Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దేశ నలుమూలల నుంచి ప్రజలూ నాయకులూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో ఒక పక్క వామపక్షాలు ఎర్రజెండాలతో తమ నిరసన తెలుపుతుంటే మరోపక్క సంఫ్ు పరివార్ శక్తులు రోడ్లకు ఇరుపక్కలా కాషాయ జెండాలను ప్రదర్శిస్తూ మోడీని పొగడ్తలతో ముంచెత్తాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు టెలివిజన్ కేంద్రాలలో చర్చా గోష్టులలో పాల్గొంటున్నారు. కానీ కాశ్మీర్ ప్రజలకు మాత్రం తమ అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం లేదు.
వారి ఇల్లు ముక్కలు చేయబడింది. వారి హక్కులను బలవంతంగా లాక్కున్నారు. నాయకులను అరెస్టు చేశారు. బాహ్య ప్రపంచంతో సమాచారం, సంబంధాలు నిలిపివేశారు. అయినా వారిని మాట్లాడేందుకు అనుమతిం చట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించండి. నిస్సహాయత, భయం, కోపం, ఆగ్రహం, అసహనం మొదలైన భావోద్వేగాలు మనసు, శరీరం, గుండెలను ఆక్రమించి మనుషులను అతలాకుతలం చేసేయ్యవూ?
ఏదో తీవ్ర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనే వదంతులు ఆగస్టు 4వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నేను సీపీఐ(ఎం) ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామితో ఫోన్లో మాట్లాడాను. తనను గృహనిర్బంధంలో ఉంచినట్టు ఇప్పుడే సమాచారం అందిందని, ఇతర రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అదేనని ఆయన చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలోని సమాచార వ్యవస్థ మొత్తాన్ని నిలిపివేయడంతో అక్కడ ఏమి జరుగుతుందో సమాచారం లేదు.
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మహబూబా ముఫ్తీ, జమ్మూకాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జడ్లోన్ అందరూ గృహనిర్బంధంలో ఉన్నారు.
ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగంతో పాటు రక్షణ, సమాచార, విదేశీ వ్యవహారాలకు సంబంధించి మినహా ఇతర విషయాలలో స్వయం ప్రతిపత్తిని కూడా ఇచ్చింది.
బయట నుంచి నలభై వేల ఆర్మీ సైన్యాన్ని కాశ్మీర్లో మోహరించారు. గన్నులు, తుపాకీలను ఎక్కుపెట్టి, 144 సెక్షన్ విధించి, కర్ఫ్యూ ప్రయోగించి కాశ్మీరీల గొంతు నొక్కేశారు. రాజ్యాంగ ఉల్లంఘనతో బలవంతంగా వారిపై తమ పెత్తనాన్ని రుద్దటం ద్వారా కాశ్మీరీ ప్రజలను భారతదేశంలో అంతర్భాగంగా చేయజాలము. ఇది దేశంలో అంతర్భాగం చేయటం కాదు.. ఆక్రమణ.
గతంలో కాశ్మీర్ నివాసులై తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కొంతమంది జమ్మూకాశ్మీర్లో సైనిక చర్య వల్ల ప్రజల సాధారణ జీవనం ఎంత ప్రభావితమవుతుందో బ్లాగ్లు, మేసేజ్ల ద్వారా తమ పూర్వ అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు.
రోజువారీ కూలీలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ప్రజలకు కర్ఫ్యూ పాసులు అందుబాటులో లేవు. అనారోగ్యంతో ఉన్న 22ఏండ్ల యువకుడు ఆస్పత్రికి వెళ్లే వీలు లేక అకాల మరణం పాలయ్యాడు. ఇలాంటి అనేక సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ దురాక్రమణతో దీనావస్థను ఎదుర్కొంటున్న పాలస్తీనా సరసన కాశ్మీరును కూడా చేరనిద్దామా? లేక 1960లో అమెరికా ఆధీనంలోకి వెళ్లిన సైగాన్ లాగా మిగులుద్దామా? తన కుత్సిత రాజకీయ ఎజెండాను వేగంగా అమలుచెయ్యటం కోసం బీజేపీ ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వం ఆడుతున్న వికృత క్రీడ పర్యవసానాలు ఎంతో ప్రమాదకరంగా ఉండబోతున్నాయి.
