Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో భూసంస్కరణలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం జమ్ము-కాశ్మీర్. జమ్ము-కాశ్మీర్ భూసంస్కరణ లలో రెండు అంతర్భాగాలు ఉన్నాయి. వీటిలో మొదటిది మహారాజా కాలం నుంచి కొనసాగుతున్న అనుపస్థిత (ఆబ్సెన్టీ) భూస్వామ్య వ్యవస్థను రద్దుచేయటం. అనుపస్థిత భూస్వాముల నుంచి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకున్న భూమిని సాగుచేస్తున్న కౌలుదార్లకు ఏ మాత్రం డబ్బును చెల్లించనవసరం లేకుండా యాజమాన్య హక్కును యిచ్చారు. యిలా ఇచ్చిన హక్కుకు భూవిస్తీర్ణ పరిమితిని విధించలేదు. భూమి యాజమాన్యంపై 22.75ఎకరాల (182కనాల్స్) గరిష్ఠ పరిమితిని విధించటం రెండవది. ఒక వయోజనుడు పెద్దగా వున్న కుటుంబం ఇంతకన్నా ఎక్కువ భూమిని కలిగి వుండకూడదు. ఈ పరిమితికి ఆవల పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్న మిగులుభూమిని పేద కౌలుదార్లకు, భూమిలేని పేదలకు డబ్బు చెల్లించనవసరం లేకుండా పంచారు.
ఈ భూ సంస్కరణలు పరిమితులు లేనివి కావు. చిన్న కౌలుదారులకు ఈ భూ సంస్కరణలు తక్కువ ప్రయోజనకారిగా ఉండటమనేది చట్టం స్వభావంలోనే ఉంది. అనుపస్థిత భూస్వామికి చెందిన భూమిలో చిన్న కౌలుదార్లు చిన్నచిన్న విభాగాలనే సేద్యం చేయటంవల్ల ఆ చిన్న కమతాలపైనే వారికి యాజమాన్య హక్కు వచ్చింది. ఈ భూసంస్కరణలవల్ల భూమిలేని వారికి అంతగా ఉపయోగం జరగలేదు. చిన్న కౌలుదార్లకు యాజమాన్య హక్కుగా వచ్చిన భూమి భూగరిష్ట పరిమితికి మించివున్న భూమి అయినందున అది సహజంగానే నాసిరకానిదై ఉంటుంది. అంతేకాకుండా భూగరిష్ట పరిమితి చట్టాలను అమలు చేసే బాధ్యతను విప్లవ చైనాలోవలే రైతాంగ కమిటీలకు ఇవ్వకుండా అధికార యంత్రాంగానికి యిచ్చినందువల్ల ఈ చట్టం నుంచి తప్పించుకోవటానికి భూస్వాములకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. దానితో పంపిణీకి అందుబాటులోకివచ్చే మిగులు భూమి పరిమాణం చాలా పరిమితంగానే ఉంటుంది. అయితే భూ సంస్కరణలతో కలిగిన ప్రయోజనాలు రైతాంగానికి అసమంగావున్నప్పటికీ జమ్ము-కాశ్మీర్లో భూస్వామ్యాన్ని బలహీనపర్చటంలో భూ సంస్కరణలు సఫలమయ్యాయి. పెద్ద భూకమతాల రద్దు చట్టం 1950సంవత్సరంలోనే అమలులోకి రావటంతో ఇదంతా 1950వ దశకంలోనే జరిగింది.
భారతదేశంలో అప్పటిదాకా ఎక్కడా అమలుకాని స్థాయిలో భూసంస్కరణలు జమ్ము-కాశ్మీర్ (కేరళలో 1957 సంవత్సరంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తరువాత భూసంస్కరణల చట్టాన్ని ఆమోదించారు)లో అమలుకావటానికి గల కారణాలలో రాజ్యాంగంలో పొందుపరచిన 370వ ప్రకరణం ఒకటి. ఈ ప్రకరణాన్నే రాష్ట్ర 'అభివృద్ధి'కి అడ్డంకిగా ఉందని అమిత్షా పార్లమెంట్లో పేర్కొనటం నిజంగా ఆశ్చర్యం.
జమ్ము-కాశ్మీర్వలే కాకుండా భారత రాజ్యాంగంలో ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా ఉంది. భూ సంస్కరణ చట్టాలను ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రవేశపెట్టినప్పుడు అది రాజ్యాంగం హామీ ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కుకు భంగకరం అని ఆయా రాష్ట్రాల హైకోర్టులలో సవాలు చేయటం జరిగింది. హైకోర్టుల తీర్పులు భూస్వాములకు అనుకూలంగా వచ్చాయి. విషయం సుప్రీం కోర్టువరకూ వెళ్ళింది.
