Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో మనం ఉన్నప్పుడు మనకు ఫేక్న్యూస్ బలం, దాని వ్యాప్తి గురించీ తెలుస్తుంది. హింస, నమ్మకద్రోహం లాంటివి రెండూ ఉన్న చోట మనకు ఏదైనా సమాచారం తెలిసినా, అది నిజమని నమ్మలేం. కాశ్మీర్లో అదనపు బలగాలు మోహరించారని, యాత్రికులు, కాశ్మీరేతరులు కాశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని చెబుతున్నారని శుక్రవారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ మేం చాలామంది నుంచి రకరకాల వార్తలు వింటూ వచ్చాం. కానీ మాకు దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రతి ఒక్కరూ తాము చెబుతున్న వాటిపై పందాలు కూడా కడుతున్నారు.
సోమవారం కర్ఫ్యూ విధించారనే వదంతులు వచ్చాయి. ఈసారి కర్ఫ్యూ కఠినంగా, ఎక్కువ రోజులు ఉంటుందని భయపడ్డారు. నేను లాల్బజార్ నుంచి నాడ్కడాల్లో ఉన్న మా ఇంటికి బయల్దేరాను. దారిలో చాలామంది హడావిడిగా పరుగులు తీస్తూ కనిపించారు. ఏటీఎం ముందు పొడవాటి క్యూలున్నాయి. సరుకుల దుకాణాల ముందు పదుల సంఖ్యలో కార్లున్నాయి. పెట్రోల్ పంపులు నిండుకున్నాయి.
నా కజిన్కు ఆగస్టులో పరీక్షలున్నాయి. తను చదువుకుంటున్నాడు. అదే రోజు సాయంత్రం కాశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలను రద్దు చేసిందనే సమాచారం వచ్చింది. నేను నా ఫ్రెండుకు రాత్రి పదిన్నరకు ఎస్ఎంఎస్ కూడా పంపించాను. కానీ అది డెలీవర్ కాలేదు. నా ఇంటర్నెట్ ఆ టైంలో కూడా పనిచేస్తోంది. అందుకే నేను కంప్లీట్ షట్ డౌన్ అయ్యుంటుందని అనుకోలేదు. మా అమ్మనాన్నలు ఢిల్లీలో ఉండటంతో మా అమ్మకు టెక్ట్స్ మెసేజ్ పంపించి, నిద్రపోయాను.
ఉదయం నేను లేవగానే కిచెన్లో నిశ్శబ్దంగా ఉంది. మామూలుగా ఉదయాన్నే గులిస్తా చానల్లో వచ్చే ఉదయం కార్యక్రమాలతో నా రోజు ప్రారంభం అవుతుంది. కానీ సోమవారం అందరూ నిశ్శబ్దంగా టిఫిన్ చేస్తున్నారు. మా ఇంటి బయట ఉదయం నాలుగు గంటల నుంచీ ఆర్మీ జవాన్లు ఉన్నారని ఎవరో చెప్పారు. టీవీ, ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ ఏదీ పనిచేయడం లేదు. కర్ఫ్యూ ఉన్నప్పుడు ఒక్కోసారి బీఎస్ఎన్ఎల్ ఫోన్లు పని చేసేవి. కానీ ఈసారి అవి కూడా మూగబోయాయి. మేం భోజనం ఎలాగా, అని కంగారు పడ్డాం. షాపులు మూసేసున్నారు. షాపుల వాళ్లెవరూ కనిపించడం లేదు. మా అంకుల్ కూరగాయలు తేవడానికి బయటికెళ్లారు. కానీ ఆయన్ను జవాన్లు అడ్డుకున్నారు. మీ అంతట మీరు బయటికొచ్చి రిస్క్లో పడుతున్నారని చెప్పారు. దాంతో, ఆయన వట్టి చేతులతో ఇంటికొచ్చారు. కానీ ఆంటీ అప్పటికే వేరే ఏర్పాట్లు చేసుంచారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినప్పటి మాదిరిగానే రెండు నెలల సరుకులు, మిగతా వస్తువులు కొనేసి ఉంచారు.
