Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ ఒకటి నుంచి చైనా వస్తువులపై పెంచదలచిన దిగుమతి పన్ను క్రిస్మస్ పండుగను నాశనం చేస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిసెంబర్ 15 నాటికి వాయిదా వేసినట్టు వార్తలు వచ్చాయి. పండుగ అంటే బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కోట్లాదిమంది అమెరికన్లు బహుమతులుగా ఇస్తారు. దిగుమతి పన్ను భారాన్ని వినియోగదారుల మీద మోపటం తప్ప మరొక మార్గం లేదని వాల్మార్ట్ తదితర దుకాణాల సంస్థలు స్పష్టం చేశాయి. మరోవైపు చైనా నాయకత్వం కూడా తాము కూడా తగిన ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పటంతో తాను ప్రతిపాదించిన పన్ను పెంపుదల క్రిస్మన్ కొనుగోళ్లకు సంబంధం లేనప్పటికీ వాటి మీద ప్రభావం పడుతుందంటున్నారు కాబట్టి వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించాడు. అదే నోటితో హాంకాంగ్లో జరుగుతున్న ఆందోళనకు వాణిజ్య యుద్ధానికి లంకె పెట్టేందుకు కూడా ప్రయత్నించిన ట్రంప్ రెచ్చగొట్టడం మానుకోలేదు. హాంకాంగ్ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని, ఇతరుల సలహాలు తమకు అవసరం లేదని చైనా ప్రకటించింది.
వాణిజ్య యుద్ధాలు మంచివి, వాటిలో విజయం సాధించటం తేలిక అని 2018 మార్చినెలలో ట్రంప్ చెప్పాడు. అయితే చైనాను ఊబిలో దించబోయి ట్రంపే తన ఊబిలో తానే పడ్డట్టు అనేకమంది విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య యుద్ధంలో ఎలా ఓటమి చెందనున్నారో వివరించారు. మీడియాలో వచ్చిన విశ్లేషణలు, వ్యాఖ్యల మేరకు దిగువ అంశాలు ట్రంప్ను ప్రభావితం చేశాయి. భద్రతా కారణాలతో చైనా టెలికాం కంపెనీ హువెరు, దాని అనుబంధంగా ఉన్న 46కంపెనీలతో లావాదేవీలు జరపరాదన్న తమ అధినేత నిర్ణయాన్ని మరో 90రోజుల పాటు నవంబర్19 వరకు వాయిదా వేస్తున్నట్టు అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ ప్రకటించాడు. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాలు కూడా హువెరు కంపెనీ పరికరాలను కొనుగోలు చేయరాదని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా విధించిన ఆంక్షలు హువెరు కంపెనీ పనితీరు మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో దాని ఆదాయం 23.2శాతం పెరిగినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదవ తరం(5జీ) నెట్వర్క్ పరికరాల విషయమై ఇది 50వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. వాటిలో 28 ఐరోపాలోనే ఉన్నాయి. ఫిన్లండ్కు చెందిన నోకియా 43, స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ 22కాంట్రాక్టులు కుదుర్చుకుంది. మరోవైపు హువెరు పోటీదారు జడ్టీయి 25వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించింది.