అటువంటి పరిస్థితులలో సుప్రీం కోర్టు తీర్పును వెలువడించకమునుపే ముందస్తు జాగ్రత్తగా జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగానికి మొదటి సవరణను ప్రతిపాదించటం జరిగింది. ఆ సవరణ ప్రకారం ఆ మూడు రాష్ట్రాల చట్టాలను న్యాయ సమీక్ష నుంచి మినహాయించటమే కాకుండా రాజ్యాంగానికి తొమ్మిదవ షెడ్యూల్ను ప్రవేశపెట్టారు. ఏ చట్టాలయితే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చబడతాయో ఆ చట్టాలు న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడతాయి.
అయితే దీనితోనే కథ ముగియలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయివేటు ఆస్తికి 'మార్కెట్ విలువ'ను అనుసరించి పరిహారం ఇవ్వాలని 1954 సంవత్సరంలో దీనితో పూర్తిగా సంబంధంలేని ఒక కేసులో సుప్రీం కోర్టు తీర్పు యిచ్చింది. అంటే భూసంస్కరణ చట్టం ఆధారంగా భూస్వామి నుంచి తీసుకునే మిగులు భూమికి ప్రభుత్వం 'మార్కెట్ విలువ'ను అనుసరించి పరిహారం చెల్లించాలి. దీనితో ప్రభుత్వ ఖజానాపై విపరీతమైన భారం పడనున్నందున ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భూములకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం నుంచి మినహాయించేందుకు నాలుగవ రాజ్యాంగ సవరణను నెహ్రూ ప్రభుత్వం చేసింది. ఈ రాజ్యాంగ సవరణను కూడా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి న్యాయ సమీక్షకు అతీతంగా మార్చారు.
ఈ సుదీర్ఘ న్యాయపోరాటంతో ఏర్పడిన పర్యవసానం ఏమంటే జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వంలాగా ఇతర ప్రభుత్వాలు భూమిని స్వాధీనం చేసుకోవటానికి మార్కెట్ విలువలో కానప్పటికీ భూస్వాములకు ఎంతోకొంత పరిహారాన్ని చెల్లించాలి. అదేవిధంగా కౌలుదారులకు భూమి పున్ణపంపిణీ కూడా జమ్ము-కాశ్మీర్లోలాగా పరిహారం ఇవ్వకుండా చేయటం సాధ్యపడదు. అంతకుముందు కౌలుకు చేసిన పొలాన్ని కొనే ఐచ్చిక హక్కును మిగిలిన దేశంలో కౌలుదార్లకు యివ్వటం జరిగింది. లేకపోతే వారు కౌలుదార్లుగా కొనసాగేవారు. ప్రభుత్వం భూస్వాముల నుంచి సేకరించిన భూమికి కూడా వారు కౌలు చెల్లించవలసి వచ్చేది.
భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణం అందించిన హామీతో ఆస్తి హక్కుకు ప్రాధాన్యతనివ్వని స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగాన్ని రూపొందించుకున్న జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం భూమిని ఎటువంటి పరిహారంలేకుండా సేకరించగలిగింది. అలానే డబ్బేమీ అడగకుండానే భూమిని కౌలుదార్లకు పంపిణీ చేయగలిగింది. కాబట్టి మిగిలిన దేశంలోకంటే జమ్ము-కాశ్మీర్లో భూసంస్కరణలు మరింత పగడ్బందీగా అమలయ్యాయి. అవి మాజీ భూస్వాముల నుంచి కనీసం భూమిని వేరు చేశాయి. కొన్ని రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడి మిగిలిపోయిన భూసంస్కరణల ఎజెండాను చేపట్టేదాకా దేశంలోని అన్ని రాష్ట్రాలలోకంటే జమ్ము-కాశ్మీర్ భూసంస్కరణలను అమలుచేసిన రాష్ట్రంగా ఒక చక్కని ఉదాహరణగా ఉండేది.
