభలో చేసిన వాదనలు దాని మనువాద ధోరణిని స్పష్టంగా తెలియచేశాయి. సామాజిక, సాంస్కృతిక సాంప్రదాయాలకు బిల్లు వ్యతిరేకమని బీజేపీ వాదించింది. కులాంతర పెండ్లిండ్లకు అడ్డుపడటమే లక్షణంగా ఆ పార్టీ చర్చించిన తీరు కన్పించింది. కులాంతర వివాహం చేసుకొన్న జంటలపై ఏ శిక్ష విధించినా, చంపినా తప్పులేదనే భావన ఇంకా మన సమాజంలో ఉంది. అలాంటి భావనతో హత్యలకు పాల్పడిన వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించడానికి ఈ చట్టం అవకాశమిస్తుంది. ''పరువు సాంప్రదాయం పేర పెండ్లి సంబంధాల స్వేచ్ఛకు ఆటంకాల నివారణ బిల్లు 2019'' అన్న పేరుతో బిల్లును సభలో ప్రవేశపెడ్తూ ప్రజలు తమ సంకుచిత దృష్టిని అధిగమించడం కోసం బిల్లు తెస్తున్నట్టు ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి శాంతి ధరివాల్ చెప్పారు. పరువు పేరుతో జరిగే నేరాల విచారణకు ప్రస్తుత ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సరిపోవడం లేదని ఆయన అన్నారు.
రాజస్థాన్లో గత ఐదేండ్లలో అంటే బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఖాప్ పంచాయతీల ఆదేశాలు 71వెలువడినట్టు రికార్డుల్లో నమోదయ్యాయి. కాగా వాటిలో హత్య కేసులు 10. ఆ పది కేసుల్లో నలుగురు పురుషులు, ఎనిమిదిమంది స్త్రీలు హత్యకు గురయ్యారు. ఇటీవలి కాలంలో పెల్లుబికిన ఈ అవాంఛనీయ ధోరణి సామాజిక అభివృద్ధికి అడ్డుపడుతోందని మంత్రి చెప్పారు. కాగా బిల్లుకు దిశలేదని, సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లకు అనుగుణంగా లేదని బీజేపీ ఆరోపించింది. బీజేపీ అభ్యంతరాల తర్వాత గోత్రం అన్న మాటను తొలిగించినా అది బిల్లును వ్యతిరేకించింది. సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లకు అనుకూలంగా బీజేపీ కేంద్రస్థాయిలోనూ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అంతకంటే మంచి చట్టాలు చేసి చూపవచ్చు.
తమ పెండ్లిని పరువు పేరుతో కొందరు గుర్తించడం లేదని తమను వేధిస్తున్నారని బెదిరిస్తున్నారని దాడులు చేస్తున్నారని జంటలు చేసే ఏ ఫిర్యాదునయినా జిల్లా కలెక్టర్, ఆర్డీఓలు స్వీకరించాలని బిల్లు నిర్దేశించింది. స్వీకరించడమంటే ఫిర్యాదు విని ఊరకే ఉండటం కాదు. స్పందించాలి. కులాంతర పెండ్లి జంటలకు వ్యతిరేకంగా కొందరు ఒకచోట సమీకృతమైనా, అలాంటి సమీకరణలకు తోడ్పడినా అది శిక్షార్హమవుతుంది. ''పరువు'' పేరుతో హత్య చేసిన వారికి ఈ చట్టం ప్రకారం మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు.
ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తన కూతురు సాక్షిమిశ్రా (23) అజితేష్ కుమార్ (29) అనే దళిత యువకుడిని పెండ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేదు. కారణం ఏమైనా గుడిలో వారి పెండ్లి జరిపిన పురోహితుడు కూడా తాను పెండ్లి చేయలేదని అడ్డం తిరిగారు. ఆ జంట చూపించే సర్టిఫికేట్ నకిలీదని చెప్పారు. సాక్షిమిశ్రా మైనారిటీ తీరినమ్మాయి. మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు చేస్తోంది. ఆమె మాటల్లో అదెలాంటి కాలేజీ అంటే అక్కడ సెల్ఫోన్లను కూడా అనుమతించరు. గుడిలో చేసుకొన్న పెండ్లిని పురోహితుడు నిరాకరిస్తున్నాడు. కాబట్టి వారు రిజిస్ట్రేషన్ పెండ్లి చేసుకోదలిచారు. దానికి ముందు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లి రిజిస్ట్రేషన్ పెండ్లికి ఆటంకం లేకుండా ఆదేశం పొందారు. తమకు ప్రశాంతంగా బతికే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. తన తండ్రి, సోదరుడు నుంచి తండ్రి స్నేహితుడి నుంచి తనకు ప్రమాదముందని ఆమె ఒక వీడియో ద్వారా చెప్పుకొంది. ఇండియా టుడే చానల్ ద్వారా ఆమె తన తండ్రిని ధోరణి మార్చుకొమ్మని కోరింది. కూతురుని కూడా కొడుకుతో సమానంగా చూడమని విజ్ఞప్తి చేసింది. ఆమె మాట్లాడిన దాంట్లో అభ్యంతరకరమైందేదీ లేదు. తనకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకొనే హక్కును ఆమె కోరింది. కుటుంబంలో ఆడమగ మధ్య వివక్ష చూపరాదని అభ్యర్థించింది. ఆజ్తక్ చానల్ యాంకర్లు ఎమ్మెల్యేతో లైవ్లో మాట్లాడగా నన్ను ఇబ్బంది పెట్టి ఆత్మహత్యకు పురికొల్పవద్దు అని కోరారు. తనను మన్నించమని గద్గద స్వరంతో కూతురు కోరగా ఎక్కడున్నా సుఖంగా ఉండు అంటూ చివరికి మిశ్రాను దీవించాడు. సాక్షిమిశ్రా తండ్రికి మద్దతుగా మరో బీజేపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. కనిపెంచిన కూతురు అలా చేయవచ్చా అని ప్రశ్నించారు. అజితేష్ కుమార్ అనామకుడు కాదు. బికారీ కాదు. బెరేలీలో అతనొక వ్యాపారి. కారు డీలర్, సోదరుడితో కలిసి హోమ్ డెకర్ షాపునూ నడుపుతాడు. కోర్టు వారి పెండ్లిని అంగీకరించింది. తండ్రి మిశ్రాకు హెచ్చరిక జారీ చేసింది. అయినా అజితేష్ కుమార్పై భౌతిక దాడి జరిగింది.
పెండ్లి చేసుకొన్న జంటలో ఎవరైనా దళితులుంటే వారి వార్షిక ఆదాయం 5 లక్షలకు లోబడిఉంటే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2.5 లక్షల ప్రోత్సాహం లభిస్తుంది. 2013లో కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. 5 లక్షల ఆదాయ పరిమితిని కొంతకాలం తర్వాత మోడీ ప్రభుత్వం తొలగించినా దేశవ్యాప్తంగా సహాయం పొందే జంటల సంఖ్య 500 ఉండాలన్న నియమాన్ని మాత్రం మార్చలేదు. కాగా ఆచరణలో ప్రోత్సాహం డబ్బు పొందిన జంటల సంఖ్య విస్మయం కలిగిస్తోంది. ఈ పథకంలో పేర్కొన్న షరతుల ప్రకారం హిందూ వివాహచట్టం కింద పెండ్లి జరగాలి. అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెండ్లి చేసుకొన్న వారికి ఈ ప్రోత్సాహం వర్తించదు. ఇలా కులాంతర వివాహాలు చేసుకొన్న 2014-15లో ఐదుగురికి ప్రోత్సాహక సాయం లభించింది. 2015-16లో దరఖాస్తు చేసుకొన్న వారి సంఖ్య 522 కాగా అందులో 72మందికే ప్రోత్సాహకం లభించింది. 2016-17లో 736 దరఖాస్తులు రాగా 45మందికి ప్రోత్సాహకం లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో 409 దరఖాస్తులు రాగా 74జంటలకు మాత్రమే ప్రోత్సాహకం లభించింది. దరఖాస్తుదారులు ప్రోత్సాహక చెల్లింపు నిబంధనలన్నింటిని పూర్తి చేయడంలేదు కాబట్టి ప్రోత్సాహకం మంజూరయ్యే సంఖ్య తక్కువగా ఉంటోందని అధికారులు చెపుతున్నారు. 120 కోట్ల జనాభాగల దేశంలో 500 ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఆ సంఖ్య దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాకూడదన్నట్టుగా షరతులు పెట్టింది. ఈ దరఖాస్తులపై ఎంపీ, ఎమ్మెల్యే లేదా జిల్లా కలెక్టర్ సంతకం చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి మాత్రమే దరఖాస్తులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రోత్సాహానికి సంబంధించిన సమాచారం ఎవరికీ అంతగా తెలియదు. కేంద్రస్థాయిలో కాంగ్రెస్ చివరి దశలో ఈ పథకాన్ని తెచ్చింది. ఆ పథకాన్ని ఎక్కువ మందికి వర్తింప చేయాలన్న దృష్టి ఏనాడూ మోడీ ప్రభుత్వానికి కలుగలేదు.
రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వమే కులాంతర వివాహాల రక్షణకు ఒక చట్టమే తీసుకురాగా పక్కనే ఉన్న గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కులాంతర వివాహాలను వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్లో ఈ వివాదం ముందుకొచ్చిన సమయంలో గుజరాత్లో 12గ్రామాలకు చెందిన 800మంది ఠాకూర్ కులపెద్దలు సమావేశమై తమ కులంలో ఎవరూ కులాంతర పెండిండ్లు చేసుకోరాదని దిఖ్ఖత్ (ఫత్వా) జారీ చేశారు. అలాగే పెండ్లికాని అమ్మాయిలు సెల్ఫోన్లు వాడరాదని నిషేదించారు. సెల్ఫోన్ల వల్ల అమ్మాయిలు చదువుపై దృష్టి కేంద్రీకరించడం లేదన్న కులపెద్దల వాదనలో పసలేదు. అమ్మాయిల దృష్టి మళ్లించే సెల్ఫోన్లు అబ్బాయిల దృష్టి మళ్లించవా? చాంధసులకు మహిళల చదువు పట్ల అంతటి ఆసక్తి ఉందంటే నమ్మేదెలా? అసలు విషయం తమ పట్ల చూపుతున్న వివక్షను ప్రశ్నిస్తూ యువతులు వీడియోలు పెడుతున్నారు. తనకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకోవడానికి కులం పేర తల్లితండ్రులు, అన్నదమ్ములు ఎలా అడ్డుపడుతున్నారో చెబుతూ వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి వీడియోలు తెలంగాణలో కులదురహంకార హత్య కేసుల్లో బయటికి వచ్చిన విషయం మనకు తెలుసు. గుజరాత్లో ఠాకూర్ కులపెద్దలు యువతుల నుంచి సెల్ఫోన్లు లాగేసుకోవాలని నిర్ణయించారు. కాగా కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే గెనిబెన్ ఠాకూర్ ఈ ఉత్తర్వులను సమర్థించారు.
ఠాకూర్ కులం నుంచి ఎవరైనా అమ్మాయి మరో కులం అబ్బాయిని పెండ్లాడితే ఆ కుటుంబం రూ.లక్షన్నర అపరాధం చెల్లించాలి. ఒకవేళ తమ కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని చేసుకొంటే రూ.2 లక్షలు చెల్లించాలి. పెండ్లికాని అమ్మాయిలు సెల్ఫోన్లతో పట్టుబడితే తల్లిదండ్రులు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ జారీ అయిన ఫత్వాల్లో ఈ ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదని గెనిబెన్ వాదం.
కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తామంటున్న సంఘ్ పరివార్ నడిపే గుజరాత్ ప్రభుత్వం కులపెద్దల ఉత్తర్వులపై చర్యలు తీసుకోవలసి ఉండింది. పెండ్లి విషయంలో వ్యక్తి స్వేచ్ఛను గుజరాత్ ప్రభుత్వం గౌరవిస్తోందా? వ్యతిరేకిస్తుందా? ఇలాంటి సందర్భంలో మౌనం వహించడమంటే వ్యక్తికి పెండ్లి విషయంలో వ్యక్తి స్వేచ్ఛలేదని చెప్పడమే. కాంగ్రెస్ పార్టీని ఇదే ప్రశ్న వేయవచ్చు. రాజస్థాన్లో తాము తెచ్చిన చట్టం లాంటిది గుజరాత్లో కూడా తేవాలని డిమాండ్ చేయాలి. లేదా ఒక అనధికార బిల్లు ప్రతిపాదించాలి. అలా కాకుండా కులాంతర వివాహాలను అడ్డుకొనే ఫత్వాను ఒక కాంగ్రెస్ సభ్యురాలు ఎలా వెనకేసుకొస్తారు? మూకస్వామ్యాన్ని ఆమె ఎలా సమర్థిస్తారు? సామాజిక అంశాలపై నిశితంగా చూస్తే బీజేపీ, కాంగ్రెస్లది ఒకే ధోరణి కన్పిస్తోంది.
- ఎస్. వినయ కుమార్