కాశ్మీర్కు ఏం జరుగుతోందో ఏం తెలీడం లేదు. ఇంట్లోని పురుషులందరూ మసీదుకు వెళ్లి వచ్చాక ఏం జరగచ్చో తెలిసింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తారనే విషయం మధ్యాహ్నం ఇంట్లో అందరికీ చేరింది. మేమంతా అది మరో వదంతి కావచ్చని కొట్టిపారేశాం.
రాజ్యసభలో జమ్ముకాశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లు పాస్ అయినట్టు డీడీ వార్తల ద్వారా తెలిసింది. కాశ్మీర్, జమ్ము ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయి. లడాఖ్ మరో కేంద్ర పాలిత ప్రాంతమైంది. ఆర్టికల్ 370, 35-ఎ తొలగించారు. ముందు ముందు ఇక్కడ ఏమేం జరగొచ్చు అని తలచుకుంటేనే ఒంట్లో సన్నటి వణుకొచ్చింది. తర్వాత 15 నిమిషాలపాటు మేం మాట్లాడకుండా అలా కూర్చుండిపోయాం.
నా దగ్గర ఢిల్లీ తిరిగెళ్లడానికి గురువారం టికెట్ ఉంది. అయితే ఎయిర్ పోర్టు వరకూ సురక్షితంగా వెళ్లడం సాధ్యమేనా అని కంగారుగా ఉంది. బుధవారం ఉదయం అంకుల్ ఇంటి నుంచి బయల్దేరి ఎయిర్ పోర్ట్కు దగ్గరగా చేరుకోవాలని ప్లాన్ వేశాం. మంగళవారం మధ్యాహ్నానికి అన్ని టీవీ చానళ్ల ప్రసారాలు మొదలయ్యాయి. కానీ టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు చూసి మేం తట్టుకోలేకపోయాం. ఎందుకంటే వాటిలో సంబరాలు చేసుకున్నట్టు చూపిస్తున్నారు. మేం ఇక్కడ మా ఇండ్లలో బందీగా ఉన్నాం, ఎవరితోనూ మాట్లాడలేక పోతున్నాం. మా భవిష్యత్తుపై ప్రభావం పడేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసమ్మతి, కోపం చూపించే అవకాశం కూడా లేదు. మంగళవారం సాయంత్రం మా ఇల్లు మరోసారి టియర్ గ్యాస్తో నిండిపోయింది. మా బంధువు ఒకరు శ్రీనగర్లో ఉంటారు. ఆయన ఇంటి దగ్గర కూడా రాళ్లు రువ్విన వారిపై జవాన్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పిల్లలు భయపడి పోయారు. దాంతో ఆయన ఆ ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్లిపోవాలనుకున్నారు. మా ఇంటి పైన హెలికాప్టర్లు తిరిగే శబ్దాలు వస్తున్నాయి. పైన వాటి శబ్దం, కింద టియర్ గ్యాస్ ప్రయోగం చూస్తుంటే, మాకు ఏదో యుద్ధ పరిస్థితుల్లో ఉన్నామా అనిపిస్తోంది. కొంతమంది యువకులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని చెబుతున్నారు. కానీ ఏదీ కన్ఫర్మ్ కావడం లేదు. మంగళవారం రాత్రి నా కజిన్ కటారాలోన్ తన యూనివర్సీటీ నుంచి తిరిగొచ్చాడు. వాళ్ల కాలేజీలో కాశ్మీరీలందరినీ క్యాంపస్ వదిలి వెళ్లిపోవాలన్నారని చెప్పాడు. యూనివర్సిటీ క్యాంపస్లో, బయట నీ భద్రతకు మేం గ్యారంటీ ఇవ్వలేమని వాళ్లు అన్నట్టు తను నాతో అన్నాడు. నా కజిన్ వాళ్ల ఇంటికి చేరుకోడానికి 24గంటలు పట్టింది. ఇంటికి చేరే లోపు చాలా మంది పోలీసులు, జవాన్ల సాయం కోరాల్సి వచ్చింది. సొంత ఇంటికి చేరుకోడానికి అనుమతి అడగాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి మేమందరం ఇది ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తూ ఉండిపోయాం.