జమ్ము-కాశ్మీర్లో అమలు చేయబడిన భూసంస్కరణల ప్రభావం సామాజిక నిర్మాణంమీదా, భూమి పంపిణీ మీద గణనీయంగా ఉంది. అంతేకాకుండా భూసంస్కరణల అమలువల్ల రాష్ట్రంలో అసమానతలను నియంత్రించ బడ్డాయి. పర్యవసానంగా గ్రామీణ దారిద్య్రం పరిమితం చేయబడింది. 2009-10 సంవత్సరంలో ప్రణాళికా సంఘం పేదరికంపై ప్రకటించిన అంచనాల ప్రకారం అన్ని రాష్ట్రాలకంటే జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసించే గ్రామీణ పేదల నిష్పత్తి తక్కువగా ఉంది. ఈ రాష్ట్ర గ్రామీణ పేదరికం నిష్పత్తి 8.1శాతం. కేవలం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే దీనికంటే కొంచెం తక్కువ నిష్పత్తిలో 7.7శాతం ఉంది. జమ్ము- కాశ్మీర్తో కలుపుకుని దేశం మొత్తంగా చూసినప్పుడు గ్రామీణ పేదరికం నిష్పత్తి 33.8శాతంగా ఉంది. అయితే ఢిల్లీ ఒక మహానగరం కాబట్టి దాని గ్రామీణ ప్రాంతాలను ఇతర రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలతో సమానంగా భావించలేం. కాబట్టి గ్రామీణ పేదరికం అత్యంత కనిష్ట స్థాయిలోవున్న రాష్ట్రంగా జమ్ము-కాశ్మీర్ ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే మోడీ, అమిత్ షాల స్వరాష్ట్రమైన గుజరాత్లో గ్రామీణ పేదరికం నిష్పత్తి 2009-10 సంవత్సరంలో అధికారిక లెక్కల ప్రకారం 26.7శాతం ఉంది. అందుకే జమ్ము-కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి దాని 'అభివృద్ధి'కి అడ్డంకిగా వుందని ఉపదేశించేముందు అమిత్ షా ఈ అధికారిక లెక్కలను ఒకసారి చూసుకోవాలి.
దారిద్య్రానికి చెందిన అధికారిక లెక్కలు వాస్తవ దారిద్య్రం నిష్పత్తిని తక్కువగా అంచనావేస్తాయి. అయితే గ్రామీణ పేదరికానికి ప్రమాణంగావున్న తలసరి రోజుకు 2200 క్యాలరీలకంటే తక్కువగా ఆహారం అందుతున్న గ్రామీణ ప్రజల నిష్పత్తిని ఎవరైనా ప్రత్యక్షంగా అంచనావేసినా రాష్ట్రాల సాపేక్ష స్థితి మారదు. దేశంలో గ్రామీణ పేదరికం అత్యంత తక్కువ నిష్పత్తిగల రాష్ట్రాలలో జమ్ము-కాశ్మీర్ ఉంటుంది.
పేదరికాన్ని అరికట్టడంలో జమ్ము-కాశ్మీర్ ఎంత ముందుందో అనేక ఇతర సామాజిక సూచికల విషయంలోను అంతే ముందుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో అన్నింటికంటే ముందున్న రాష్ట్రాలలో జమ్ము-కాశ్మీర్ కూడా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించటం వెనుక రాష్ట్రంలో అమలయిన భూసంస్కరణలు పోషించిన పాత్ర తక్కువేమీ కాదు. 370వ ప్రకరణం ప్రకారం జమ్ము-కాశ్మీర్ భారత రాజ్యాంగం పరిధికి ఆవల ఉండటంవల్లనే ఇది సాధ్యపడింది. లేకపోతే పైన వివరించిన సాపేక్ష సంఖ్యలు భూసంస్కరణల అమలు లేదా 370వ ప్రకరణంతో సంబంధం లేకుండా చరిత్రలో అంతకు ముందు నుంచే అస్థిత్వంలో వుండటంచేత ఇతర రాష్ట్రాలకంటే జమ్ము-కాశ్మీర్లో ఎన్నడూ దారిద్య్రం తాండవించలేదని అనుకునే అవకాశం ఉంది. నిజానికి జమ్ము-కాశ్మీర్ రైతాంగం ప్రధానంగా ముస్లిం రైతాంగం ఇతర భూస్వామ్య పాలనలలోవలెనే అత్యంత భూస్వామ్య పాశవిక పాలనలో కడుపేదరికంలోను, అజ్ఞానంలోను మగ్గింది. మహారాజా ప్రభుత్వ అధికారులు రైతాంగం నుంచి పన్నులను వసూలు చేయటంలో అత్యంత కర్కశంగా వ్యవహరించేవారు. రైతులు పన్ను కట్టలేని స్థితిలో వున్నప్పటికీ వారిని వేధించకుండా వదిలేవారు కాదు.
అటువంటి భూస్వామ్య ఆర్థిక వ్యవస్థను నేడు దేశంలోనే అత్యంత కనిష్ట పేదరికం నిష్పత్తిగల రాష్ట్రాలలో ఒకటిగా పరివర్తన చెందేలా చేసిన ఘనత అమిత్ షాను ఆకట్టుకుని ఉండకపోవచ్చు. ఏ ప్రమాణం ప్రకారం చూసినా ఇది చాలా గొప్ప విషయమే. అలాగే ఈ లక్ష్యాన్ని వాస్తవీకరించటంలో 370వ ప్రకరణం నిర్వహించిన పాత్ర తక్కువేమీ కాదు.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
ప్రభాత్ పట్నాయక్
సెల్: 8886396999