ఆర్టికల్ 370 రద్దును ప్రకటించటానికి చాలా వారాల ముందుగానే ప్రభుత్వం సుమారు నలభై వేల సైన్యాన్ని కశ్మీర్కు తరలించింది. ఇది ఫెడరల్ విధానాలు, ప్రజాస్వామిక హక్కులపై ప్రత్యక్ష దాడి. సంబంధిత రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారి ప్రమేయం లేకుండా కేంద్రం ఒక రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టింది. ఇది అసాధారణ చర్య.
బీహార్ నుంచి జార్ఖండ్ను, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ను, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మొత్తం ప్రక్రియ జరగటానికి కొంత సమయం పట్టింది. అనుకూల, ప్రతికూల అభిప్రాయాలున్న సెక్షన్ల మధ్య సంప్రదింపులు, చర్చలు, పోరాటాలు జరిగాయి. రాజ్యాంగబద్ధంగా కొత్త రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చాయి.
భారతదేశం సమాన హక్కులు కలిగిన రాష్ట్రాల సముదాయం. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశమైనా రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధుల మధ్య చర్చల ద్వారా నిర్ణయం కావాలి. ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, సరిహద్దుల్లో మార్పులు చేయాలన్నా సంబంధిత రాజ్యాంగ నిబంధనలకు లోబడి చేయాలి. కానీ జమ్మూకాశ్మీర్లో ఇదేదీ అమలుకాలేదు.
కాశ్మీరీలకు తమ రాష్ట్రంపై గల హక్కులను లాగేసుకుని, వారి అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించటానికి వారేమన్నా రెండవతరగతి పౌరులా? లడ్డాక్ ప్రజలను వారి ప్రజాప్రతినిధుల నుంచీ దూరం చేశారు? ఇప్పుడు వారి ప్రాంతం కేంద్రం చేతిలో ఒక చిన్న మునిసిపాలిటీలాగా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడదని గ్యారంటీ ఏమీ లేదు.
పాలకులు తమ భజన బృందాల ద్వారా ఆర్టికల్ 370పై పనిగట్టుకుని ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 1947 ఆగస్టు15న స్వాతంత్య్రం వచ్చేనాటికి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు. ఒక సంస్థానంగా మహారాజా హరిసింగ్ పాలన క్రింద ఉన్నది.
ముస్లింలు మెజారిటీగా ఉన్న రాష్ట్రాన్ని ఒక హిందూ రాజు పాలించాడనటానికి ఇది ఒక ఉదాహరణ. తాను స్వతంత్రంగా ఉండాలనే ఆలోచనతో రాజా హరిసింగ్ విలీనానికి ఒప్పుకోలేదు. కానీ షేక్ అబ్దుల్లా నాయకత్వంలోని ముస్లిం ప్రజలు మాత్రం భారత్లో కలవాలని కోరుకున్నారు. ఇదంతా జరువుతున్నప్పుడే కాశ్మీరును ఆక్రమించుకోవాలనే ఉద్దేశ్యంతో పాక్ పంపిన సైన్యం ఇంచుమించు శ్రీనగర్ దరిదాపులకు చేరుకుంటున్న తరుణంలో అనేక పరిణామాల మధ్య భారత్లో విలీనం ఖరారయ్యింది.
కాశ్మీరు లోయలోని ముస్లిం ప్రజలు పాక్ సైన్యాన్ని తిప్పికొట్టారు. దాని తరువాత మాత్రమే భారత సైనికులు విమానాలద్వారా అక్కడికి చేర్చబడ్డారు. పాక్ సైన్యం ఓడిపోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మహారాజు హరిసింగ్ విలీన పత్రాలపై సంతకం చేసాడు. ఆ ఒప్పందంలో ఆర్టికల్ 370 చేర్చటం ద్వారా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వబడింది. ఆ హామీనే బీజేపీ ఇప్పుడు తన మోసకారితనంతో రద్దు చేసింది.