బుధవారం ఉదయం ఐదు గంటలకే లేచాను. ఎయిర్ పోర్ట్ దగ్గరున్న పీర్ బాగ్ బయల్దేరాను. మా ఆంటీకి కన్నీళ్లతో గుడ్బై చెప్పాను, ఆమె నాతో దుబాయిలో ఉంటున్న తన కొడుకుతో ఒకసారి మాట్లాడమని చెప్పారు. ఆదివారంరాత్రి అతడితో మాట్లాడలేక పోయానని బాధపడ్డారు. 'బిడ్డతో మళ్లీ ఎప్పుడు మాట్లాడతానో, ఏమో' అన్నారు. ఆమె కొడుకు వరకూ ఆ సందేశం చేర్చే ఏకైక మార్గం నేనే. బయట రోడ్లపై బ్యారికేడ్లు, ముళ్ల కంచెలు ఉన్నాయి. మేం కారు వెళ్లే ఒక మార్గాన్ని వెతికాం. ఉదయం కావడంతో మమ్మల్ని ఎవరూ ఆపలేదు. పీర్ బాగ్ చేరగానే అక్కడ కూడా మాకు చాలా బ్యారికేడ్లు కనిపించాయి. చిన్న గల్లీలో వెళ్లడాన్ని కూడా నిషేధించారు. దాంతో తిరిగి వచ్చేశాం. బాగా పొద్దుపోయాక మా ఆంటీ వచ్చారు. టియర్ గ్యాస్ పొగ వల్ల తన కజిన్ పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, కారులో పెట్రోల్ లేక, వేరే రవాణా వ్యవస్థలు కూడా లేకపోవడంతో మందు లు కూడా తీసుకు రాలేకపోయానని చెప్పారు.
ఢిల్లీకి వెళ్లడం చాలా కష్టంగా అనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా మా అమ్మనాన్నలతో ఒక్క మాట కూడా మాట్లాడలేక పోయాను. వాళ్లు చాలా కంగారు పడుతుంటారని నాకు తెలుసు. కానీ కాశ్మీర్లో ఉన్న నా కుటుంబానికి ఎలా గుడ్బై చెప్పాలో నాకు తెలీడం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్లను అలా వదిలేసి నేను సాధారణ జీవితం వైపు ఎలా రాగలను అనిపించింది. కానీ నేను ఒక బాధ్యతతో అక్కడి నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నాను. 'కాశ్మీర్లో మీ అమ్మనాన్నలను కలిసి వచ్చాను, వాళ్లు సురక్షితంగా ఉన్నారు' అని నా కజిన్స్ అందరికీ చెప్పాలనుకున్నాను. 'అక్కడ మీ ఇంట్లో కొన్ని నెలలకు సరిపడా నిత్యా వసరాలు, సరుకులు ఉన్నాయి' అనే విషయాన్ని కూడా నేను వాళ్లకు చెప్పాను. ఎంత నిరాశలో, నిస్సహాయ స్థితిలో ఈద్ చేసు కున్నామో... ఆ భావన మా జీవితాలపై ఎంత సుదీర్ఘ ప్రభావం చూపబోతోందో.. దాని గురించి కూడా నేను వాళ్లతో మాట్లాడాను.
- మిస్బా రేషీ,
ఢిల్లీ యూనివర్సిటీ ఫిలాసఫీ గ్రాడ్యుయేట్, లా విద్యార్థిని. ( బిబిసి వెబ్సైట్ నుంచి)