మూడు వందల బిలియన్ డాలర్ల విలువగల వస్తువులపై ఆగస్టు ఒకటి నుంచి పన్ను విధిస్తామన్న ట్రంప్ తరువాత ఆ మొత్తాన్ని 160బిలియన్లకు తగ్గించి సెప్టెంబర్ ఒకటి నుంచి పన్ను వేస్తామని ప్రకటించాడు. క్రిస్మస్ పేరుతో ఇప్పుడు దాన్ని కూడా డిసెంబర్ 15కు వాయిదా వేశాడు. అయితే కిందపడ్డా పైచేయి తనదే అని చెప్పుకొనేందుకు అమెరికా వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. అయితే అమెరికా రైతాంగం యిబ్బందులు పడుతున్నదని రాయిటర్స్ ఒక వార్త ఇచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న రుణాలు 17.5శాతం తగ్గాయని, బకాయిల చెల్లింపునకు వత్తిడి, కొత్తగా రుణాలు నిలిపివేయటంతో అనేకమంది దివాలా చట్టాన్ని ఆశ్రయిస్తున్నట్టు తెలిపింది. చైనా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా, ధాన్యం వంటి ఉత్పత్తుల మీద పన్నులు విధించిన కారణంగా అక్కడి రైతాంగం యిబ్బందులు పడుతున్నది. వారిని ఆదుకొనేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదు. చైనా ఉత్పత్తులపై పన్ను విధింపు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగానే అమెరికా స్టాక్మార్కెట్ సంతోషపడింది. అయితే తాము కూడా ప్రతి చర్యలకు వెనుకాడబోమని చైనా వెల్లడించగానే డీలాపడటం అమెరికా బలహీనతకు సూచికగా విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రంప్ వ్యూహం విఫలమౌతున్నదని బాహాటంగానే మీడియాలో వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలతో రోజు రోజుకూ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ప్రతి వారి మీద బస్తీమే సవాల్ నాకు లొంగుతారా లేదా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా లేదా అనే బెదిరింపులకు దిగుతున్నది. ఇది దాని ఆర్థిక వ్యవస్థతో పాటు రాజకీయ పలుకుబడిని కూడా దెబ్బతీస్తున్నదంటే అతిశయోక్తి కాదు. తమ చర్యల కారణంగానే చైనా అభివృద్ధి కూడా పడిపోయిందని ట్రంప్ చంకలు కొట్టుకోవచ్చు. నిజానికి అదొక చిన్న కారణమే తప్ప మరొకటి కాదు. అంతర్గతంగా తీసుకున్న చర్యలు అభివృద్ధి రేటు తగ్గటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తన వస్తువులను అమ్ముకొనేందుకు చైనా అవసరమైతే తన యువాన్ విలువను తగ్గించు కొనేందుకు సిద్ధంగా ఉందన్న సూచనలు గతవారంలో వెలువడిన విషయం తెలిసిందే. అమెరికా తన డాలరు విలువను తగ్గించనట్టయితే ప్రపంచ మార్కెట్లో దాని వస్తువులను కొనుగోలు చేసే వారు ఉండరు. తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఇతర పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా భయపడుతోంది. డాలరు విలువ తగ్గకుండా ప్రపంచ దేశాలను అదిరించి బెదిరించి తన వస్తువులను అంటగట్టాలని చూస్తోంది.
అమెరికాను ఒంటరిపాటు చేసేందుకు, మిత్రులను సంపాదించుకొనేందుకు చైనా తనదైన శైలిలో ముందుకు పోతోంది. 2018 జనవరిలో చైనా తాను చేసుకొనే దిగుమతులపై సగటున ఎనిమిదిశాతం పన్ను విధించింది. అమెరికా ఎప్పుడైతే వాణిజ్య యుద్ధానికి దిగిందో అమెరికా వస్తువులపై పన్ను మొత్తాన్ని 20.7శాతానికి పెంచి, మిగతా దేశాలపై సగటు పన్నును 6.7శాతానికి తగ్గించింది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించి ఇతర దేశాల నుంచి పెంచుకున్నదని, ఇతర దేశాలకు తన ఎగుమతులను పెంచిందని పీటర్సన్ ఇనిస్టిట్యూట్ పేర్కొన్నది. అమెరికా ఒక వైపు తన సోయా బీన్స్ నుంచి బోయింగ్ విమానాల వరకు ఏవేవి కొనాలో జాబితా ఇస్తోంది. అదే సమయంలో ప్రభుత్వరంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్న చైనా ఆర్థిక విధానాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేస్తోంది. భద్రత సాకుతో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింప చేయకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగావు సరే మిత్ర దేశాలైన మెక్సికో, ఐరోపా దేశాల మీద కూడా తొడగొట్టటం ఏమిటయ్యా బాబూ అని ట్రంప్ను చూసి కొందరు అమెరికా వాణిజ్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మన బోయింగ్లు ఎక్కువగా కొనాలని చైనా మీద వత్తిడి తెస్తే తమ ఎయిర్బస్ల సంగతేమిటని ఐరోపా దేశాలు అమెరికాను ప్రశ్నించవా, చైనాతో సఖ్యతకు ప్రయత్నించవా అని చెబుతున్నా ట్రంప్ వినటం లేదు.