ప్రత్యేక హౌదా కేవలం కాశ్మీరుకు మాత్రమే లేదు. భారత రాజ్యాంగంలోని 5, 6 అధికరణల కింద ఆదివాసీలకు తమ భూమి, అటవీ సంపదపై రాజ్యాంగ పరమైన హక్కులు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ఆదివాసీల భూములను ఇతరులెవ్వరూ కొనకూడదు. ఆర్టికల్ 371 ప్రకారం వివిధ రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి.
ఉదాహరణకు హిమాచల్ప్రదేశ్లో బయటి రాష్ట్రాల వారు భూమి కొనుగోలు చేయకూడదు. అలాగే సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయలలో కూడా అక్కడి ప్రజలకు కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి. మణిపూర్లోనైతే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ప్రయాణించటానికి ఇతర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఆయా ప్రాంతాల చారిత్రక, భౌగోళిక పరిస్థితుల రీత్యా ఇటువంటి హక్కులు ఏర్పాటు చేయబడ్డాయి.
'ఒకే దేశం- ఒకే విధానం' నినాదంతో సంఫ్ు పరివార్ తమ సంస్కతి భాష, జీవనవిధానాలపై జరుపుతున్న దాడి నుంచి వాటిని రక్షించుకోవాలని అనేక సెక్షన్ల ప్రజలు భావిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే అద్భుతమైన భావంలోనే భారత దేశ ఐకమత్యం రక్షించబడుతున్నది. దానిని మరలా పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం నేడు ఏర్పడింది. ప్రభుత్వం తన ఏకపక్ష ధోరణిని రాష్ట్రాలపై రుద్దడం ఒక చోట ప్రారంభమైతే భారతదేశ సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల స్వీయ హక్కులు బలహీన పరచబడతాయి.
ఆర్టికల్ 370 భారత రాజ్యాంగం కాశ్మీరుకు ఇచ్చిన సంపూర్ణ హామీ. అయితే గత కాంగ్రెస్ నుంచి నేటి బీజేపీ వరకు అన్ని కేంద్ర ప్రభుత్వాలూ ఇప్పటి వరకు 44సవరణలు చేయడం ద్వారా ఆ స్వయం ప్రతిపత్తిని నీరు గార్చారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారు. ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి, అసహనం చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని పాకిస్థాన్ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి తన సొంత పద్ధతిలో శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే కాశ్మీరు ప్రజలు భారతదేశానికి పరాయివారిగా చూడబడటానికి ఆర్టికల్ 370 కాదు, దానిని విచ్ఛిన్నం చేసి నిర్వీర్యం కావటానికి తోడ్పడ్డ పరిస్థితులు కారణమని చరిత్ర చెబుతోంది.
బీజేపీ ప్రభుత్వం తన చర్యల ద్వారా ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లో వారి పాలనను తాను సహించబోననే విషయాన్ని ప్రపంచానికి చాటింది. దీనివల్ల మన భారత దేశానికి తీవ్ర నష్టం జరుగుతోంది. భిన్న సందర్భాలలో, వివిధ మార్గాల్లో లౌకిక భారతావనిపై దాడి చేయటం ద్వారా తన 'రెండు జాతుల' సిద్ధాంతానికి ఏ విధంగా కట్టుబడి ఉందో నిరూపించుకుంది. వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాశ్మీర్ అంశంపై మాట్లాడుతూ ''మానవత్వం, ప్రజాస్వామ్యం, కాశ్మీరీతత్వం'' అనే మూడు మూల స్తంభాలపై తన కాశ్మీరు విధానం ఆధారపడి ఉందన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన వారసులమని చెప్పుకునే వారి వల్లనే నేడు ఆ మూడు మూల స్తంభాలు ప్రమాదంలో పడ్డాయి. యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేసే పనిలో వారు ఉన్నారు.
- బృందాకారత్
అనువాదం: పద్మశ్రీ
సెల్: 9490098687