హాంకాంగ్లో నిరసన తెలుపుతున్న వారి మీద తియాన్మెన్ తరహా అణచివేతను తాము వ్యతిరేకిస్తామని, హాంకాంగ్లో అణచివేత చర్యలు వాణిజ్య యుద్ధం మీద ప్రభావం చూపుతాయని ట్రంప్ ప్రకటించి వివాదాన్ని మరో కొత్త మలుపు తిప్పాడు. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఇతర సమస్యల్లో కూడా జోక్యం చేసుకొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. హాంకాంగ్ నిరసనలు చైనా అంతర్గత వ్యవహారం, దానికి వాణిజ్య యుద్ధానికి సంబంధం లేదు, తమకు ఇతరుల సలహాలు అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ముడిపెడితే రెండు దేశాల మధ్య తదుపరి చర్చలకు అవకాశాలుండవని అనేక మంది హెచ్చరిస్తున్నారు. జూలై 30న షాంఘైలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం యివ్వకుండానే ముగిసిన విషయం తెలిసిందే.
యిలాంటి హెచ్చరికలు అమెరికాలో చాలా కాలం నుంచి వినపడుతున్నా ట్రంప్ బింకాలు పోతున్నాడు. తనతో ఒప్పందానికి చైనా సిద్ధంగా ఉందని తాను సిద్ధంగా లేనని, ముందు హాంకాంగ్ సమస్యను అదెలా పరిష్కరిస్తుందో చూస్తానంటూ ట్రంప్ వాచాలత్వాన్ని ప్రకటించాడు. మాంద్యం భయాలేమీ లేవని, వాణిజ్య పోరుతో తమకేమీ నష్టం లేదని వైట్హౌస్ యంత్రాంగం భావిస్తున్నదని రాయిటర్స్ పేర్కొన్నది. మాంద్య భయంతో గత బుధవారంనాడు అమెరికా స్టాక్ మార్కెట్ మూడుశాతం పతనమైంది. 2009 మాంద్య తరువాత అమెరికా ఫెడరల్ రిజర్వు, ఇతర 19దేశాల రిజర్వుబ్యాంకులు పెద్ద మొత్తంలో తమ వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ అధ్యక్షుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మాంద్యంలోకి నెడుతున్నాడని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులలో ఒకరైన బెటో ఒ రూర్కీ ఒక టీవీ చానల్లో పేర్కొన్నాడు.
విదేశాంగ విధానం అంటే న్యూయార్క్ రియలెస్టేట్లో పోటీదార్లను బెదిరించి తాను చేసుకున్న లాభదాయకమైన ఒప్పందాలు అనుకుంటున్నట్టుగా ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు అలా ఉండవని తెలుసుకోవాలని ట్రంప్కు ఒక విశ్లేషకుడు సలహా ఇచ్చాడు. అదిరించి బెదిరించి చైనా నేత గ్జీ జింపింగ్ను దారికి తెచ్చుకుందామని చూస్తే కుదరదు. చైనా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి. అమెరికా దాని దగ్గర తీసుకున్న 1.2లక్షల కోట్ల డాలర్ల రుణపత్రాలు(బాండ్లు) న్నాయి. వాటిని గనుక అమ్మేస్తే అమెరికా పరిస్థితి ఏమిటి? దాని దగ్గర ఎక్కడా దొరకని విలువైన ఖనిజం(మట్టి) ఉంది. అన్నింటికీ మించి తన కరెన్సీ విలువను తగ్గించి నిలబడగల సత్తా ఉందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 83శాతం తగ్గాయి. యిప్పటికే వాణిజ్య యుద్ధం అమెరికా వార్షిక వృద్ధి రేటును నాలుగు నుంచి రెండుశాతానికి దించింది. ప్రపంచం మరోసారి మాంద్యానికి దగ్గరవుతోంది. ప్రపంచం దృష్టిలో స్వేచ్ఛా ప్రపంచపు రాజధాని వాషింగ్టన్ యిప్పుడు బీజింగ్వైపు తిరిగింది. ఒక పోలీసు రాజ్యం బాధిత దేశంగా మారింది. స్వేచ్ఛా వాణిజ్యం గురించి ఉదారవాద ప్రజాస్వామ్యాలకు కమ్యూనిస్టు నాయకత్వం యిప్పుడు పాఠాలు చెబుతోంది అంటూ ఒక విశ్లేషకుడు వాపోవటం అమెరికా ఏ పరిస్థితికి లోనైందో వెల్లడిస్తున్నది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288